విష్ణు మహా పురాణము

Table of Contents

11 - గోవర్ధనోద్ధరణము

 

 

మైత్రేయా! ఇంద్రుడు యాగ భంగమై నందులకు మిగుల రోషము గొని సంవర్తకములను మేఘ గణముం బిలిచి నా మాట విని మీరు గోకులమునకుం జనుడు. అక్కడ మిక్కిలి దుర్భుద్ధితో నందగోపుడు మఱి గొందఱం గూడి కృష్ణుని యండం బలుపుగొని యాగభంగము సేసెను. గోపకులకు జీవనాధారము లయిన గోవులు కూడ దానికి కారణము. కావున నా గోవులను వర్షపాతముచే బాధింపుడు. నేను కొండ శిఖర మట్లై ఐరావతము నెక్కి వాయుజలోపద్రవము సమకూర్చి సాహయ్యము సేసెదను.

 

 

ఇట్ల ఆజ్ఞపింపబడి మేఘములు గోవులు నశింప వలెనని పెనుగాలి వాన గురిసినవి. క్షణములో భూమి దిక్కులు నింగియు అనేక మగునట్లు నేకధారగా జడివాన గురిసి ముంచెత్తెను. మెఱుపు తీగలనెడి కొరడా దెబ్బలకు జడిసినవో యన్నట్లు మేఘములు దిక్కులు పెను గర్జనముల బ్రతిధ్వనింప కుంభ వృష్టి గురియ లోకమంధకార బంధురమై క్రిందు మీదులు నంతరాళమును కేవల జలప్రాయ మయ్యెను. గోవులు పైబడు నా వాన పెనుగాలుల కేగిరిపోయి సంధి బంధములు విడి తలలొరిగి ప్రాణములు వాసెను. కొన్ని యావులు దూడల కడుపున కదుముకొని నిలిచెను. జల పూరములం గొన్ని లేగలం గోల్పోయినవి. దూడలు బిక్క మొగము వెట్టి పెనుగాలికి మేడలు వడక రక్షింపు రక్షింపు మని కృష్ణునిం గూర్చి యడలను నంభారములు సేసినవి. గోపగోపీ గోపాల సంకులమైన యా గోకులము మిక్కిలి దుఃఖితము కాగా హరి చూచి యిట్లను కొనెను. మఖభంగము సేసెనని కసిగొని యింద్రుడు చేసిన చేష్ట యిది. ఈ గోష్ఠమంతను నేనిపుడు గాపాడ వలయును. ఈ కనిపించు గిరి నేను దేకువ గొనియెత్తి పెను శిలలం బలువైన దీనిని గొడుగగట్లెత్తి పట్టెదను. అని నిశ్చయించి కృష్ణుడు గోవర్ధన పర్వతముం బెకల్చి యొక్క కేలనవలీలగా నెత్తి పట్టెను.

 

 

మఱియు కొండనెత్తి నవ్వుచు గోపాలురతో నవ్వుచు తొందరగ నందఱు నీ క్రిందకు రండు. ఈదురుగాలి చొరని ఇక్కడ సుఖముగా నుండుడు. కొండపై బడునేమోయని జడియకుడు. అని కృష్ణుడు పలుక గోధనములతో గోపకులు భాండములు బండ్లకెక్కించి గోపికలను నక్కొండ క్రిందకు జేరిరి. అందఱు నాశ్చర్యపడి, యానందపడి ప్రీతిచే చూపులు

 విప్పార తన లీలలను స్తుతింప నా కొండను హరి యవలీలగ దనకేలం ధరించెను. ఏడురాత్రు లమ్మబ్బులుబ్బునం గుండపోతగ గురిసినవి. గోవర్ధనమెత్తి గోకులముం గాపాడ బలారి వింతముసెడి వారిదములను వారించెను. అందఱు నాశ్చర్యముఖులై కనుగొన కృష్ణుడంత గోవర్ధన పర్వతమును యథా స్థానము విడిచెను.