విష్ణు మహా పురాణము
5 - శుక్ల కృష్ణ యజుర్వేద శాఖా వివరణం
యజుర్వేద వృక్ష శాఖలు ప్రధాన మైనవి యిరువది యేడుగ వ్యాస శిష్యుడగు వైశంపాయనుడు రచించి శిష్యుల కివ్వగా వారు గ్రహించిరి. అందు బ్రహ్మ రాత సుతుడగు యాజ్ఞవల్క్యు డొకడు. అతడు మిక్కిలి ధర్మ మెఱింగిన వాడు. గురువృత్తి యందాసక్తి గలవాడు. నేడు మహామేరువు నుండి ఋషి సంఘముతో వచ్చు ఋషికి నేడు రాత్రులలో బ్రహ్మహత్యా దోషము వాటిల్ల గలదు. పూర్వము మునిగణము చేసిన ఈ శపథము వైశంపాయను డతిక్రమించెను. తన సోదరి పుత్రుని కాలితో తాకి చంపెను. అటుపై తన శిష్యులతో నిట్లనెను. శిష్యులారా! బ్రహ్మ హత్యా దోషమును హరించు నట్టి వ్రతమును నా నిమిత్తమై యందఱు చేయుదురు గాక! ఆలోచన వలదు. అనగా యాజ్ఞవల్క్యు డిట్లనెను. భగవంతుడా! వీరినేల క్లేశపెట్ట వలెను? అల్ప తేజస్కులగు వీరందఱు ఎందులకు? నేను చేసెదననగా గురువగు వైశంపాయనుడు కోపించి బ్రాహ్మణుల నవమానించు నీవు నావద్ద అధ్యయనము చేసిన భాగమును కక్కి వేయుము. బ్రాహ్మణ శ్రేష్టులగు వీరిని నిస్తేజస్సులుగా చెప్పు చున్నావు. అట్టి శిష్యుడు నాకేల? నా యాజ్ఞ నుల్లంఘించితి వనెను. అన యాజ్ఞవల్క్యుడు, భక్తితోనే నేను చెప్పితిని. నీ చదువు నాకక్కర లేదని పలికి రక్త సిక్తములై రూపము దాల్చిన యజస్సులను వామనము చేసి ఇచ్చి యాజ్ఞవల్క్యుడు చనేను. యాజ్ఞవల్క్య మహాముని కక్కిన యజుస్సులను ఆ శిష్యులు తిత్తిరి పక్షులుగా నయి స్వీకరించిరి. అందువలన వానికి తైత్తిరీయము లని పేరు గల్గెను. గురు ప్రేరితులై బ్రహ్మహత్యా వ్రతము నాచరించితి. అట్లాచరించి యజుర్వే దాధ్యాయన మొనరించిరి. యాజ్ఞవల్క్యుడును ప్రాణాయామ పరాయణుడై నియమమున యజుర్వేదము నపేక్షించి యిట్లు సూర్యుని స్తుతించెను.
సృష్టి కర్తవు మోక్ష ద్వారమవు అమిత తేజస్వివి ఋగ్యజుస్సామ వేద రూపుడవు. వేదత్రయాత్మక దీప్తి యుక్తుడవు అగు సూర్యా! నీకు నమస్కారము. ఆతప వర్ష హేతువగుటచే నగ్నీషోమ రూపుడవు కనుకనే కారణ రూపుడవు తేజః కారకుడవు. చంద్రునికి పుష్టిని కలిగించు తేజస్సును ధరించిన వాడవు నగు నీకు నమస్కారము. తన కిరణములచే చంద్రుని తృప్తి పఱచుచు ఆ చంద్రుని ద్వారా దేవతలను స్వధామృతముతో పితృ దేవతలను తృప్తి పఱచుచున్న తృప్తి రూపుడవగు నీకు నమస్కారము. మంచు నీరు తాపము రంగులకు కర్తయై ప్రపంచమును భరించు వాడు కనుకనే హేమంత వర్ష గ్రీష్మ రూపుడును, సృష్టి కర్తయునగు సూర్యునకు నమస్కారము. ఏ సూర్యుడు దయించనిదే నరుడు సత్కర్మాచరణ యోగ్యుడు కాదో. నీరు పవిత్రతను కలిగింప జాలదో అట్టి సూర్య దేవునకు నమస్కారము. ఎవని కిరణములు సోకినంతనే లోకము కార్యాచరణ యోగ్యమగునో అట్టి పవిత్రతకు కారణమైన శుద్దాత్ముడగు సూర్యునకు నమస్కారము. ప్రేరకుడును జనకుడును తమో వినశాకుడును అదితి సంతతి యగు దేవాదులకు నాది భూతుడు నగు భాస్కరునకు నమస్కారము. రమణీయ తేజో మయమైన ఎవ్వని రథమును నిత్యములైన ఛందో రూపాశ్వములు వహించు చున్నావో లోకమునకు నేత్రభూతు (జగచ్చాక్షువు) దిన సూర్యునకు నమస్కరింతును.
ఈ విధముగ స్తుతించిన యాజ్ఞవల్క్యునకు ఆశ్వ రూపమున వచ్చి సూర్యుడు వారము కోరుకొమ్మనెను. యాజ్ఞవల్క్యుడు సూర్యునకు నమస్కరించి యిట్లడిగెను. మా గురువగు వైశంపాయను యొద్దలేని యజుర్వేదమును నా కనుగ్రహింపు మనెను. ఇట్లడిగిన యాజ్ఞవల్క్యునకు సూర్య భగవానుడ యాతయామములు (నిలువ యున్నవి) గానివియు వైశంపాయను డేరుంగనివియు నగు యజుర్వేద భాగముల ననుగ్రహించెను. ఆ భాగములను నద్యయనము చేసిన బ్రాహ్మణులు వాజులు (అశ్వములు)గ చెప్ప బడుదురు. సూర్యుడు కూడ వాజీ (అశ్వ) రూపమును ధరించెను గదా! ఆవాజులు యొక్క శాఖలు పదునైదు గలవు. కాణ్వాదులు యాజ్ఞవల్క్యు లుగ చెప్ప బడుదురు.
