విష్ణు మహా పురాణము
6 - సోమోత్పత్తి - ఊర్వశీ పురూరవ చరిత్ర
నీవు సూర్యవంశ రాజులం దేల్పిటివి. ఇక సోమవంశ రాజులను వినగోరెదను. ఓ బ్రాహ్మణా! స్థిరకీర్తులగు చంద్ర వంశ్యరాజుల చరిత్ర నేటికిని గీర్తింప బడుచున్నది. ప్రసాద సుముఖుడవై యది యానతీయ దగుదువన శ్రీపరాశరుడిట్లనియె. ఓ ముని శార్దూల! ప్రసిద్ధ తేజుడగు సోముని వంశమున భూపతులు ప్రసిద్ధులు జనించిరి. అనుక్రమముగ వినుము. ఈ వంశ మతిబల పరాక్రమ ద్యుతిశీల చేష్టావంతులు నతిగుణాన్వితులైన సహుష యయాతి కార్తవీర్యార్జునాది రాజన్యులచే నలంకృత మైనది. అఖిల జగత్స్రష్టయగు భగవంతుడు నారాయణుని నాభిసరస్సు నందుద్భవించిన అబ్జయోని బ్రహ్మ యొక్క పుత్రుడత్రి. అత్రి కుమారుడు సోముడు. ఆయనను బ్రహ్మ ఓషధులు ద్విజులు నక్షత్రములకు నధిపతిగా నభిషేకించెను. అతడు రాజసూయ యాగముల జేసెను. దాని ప్రభావమున నత్యున్నతాధిపత్యము వలన నితనిని మదమావేశించెను. మదాతిశయముచే సకల దేవా గురువగు బృహస్పతి భార్య దారను హరించెను. బృహస్పతి ప్రేరేపణ బ్రహ్మ చెప్పినను దేవర్షు లందరు యాచించినను నామెను వదలడయ్యే. బృహస్పతి తోడి ద్వేషముచే శుక్రుడు చంద్రునికి సహాయపడెను. జంభనికుంభాదు లెల్ల దానవులు నాతనితో పెద్ద యుద్దము లేవదీసిరి. బృహస్పతికి శక్రుడు సకలదేవ సైన్యముతో సహాయుడయ్యె. ఇట్లా గురుచంద్రులకు తారా నిమిత్తముగా తారకామయమను ఘోర యుద్దము జరిగెను.
రుద్రపురోగములు దేవత లసురుల పైని అశేష దానవులు దేవతల మీదను సర్వాస్త్ర శస్త్రములను బ్రయోగించిరి. ఇట్లు భయంకర సంగ్రామ సంక్షుబ్ధ హృదయమై జగత్తు బ్రహ్మను శరణొందేను. ఆయన శక్రుని శంకరుని అసురులను సురలను వారించి బృహస్పతికి తార నిప్పించెను. ఆమె గర్భిణియై యుండుట చూచి బృహస్పతి నా క్షేత్ర మందు నీవింకొకని సుతుని ధరింప రాదు. వీనిని విడువుము. అతిధార్ష్ట్యము చాలింపు చాలింపు మన నామె మహాపతివ్రత గావున నా గర్భమును ఒక యిషీకా స్తంబమున దిగిచెను. తిరిగినదే తడవుగా నా శిశువు మహా తేజస్సుతో దేవతల తేజస్సును జిమ్మి వేసెను. ఆ కుమారుడతి సుందరు డగుటచే వాని యెడ ముచ్చట పడు గురుని చంద్రునింగని దేవతలు సందేహము పుట్టి తారను బ్రశ్నించిరి. సుందరీ! మాకు నిజము చెప్పుము. వీడు సోముని కొడుకా బృహస్పతి తనయుడా అననామె సిగ్గుచే నించుకయు పలుకదయ్యె. వేల్పులు మఱిమఱి యడిగినం జెప్పకున్న జూచి యా పుట్టిన శిశువు ఆమెను శపింప బూని యిట్లనియె. దుష్టురాలా! అమ్మ! మా తండ్రినేల చెప్పవు? ఇదిగో ఇప్పుడే దొంగ సిగ్గు నభినయించు నీకు నేను శాస్తి చేయుదును. (శాస్తి = శాసనము ఆజ్ఞలో బెట్టెదనన్న మాట. తగిన శిక్ష చేసెదనని లోక వ్యవహారములో తాత్పర్యము) ఇప్పుడు గూడ కొంచమైన పలుక కున్నావు. అని బాలుడన పితామహు డా కుమారుని వారించి స్వయముగా తారను జేరి! అమ్మాయి! చెప్పు. వీడెవ్వని కొడుకు సోముని వాడా! బృహస్పతి వాడా! అన నామె లజ్జించుచు మెల్లగ సోముని వాడనియె. అంత నచ్చవు, తేలి చెక్కిళు లందు కాంతులు చెదర నుడుపతి కుమారుం గౌగలించుకొని బాగు బాగు! వత్స! ప్రాజ్ఞుడవు, తెలివైన వాడవు అని వానికి బుధుడని పేరు పెట్టెను. ఇతడు ఇళ యందు పురూరవడను కొమరునిం గనెనన్న యంశము లోగడ చెప్పితిని గదా!
