విష్ణు మహా పురాణము

Table of Contents

22 - పృథురాజ్య పట్టాభిషేకము

 

 

పూర్వము పృథు చక్రవర్తిని మహర్షులు రాజ్యమునంద భిషేకించిన వెనుక క్రమముగా బ్రహ్మ రాజ్యముల నీయ మొదలిడెను. నక్షత్రములు గ్రహములు లతలు యజ్ఞములు తపస్సుల రాజ్యము నందు సోముని పతిగ నుంచెను. రాజుల రాజ్యమున కుబేరుని జలము రాజ్యమున వరుణుని ఆదిత్యుల రాజ్యమున విష్ణువును వసు రాజ్యమున నగ్నిని ప్రజాపతుల రాజ్యమున దక్షుని అదితి పుత్రులగు మరుత్తుల రాజ్యమున వాసవుని (ఇంద్రుని) దైత్య దానవుల రాజ్యమున ప్రహ్లాదుని అధిపతులుగా జేసెను. పితృ దేవతలకు యమధర్మ రాజుని, గజేంద్రములకు నైరావతమును, పక్షులకు గరుత్మంతుని, దేవతలకు వాసవుని, ఆశ్వములకు నుచ్పైశ్రవమును, గోవులకు వృషభమును, మృగము లన్నిటికిని సింహమును, సర్పములకు శేషుని, స్థావరములకు హిమవత్పర్వమును, మునులకు కపిల మహామునిని, నఖములు కోరలు ప్రధానముగా గల మృగములకు వ్యాఘ్రమును, వనస్పతులకు ప్లక్షము (జువ్విచెట్టు) ను, ఇతరములకు గూడ ఇట్లే ప్రాదాన్యమును పునస్కరించుకొని రాజ్యాధిపతుల జేసెను. ఇట్లు రాజ్యములను విభజించి దిక్పాలకులను గూడ బ్రహ్మ ఏర్పాటు జేసెను.

 

 

తూర్పు దిక్కునందు వైరాజ ప్రజాపతి పుత్రుడగు సుధన్వుని, దక్షిణ దిక్కునందు కర్దమ ప్రజాపతి పుత్రుడగు శంఖపదుని, పశ్చిమ దిక్కు నందు రాజ పుత్రుడును నాశ రహితుడును నగు మహానుభావుడు కేతుమంతుని, ఉత్తర దిక్కు నందు పర్జన్య ప్రజాపతి పుత్రుడును నేరికిని నెదుర్కొన శక్యము కాని వాడును హిరణ్యరోముడను వానిని బ్రహ్మ రాజులుగ నభిషేకించెను. ఆ దిక్పాలకులచే నీ సప్త ద్వీపములు పట్టణములతో నొప్పు భూమి యంతయు వానియా దేశమును మీరక ధర్మమును పునస్కరించుకొని యిప్పటికిని పరిపాలింప బడుచున్నది. వీరందరూ ప్రపంచస్థితి (పరిపాలనము) యందు ప్రవర్తించిన మహానుభావుడగు విష్ణు దేవుని విభూతు (ఐశ్వర్య)లే. ఇంక నితర రాజులు కాబోవు వారు పూర్వమయిన వారు ఇప్పుడున్న వారు అందఱును సర్వభూత మయుడగు విష్ణువు యొక్క యంశభూతులు. దేవ దైత్య దానవ రాక్షస పశు పక్షి మనుష్య సర్ప నాగ వృక్ష పర్వత గ్రహ ప్రభువులు అతీతులు వర్తమానులు భావులు వారందరున్ను విష్ణు దేవుని యంశ వలన పుట్టిన వారే.

 

 

