విష్ణు మహా పురాణము
9 - ధ్రువాది జ్యోతిశ్చక్ర వర్ణనము
భగవానుడగు విష్ణుని నక్షత్రమైన శింశుమార స్వరూపము దివమ్మున వెలుఁగు చున్నది. దాని తోక యందు ద్రువుండున్నాడు. ఆ శింశుమారాకృతియే, చంద్ర, సూర్యాది గ్రహములను, గిఱ్ఱునఁ ద్రిప్పుచున్నది. అట్లు తిరుగు చున్న దాని వెంట నక్షత్రములు చక్రము వలెఁ దిరుగు చున్నవి సూర్య చంద్రులు, తారా నక్షత్రములు, గ్రహములతోఁ గూడ, వాయుమయము లైన గట్టి త్రాళ్ళచే ధ్రువుని యందు గట్టఁ బడి యున్నవి. అనఁగా భూమికి నడుమనున్న ఆవాహము, ఆ మీది మేఘములకు భాస్కరులకు మధ్య నున్న ప్రవాహము, సూర్యునికిఁ జంద్రునకు నడుమ నున్న అనువహము, చంద్రునికి నక్షత్రములకు నడుమ నున్న సంవహము, నక్షత్రములకు గ్రహములకు మధ్యనున్న వివహము, గ్రహములకు సప్తర్షులకు మధ్య నున్న పురోవహము, సప్తర్షులకు ద్రువునికి మధ్య నున్న పరివహము అను సప్త వాయువులచే వేగమున సూర్య చంద్రాదులు ధ్రువ మండలము నంటి తిరుగు చున్నవి. జ్యోతి స్స్వరూపమైన ఈ శింశుమారాకారము యొక్క హృదయము నందు తారా స్వరూపమున నారాయణుఁడే స్వయముగా దాని కాధారమై యున్నాడు. తారా మాయమైన శింశుమారము యొక్క తోక యందు, జగత్పతి యైన యా నారాయణు నారాదించుచు, నుత్తానపాదుని కుమారుఁడగు ద్రువుడున్నాడు. సర్వాధ్యక్షుడైన జనార్దనుఁడు శింశుమారమునకును, శింశుమారము ద్రువునకును, ధ్రువుడు సూర్యునికి నాదారముగా నున్నారు. ఆ సూర్యుఁడు దేవాసుర మనుష్యులతో గూడి, యీ జగత్తున కాదారముగా నున్నాడు. అదెట్లన శ్రద్ధగా వినుము. సూర్యుఁ డేనిమిది మాసముల రసము గల యుదకముల నాకర్షించి వర్షించును. దాని వలన నన్నము, అన్నము వలన సర్వ జగత్తు కలుగు చున్నవి. తీక్షణమైన కిరణములచే జగత్తు నందలి నీరును బీల్చి, చంద్రుని యందు విడచును. చంద్రుడు, పొగ, నిప్పు, గాలి యను వాని కూడికయై యున్న మేఘముల యందు, వాయు నాడీమయము లయిన నాళముల ద్వారమున (గొట్టముల ద్వారా) చిమ్మును. ఆ మేఘము లందుండి నీరు భ్రంశము నొందదు (పడిపోదు). కాన, నానికా (ఆ + భ్ర) మను పేరు వచ్చినది. కాలము వలన సంస్కారము పొంది, యా నీళ్ళు నిర్మలములై వాయువుచేఁ బ్రేరేపింపఁ బడి భూమిపై వర్షించును. భగవానుడైన సూర్యుడు నాల్గు తెరంగులుగా నున్న యుదకము నాకర్షించును. అనగా మేఘ గర్భమునకుఁ జేరుటకు మున్ను నీరు నదులందు, భూమి యందును, జీవుల దేహమందును నాల్గు తెరంగులుగా నుండును. ఆకాశగంగ యందలి నీటిని సూర్యుడు పై వలెనే గ్రహించి మేఘముల మూలమున కాకుండ తన కిరణముల చేతనే దానిని భూమిపై వర్షించు చున్నాడు. దాని స్పర్శచే, మానవుడు బాపముల వాసి పుణ్య లోకములకు పోవును. దానికే దివ్య స్నానమని పేరు. సూర్యుడు కనబడు చుండగనే మేఘముల మూలమున గాక సూర్యుని కిరణముల చేత నాకాశ గంగా జలము కృత్తికా నక్షత్రము మొదలు కొని యున్న వానిలో బేసి నక్షత్రముల యాందాకాశము నుండి వర్షింప బడు ణా జలము దిగ్గజములచే వర్షింప బడు నా జలము దిగ్గజములచే వర్షింప బడు గంగోదకమని పేరు గాంచినది. సరి నక్షత్రముల యందనగా రోహిణి, ఆర్ద్ర మొదలగు వాని యందున్న సూర్యుని కిరణములచే నాకర్షింపబడి వర్షింపబడు నాకాశ గంగా జలము కూడా చాలా పుణ్యమైనది. పాపహరము, దివ్య స్నానమను వాడుక దీనికే. మేఘములచే వర్షింపబడు నీరోషధులను బెంచును. అది జీవనాధారము గాన అమృతమని పేరొందినది. దానిచే బెంపొంది యోషదులు ప్రజల శరీరోత్పత్తి పోషణముల సాధకము లగుచున్నవి. అందుచే శాస్త్ర దృష్టి కల మానవులు వేద విహితము లయిన యజ్ఞము లొనర్చి దేవతల దృప్తి పరతురు. అట్లు యజ్ఞములు, వేదములు, వర్ణములు, సర్వ దేవతలు, పశువులు, భూతములు మొదలగునివి ఎల్ల వర్షముచే నిలుచు చున్నవి. అన్నము వృష్టిచే నేర్పడు చున్నది. ఆ వృష్టి కాధారము సూర్యుడు. అతని కాధారము ధ్రువుడు. ధ్రువుని కాధారము శింశుమారము. ఆ శింశుమార చక్రమున కాధారము నారాయణుడు. దాని హృదయ మందే యా నారాయణ మూర్తి యున్నాడు. సర్వ భూతములకు నతఁడే మొదలయి సనాతనుడయి భరించువాడై యున్నాడు.
