విష్ణు మహా పురాణము

Table of Contents

2 - ఇక్ష్వాకు ప్రభృతి రాజ వంశ వర్ణనమ్

 

 

 

కకుద్మి బ్రహ్మ లోకము నుండి తిరిగి భూమికి రానంతలో నుద్వేజనులను పేర రాక్షసులు కుశస్థలీ పురమును ధ్వంసము చేసిరి. ఇతని తమ్ములు నూర్గురు వారికి జడిసి దిక్కులకు పారిపోయిరి. వారి వంశీయులు క్షత్రియులు నలుదేసలం జేదరిరి. వృష్టుని వంశము వార్షకమను పేర క్షత్ర జాతి ఏర్పడెను. నభాగుని కొడుకు నాభాగునన నొప్పెను. వాని కుమారు డంబారీషుడు అతని సుతుడు విరూపుడు. వానికి పృషదశ్వుడు వానికి రథీతరుడు పుట్టిరి. ఈ వంశమున నీ శ్లోకము పఠితము. రథీతరులు సంతతి క్షాత్రసంపన్నులయ్యు తపముచే ఆంగీరసులనెడి ద్విజులు కూడా నయిరి. మనువు తుమ్మిన తఱి నాతని ముక్కు నుండి ఇక్ష్వాకువు పుట్టెను. వికుక్షి నిమి దండుడు నను ముగ్గురాతని నూర్గురు కొడుకులలో ముఖ్యులు. శకుని మొదలగు నేబది మంది యుత్తారా పథమును బాలించిరి. ఎనుబది యెన్మిది మంది దక్షిణా పథపాలకులైరి. ఇక్ష్వాకువు అష్టకా శ్రాద్ధ నిమిత్తముగ మాంసముం దెమ్మని వికుక్షిని పంపెను. ఆతడేగి యనేక మృగములం జంపి మిక్కిలి యాకలిగొని యందొక కుందేటిని దిని వేసెను. తక్కిన మాంసముం దెచ్చి తండ్రికి నివేదించెను. ఇక్ష్వాకువు ఇక్ష్వాకు కుల గురువగు వశిష్టునిది ప్రోక్షింపుమని పలికి నంతట నతడు చాలు నిది యమేధ్యమయిన (అపవిత్రమైన) మాంసము. దురాత్ముడు నీ కొడుకు దీనిని జెరచినాడు. ఇందలి కుందేటిని వీడు తిన్నాడు. అని యిట్లాచార్యునిచే బలుకబడి యా వికుక్షి శశాదుడను పేరొంది తండ్రిచే పరిత్యజింప బడియె. తండ్రి చనిపోగా నీతడీ పృథివిని ధర్మమున బాలించెను.

 

 

ఆశశాదునకు పురంజయుడు పుట్టెను. అతని చరిత్ర ఇది. త్రేతా యుగము నందు దేవాసుర యుద్దమతి భయంకరముగ జరిగెను. అందసురుల చేతిలో నమరులోడి విష్ణు నారాధించిరి. సకల జగత్పరాయణుడు ఆద్యంత రహితుడునగు నారాయణుడు వేల్పులకు బ్రసన్నుడై యిట్లనియె. మీ కోరిక నాకు దెలిసినది. అందులకిదె నా పలుకాలింపుడు. రాజర్షియైన శశాదుని తనయుడు పురంజయుడు క్షత్రియ వీరుడు. అతని మేన నేను స్వయముగ నంశావతార మెత్తి యా రాక్షసుల నందరిని సంహరించెద. అందుచే మీరు పురంజయుని అసుర సంహారమునకు సన్నద్ధుం జేయుడనగా విని యమరులు విష్ణు భగవానునికి మ్రొక్కి పురంజయుని దరికి వచ్చి యిటు పలికిరి. ఓ క్షత్రియ శిరోమణీ! మా కోరినటుల మా శత్రు సంహారమున కీవు సాహాయ్యము సేయ గోరుచున్నాము. అభ్యాగతులము కావున మా ప్రీతికి భంగము సేయరాదు. అనవిని పురంజయు డిట్లనెను. మీకు రాజు శతమఖుడు త్రిభువన నాథుడు అతని మూపున నేను గూర్చుండి మీ శత్రువులతో బోరుదునేని నేను మీకు దోడయ్యెద నన విని దేవతలు, దేవేంద్రుడు నిది బాగున్నదని యంగీకరించిరి.