పరిపాలానా సామర్ధ్యము సర్వేశ్వరుడగు విష్ణువును వదలి మరి ఎవ్వరికిని నుండదు. ఈతడే సృష్టి కాలము నందు రజో గుణాశ్రితుడై సృష్టిని స్థితి కాలమున సత్త్వ గుణాశ్రితుడై పరిపాలనమును ప్రళయ కాలమున తమో గుణాశ్రితుడై లయమును చతుర్విభాగ పురస్సరముగ చేయు చున్నాడు. జనార్ధనుడు చతురంశలు గలవాడు. సృష్టి సమయమున రజో గుణవంతుడై ఒక అంశచే బ్రహ్మగను అవ్యక్త రూపుడాయెను. రెండవ అంశచే మరీచ్యాది ప్రజాపతులైరి. స్థితి కాలమున సత్వ గుణాశ్రితుడై ప్రథమాంశచే విష్ణువుగనై పాలనము చేయు చున్నాడు. రెండవ యంశచే మన్వాది రూపుడుగను మూడవ యంశచే కాలరూపుడుగను నాల్గవ యంశచే సర్వప్రాణు లందు నుండి స్థితిని (పరిపాలనమును) చేయు చున్నాడు. అంతకాలము నందు తమోగుణాశ్రితుడై ప్రథమాంశచే రుద్రా రూపుడుగను రెండవ యంశచే అగ్ని, అంతకుడు మున్నగు రూపములతోను మూడవ యంశలో కాల స్వరూపుడుగను నాల్గవ యంశలో సర్వ భూతముగనునై వినాశము చేయు చున్నది. ఈ విభాగము సార్వకాలికము.

 

 

బ్రహ్మదక్షుడు మున్నగువారు కాలుడు అన్ని జంతువులు ఇవన్నియు జగత్తు యొక్క సృష్టి కారణములైన హరి విభూతులు విష్ణువు మన్వాదులు కాలము సర్వభూతమును ఇవన్నియు స్థితికి నిమిత్తమగు విష్ణువు యొక్క విభూతులు. రుద్రుడు కాలుడు అంతకుడు మున్నగు వారు సమస్త జంతువులు ఇవన్నియు ప్రళయమునకు నిమిత్తమగు జనార్దునుని విభూతులు. సృష్టి జగదాది యంది మధ్య మందు అంతము నందును ధాత మరీచ్యాదుల చేత చేయ బడుతున్నది.

 

 

ఆ కాలము నందు బ్రహ్మ సృష్టిచేయును. తరువాత మరీచ్యాదులు. జంతువులు పక్షులు కూడ ప్రతిక్షణము సృష్టించు చుండును. కాలరూప మగు విభూతి లేకుండ బ్రహ్మగాని ప్రజాపతులు గాని సమస్త జంతువులు గాని సృష్టిని చేయజాలవు. స్థితిని లయమును చేయజాలవు. ఏ ప్రాణిచేత సృష్టి స్థితి లయములు చేయబడు చున్నను వానికెల్ల నిమిత్తము హరి శరీరమే.

 

 

ఈ విధముగ సృష్టి స్థితి లయములకు జనార్దనుడే కర్త. త్రిగుణ ప్రవృత్తిచే నిట్లు మూడు విధములై నాలుగు అంశలతో నుండును. గుణ ప్రకృతి రహితమైన పరమ పదము మహత్తు. అది జ్ఞానమయము. వ్యాపకము స్వప్రకాశము, సాటిలేనిది. పరమాత్మ స్వరూపమగు ఆ పదము కూడా నాలుగు రీతులు గలది.

 

 

ఆ పరమ పదము బ్రహ్మ రూపమే గదా! దానికి చాతుర్విధ్య మెట్లు?

 

 

సర్వ వస్తువులకును కారణమైన సాధన మందురు. దానిచే సాధించుటకు నభిమతమైన వస్తువే సాధ్యము. ముక్తిగోరిన యోగికి ప్రాణాయా మాదికము సాధనము. పునరావృత్తి రహితమైన పరబ్రహ్మ సాధ్యము. యోగులకు ముక్తి కొఱకై యోగ శాస్త్ర జన్యమైన ప్రాణాయామాది సాధన విషయమైన జ్ఞానమే చతుర్భేద జ్ఞానభూత బ్రహ్మయొక్క మొదటి భేదము.

 

 

