విష్ణు మహా పురాణము
18 - అంగ వంశము
యయాతి నాల్గవ కుమారుడగు అనువునకు సభానలచక్షుః పరమేషువులను వారు ముగ్గురు పుత్రులు గల్గిరి. సభానలుడు, కాలానలుడు, సృంజయుడు, పురంజయుడు, జనమేజయుడు, మహాశాలుడు, మహామనుడు అనువారు వరుసగా తండ్రి కొడుకులు. మహామనునకు ఉశీనరుడు తితిక్షువు అను నిద్దరు గల్గిరి. ఉశీనరునకు శిబి నృగుడు నవుడు కృమి వర్మ యను నైదుగురు కుమారులు. శిబి కొడుకులు వృషదర్భ సువీర కేకయ మద్రకులను నల్గురు. తితిక్షువునకు రుశద్రథుడను వాడు గల్గెను. వానికి హేముడు వానికి సుతపుడు వానికి బలియుం గల్గిరి. అతని భార్య యందు దీర్ఘ, తమస, అంగ, వంగ, కళింగ, సుహ్మ, పౌణ్డ్రులను వారు క్షత్రజాతి వారు పుట్టిరి. ఇది బాలేయ (పవిక్షేత్రజ వంశమను ప్రసిద్ధి నందెను) ఆ సంతతి యొక్క పేర దేశములు నేర్పడినవి.
అంగుడు, అనపానుడు, దివిరథుడు, ధర్మరథుడు, చిత్రరథుడు (రోమపాదుడు) నను తండ్రి కొడుకుల వరుస ఏర్పడెను. రోమపాదుడు దశరథుని చెలికాడు. సంతతి లేని ఆ రోమపాదునకు శాంత యను కన్యను అజమహారాజు కుమారుడు దశరథుడు కుమార్తెనుగా నిచ్చెను. రోమపాదుడు చతురంగుడు, పృథులాక్షుడు, చంపుడు ననువారు వరుసగా తండ్రి కొడుకులు. చంపుడు చంపా నగర నిర్మాణము సేసెను. చంపుని కొడుకు హర్యంగుడు అతని కొడుకు భద్రరథుడు. అతని వాడు బృహద్రథుడు, అతనికి బృహత్కర, అతనికి బృహద్భానువు, అతనికి బృహన్మనుడు, అతనికి జయద్రథుడు గల్గిరి. జయద్రథుడు బ్రహ్మ క్షత్రకులముల సాంకర్యమున పుట్టినది యగు బహార్య యందు విజయునిం గనియె. విజయునికి ధృతి, యతనికి ధృతవ్రతుడు, అతనికి సత్యకర్మ, అతనికి అతిరథుడు గల్గిరి. ఇతడు గంగకు వెళ్లి పెట్టెలో నున్న వానిని పృథ (కుంతీ) చేత్యక్తమైన సుతుని కర్ణునిం బుత్రుంగా బడసెను. కర్ణునికి వృషసేనుడు గలిగె. ఇంతవరకు అంగ వంశ్యులు. ఈ మీద పూరు వంశము వినుము.
