విష్ణు మహా పురాణము
19 - ప్రహ్లాద కృత విష్ణు స్తుతి
కృత్య వమ్మైనట్లు విని హిరణ్యకశిపుడు పుత్రుని పిలచి యీ ప్రభావమునకు కారణ మడిగెను.
“ప్రహ్లాదా! మంచి ప్రభావశాలి వైతివి. ఈ నీ మహిమ మంత్రాదులచే కలిగినదా? సహజమా?” ప్రహ్లాదుడు తండ్రికి నమస్కరించి ఇట్లనెను.
“మన్త్రాది కృతము గాదు నైసర్గికము గాదు హృదయము నందు అచ్యుతుని ధరించిన వానికెల్ల యీ ప్రభావము సమానమే. ఎవడు తనకువలె నితరునికి గూడ పాప ఫలము (దుఃఖము) లను చింతించడో వానికి పాప కారణము లేకుండుటచే పాపము పుట్టాడు. మనో వాక్కర్మల (త్రి కరణముల) చే నెవడితరునికి పీడను కల్గించునో అదియే బీజముగా గల జన్మ వానికి నశుభము నదికముగ కల్గించును. అట్టి పాపమును నేను కోరను చేయను. ఒకనికి చెప్పను. కేశవుని సర్వభూతము లందు నా యందును నున్నవానిగ భావించుచు ఇట్లందరి యందు శుభ చిత్తము గల నాకు శారీరక మానసిక, అధిదైవిక అధి భౌతిక దుఃఖము లెట్లు కలుగ గలవు? ఈ విధముగ శ్రీహరిని సర్వ భూతమయునిగ తెలిసికొని పండితులు సర్వభూతము లందు గాఢమైన భక్తిని పరువ వలెను.”
ఈ వచనములను విని ప్రాసాదాగ్రమున నున్న రాక్షస రాజు క్రోధముచే గ్రమ్మ బడిన ముఖము గలవాడై రాక్షస సేవకులతో నిట్లు పలికెను.
ఈ దుష్టుని శతయోజ నోన్నతమగు నీ ప్రాసాదము నుండి త్రోసి వేయుడు. రాళ్ళచే భిన్నమైన యవయవములు గలవాడై పర్వాతాగ్రమున పడుగాక!
వారలట్లే త్రోసి వేయగా హృదయమున శ్రీహరిని ధరించి పడుచున్న జగద్దారకుడగు కేశవుని భక్తుడగు నా బాలకుని జగద్దాత్రియగు భూదేవి జాగ్రత్తగ ధరించెను. చెక్కు చెదరకుండ పడిన పిల్ల వానిని చూచిన మాయావులలో శ్రేష్టుడగు శంబరునితో నిట్టనెను.
దుర్భుద్ది నీ బాలుని మేము చంప జాలము. నీవు మాయావివి గావున మాయతో వీనిని చంప మనెను.
“అట్లే చంప గలను, వేయింబది మాయలు గలవు”.
అని పలికి సర్వత్ర సమ (బ్రహ్మ) దర్శనము గల ప్రహ్లాదునిపై మాయలను ప్రయోగించెను. సమాహిత చిత్తుడై ప్రహ్లాదుడు ఆ శంబరుని యందు గూడ మాత్సర్యము లేకుండ మధుసూదనుని స్మరింపగా భగవంతుడు వాని రక్షణకై సుదర్శన చక్రమును పంపెను. ఆ చక్రము ప్రహ్లాదుని రక్షించుచు మాయల నణగ చేసెను.
రాజు వాయు దేవునితో ఈ దుర్మార్గుని శీఘ్రముగా శోశింప జేయుమని ఆజ్ఞాపింపగా ఆ వాయువు పిల్లవాని శరీరములో ప్రవేశించి బాధపెట్టగా ప్రహ్లాదుడు హృదయస్థు జనార్ధనుని ధ్యానించెను. ఆ భగవానుడు హృదయాస్థుడై ఆ వాయువు నంతను పానము చేసెను. ఇట్లన్నియు సమసిపోగా ప్రహ్లాదుడు గురు గృహమును చేరెను. గురువు ప్రతి దినము శుక్ర నీతిని బోధించెను.
పూర్తియైన పిమ్మట రాజసన్నిధికి గొంపోయి నీ బాలుడు శుక్రనీతి బాగుగ నెరింగి యున్నాడు అని చెప్పగా
ముల్లోకములలో భూపతి మిత్రుల యందు శత్రువుల యందు మధ్యస్థుల యందు నెట్లు మెలగ వలెను? మంత్రు లందు, అమాత్యు లందు, ఇతరు లందు, అంతరంగికుల యందు, చారులందు, పౌరులందు, శంకితులందు నితరుల యందు నెట్లు మెలంగ వలెను?
కృత్యాకృత్య విధానమెట్లు? దుర్గములను ఆటవికులను నెట్లు సాధించ వలెను? కంటకములను అనగా చారులను లేక క్షుద్రు శత్రువులను శోధింప వలెను. ఇంకా నిరతములైనవి నీనేర్చిన తెలుపమని రాజడుగగా
నమస్కరించి వినయముతో నిట్లు తెలిపెను.
