విష్ణు మహా పురాణము
3 - కాల స్వరూపము
“గుణము లేని దేశకాలాది కొలతల కందని దేహము లేని శుద్దమైన వాడు సహకారి సామగ్రి లేనివాడు పుణ్యపాప సంస్కారములు రాగాది గుణములు లేని పరబ్రహ్మ పుట్టించుట పెంచుట త్రుంచుట మొదలగు కార్యక్రమము నందు కర్తయగు యెట్లు పోసగును?”.
“మణి మంత్రౌషధ్యాదులు యొక్క శక్తులు అచింత్యమైన జ్ఞానమునకే గోచరములగును. అచింత్య జ్ఞానమనగా తర్కమునకు లొంగనిది. భిన్నాభిన్నత్వాది వికల్పములచే నూహించుటకు వశము గానిది, కేవలము అర్దాపత్తి ప్రమాణ విషయము లన్నమాట. అగ్నికి దాహశక్తి వలె పరబ్రహ్మకు గూడ సృష్ట్యాది హేతువులయిన స్వభావ సిద్దములయిన శక్తులు గల వన్నమాట. స్వభావ సిద్దము లనగా నవి యాయన స్వరూప భూతములే. కనుకనే మణి మంత్రౌషధ్యాదులచే మరి యే యితరమైన వేడిమినైన నివారింప వచ్చును గాని స్వభావమైన పరబ్రహ్మ యొక్క యీ శక్తులను వారింప శక్యము గాదు. కావుననే యాయన యీ యైశ్వర్యము నిరంకుశము. ఓ తపస్వి శ్రేష్ఠ! భగవంతుడు సృష్టి యందేట్లు ప్రవర్తిన్చునో యెఱుంగుము. నారాయణుడే బెహ్మయు లోకపితా మహుండునైతనంత తా నావిర్భవించగా భగవంతుడు (స్వయంభువు) పుట్టినాడని లోకములో జీవుల పుట్టుకతో పోల్చి చెప్పుట ఔపచారికము. అట్టివాని పరమాయువు బ్రహ్మ మానముచే నూరేండ్లు పూర్వ పదార్ధము. తరువాతి యేబదేండ్లు రెండవ పరార్ధ (ద్విపరార్ధ) కాలమని చెప్ప బడినది.
విష్ణువు యొక్క కాల స్వరూపమిది. మఱి ఆ బ్రహ్మ యొక్క యితర చరాచర జీవుల యొక్క జీవనకాల పరిమాణము నెరింగి కొనుము. (పరిణామము అను పాఠాంతరమున జీవుల యొక్క అవసాన స్థితి కూడా నెరింగి కొనుమని అన వచ్చును). దానికి యనువైన కాలమాన మిది. 15 నిమిషములు ఒక కాష్ఠ. 30 కాష్ఠలు 1 కల. 30 కలలు 1 ముహూర్తము. 30 ముహూర్తములు 1 దినము(1 పగలు + 1 రాత్రి). 30 దినములు ఒక మాసము. 15 దినములు ఒక పక్షము (శుక్ల పక్షము, కృష్ణ పక్షము). 2 పక్షములు ఒక మాసము. 6 మాసములు ఒక ఆయనము. 2 ఆయనములు (ఉత్తర, దక్షిణాయనములు) 1 సంవత్సరము. ఉత్తరాయణము 5 మాసములు దేవతలకొక పగలు పితృ దేవతలకు రాత్రి. దక్షిణాయనము 6 మాసములు దేవతల రాత్రి, పితృ దేవతలకు పగలు. దేవతలు వేయి సంవత్సరములు (దివ్య) ఒక మహా యుగము. నాలుగు వేల దివ్య సంవత్సరము లనగా,
కృత యుగము = 4 వేల దివ్య సంవత్సరములు.
త్రేతా యుగము = 3 వేల దివ్య సంవత్సరములు.
ద్వాపర యుగము = 2 వేల దివ్య సంవత్సరములు.
కలి యుగము = 1 వేయి దివ్య సంవత్సరములు.
కృత యుగము = 4వందల దివ్య సంవత్సరములు.
త్రేతా యుగము = 3 వందల దివ్య సంవత్సరములు.
ద్వాపర యుగము = 2 వందల దివ్య సంవత్సరములు.
కలి యుగము = 1 వంద దివ్య సంవత్సరములు.
కృత యుగము = 4వందల సంవత్సరములు.
త్రేతా యుగము = 3 వందల సంవత్సరములు.
ద్వాపర యుగము = 2 వందల సంవత్సరములు.
కలి యుగము = 1 వంద సంవత్సరములు.
ఈ విధముగా యుగ పరిమాణము మొత్తము 10 వేల + సంధ్య, సంధ్యంశము మొత్తము 2 వేలు 12 వేల దివ్య సంవత్సరములు ఓకే మహా యుగము. ఇట్టివి వేయి దివ్య మహాయుగములు బ్రహ్మకొక పగలు. ఆయన పగటి వేళ మనువులు పదునాలుగు ఆయా కాలములో సప్తర్షులు, దేవతలు, ఇంద్రుడు, మనువు ఆయన కుమారులునేక కాలము నందే సృజింప బడుదురు. ఉప సంహరింప బడుదురు. 71 చతుర్యుగములు (మహా యుగములు) ఒక మన్వంతరము. అది మనువు కాలము. ఇంద్రర్షి మను పుత్రుల కాలమిది. ఒక కోటి యిరువది లక్షల దివ్య సంవత్సరములు బ్రహ్మ యొక్క దివస ప్రమాణము.
అందు పదునలుగురు మనువులు గతింతురు. అనగా ఒక మంవంతరమునకు ఎనిమిది లక్షల యేబది యేడు వేల నూట నలుబది మూడు దివ్య వర్షములు ప్రమాణము. అది మనుష్య మనమున ముప్పదికోట్ల ఎనుబది యైదు లక్షల డెబ్బది యొక్క వేయి నాలుగు వందల యిరువది తొమ్మిది సంవత్సరములు. బ్రహ్మ యొక్క పగటి చివర నైమిత్తిక ప్రళయము (ప్రతి సంచరము) కల్గును. ముల్లోకములును తగలబడి పోవును. ఆ వేడి కోర్వక మహాలోక మందలి జనులు జనలోకమున కేగుదురు. అంతయు నొకే సముద్ర మగును. అపుడు బ్రహ్మ నారాయణ స్వరూపుడయి ముల్లోకములను మ్రింగి కడుపులో నిమిడించు కొని శేష తల్పమున శయనించును. భగవంతు డయిన విష్ణువు నీటిపై శేష శయ్యాయందు సృష్టికర్త యగు బ్రహ్మ యాయన నాభి కమల మందును నిద్రింతురు. అపుడు జనలోక గతులగు యోగులాయనను ధ్యానించు చుందురు. సరిగా నదే ప్రమాణమున రాత్రిని గడిపి ఆవల యాయన మరల సృష్టి కావించును. ఇట్టి దినములు, పక్షములు మాసముల లెక్కచే నొక్క సంవత్సరమై యట్టివి నూరేండ్లు బ్రహ్మకు పరమాయుర్ధాయమగును. ఇపుడా బ్రహ్మకు ‘పాద్మమహా కల్పమను’ పేరా నొక పదార్ధము గతించినది. ద్వితీయ పరార్ధ మందిపుడు వరాహ కల్పము అనుఁ బేరుగల మొదటి కల్పము నడుచు చున్నది.