 

 

అవ్వల నింద్రుడు వృషభ రూపము ధరింప దాని కకుద (మూపుర)మున నత్యంత సంతోషముతో పురంజయ మహారాజు గూర్చుండి చరాచర గురువగు విష్ణు భగవానుని తేజస్సుతో ఆప్యాయితుడగుచు నా దేవాసుర సంగ్రామ మందెల్ల యసురులం గూల్చెను. ఎద్దు మూపురమున (కకుత్తు నందు) స్థితుడయి నందున నాతనికి కకుత్థ్సుడను పౌరుషనామ మేర్పడినది. అతని కుమారు డనేనసుడు. అతని కొడుకు పృథువు. అతని కొడుకు విష్టరాశ్వుడు. వాని పుత్రుడు చంద్ర వంశీయుడగు యువనాశ్వుడు. యువనాశ్వుని సుతుడు శావస్తుడు. ఆతడు నిర్మించినది శావస్తి పురము. వాని కొడుకు బృహదశ్వుడు. వానికి జనించిన వాడు కువలయాశ్వుడు. ఈతడు విష్ణు తేజస్సంయుతుడై తన కొడుకు లిరువది యొక్క వేల మందితో నేగి యుదంక మహర్షి కపకారియైన దుందుడను రాక్షసుని జంపి దుందుమారుడను పేరందెను. అతని కొడుకు లందరు దుందుని ముఖ నిశ్శ్వాసాగ్నిచే దగ్దులై నశించిరి. దృడాశ్వ చంద్రాశ్వ కపిలాశ్వులు ముగ్గురు మాత్రము మిగిలిరి. ధృడాశ్వునికి హర్యశ్వుడు, నికుంభుడు. నికుంభుని కమితాశ్వుడు. వానికి క్రుశాశ్వుడు. వానికి ప్రసేనజిత్తు. వానికి యువనాశ్వుడు గల్గిరి. ఆ యువనాశ్వుడు సంతానము లేక విచార మంది మునుల యాశ్రమ మండలము నందు వసించు చుండ దయాశీలురగు మునులు పుత్రాకామేష్టిం జేసిరి. ఆ యిష్టిలో ఋషులు నడిరేయి దాటిన తర్వాత మంత్ర పూరితమైన జలము నింపిన కలశమును యజ్ఞవేది నడుమ నుంచి యందరు నిదుర వోయిరి.

 

 

అమ్మునులట్ల నిదురవోవ యువనాశ్వుడు దప్పికగొని యయ్యాశ్రమము లోనికేగి మునులను లేపకయే యతనున్న మంత్ర పూతము మహా మహిమ గలదియునగు కలశ మందలి నీరు ద్రావెను. ఋషులు మేల్కని ఎవ్వడీ జలముం ద్రావెనని యడిగిరి. ఈ జలమును త్రావినచో యువనాశ్వ నృపతి పత్ని మహాబల పరాక్రమ సంపన్నుడగు బుత్రునిం గనగల దనిరి. అది విని యారాజు తెలియక నేనిది త్రావితిననెను. అతని కడుపున గర్భము (శిశువు) ఏర్పడి దినదినాభివృద్ధి నందెను. సమయమయినంత నా శిశువు కుడి బొటన వ్రేల రాజు కుక్షిని భేదించుకొని వెలికి వచ్చెను. ఆ రాజు మరణించెను. పుట్టినాడు గదా వీడేమి కుడుచుకొనునని మునులనిరి. అంతట నింద్రుడేతెంచి నన్ను గుడుచు కొనుచు (మాం దాస్యతి) అనెను. దాననాతడు మాంధాతయను పెరివాడగును. అను దేవేంద్రుడా బిడ్డ నోటం దన చూపుడు వ్రేలినిడగా నంతట నాతడద్దానిం గుడిసెను. ఆ అమృత స్యందియైన వ్రేలింగుడిచి యొకనాటనే చక్కగ వృద్ధి నందెను. ఆ మాంధాత చక్రవర్తి సప్తద్వీపవతియైన మహి ననుభవించెను. ఇక్కడ నొక శ్లోక మిట్లు పశ్లోకితము. సూర్యుడెంత మేర నుదయించును ఎంత దాక సంచరించు నా సర్వ ప్రదేశము యువనాశ్వ తనయుడగు మాంధాత యొక్క క్షేత్ర మనబడును.

