విష్ణు మహా పురాణము

Table of Contents

36 - బలరామ కృత ద్వివిద సంహారము

 

 

మైత్రేయ! వినుము. దేవపక్ష విరోధి నరకుడు. వాని మిత్రుడు ద్వివిదుడను వానరుడు. బలశాలి యాతడు. దేవతల యెడ వైరముం గొనెను. కృష్ణుడు దేవేంద్ర ప్రేరణచే నరకుం జంపెను. గావున దీనికి బ్రతిక్రియ చేయుదునని ద్వివిదుడు దేవతల యెడ పగగొని యజ్ఞ విధ్వంస మారంభించెను. మర్త్య లోకమునకు హానియుం జేసెను. సాధువుల మర్యాదలను విచ్చిన్న పరచెను. ప్రాణులను నశింప జేసెను. దేశ నగర గ్రామవన ప్రదేశములను గాల్చెను. పర్వతముల నెత్తి పడవైచి గ్రామములను పిండి గొట్టెను. కొండలను నదులందు బడవైచెను. దాన నుదధిపొంగి కట్టదాటి దరినున్న పురగ్రామాదుల ముంచి వైచెను. ఆ వానరుడు కామరూపి కావున పెద్ద రూపముం గొని దూకుచు సమ్మర్ధ పరచి చూర్ణము గావించు చుండెను. ఆ దుష్టునిచే సర్వజగము ద్వంస మొంది స్వాధ్యాయ వశట్కారములు వోయి మిగుల దుఃఖిత మయ్యెను.

 

 

ఒకప్పుడు బలరాముడు రైవతుని యుద్యానమున తన యింతి రేవతితో మఱియుం గల పెక్కుమంది తరుణులతో మద్యపానము సేసెను. అప్పుడు పెల్లున పాటలు పాడుచు తరుణీ రత్న మధ్యమందు నందన వనమునం గుబేరుడట్లు క్రీడించెను. అంతట నా కోతి యేతెంచి హలాయుధుని నాగలిని ముసలమును గైకొని యీ బలరాముని ముందు కోతిచేష్టలు సేసెను. అట్లే యా యంగనల ముందు పండ్లగిలించి వెక్కిరించెను. మద్యపూర్ణము లయిన కళ్ళు ముంతల పగులగొట్టి యట్టిటు పారవైచెను. అప్పుడు హాలి కోపము గొని వానిం బెదర గొట్టెను. అయినను వాడాతని నవమానించుచు కిలకిల ధ్వని సేసెను. వానినట్లు వెక్కిరింప నిచ్చి బలరాముడు రోశముగొని ముసలము చేపట్టెను. వాడునొక రాతిబండం బట్టుకొని విసరెను. దానిని బలరాముడు ముసలాయుధమున బగుల గొట్టి క్రింద బడవైచెను. అవ్వల వాడావలకు దూకి బలరాముని రొమ్మున ముసలముతో గొట్టెను. అవ్వల బలరాముడు కోపము గొని వాని నడినెత్తిం గుప్పిట బొడచినంత వాడు రక్తము గ్రక్కుకొని ప్రాణములు వాసి నేలపై గూలెను. వజ్రాయుధ వజ్రముచే వలె వాని శరీరముచే నాగిరి శృంగము నూరు బ్రద్దలయ్యెను. అంతట దేవతలు వచ్చి రామునిం గని నీ విక్రమము బాగు బాగని కొనియాడుచు పుష్ప వర్షముం గురిపించిరి. రాక్షస పక్షమున కుపకారియైన యీ పాడు కోతిచే జగమెల్ల ధ్వంసము చేయబడినది. భాగ్యవశమున వాడు నాశనమందినాడని సురలు పలికి గుహ్యకులతో గూడ నమరు లానంద భరితులై స్వర్గమున కేతెంచిరి. ఇట్టివి ధరణిందాల్చు శేషుని మూర్తియైన బల్లదేవుని లీలలనంతములు. అపరిమేయములు.