క్లేశ నివృత్తి కొఱకై యాగా మభ్యసించు చున్న యోగికి సాధమగు బ్రహ్మ విషయక మగు జ్ఞానము రెండవ భేదము. (అనగా సాంఖ్య జన్యమగు ప్రకృతి వినిక్తాత్మ విషయక విశిష్ట జ్ఞానము). సాధ్యసాధన విభాగ రహితమై పరస్పరైక్య భావముతో బ్రహ్మైవాహం అహమేవ బ్రహ్మ అనెడి మనుష్యాది ద్వైత రహితాత్మ విషయ ప్రచురమైన విజ్ఞానము మూడవ భేదము. పైన చెప్పబడిన మూడు జ్ఞానములు (1. నేను దేహాది విలక్షుడను. 2. సచ్చిదానంద రూపమగు బ్రహ్మను. 3. బ్రహ్మను నేనే) యందలి విశేషాంశ పరిత్యాగ పూర్వకముగ చూపబడిన నిర్విశేషాత్మ స్వరూపము గలదియు. వ్యాపార శూన్యము (సాధనానుష్టాన రహితము) నాకు రూప గోచరము కానిదియు, వ్యాపించు నదియు, సాటి లేనిదియు, స్వప్రాకాశము, సత్తామాత్రము,( అపక్షయాది రహితము) స్త్రీత్వాదిలింగ గమ్యము కానిదియు ప్రశాంతము = ఆశనాయాది షడ్మూరి రహితము శుద్దము = కర్మ రహితము. ఉహాతీతము. ఆశ్రయ శూన్యమును బ్రహ్మ సంజ్ఞితమగు జ్ఞానమయుడగు విష్ణు జ్ఞానము నందు ఇతర జ్ఞాన నిరోధముచే అంతిమ జ్ఞాన బలముచే పొందు యోగులు, సంసార కేదారము నందు నిర్భీజతను అనగా పునరావృత్తి లేక పోవుటను పొందుదురు. ఇదియే విష్ణుపదము.

 

 

ఇది పాప శూన్యము శాశ్వతము, వ్యాపకము నాశ రహితము. హేయ శూన్యము. పునరావృత్తి శూన్యము. పాపనాశము కాగా క్లేశ ద్వంసము కాగా నిర్మలుడై ఈ పదము నందును బ్రహ్మ రూపములు రెండు. క్షరము, అక్షరము. మూర్థము అమూర్థము. ఇవి సర్వ భూతము లందు గలవు. ఆ పరాబ్రహ్మ అక్షర రూపము. సమస్త జగత్తక్షర రూపము. ఒక ప్రదేశమున నున్న అగ్ని యొక్క కాంతి విస్తరించి నట్లు పరబ్రహ్మ శక్తియే ప్రపంచము. సామీప్య దూరత్వాదులచే అగ్నికి బహు త్వాల్పత్వముల వలె తచ్చక్తికి కూడా తారతమ్య ముందును. బ్రహ్మ శక్తులయిన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రధానులు. దేవతలు దక్షాదులు అంతకంటె న్యూనులు. అంతకంటె మనుష్యులు అంతకంటె పశువులు మున్నగు వారు అల్పులు, అల్పతరులు. ఓ మునివరా! ఈ జగత్తంతయు నిత్యము అక్షరము. ఆవిర్భావతి రోభావములచే జన్మ నాశ వికల్పములు కలుగు చుండును.

 

 

ప్రవాహమువలె స్నది నిత్యము. సర్వశక్తి మయుడు విష్ణువు. బ్రహ్మ యొక్క పరస్వరూపము. అందు మూర్త రూపమును యోగులు యోగారంభము నందు ధ్యానింతురు. మనస్సు ఏకాగ్రము కాగా దివ్యరూప విషయము గూడిన డగుటచే సాలంబమై, మంత్రా నుసంధనాది యుక్త మగుటచే సభీజమైన మహాయోగము యోగులకు సమాధి పర్యంతము ఆ రూపమున కలుగును. ఆ విష్ణువు సర్వ శక్తుల కంటె నుత్కృష్టుడు. అపర రూపము బ్రహ్మకు సన్నిహితము. బ్రహ్మ మూర్తరూపుడు. హరి సర్వ బ్రహ్మమయుడు. ఆ హరి యందే సమస్త జగత్తు ఓతప్రోత భావమున నున్నది. పడుగుపేకగా నల్లుకొన్నది. ఆయన వలన జగత్తు. జగత్తు నందు ఆ హరి. క్షరాక్షర రూపుడగు శ్రీహరి భూషణాస్త్ర స్వరూపము గల పురుష ప్రకృతి రూపమగు జగత్తును భరించు చున్నాడు.

 

 

భూషణాస్త్ర స్వరూపమున నున్న యీ జగత్తును విష్ణువు భరించు చున్న సంగతిని తెలుపుదురు గాక!