 

 

మాంధాత శశి(త) బిందుతన నిందుమతిం బరిణయ మాడెను. ఆమె యందాతాడు పురుకుత్సుని, అంబరీషుని, ముచుకుందుని ముగ్గురు పుత్రులం గనెను. ఆమె యందే యారేని కేబది మంది కూతురులుం బుట్టిరి. ఈ నడుమ బహ్వృచుండు (ఋక్మాఖీయుడు) సౌభరియను ఋషి పండ్రెండేండ్లు జలము లందుండెను. అందా నీటిలో సంమదుడను చేపలకు రాజు పెక్కు మంది సంతానము గల్గి అతి ప్రమాణము గలవా డందుండెను. వాని కొడుకులు మనుమలు కూతురు బిడ్డలు వాని వెనుక ముందు నిరుపార్శ్వముల రెక్కలందోకను దల మీదనుం దిరుగుచు వానితోనే రేయిం బవళ్ళు మిక్కిలి తనిసి క్రీడించిరి. వాడును సంతాన స్పర్శ హర్ష ప్రకర్షం జేసి పలు తెరగుల తన పుత్ర పౌత్ర దౌహిత్రాదులతో గూడ ననుదిన మా మహర్షి చూచు చుండ మిగుల క్రీడించెను.

 

 

అవ్వల నా నీటిలో నున్న సౌభరి ఏకాగ్రత నుండి తొలగి (మనసు లక్ష్యమున నిలువక) యనుదిన మా చేప యొక్క కొడుకులు పౌత్రులు దౌహిత్రుల తోడి అతిరమణీయ విలాస మట్టెగని యిట్లనుకొనెను. ఆహా! ఈ మీనరాజెంత ధన్యుడు. అభిమతమైన యొక జన్మాంతర మంది ఈ కొడుకులతో మనుమలతో మునుమనుమలతో నుల్లసిల్లుచు మాకు వేడుక నొదవించు చున్నాడు. మేమునునిట్లు పుత్రపౌత్ర దౌహిత్రులతో నానందింతుము గాక యని లెస్సగ గమనించి యా నీరు వెడలి సంతానము కనువేడుక గొని కన్యకై మాంధాత చక్రవర్తి దరికేగెను. ఆయన రాక వినినంతట భూకాంతుడు లేచి ఎదురేగి లెస్సగ నర్ఘ్య పాద్యాదులం బూజింప నుచితాసనముం గొని సౌభరి రేనింగూర్చి యిట్లనియె.

 

 

నరేంద్రా! గృహస్థుగా దలచితిని. కావున నాకు నీ కన్యనిమ్ము. యజ్ఞమునకు భంగము సేయకుము! కార్య వశమున వచ్చిన యర్థులు కకుత్థ్స వంశము నందు విముఖులై పోరు గదా! పుడమి యందితరులు రాజులున్నారు. వారికి కూతుండ్రును బుట్టినారు. కాని అర్థులేతెంచి యర్థించిన దాని నిచ్చెడి దీక్షయందు దృడమైన వ్రతనిష్ఠ గల కులము నీ దొక్కటే. నీకు నూట ఏబది మంది కూతుండ్రున్నారు. అందొక యామెను నాకిమ్ము. ఓ రాజోత్తమా! అడిగి లేదని పించుకొనుట అతి దుఃఖ హేతువు. నేను దానికి బాధ పడుచున్నాను.

