విష్ణు మహా పురాణము
5 - జనక రాజ వంశ వృక్షము
ఇక్ష్వాకుని తనయుడు నిమి సహస్ర సంవత్సర సత్రయాగ మారంభించెను. అందు వశిష్ఠుని హోతగా వరించెను. అతనింగని వశిష్ఠుడు నన్నింద్రుడు తొలుత నైదువంద లేండ్లు జరుగు యాగమున వరించి నాడు. ఆ మీద వచ్చి నీకును ఋత్విక్కు నయ్యెద, నందనుక నాగుమన రాజు మారు పలకడయ్యే. వశిష్ఠుడాత డంగీకరించెననుకొని అమరపతి యాగముం జేసెను. నిమియును తత్కాలముగ గౌతమాదు లన్యులచే యాగము గావింపించెను. ఇంద్ర యాగము ముగియ వశిష్ఠుడు త్వరపడి నిమి యజ్ఞము సేయుదునని వచ్చెను. అక్కడ గౌతము డాయాగ కర్తయగుట జూచి నిద్ర పోవుచున్న యా ఱేనికి నన్ను గాదని ఈ గౌతమునికి ఈ యార్త్విజ్యమిచ్చె గావున నీతడు విదేహుడు గాగలడని శాప మిచ్చెను. అవని పతియు మేల్కొని యిట్లనియె. నన్ను బలుకరింపకయ నిద్రలో నున్న నాకు శాపమిచ్చె నీ దుష్ట గురువు గావున వానికిని దేహము పడిపోవునని ప్రతిశాప మిచ్చి తానూ దేహమును విడిచెను. ఆతడిచ్చిన శాపము వలన వశిష్ట చిత్తము మిత్రావరుణుల తేజస్సునం బ్రవేశించెను. ఊర్వశీ దర్శనము వలన బీజస్ఖలన మయిన యా మిత్రావరుల నుండి వశిష్ఠుడు మరియొక దేహముం బడసెను. ఇక నిమి యొక్క శరీరము అతిమనోహర తైల గంధాదులచే నుపసంస్కృతమై క్లేదాది దోషము లేవియు నొందక సద్యోమరణ మందినట్లుండెను. యజ్ఞ సమాప్తియై భాగములందికొన వచ్చిన దేవతలం గని ఋత్విక్కులు యజమానునికి వరమిండని కోరిరి. దేవతలు వరమిత్తుమడుగమన నిమి యనియె. భగవంతులు తమరు సంసార దుఃఖహరులు. శరీరమునకు జీవాత్మకు వియోగమయి నప్పుడు గల్గు నీ దుఃఖము వంటి దుఃఖ మింకొకటి లేదు. కావున నేను సర్వలోకుల లోచనము లందు వసింప గోరెదను గాని శరీర గ్రహణము గోరను. అన దేవత లశేష భూతముల కన్నులంద తడవ తరింప జేసిరి. అందువలన భూతములు (ప్రాణులు) ఉన్మేష నిమేషములు (రెప్ప పాటు) సేయ మొదలిడెను. పుత్ర సంతానము లేని యాఱేని శరీరమును రాజ్య మరాజకమగునని భయపడి మునులు అరణియందు మథించిరి. అందుండి కుమారుడు జనించెను. జనించుట వలన జనకుడను పేరొందెను. ఈతని తండ్రి విదేహుడగుటచే (దేహము లేని వాడగుటచే) నీతని పుత్రుడీతడు వైదేహుడనియు, మథనము వలన మిథియని గూడ పేరందెను. అతని కుదావసువు పుట్టెను. అటనుంచి వరుసగా నందివర్ధనుడు, సుకేతువు, దేవరాతుడు, బృహదుక్థుడు, మహావీర్యుడు, సుధృతి, దృష్టకేతువు, హర్యశ్వుడు, మారుడు, ప్రతీకుడు, కృతిరథుడు, దేవమీడుడు, విబుధుడు, మహాధృతి, కృతరాతుడు, మహారోముడు, స్వర్ణరోముడు, హ్రస్వరోముడు, సీరధ్వజుడును తండ్రి కొడుకులయిరి. సీరధ్వజుడు, సంతానార్థియై యజ్ఞభూమి దున్నుచుండ సీత యుదయించినది. సీరధ్వజుని తమ్ముడు సాంకాస్య పురాధిపతి కుశధ్వజుడు. సీరధ్వజుని కుమారుడు భానుమంతుడు ఆటనుంచి శుచి ఊర్జుడు శతధ్వజుడు కృతిరంజనుడు పురుజిత్తు అరిష్టనేమి శ్రుతాయువు సుపార్శ్వుడు సృంజయుడు క్షేమావి అనేసుడు భౌమరథుడు సత్యరథుడు ఉపగుపు ఉపగుప్తుడు స్వాగతుడు స్వాంగుడు స్వాపనుడు సువర్చుడు సుభాషుడు సుశ్రుతుడు జయుడు విజయుడు ఋతుడు సునయుడు వీతహవ్యుడు ధృతి బహులాశ్వుడు కృతి యునుంగా నిమి వంశ వృక్షము తండ్రి కొడుకులుగా విస్తరించినది. ఈ జనక వంశము కృతియందు నిలుపు గొన్నది. వీరందరు మైథిలులు. వీరు సాధారణముగా ఆత్మవిద్యా సంపన్నులయిన భూపాలురుగా నుందురు. రాజర్హు లన్నమాట.
