విష్ణు మహా పురాణము
10 - యయాతి చరిత్రము
నహుషుని కొడుకులు ఆరుగురు. యతి యయాతి సంయాతి ఆయాతి వియీతి కృతి అనువారు. మహా బలశాలురు. యతి రాజ్యమును గోరలేదు. యయాతి భూపతి అయ్యెను. అతడు శుక్రాచార్యుల కూతురును దేవయానిని వృష పర్వుడను రాజు కూతురును శర్మిష్ఠను పెండ్లాడెను. ఇక్కడ అనువంశమైన శ్లోకమొకటి యున్నది, దాని భావము. “దేవయాని యదువును దుర్వసుని గన్నది. వృషపర్వుని కూతురు (వార్షపర్వణి) ద్రుహ్యుని అసువును బూరుని గనెను”.
శుక్రుని శాపముచే యయాతి కొంత కాలము ముసలి తనము పొందెను. ఆ మీద ప్రసన్నుడైన యా శుక్రుని మాటను బట్టి తన ముసలి తనమును పెద్దకొడుకగు యదువునకు సంక్రమింప జేయవలె నని, వత్సా! నీ మాతా మహుడు ఇచ్చిన ఈ శాపముచే అకాలమున నాకు జర వచ్చినది. దానిని అతని అనుగ్రహముననే సంక్రమింప జేసెదను ఒక వేయేండ్లు విషయ భోగములు అనుభవించితి గాని తృప్తి కలుగ లేదు. నీ ప్రాయముచే నేను విషయములను అనుభవింప కోరుచున్నాను. ఇది నీవు కాదనరాదు. అన విని యదువు ఆ ముదిమిని తీసుకొనడానికి ఇష్ట పడలేదు. వానిని దండ్రి నీ సంతతి రాజ్యార్హము గాబోదని శపించెను. అటుపై శర్మిష్ఠ తనయుని అందరి కన్న చిన్నవానిని పూరుని నట్లు అడిగెను. అతడు అత్యంత ఆదర బుద్దియై సబహుమానముగ తండ్రికి ప్రణమిల్లి మహాప్రసాద మిది మాకని ఉదారముగా పలికి ముదిమిని గొనెను. తన యౌవనమును తండ్రికి ఒసగెను. అతడును పూరువు యవ్వనమును పొంది ధర్మము తప్పకుండ యథాభిలాషముగ సమయమునకు సమకూరిన విధముగ ఉత్సాహముతో విషయముల వెంట జరించెను. ప్రజా పాలనము కూడ చక్కగా చేసెను. విశ్వాచి (అప్సరస)తో దేవయాని తోడను నుపభోగ అనుభవము నంది కామముల తుదినందెద ననియు ననుదినము నదే మనసు పడియుండెను. దినదినోప భోగములచే కామములతి రమ్యములని తలంచెను. అందుచే ఇతని గూర్చి యిది యొక గాథ. దీవి భావము. ఎన్నడునేని కామము కామముల యుపభోగమున శమింపదు. హవిస్సు చేత అగ్ని వలె మిక్కిలిగా అభివృద్ధి చెందును. పృథివి యందున్న మొత్తము వ్రీహులు యవలు ఇత్యాది దానయ విశేషములు హిరణ్యము (బంగారము) పశువులు స్త్రీలును నొక్కనికి గూడ సరిపోవు. అందువలన తృష్ణను ఆశను పరిత్యజించ వలయును. సర్వ భూతము లందును పాపపు తలంపు నెప్పుడు సేయడో అప్పుడు అసమా దృష్టి గలవాని కన్ని దిశలు సుఖ వలయములు. దుర్మతులైన వాండ్రేది వదల జాలరు. ఏ కొలది జరించిన కొలది జరింపదో (ముదిమి గ్రమ్మినం దేనికి ముదిమి లేదో) అట్టి తృష్ణను ఆశను ప్రాజ్ఞుడు వీడ వలయును. అట్టివాడు సుఖముచే నింప బడును. జరించిన వానికి జుట్టు దంతముళ్ళు జరించును (జుట్టు నేరియును పండ్లూడును) ధనాశ జీవితాశ మాత్రము జరావశుడైన వానికి జరింపవు. విషయ లంపటుడైన నాకు వేయి ఏండ్లు నిండినవి. అయినను ననుదినము నాకు వాని యందాశ కల్గుచునే యున్నది. కావున నేనీ తృష్ణను విడిచి మనసును బ్రహ్మమందుంచి నిర్ద్వంద్వుడనై (సుఖ దుఃఖములు శోక మోహములు అనునీ జంటలు అంటూ తొలగి) నిర్మముడనై నాది నేను అను మమకారమును బాసి మృగములతో గూడ జరించెదను. అని పూరుని నుండి జరం గైకొని యౌవనము వానికిచ్చి రాజ్యము నందతని నభిషేకించి తపస్సునకు అడవికి పోయెను. ఆగ్నేయ భాగమందు దుర్వాసుని బడమాట ద్రుహ్యుని దక్షిణా పథమున యదువును ఉత్తర దిశ ననువును పరిమితి మండలాధిపతుల గావించి సర్వ పృథ్వీ మండలేశ్వరుని పూరువుం
గావించి యాతడు వనమేగెను.