 

 

ముని వచన మాలించి యా రాజు ముదిమిచే శరీరము శిథిలమై యున్న యమ్మునిం గని కాదనుటకు జడిసి శాపమునకును వెఱచి యించుక మొగము వంచి చాల తడవాలోచించెను. రాజేంద్రా! ఎందుల కాలోచనలో బడితివి. ఇందేనించుకయు నసహనముగా బలుక లేదు. కూతురేనికేని యవశ్య మీయ వలసినదియే. ఆమె చేత గృతార్థత లభింపకున్న నింకేమున్నది. యని సౌభరి భగవానుని వచనము విని శాపమునకు భయమంది మాంధాత వినయ వినతుడై యిట్లనియె.

 

 

“స్వామీ! ఇది మా కుల మర్యాద. కన్య కిష్టుడును నుత్తమ వంశ్యుడు నగువరునకు కన్యను మేమిత్తుము. మీ కన్యాయాచన మా మనోరథముల కందనిది. ఎట్లో యిది తటస్థించినది. పరిస్థితి ఇది యిట్లుండ నిపుడేమేమి సేయవలెనో యెరుంగక యాలోచనలో పడినానని” యా చక్రవర్తి యనగా ముని తనలో నిటు తలంచెను. మమ్ము త్రోసి పుచ్చుట కిది యొక యుపాయము. యితడు ముదుసలి ముదితల కనభిమతుడు. కన్యల మాని మరి యేమనవలెను! అని ఈతడాలోచించి యిట్లన్నాడు. అగుగాక! ఇటు సేసేదనని తనలో గుణించుకొని మాంధాతతో ముని యిట్లనియె. ఇట్లేని మే మంతఃపుర ప్రవేశము సేయుటకు వర్షవరునికి (అంతః పురపు కావలి వానికి) ఆజ్ఞ నిమ్ము. ఏ కన్య యేని నన్నభిలషించునేని నేను దార సంగ్రహము సేసికొనెదను. అటుల కాదేని మా ఈ కాలాతీత ప్రయత్న మింతటితో జాలునిట పలికి యూరకుండెను.

 

 

అంతట మునిశాప శంకితుడై మాంధాత కన్యాంతఃపుర రక్షకుని కానతి నిచ్చెను. వానితో గూడ సౌభరి భగవాను డంతఃపురములోన బ్రేశించుచునే సకల సిద్ధ గంధర్వ మనుష్యుల నతిశయించిన చక్కని రూపముం గైకొనెను. ఆ ఋషిని లోనం బ్రవేశింప జేసి యవ్వర్షవరుడు కన్యలతో నిట్లనియె. మీ తండ్రి మహారాజు ఆజ్ఞాపించు చున్నాడు. ఈ బ్రహ్మర్షి కన్యార్థియై మమ్ముం గూర్చి యభ్యాగతుం డాయెను. నేనును మాట యిచ్చితిని. మా పిల్ల ఎవతెయే నోక్కతే భగవంతుని నిన్ను వరించునేని యామె యిష్టమునకు ప్రాతికూల్యమును సేయననెను. కన్యలందరాలించి యాతనిపై ననురాగమొంది సకాములై యాడయేనులు గజ యూధపతి నట్లా ఋషిని నేను నేనని యందరును వరించిరి. పలికిరి గూడ. అక్కలార! చాలు చాలు. నేనతని వరింతు నితనినే వరింతును. ఇతడు నీకనురూపుడు గాడు చెల్లీ! ఇతడు నాకే మగడుగా సృష్టింప బడినాడు. నేనతనికై సృష్టింప బడినాను. నీవుపశమింపు నేను మొదట వరించితిని. నేను మొదట. ఇంట నడుగు పెట్టినదే తడవు నేనీతని వలచితిని. ఎందులకు భంగము సేసేదవు? నాచేత నాచేత (నాతడు వరింపబడె) నని యా ముని బాలునికై పెద్ద రగడ సాగెను. మిగుల చక్కని వాడని చక్కని ఋషి యని పెర్గన్న యమ్ముని బాలు డందరి చేతను హృదయ పూర్వకముగ వరింప బడినంతట నంతఃపుర రక్షకుడేగి రాజునకు సవినయముగ నదియెల్ల విన్నవించెను.