పురూరవుడతి దానశీలుడు. అనేక యజ్ఞములు చేసిన వాడు, అతి తేజస్వి, సత్యవాది, రూపసి, మనస్వి (పండితుడు), మిత్రావరుణు లిచ్చిన శాపముచే మానుష్య లోకము నందే నుండ వలయునని నిశ్చయించి యూర్వశియా సుందరునిం జూచి నంతన గుట్టు విడిచి యతనిపై మనసు పడి స్వర్గ సుఖాభిలాషం గూడ విడిచి వానినే జేరెను. అతడును సకల లోకాంగనల నతిశయించు దాని సౌకుమార్య లావణ్య గతి విలాసహావభావాది గుణ విశేషము లుపక్షించి యామెయంద మనస్సు లగ్నమై యుండెను. అయ్యుభయము నొండొరుల మనసుపడి మరుచూపు లేక మఱి యితర ప్రయోజనము లన్నిటిం ద్యజించి యుండెను. పురూరవుడు ప్రౌడుండు గావున చొరవ సేసికొని సుందరీ! నిన్నేను వలచితిని. ప్రసన్న వగుము. అనురాగముం గొనుమని పలుక నూర్వశి సిగ్గుదొరగి యగుగాక! నాకొక ప్రతిజ్ఞ గలదది నీవు పాలింతువేని యిట్లయగు గాక యన నతడు మరల నామెతో నాకా ప్రతిజ్ఞ యేదో తెలుపుమన నామె మరియిట్లు పలికెను. శయన సమయమున నాకు పుత్రులట్లున్న ఈ మేక పిల్లలను దొలగింప రాదు. నీవు నగ్నుడుగా నాకు గనబడ రాదు. నాకాహారము నేయి మాత్రము గావలెననియె. రాజట్లే కానిమ్మనియె.
ఆమెతో గూడ పురూరవు డలకా నగర మందు చైత్రరథ పుష్పోధ్యానము లందు మానస సరోవరము మొదలయిన పద్మ సరస్సు లందతి రమణీయ ప్రదేశములందు విహరించుచు నిరువది యొక్క సంవత్సరములు దినదిన వర్ధమానానంద రస భరితుడై క్రీడించెను. ఊర్వశియు నతనితోడి యుపభోగమున ప్రతిదిన మనురాగ మభివృద్ధి నొంద స్వర్గలోక నివాసము మాటయే మరచెను. ఊర్వశి లేమి నమరలోక మప్సరసలకు గంధర్వుడు తన వారితో గూడ వచ్చి యా రాత్రి వారి పాన్పు నుండి యొక మేకను గొనిపోయెను. ఆకాశ మందది లాగికొన పోవు తరిం బెట్టిన యరపు నూర్వశి వినెను. దిక్కులేని నా బిడ్డ నేవ్వడో లాగికొని పోవుచున్నాడు. నేనెవ్వని శరణొందేద ననెను. అది వినియు రాజు దిగంబరిగా నున్న నన్ను దేవి చూడ గలదని వెలిక పోడయ్యే. అవ్వల రెండవ మేకను గూడ గంధర్వులు లాగికొని పోయిరి. దాని యరపు గూడ విని మరల నేననాథను. అభర్తృకను. కుత్సితు నొక్కని గట్టుకొని తిరుగు చున్నానని యాక్రందించెను. పురూరవు డందులకు గోపము గొని చీకటి గదా యని ఖడ్గముం గొని “ఓరి! దుష్ట దుష్ట! ఇదె చచ్చిటివి చూడుమనుచు బరువెత్తెను. అంతలో గంధర్వులు మిక్కిలిగ నుద్దీపించు మెరపును జూపిరి. ఆ వెలుగులో నూర్వశి రాజుం దిగంబరి గాగని మున్ను చేసికొన్న కట్టడ దప్పినదని యాక్షణమే వెడలి పోయెను. గంధర్వులు నా మేకల నక్కడనే విడచి సురలోక మేగిరి. ఆ మేకలం గొని రాజానంద భరితుడై తన పాన్పున కేతెంచి యూర్వశిం గానడయ్యే. ఆమెనట గానక దిగంబరిగానే వెఱ్రి వాడట్లు వెఱ్రి పర్వులు పెట్టెను. కురుక్షేత్ర మందు తామర కొలనిలో నితరాప్సరసలు నల్వురగూడి యున్న యూర్వశిం గాంచెను. ఆ వెఱ్రి రూపుతోనే యింతీ! నిలు