విష్ణు మహా పురాణము
22 - బలరామ కృష్ణ కృత జరాసంధ పరాజయము
కంసుడు జరాసంధుని కూతుండ్రను ఆస్తి, ప్రాస్తి యనువారిని పెండ్లాడెను. వారిద్దరి భర్తయగు కంసుని హరి చంపెనని మగధాదిపతి జరాసంధుడు పగగొని వానిని చంప దలచి యిరువది మూడక్షౌహిణుల సేనతో దండెత్తి వచ్చి మథురను ముట్టడించెను. బలరామ జనార్దనులల్ప పరివారములతో పురము వెడలి వానితో బోరిరి. అటుపై రామకృష్ణులు తమ తొలుతటి యాయుధములం గైకొని యని సేయవలయునని తోచిన యంత వారికి శార్జ్గము అను ధనువు అక్షయ బాణములు గల అంబుల పొదులు రెండు కౌమోదకి యను గదయు నాకాశమందుండి వచ్చినవి. బలరామునికి అభిమతమైన నాగలియు రోకలియు గగనము నుండి వచ్చెను. అయ్యిరువురకు నవి యభిమతములును ఆనందకరములు నయ్యేను. వానిం గొని మగధపతి వారాయుద్దమునం బరాజితుం గావించి పుర ప్రవేశ మొనరించిరి. ఆ దుష్టుడోడిపోయి ప్రాణములతో బోగా కృష్ణుడది వానిం గెలిచినట్లు గాదనుకొనెను. వాడును సైన్యముల గూర్చికొని తిరిగి వచ్చి పోరి యోడిపోయి మరల పారిపోయెను. ఆ దుర్మార్గుడిట్లు పదునెనిమిది మారులు దండెత్తి యుద్దము చేసి పారిపోయెను. యాదవులల్ప సైన్యముతో బహుసైన్య పరివారునిట్లు పలు పర్యాయము లోడించిరి. అదంతయు విష్ణునంశమైన కృష్ణుని విలాసము. సృష్టిని జగత్సంహారమును గావించు నా చక్రాయుధునకు శత్రు నాశనోద్యమ మేపాటిది? అయినను నవతార మెత్తినందున నా నరకేసరి నర ధర్మమనుసరించియే బలవంతులతో సంధిని బలహీనులతో యుద్దము సామము ఉపప్రదానము (దానము) భేదము అనునవి ప్రదర్శించుచు తుదకు దండపాతముం జేయును. ఒక్కొక్క యెడ పారిపోవుటయుం గలదు. ఈ రీతిగా మనుష్య చేష్టననుసరించును. ఇది యంతయు జగత్పతి యొక్క స్వేచ్చాను సారమైన యొక లీలయే.