 

 

అది యెరింగి యిదేమి! యిదెట్లు! ఏమి చేయుదును. నేనేమంటినని మనసు చెదిరి రాజు ఇష్ట పడకుండియు నందుల కంగీకరించే. అనురూపముగ నమ్మహర్షి వివాహమాడి యా కన్యలందరిని దన యాశ్రమమునకు గొని పోయెను. అందును నతడశేష శిల్పకల్పనా దక్షునింకొక విధాతనట్లు విశ్వకర్మ నాహ్వానించి యందరి సుందరుల కొక్కొక్కతె కొక్కొక్కటిగ నుత్పుల్ల పంకేరుహములు కూజత్కలహంస కారండవాది విహంగ మాభిరామములగు కాసారముల తోను, నుపవనముల తోను, నుపధానముల తోడి, శయ్యాపరిచ్చదముల తోను, సమగ్రావకాశముగ నిర్మింపుడని యానతిచ్చెను. ఆ ఇచ్చిన యాజ్ఞనచ్చము పాలించి అశేష శిల్ప విశేషచార్యుండగు త్వష్ట యట్లకావించి చూపించెను. అవ్వల నప్సరమర్షి సౌభరి యాజ్ఞంగొని యా సదనములం దెన్నడు విడువక నందన మహానిధి నివాసము చేసెను. ఆపై నెడవడని భక్ష్వభోజ్య లేహ్యచోష్యాది వివిదోపభోగాహారోప హారములతో సందడిగ గ్రందుకొను భృత్య వర్గము నహర్నిశ మా మందిరములందా యిందువదనలు విందారగింప జేసిరి.

 

 

ఒకతరి కూతురులపై వాత్సల్యమున మనసులాగ నమ్మహీపతి యా కన్యలు మిగుల దుఃఖితలా? లేక సుఖమున్నారా? అని యాలోచించి యమ్మహర్షి యాశ్రమ సమీపమున కేతెంచి, కన్నులు మిరుమిట్లు గొలుపు కిరణములు జిమ్ము స్పటిక మణిమయ ప్రాసాదమాలా మనోహరమయిన యుద్యాన వనము నందలి సరోవరమును దర్శించెను. ఒక్క ప్రాసాదమందు బ్రవేశించి కూతురుం గౌగలించుకొని యామె యిడిన చక్కని యాసనమందు గూర్చుండి వాత్సల్యరసపూరముబికి యానంద బాష్పములు గురియ, అమ్మాయీ! నీకు సుఖమే కద! అసుఖ మించుకయు లేదు గద. నీపైనీ మహర్షి చెలిమి వాటించునా; లేదా? మన యింటనునికి మాట జ్ఞప్తికి వచ్చునా? అని యడుగ కూతురు తండ్రికిట్లనియె. నాన్నగారూ! ఈ సౌధమతి రమణీయము. ఈ ఉద్యానవనమతి మనోహరము. ఉత్పుల్ల పద్మాకర జలాశయములు అవ్యక్త మధురకూజిత విహంగములచే హృదయంగములు. మనోనుకూల భక్ష్య భోజ్యములు అనులేపనములు అంబరాభరణాది భోగము మృదుల మృదులశయనాసనాది సర్వసంపదల సమృద్ధము. మీ గార్హస్థ్య మద్భుతము అయినను పుట్టిల్లు నెవ్వరు మరువగలరు? నీ ప్రసాదము చేతనే నాకీ యశేష శోభన వైభవము. కాని ఒక్కటే నాకు భేద కారణము. నా ఇల్లు వెడలి ఈ మహర్షి నా వల్లభుడెటకును వెడలడు. నా ప్రీతికై కేవలమితడు నా చెంతన యుండును. నా సోదరీమణుల చెంతకేగిన జాడయే లేదు. దీన నాయప్పజెల్లెండ్రు పరితపింతురేమో! ఇది నాకొక్కటి దుఃఖ కారణమన విని యా రాజు రెండవ ప్రాసాదమున కేతెంచి యామెయుం దన ప్రాసాదాద్యుప భోగ వైభవము వర్ణింప విని యా బాలికయు నా మగడు నా చెంతన ప్రొద్దెల్ల నుండు నొండుమెడకు పోడని వాపోవ విని యిట్లందరి సౌధములకేగి యందరు నిట్లుగ్గడింప నానందాశ్చర్య నిర్భరవివశ హృదయుండై సౌభరి భగవంతుం డేకాంతమున నుండుతరిం దరిసి యాతని పూజలందికొని యిట్లనియె.