నిలు! మనసునం బరమ ఘోరవు. మాటం గపటవు ఓసి నిలునిలు మనియిట్లు పలుభంగులయిన సూక్తములం బల్కెను. ఊర్వశియు నిట్లనియె. మహారాజా! ఈ యవివేక చేష్టలు చాలును. నేనిపుడు గర్భిణిని. ఏడాది తరువాత నీవిటకు రాదగును. నీకు కొడుకు గలుగ గలడు. ఒకానొక రేయి నీతో గలిసి యుందును గదా యన హర్షించి పురూరవుడు తన పురమునకుం జనెను. ఆయప్సరసలతో నూర్వశి నేనిన్నాళ్ళనురాగమున మనసాకర్షింపబడి యున్న పురుషుడీతడనెను. వారు నిట్లనిరి. బాగు బాగు! ఈతని చక్కదన మెంత చక్కనిది. ఈతనితో మాకు గూడ కలకాలమునికి జతపడు గాక! యనిరి. ఏడాది కాగానే యా రాజచట కేతెంచెను. అతని కూర్వశి కుమారుని దీర్ఘాయుష్మంతుని సమర్పించెను. సమర్పించి యొక్క రేయి యాతనితో నుండి యైదుగురు కొడుకులు గలుగు గర్భాముం ధరించెను. మఱియు ఱేనింగని నాకు బ్రీతిగలుగ సర్వ గంధర్వులు మహారాజునకు నీకు వరమీయ నున్నారు, వరమడుగుము అన రాజు రిపుల నందరం గెలిచితిని. ఇంద్రియ పాటవ మించుకయు సడల లేదు. బంధు సమృద్ధియు గలదు. అమిత సైన్యకోశ సమృద్ధియుం గలదు. ఊర్వశీ సాలోక్యము కంటె మరియోకటి మాకు గావలసినది లేదు. కావున నేనీయూర్వశి తోడన కాలము గడుపగోరెద నన గంధర్వులా రాజున కొకస్థాలిని (పాత్రను) ఒసంగిరి. మఱియు నిట్లు పలికిరి. వేదామ్నాయము ననుసరించు వాడవై యగ్నిని మూడుగా జేసి ఊర్వశీ సలోకతామనోరథ సిద్ద్యర్థమని (సంకల్పము సేసి) చక్కగా యాగము సేయుము. దాన నవశ్య మభిలషితమంద గలవు. అన నాతడాయగ్ని స్థాలింగొని యేగెను. నట్టడవిలో అక్కడ! నా తెలివి తక్కువ తనమిది యేమి? నేనిపుడేమి సేసితిని? అగ్నిస్థాలిం గొని వచ్చితిని. ఊర్వశిం గాదు. అని యాస్థాలి నడవిలో విడిచెను. స్వపురమున కేగెను గూడ. అర్థరాత్రి గడవ మెలకువ వచ్చి యిట్లను కొనెను. ఊర్వశీ సాలోక్య ప్రాప్తికి గంధర్వులు నాకు అగ్నిస్థాలి నిచ్చిరి. నేనద్దాని నడవిలో బారవేసితిని. అందుచేనది తెచ్చుట కేగెదనని లేచి యటకేగి యచ్చట దాని గానడయ్యే.
ఇక్కడనేనగ్ని పాత్ర నుంచితిని అదే అశ్వత్థము, శమీ గర్భము నైనది. అందుచే నదే యగ్ని రూపము గొని నేను పురమేగి యరణిం గావించి యందు ఉదయించిన యగ్నిని ఉపాసించెదను, అని పురమునకు వచ్చి యరణిం గావించెను. అదే యంగుళముల కొలతతో నరణిం జేయువాడై గాయిత్రిం బఠించెను. పఠించు చుండగా గాయత్రీ మంత్రాక్షరములెన్నో యన్ని అంగుళముల యరణి తయారయ్యెను. అందగ్నిని మథించి త్రేతాగ్నుల నతడామ్నాయాను సారియై హోమము సేసెను. ఊర్వశీ సాలోక్యమును ఫలముగా నభిసంధానము సేసెను. (సంకల్పము చెప్పి కొనెనన్న మాట) అదే యగ్ని విధానమున బహువిధ యజ్ఞము సేసి గంధర్వ లోకములు వడసి యూర్వశితో నెడబాటు లేని స్థితి నందెను. మొదట నేకాగ్నియే యుండెను. ఈతని చేత నీమన్వంతరము నిట్లు త్రేతాగ్నులు ప్రవర్తింప బడెను.
