విష్ణు మహా పురాణము
11 - సూర్య మహిమా వర్ణనము
స్వామీ! తమరు రవి రథమందలి సప్త గణము వారి వారి పనులఁ గూర్చి సమగ్రముగ సెలవిచ్చితిరి. సూర్యుడు సేయు పనిం దేలిపినారు గారు. దేవతాది సప్త గణమే హిమోష్ణ జలములను వర్షించునేని వృష్టి సూర్యుని వలన నని యేల చెప్ప బడినది. సర్వ కార్యక్రమము నీ సప్త గణమునకు జెందినదగు నేని సూర్యుడు దయించినాడు. ఆకాశ మధ్య మందున్నాడు, అస్తమించినాడని జనమేల పలుకును?
మైత్రేయా! వినుము. ఈ సప్తగణ మొక్కటగను రవి సర్వప్రధానుడుగ నున్నాడో దీని కంతకుంబైని విష్ణువు యొక్క పరాశక్తి ఋగ్యజుస్సామ వేదరూపిణి త్రయీమూర్తి వెలుంగు చున్నది. అది జగత్తు యొక్క పాపమునెల్ల నశింప జేయును. ఆ శక్తియే విష్ణువు. జగత్తును పాలించును. స్థితి హేతువగును. సూర్యుని యందు ఋగ్యజుస్సామ స్వరూపిణియై ఆ శక్తియే యున్నది. ప్రతి మాసము నాయా సూర్యులెవరు గలరో వారియందు త్రయీరూపిణియగు నా శక్తి నిలుపొందు చుండును. పూర్వాహ్ణ మందు ఋక్కులు, మధ్యాహ్నము యజుస్సులు, సాయాహ్నమందు బృహద్రథంతరాది సామములు సూర్యుని స్తుతించు చుండును. ఈ త్రయీ విష్ణువు యొక్క శరీరము. బ్రహ్మ పురుషుడు పురుషోత్తముడగు హరి, రుద్రుడునను, మూర్తి త్రయము త్రయీ రూపము. బ్రహ్మ సృష్టి యందు ఋగ్వేదమయుడుగను విష్ణువు స్థితియందు యజుర్మయుడుగను రుద్రుడు లయయందు సామమయుడుగను నుందురు. కావున రుద్ర దేవతాకమయిన సామము యొక్క ధ్వని యశుచి హేతువన బడును. శుద్ధ సత్వమయము. వేదత్రయ రూపమునగు వైష్ణవీ శక్తి తన శరీరమైన సప్తగుణము నందున్న యా సూర్యుని నధిష్టించి యున్నది. దాని వలన భానుడు తన కిరణములతో జాజ్వల్యమానుడగుచు సర్వ జగమ్ముల సర్వవిధ తమస్సును నశింప జేయు చున్నాడు. స్థూలమైన చీకటినే కాదు, జీవుల యంతః కారణము నందున్న తమో గుణమును అజ్ఞానమును నశింప జేయుచు చైతన్యాధాయకు డగుచున్నాడని భావము. ఈయనను మునులు స్తుతించు చున్నారు. గందర్వు లెదుట నిలిచి గానము సేయుచున్నారు. అప్సరసలు నృత్యము సేయు చున్నారు. రాక్షసు లనుగమనము సేయు చున్నారు. పన్నగులు వహించు చున్నారు. యక్షులు రశ్మి సంయోజనము చేయు చున్నారు. వాలఖిల్య మహర్షులు గూడనట్లే వీని చుట్టుకొని యందురు. శక్తి రూపధరుడగు విష్ణువు ఒకప్పుడు నుదయించుట లేదు. అస్తమించుట లేదు. కేవల అధిష్టాటయగుటచే స్థిరుడు అధిష్టేయము అస్థిరమునగు ఆయన సప్తవిధ గణము కంటే వేరైన వాడు. ప్రత్యేక శక్తిమయము స్తంభము నందున్న అద్దమున కెదురుగా నేవ్వడెవ్వ డెగును. అతడతడందు ప్రతిబింబ దర్శనము నొంది దానితో సంబంధమును బడయును. ఇట్లే యా వైష్ణవీ శక్తియు ప్రతిమాసము నందును దీపించు నా భాను బింబము నందిరవుకొని ఎన్నడు విడిచి పోదు. ఆ ప్రభువు పితృ దేవా మనుష్యాదుల నెల్ల వేళల నాప్యాయితులం గావించును. నహోరాత్రములకు కారణమై తిరుగు చున్నాడు. సూర్య రశ్మి విశేషమైన సుషుమ్నచే తర్పితుడై అమృతమూర్తి యగు చంద్రుడు కృష్ణపక్ష మందు దేవతలచే పానము సేయబడును. దేవపానానంతరము రెండు కళలు మాత్రముగా మిగిలి యున్న యా సోముని కృష్ణ పక్షము తుదను (అమావాస్య తిథి యందు) పితృ దేవతలు త్రావుదురు. సూర్యుని వలన వారు తర్పణము (తృప్తిని) పొందుదురు. భూమి యందున్న రసమును సూర్యుడు తన కిరణములచే గ్రహించి (పీల్చి) దానిచే భూత జాలము యొక్క పుష్టి కొఱకు సస్య సమృద్ధి కొఱకును విడుచును. అట్లు సూర్య భగవాను డశేష భూత జాలమును పితృ దేవా మనుష్యాదులను దనియింప జేయు చున్నాడు. దేవలతకు ఒక శుక్ల పక్షము నందును పితృ దేవతలకు నెలకొక రోజు (అమావాస్య) నందును మర్త్యులకు దిన దినము నీ సూర్య తృప్తి ననుగ్రహించు చున్నాడు. ఈ యాసాయన కాల భేదము సూర్యగోళ పరిభ్రమణమును బట్టి ఇది దేవలోక పితృలోక మానవ లోకములం దేర్పడును. ఇది ఖగోళ శాస్త్ర విజ్ఞాన విషయము. పురాణము లందిది కథా రూపమున ప్రతిపాదితము.