 

 

భగవంతుడా! ఈ నీ గొప్ప యణిమాదిసిద్ధి ప్రభావముం చూచితిని. ఇట్టి విభూతి వైభవమును మేమింకొకని యెడ దిలకించి యుండము. ఇదంతయు భగవన్మూర్తియగు నీ తపస్సు యొక్క ఫలము. అని యమ్మునిం బూజించి యక్కడనే యమ్మునివరునితో గొంత కాలముండి యభిమత భోగముల ననుభవించి తన పురమునకు వచ్చెను. కొంత కాలము గడువ నమ్మునికా రమణు లందు నూటయేబది మంది పుత్రులు గల్గిరి. దినదిన మట్లు పెంపెక్కిన స్నేహ ప్రసారము గల యా ముని మమకారము మనసు నాకర్షింప నీ నా పిల్లలు ముచ్చటగ బలుక నేర్తురా? ముద్దుగ నడుతురా? యువకులగుదురా? యువతులం బెండ్లాడుదురా? అట్టి యందము నేనుగందునా? వీరికి కొడుకు లుదయింతురా? వీరు కొడుకులకు గొడుకులం గన నేను గనులార గనుగొందునా? ఈ మున్నగు కోరికలను కాల సంపదచే నను దినము పెరుగుచున్న వానిం జూచి యిట్లాలోచించెను. ఒక మనోరథము వెంట మనోరథము పుట్టును. మనోరథములకు సమాప్తి పదివేలు కాదు. లక్షల యేండ్లకైన లేదు. మనోరథములు పూర్ణము లయిన కొలది క్రొత్తవి పోటమరించును. కాళ్ళు వచ్చి నడక వచ్చినది యౌవనమును గందిరి. భార్యలతో గలయిక యేర్పడెను. సంతానుము కల్గినది. కొడుకుల గంటిని. వారి కొడుకుల పుట్టువును నా ఇంకను చూడ వలయునని కోరుచున్నది. వారి సంతానముం గూడ చూచెద గాక! అవ్వల మరొక మనోరథము పుట్టును. అదియును నిండిన నాపై నింకొకటి పుట్టును. మనోరథముల నెవ్వడు వారింప గలడు? మృత్యువు దాకా మనోరథముల కంతు లేదు. ఇప్పటికిది నాకు దెలిసినది. మనోరథార్థములందు సక్తమయిన మనస్సు పరమార్థ మందు సక్తము కాదు. నీట వసించు చేపల స్నేహముచే నా సమాధి వెంటనే నశించినది. ఆ సంగముచే నంగనా పరిగ్రహము చేసితిని. సంసార పరిగ్రహముచే నత్యంత విప్స (వాంఛ) యతిశయించినది. ఒక్క శరీరము

