విష్ణు మహా పురాణము
12 - గోవింద పట్టాభిషేకము
కృష్ణుడు గోవర్ధన శైలమును గోకులము నుద్దరింప పాకశాసనుడు కృష్ణ దర్శనము సేయ నభిలషించెను. అతడైరావతమేక్కి వచ్చి గోవర్ధన గిరిపై గోపాల బాలక రూపము ధరించి గోవులం గాచుచు గోప కుమారులతో చుట్టబడి సకల జగద్రక్షకుని హరిని హరి (ఇంద్రుడు) దర్శనము సేసికొనెను. మఱియు నందరకుం గనబడకుండ పై యెత్తున హరి శిరమ్మున దన రెక్కలతో నీడ గల్పించుచున్న పక్షిరాజును గరుడును గూడ దర్శించెను. అతడైరావతముం దిగి ఏకాంతమున ప్రీతిచే గనులు విప్పార నల్లన నవ్వుచు మధువైరి కిట్లనియె.
కృష్ణ! కృష్ణ! ఇదే యాలింపు మేనెందులకు నీ సన్నిధి కేతెంచితినో విన్నపము సేసెద. నీ వింకొకలాగు భావింప వలదు. పరమేశ్వరా! అఖిలాధారుడవీవ పృథివీ భారముడుప నవతరించినాడవు. యాగభంగము సేసితివని పగగొని నేను గోకుల మాకులము సేయ మేఘముల కాన యిచ్చితిని. వానిచే నీ కల్లోలము సేయబడినది. నీవు గిరినెత్తి గోవుల గాచితివి. అధ్బుతమైన నీ ఈ లీలచే నేను సంతసించితిని. ఒక్క కేల నీవీగిరి నవలీల నెత్తుట వలన స్వామీ! వేల్పుల ప్రయోజనము నేరవేర్ప బడినదని నేదలంతును. నీచే సురక్షితులైన గోవులు నిన్ను సత్కరింప వలెనను కారణముచే నన్ను మిక్కిలి ప్రేరేప నీ దరి కిట కేతెంచితిని. గోవుల మాట నుత్తేజితడనై గోకులమునకు ప్రభునిగా నుపేంద్రునిగ సత్యలోకో పరిస్థిత గోకులేశునిగా నిన్ను బట్టాభిషేకించెద. గోవుల కింద్రుడవగు నీవు గోవిందుడవుం గాగాలవు.
అంతట సురపతి తన వాహనమైన యైరావతము నుండి గంటం జేకొని దానం బవిత్ర జలములు నింపి గోపాల కృష్ణున కభిషేకము గావించు చుండగా నా క్షణమున గోవులు పాలు చేపి వసుంధర నెల్ల గోక్షీరధారార్ద్రం బొనరించినవి. మాట వెంబడి శచీపతి జనార్దను నుపేంద్రునిగ సంప్రీతి నభిషేకించి వెండియు సవినయముగ నిట్లనియె. పృథ్వీధరా! గోవుల మాట సెల్లించితిని. మఱియు భూభారము తగ్గించ దలచి చెప్పు నా పలుకాలింపుము. నా యంశము భూమి యందు అర్జునుండను పేర నవతరించినది. ఆతడు నీచే రక్షింపబడు గాక! ఆ వీరుడు భూభారవతరణముణ నీకు సాహాయ్య పడగలడు. ఆత్మవలె నతడు నీకు సంరక్షణీయుడు అనియె. అంత నింద్రునితో భగవంతు డిట్లనియె.
భరతవంశ మందు నీ యంశమున బుట్టినాడని పార్థుని నే నెరుంగుదును. నేను భూతలమున నున్నంత వరకాతని నేను బాలించెదను. దేవేంద్రా! నేనున్నంత వరకు అయ్యర్జునుని బోర నెవ్వడుం గెలువ లేడు. కంసుడను దైత్యుడు అరిష్టుడు కేశీ కువలయాపీడుడు నరకుడు మరి యా పెక్కురు హతులై నంత మీదట మహా యుద్దము జరుగును. అందు సర్వ భారావతరనముం జేయబడి నట్లే యెరుంగుము. నీ కుమారుడగు నర్జునుని విషయమై సంతాప పడకుము. అర్జునుని శత్రువెవ్వడును నా యెదుట నేమియు చేయజాలడు. అర్జునుని కొరకే నేను యుధిష్టర పురస్సరులైన బిడ్డలను భారత యుద్దమైన తరువాత నెట్టి దెబ్బ తినకుండ కుంతీ కొసంగెదను. అని పలుక విని దేవపతి జనార్ధనుం గౌగిలించుకొని యైరావత గజమెక్కి తిరిగి దివమ్మున కేగెను. పిమ్మట కృష్ణుడును, గోవులతోను, గోపాలురతోను, గోపికల చూపులచే బవిత్రమయిన దారివెంట వ్రేపల్లెకు విజయం చేసెను.