నాకు గురువుచే సర్వము ఉపదేశింప బడినది. అందు సందేహము లేదు. కాని యిది యోగ్యమైనది కాదని నా యభిప్రాయము. సామదాన భేద దండోపాయములు మిత్రాదులను సాధించుట విషయమై చెప్ప బడినవి. అట్టి మిత్రాదులే నాకు లేరు. కోప పడకుము. సాధ్యములైన మిత్రాదులే లేనప్పుడు సాధనము లెందుకు? సర్వభూత నియామకుడును జగత్ప్రభువును జగన్మయుడును పరమాత్మయునగు గోవిందుని యందు మిత్రమిత్రుల ప్రసక్తియే లేదు. భగవంతుడగు విష్ణువు నీయందు నాయందు నితరుల యందు గలడు గావున వీడునాకు మిత్రము ఇతడు నాకు శత్రువను విభాగమే లేదు. అట్టియెడ దుష్టములైన యద్యమములకు సంబంధించిన నీతి శాస్త్రాది వచనములలో నేమి ప్రయోజనము. అవిద్యాంతర్గతము లయిన వానిచే శోభానమగు ఆత్మయందు యత్నము కర్తవ్యం. అజ్ఞానులకు అవిద్య యందు విద్యాబుద్ది కల్లుగును. బాలుడు మిణుగుఱు పురుగును అగ్నినిగా తలచును గాదా!
బంధహేతువు కాని కర్మయే కర్మ యనబడును. మోక్షమున కుపయోగించు విద్యయే విద్య. ఇతర కర్మ వృథా ప్రయాసము కొఱకే. ఇతర విద్య కేవలం శిల్ప చాతుర్యము కొఱకే కావున దీనినంతను ఆసారముగా తలంచి యుత్తమమైన సారమును వినిపించెద. నమస్కరించి చెప్పు చున్నాను. రాజ్యమును గూర్చి యెవడు యోచించడు. ధనమును ఎవడు కోరడు. అయినను అదృష్టములే సంపదలకు కారణములు గాని యత్నములు కావు. జడులు (యత్నము లేనివారు) అవివేకులు శౌర్య హీనులు నీతి లేని వారికి గూడ రాజ్యములు అదృష్ట వశమున భోగ్యములగు చున్నవి. ఆ కారణముచే గొప్ప సంపదను కోరువాడు పుణ్యముల విషయమై యత్నించ వలెను. మోక్షమును గోరువాడు భగవదాత్మక మగుటచే నన్నిటి యందు సమ బుద్దిని చేయవలెను. దేవతలు మునుష్యులు పశువులు పక్షులు వృక్షములు పాములు అన్నియు నా అనంతుని రూపమే, విష్ణువు కంటే అది వేరుగా కనబడు చున్నది. ఈ సంగతి తెలిసిన వాడు స్థావర జంగమాత్మక సర్వ ప్రపంచము అంతర్యామి యగు ఆత్మతో కూడిన దానినిగ జూడ వలెను. విష్ణుదేవుడు విశ్వ రూపుడదు గదా! ఇట్లు తెలిసిన వానియెడ అనాదియగు పరమేశ్వరుడు అచ్యుతుడు ప్రసన్నుడగును. అతడు ప్రసన్నుడు కాగా క్లేశములెల్ల నశించును.
ఈ ప్రహ్లాదుని వచనములు విని కోపముతో నాసనము నుండి లేచి హిరణ్యకశిపుడు కుమారుని వక్షమును దన్ని, మండి పడుచు జగమును నశింప జేయువాని వలె ఓ విప్రచిత్తా! ఓ రాహో! ఓ బలా! నాగ పశాములతో గట్టిగా గట్టి వీనిని సముద్రమున త్రోసి వేయుడు. ఆలసింప వలదు. లేని యెడల అన్ని లోకములు దైత్య దానవులు ఈ దుష్ట బుద్ధి యొక్క మతము ననుసరింతురు అనేక విధములు మాచే నివారింప బడినను ఈ పాపాత్ముడు శత్రు స్తోత్రములు చేయు చున్నాడు. దుష్టులను చంపుటయే మేలు! అని పలుకగా రాక్షసులు వెంటనే ప్రహ్లాదుని నాగ పాశములతో బంధించి ప్రభువు నాజ్ఞను పురస్కరించుకొని సముద్ర జలమున త్రోసిరి. చలించుచున్న ప్రహ్లాదునితో సముద్రము గూడ చలించి క్షోభించెను. అప్పుడు రాక్షసులతో హిరణ్యకశిపుడు “దైత్యులారా! ఈ సముద్రము నందే వీనిని పర్వతములచే సందు లేకుండ కప్పివేయుఫు. అగ్ని శత్రములు సర్పములు వాయువు విషము కృత్య మాయలు ఉన్నట దేశము నుండి త్రోపులు దిగ్గజములు మున్నగు వానితో వీనిని చంప శక్యము కాలేదు. వీడు బ్రతికి ప్రయోజనము లేదు. నీటి మధ్యము నందు పర్వతముతో నచ్చాధింప బడి యుండు గాక! వేయి సంవత్సరాల కైన చావ గలడు అని పలుకగా రాక్షసులట్లే చేసిరి. నీటి మధ్యమున పర్వతాక్రాంతుడై యున్న ప్రహ్లాదుడు నిత్య కృత్యాచరణ సమయమున నేకాగ్ర చిత్తముతో నచ్యుతుని నిట్లు స్తుతించెను.