పుట్టుటే దుఃఖమయి యుండ నూటయేబది శరీరముల నిటగన్నాడను. రాజ కన్యలం బెండ్లాడుటతో ననేక పుత్రులతో నది మిక్కిలి పెంపబడినది పౌత్రుల చేతను, వారి కుమారు చేతను వారి వారి పరిగ్రహముల చేతను దుఃఖహేతువు తెగ పెరుగును. మమకారమునకు పర్యాయమే పరిగ్రహము. నీట నుండి చేసిన తపస్సునకు నీయభివృద్ది యంతరాయము (విఘ్నము). చేప తోడ నుండుట వలన నాకు సుతాదుల యెడ వలపు గలిగెను. దానిచే నేను ముషితుడ నయితిని హరింప బడినాడను. యతులకు నిస్సంగత్వము ముక్తిస్థానము. సంగము వలన నెల్ల దోషములు గల్గును. యోగా రూఢుడయిన వాడు ముక్తిచే గ్రిందికి త్రోయ బడును. అల్పసిద్ది గలవాని మాట చెప్పెడి దేమి. భార్యయనెడి గ్రహము (మొసలి) పట్టి

బుద్ది చెడిన నేను నావారి దుఃఖములకు దుఃఖ పడక దోషముల దొలగి ఆత్మసిద్ది నందుట కనువుగ నిక జరించెద. సర్వధాత అచింత్య రూపుడు అణువు కంటె నణువు మహత్తుకంటె మహత్తు యుగ భేధముచే సితాసిత వర్ణుడు లేక శుద్దబద్ద రూపుడు ఈశ్వరుల కీశ్వరుడు నైన విష్ణువును తపసుచే ఆరాధింతును.

 

 

సమస్త శక్తి మంతుడును సర్వ రూపుడును కారణకార్య రూపుడును ననంతుడును నగు నా విష్ణు దేవుని యందు దోషదూరమైన చిత్తము తిరిగి పునరావృత్తి లేని ముక్తి యెల్లపుడు స్థిరముగా నుండు గాక! ఆది మధ్యంతములు లేని వాడును దోషరహితుడును సమస్త రూపుడును సర్వేశ్వరుడును విష్ణువు కంటే నితరమే మాత్రము లేక పోవుటచే నేను గురువులకు పరమ గురువగు నా విష్ణువును శరణు పొందు చున్నాను.

 

 

యిట్లు తనను దాన తెలిసికొని సౌభరి గృహారామక్షేత్ర పుత్ర కళత్ర విషయ సముదాయము నెల్ల విడిచి, భార్య లందరిలో నడవిం బ్రవేశించెను. అందున ననుదినము వైఖానన (వానప్రస్థ) ప్రక్రియ ననుసరించి అఖిల పాపములం దొలగించికొని, పరిపక్వ మనోవర్తనుడై తన యందగ్నులను ఆరోపించుకొని భిక్షువు (సన్యాసి) ఆయెను. సకల కర్మ కలాపమును భగవంతుని యందర్పించి జన్మ జరాది వికార శూన్యము మరణాది ధర్మ రహితము దిగ్దేశాది సంబంధ శూన్యము పరమ పదమునగు నచ్యుత స్థాన మందెను. ఇది మాంధాతృ దౌహిత్ర చరిత్రము దేల్పితిని. ఈ సౌభరి చరిత్ర మెవ్వడు స్మరించునో, జడువునో, జదివించునో, వినును, వినిపించునో, ధారణ సేయునో, వ్రాయును, వ్రాయించునో, నేర్పును, అధ్యయనము సేయించునో, ఉపదేశించునో, వాని కేనిమిది జన్మములు అసద్బుద్ధి అధర్మము వాజ్మనః కాయముల చేన సన్మార్గ వర్తనము సమస్త హేయ పదార్థము లందు మమకారమునుం గలుగదు.