విష్ణు మహా పురాణము

Table of Contents

3 - వేదవ్యాస చరిత్ర

 

 

‘భగవాన్! సర్వ ప్రపంచము విష్ణువే కాని వేరుగాదు. ఇదంతయు విష్ణువు నందే స్థితి లయముల నొందు చున్నది. విష్ణువు కంటె వేరొకటి లేదు’ అను విషయములను నీ వలన నేను తెలిసికొంటిని. ఈ విషయమును వినగోరు చున్నాను. అదేమనగా, ఆ విష్ణువే వేదవ్యాస రూపమున వేదమును యుగయుగమున విభజించెను గదా! ఏ యే యుగమందు నేయే రూపము దాల్చెనో తెలుపుము. వేదశాఖా భేదములను గూడ తెలుపుదువు గాక!

 

 

మైత్రేయా! వేదమనెడి వృక్షమునకు శాఖలు వేలకొలది గలదు. వాని విస్తృతి చెప్ప నలవి గాదు. కావున సంగ్రహముగ వినుము. మహామునీ! ప్రతి ద్వాపర యుగమునను. మనుష్యుల యొక్క వీర్యము అనగా నుత్సాహము, తేజస్సు అనగా తపోయోగాది జనిత ప్రభావము. బలము అనగా ధారణా శక్తియు నల్పములని గుర్తించి సర్వ భూతముల హితము కొఱకు వేద విభాగము నా వేద వ్యాసుడు చేయు చుండును. ఒక్కొక్క వేదము నిట్లు విభజించు చున్న వేదవ్యాస మూర్తి మధుసూదనుని మూర్తియే. ఏ మన్వంతరమున నేయే వ్యాసులు జనించి వేదశాఖా భేదముల నెట్లు గావించిరో వినుము. వైవస్వత మన్వంతర మందలి ద్వాపర యుగము లందు మహర్షులచే వేదము ఇరువది యెనిమిది పర్యాయములు విభక్త మయినది. ఇరువది యెనమండుగురు వేదవ్యాసులు గతించినారు. వారిచే ద్వాపర యుగము లందు వేదము నాలుగు భాగములుగ ననేక పర్యాయములు చేయ బడినది.

 

                              

 

వేదము విభక్త మయినను వికార రహితమయి స్థిరముగ నున్న ఓ మను నేకాక్షర రూపమగు బ్రహ్మ గొప్పది యగుట వలన పెంపొందించునది యగుట చేతను బ్రహ్మ యనబడును. భూః భువః స్వః అను వ్యాహృతి త్రయమును కారణా వ్యవస్తయందు అంతర్గతము చేసికొని యుండుటచే బృహత్పదార్ధ మగుట చేతను కార్య వ్యవస్థ యందు వ్యాహృతి వేద రూపమున పరిణమించుట చేతను బృహత్వ బృంహణములచే బ్రహ్మయన బడుచున్నది. జగత్తు యొక్క ప్రలయోత్పత్తు లందు కారణ రూపమయి మహాత్తత్వము కంటె పరమై గుహ్యమైన యే ప్రధానము గలదో తద్రూపమగు బ్రహ్మకు నమస్కారము. ప్రధానము నుండియే జగత్తు పుట్టి అందే లయించుటచే ప్రధానము అనగా ప్రక్రుతి జగత్తు యొక్క ప్రలయోత్పత్తులకు కారణ మందురు. అట్లు కారణమైన ప్రధాన తాదాత్మ్య రూపమున ప్రణవమును స్తుతించు చున్నాడని భావము.

 

 

ఆ తత్త్వము ఆగాధము, అనగా ఆది లేనిది. అపారము అనగా సర్వగతము నాశ రహితమునై తమోగుణ కార్యమగు అజ్ఞానముచే మోహము కలిగించును. సత్వ గుణ కార్యమగు ప్రకాశముచే జ్ఞాన జననము చేతను రజోగుణ కార్యమగు ప్రవృత్తిచే కర్మోత్పాదన

చేయుట చేతను పురుషార్థ సాధన మగును. భోగ సాధన మగును. సాంఖ్యులకు అనగా మూల ప్రకృత్యుపాసకులకు ప్రకృతి పురుష వివేకమును కలిగించుణ దగుటచే నదియే ప్రాప్యస్థానము. అంతరింద్రియ బహి రింద్రియముల ఉపరమమే స్వభావముగా గల యోగులకు శమాది ప్రాప్తికి నుపాయ మగుటచే ప్రాప్యము. అప్రదానము ఇంద్రియ గోచరము కానిది నాశ రహితము ప్రవృత్తి రూపము. ఎల్లప్పుడు సంకోచ వికాసములచే ఉండునది. ఉపనిషత్తు లందు ప్రధానము స్వతస్సిద్ధ మని అవిద్యాంతర్గతము భేదారహితము ప్రకాశవంతమని అపక్షయ శూన్యమని అనేక రీతులుగా చెప్ప బడును. పరమాత్మ రూపుడగు వాసుదేవ రూపుడగు నా పరమాత్మకు నమస్కారము. ఈ ప్రణవరూప బ్రహ్మ అకారోకారమకార రూపావయవ భేదముచే మూడుగ నున్నది. అవయవిరూపమున అభిన్నము. తన యందు కల్పితములైన భిన్న మూర్తులచే భిన్నుడుగా గ్రహింప బడును. ఆ పరమాత్మయే శాఖా ప్రణేతయగు వ్యాసాది రూపము ధరించి వేద విభాగము చేయును. అట్లు చేయు నతడు సమస్త వేద శాఖాజ్ఞాన స్వరూపుడు అసంగుడు నగు భగవంతుడే.