 

 

సమర్ధుడు అప్రమేయుడునగు విష్ణు దేవునకు నమస్కరించి వశిష్టునిచే నాకు చెప్పబడిన విషయమును చెప్పెదను. భగవంతుడగు శ్రీహరి కౌస్తుభమణి రూపమున నీ జగత్తు యొక్క స్వచ్చమగు రూపమును ధరించు చున్నాడు. శ్రీవత్స రూపముతో నున్న ప్రధానమును ధరించు చున్నాడు. బుద్ది అనగా మహాత్తత్త్వము గదా రూపమున మాధవుని యందున్నది. భూతముల కాది భూతమగు తామసాహంకారమును శంఖ రూపముతోను ఇంద్రియములకు నాది భూతమగు రాజసాహంకారమును శార్జదనూ రూపమునను ధరించు చున్నాడు. మిక్కిలి చంచలమును వేగముచే వాయువు నతిక్రమించి నదియు నగు మనస్సును సుదర్శన చక్ర రూపమున హస్తమున ధరించు చున్నాడు. ముక్తామాణిక్య మరకతేంద్రనీలవ్రజ రూపమై పంచరూపములతో నున్న గదాధరుని వైజయంతీ మాల పంచభూత హేతువులగు పంచ తన్మాత్రల సంఘాతమైన భూతమాలయే. జ్ఞానేంద్రియములను కర్మేంద్రియములను అన్నిటిని అశేష బాణ రూపమున జనార్ధనుడు ధరించు చున్నాడు. అచ్యుతుడు ధరించు చున్న అతి నిర్మలమైన ఖడ్గరత్నము అవిద్యామయ కోశమందు దాచబడిన విద్యామయమగు జ్ఞానమే ఈ విధముగ హృషీకేశుడు ప్రదానమును బుద్ది (మహాత్తత్త్వము) అహంకార ద్వయమును భూత పంచకమును మనస్సును సర్వేంద్రియములను విద్యాఽవిద్యలను అస్త్రభూషణ రూపమున నున్న వానిని అరూపుడై ధరించు చున్నాడు. ప్రాణుల శ్రేయస్సు కొఱకై మాయారూపుడై వికారములతో గూడిన ప్రకృతిని సకల జగత్తును ధరించు చున్నాడు.

 

 

మఱియు విద్యాఽవిద్యలును సదసత్తులును సర్వ భూతేశుడైన మధు సూదనుని యందు గలవు. కళా కాష్టా నిమేష దిన ఋతు ఆయన సంవత్సరాది కాల స్వరూపుడు భగవంతుడు. అపాపుడు నాశరహితుడు. భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్య లోకములు ఏడును ఈ ప్రభువే.

 

 

సమస్త లోక రూపమగు నాకారము గలవాడై పూర్వజులకు కూడ పూర్వజుడై సర్వ విద్యలకు నాధార భూతుడై శ్రీహరి స్వతంత్రుడై యున్నాడు. దేవ మనుష్య పశ్వాది బహు రూపములతో నమూర్తి మంతుడగు నీ సర్వేశ్వరుడు భూతమూర్తియు ననంతుడు నగుచున్నాడు. ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదము ఉప వేదములు ఇతిహాసములు వేదాంత (ఉపనిషద్) సూక్తులు వేదాంగములు మన్వాడి స్మృతులు సమస్త శాస్త్రములు ఉపాక్ష్యానములు అనువాకములు వాక్య ప్రసంగములు గీతములు ఇవి యున్నవి శబ్ద రూపధరుడగు విష్ణు భగవానుని శరీరమే. మూర్తములు గాని అమూర్తములు గాని యగు వస్తు సముదాయ మంతయు వాని శరీరమే. కార్యకారణ రూపమగు నీ విశ్వమంతయు నా జనార్ధనుని కంటె వేరుగాదు. ఆ హరిని నేనై యున్నాను. అను బుద్ది ఎవరికి కల్గునో అతనికి శరీరము వలన కలిగెడి రాగ దేశాదులు కాని హృద్రోగాములు కాని సంభవింపవు. ఓ బ్రాహ్మణుడా! విష్ణు పురాణ మండలి ప్రథమాంశము పూర్తిగా నీకు చెప్పితిని. దీనిని ధరించుటచే జనుడు సర్వపాప నిర్ముక్తు డగును. మైత్రేయా! ఈ ప్రథమాంశమును వినుట వలన మానవుడు కార్తిక మాసమందు పుష్కర క్షేత్రము నందు పన్నెండు సంవస్తారములు స్నానము చేసిన వచ్చెడి ఫలము కలుగును. దేవ ఋషి పితృ గంధర్వ యక్షాదుల జన్మ వృత్తాంతమును వినువానికి దేవతలు మొదలగు వారు వరప్రదాత లగుదురు.