వాయు మహా పురాణము

Table of Contents

43 -  భువనవిన్యాసో

సూతుడు పలికెను:- గంధమాదన పర్వతము ప్రక్కన ఒక విశాలమైన పై సందు గలదు. అది తూర్పుపడమలకు ముప్పది రెండువేల యోజనములు గలది-1. దీని పొడవు ముప్పది నాలుగువేలు (యోజనములు). అచట నుండి శుభకర్మలు చేయువాడు కేతుమాలులని ప్రసిద్ధి జెందిరి-2. అచట మానవులందరు నల్లనివారు గొప్పతేజము బలము గలవారు. స్త్రీలు కూడ నల్లకలువ రేకుల కాంతి కలవారు. వారందరు చూడదగిన యందగత్తెలు-3.

అచట షడ్రసముల కాశ్రయమైన ఒక గొప్ప పనస చెట్టు గలదు. (అదివారు) బ్రహ్మ కుమారుడ(లగు) ఈశ్వరుడు దానిఫలరసమును ద్రాగి మనోవేగము గలిగి స్వేచ్చగా చరించువాడ(ర)యి పదికాలసంవత్సరములు జీవించును(తురు). దాని ఫలరసమును ద్రాగి (వారు) కలిసి జీవింతురు-4.

మాల్యవత్పర్వతము యొక్క ప్రక్కన గూడ తూర్పున తూర్పుగా సందు కలదు. దాని పొడవు వెడల్పులు పడమటి సందునకున్నంతటివే-5, అచట నుండి వారు భద్రాశ్వులుగా తెలియవలెను. వారునిత్యము సంతుష్టమనస్కులు. అచట భద్రమను సాల(మద్ది) వృక్షముల వనము గలదు. నల్లని మామిళ్ళు అచటి మహావృక్షములు-6, అటనుండు పురుషులు శ్వేత (తెలుపు) వర్ణము గలవారు. మహాతేజో బలసంపన్నులు. స్త్రీలు తెల్ల కలువల కాంతి కలవారు. సుందరులు చూడదగినవారు-7. చంద్రకాంతిగలిగి చంద్రవర్ణములు గలిగి చంద్రునివంటి ముఖము గలవారు చంద్రుని వలె చల్లనైన యా స్త్రీలు కలువ వాసనలు గలవారు-8. వారి యాయువు రోగములు లేక పదివేలయేండ్లు నల్లమామిడి పండ్ల రసము ద్రాగి వారెప్పుడును స్థిరమైన (ముసలితనమురాని) యౌవనము గలవారు-9.

ఋషులనిరి:- నాలుగు ద్వీపములయొక్క ప్రమాణము, వర్ణము (రంగు) ఆయువు, ఉన్నది యున్నట్లుగా (నిజముగా) జెప్పబడినది. సంగ్రహముగా కాని విస్తరముగా కాదు-10.

సూతుడనెను:- ఓ కీర్తివర్ధనలారా! ఏది పూర్వసిద్ధులచేత కీర్తింపబడి యుదాహరింప (చెప్పు) బడినదో ఆ భద్రాశ్వుల చిహ్నములను సంగ్రహముగా వినుడు. అది (భద్రాశ్వ దేశము)-11. ప్రసిద్ధమైన సమస్తదేవకూట పర్వతమునకు పరముగా తూరుపు దిక్కుగా అన్ని దిక్కులయందున్నట్లు చెప్పబడినది-12. కులాచలముల యొక్కయు, విశేషించి నదుల యొక్కయు జనపదములు (దేశముల) యొక్కయు, విశేషించి నదుల యొక్కయు, జనపదముల (దేశముల) యొక్కయు స్వరూపము చూచిన రీతిగను విన్నరీతిగను చెప్పబడినది-13. శైవాలము వర్ణమాలాగ్రము కోరంజము, శ్వేతవర్ణము, నీలము అనునీ యైదు కులపర్వతములు-14, వాని (నుండి బుట్టిన) సంతానమైన యితర పర్వతములు బహువిస్తరములై నూర్ల కొలదియు వేలకొలదియు నైన కోటి కోటుల భూమియందు గలవని తెలియవలెను-15. అవి జనావాస దేశములలో (జనపదములలో) కలసి యనేక ప్రాణులతో వ్యాకులమై అనేకవిధముల జాతులుగలవై యనేక రాజులచే పరిపాలింపబడినవి-16. పరాక్రమవంతులై శ్రీమంతులైన పురుష శ్రేష్ఠులచే నివసింపబడిన యా జనపదములు కీర్తనీయములుగా ప్రకాశించినవి-17.

సమ స్థానముల యందును విషమ స్థానములందును గిరుల మధ్యలో నివేశించిన వివిధములైన రాష్ట్రములు వాని యొక్క పేరులను వినుడు-18. అట్లే సుమంగళములు, శుద్ధములు, చంద్రకాంతములు, సునందనములు, ప్రజకములు, నీలశైలేయములు, సౌవీరములు, విజయస్థలములు-19, మహాస్థలములు, సుకామములు మహాకేశములు సుమార్థజములు, పాంతరంహములు, సోపసంగములు, పరివాయములు, పరావాచకములు-20, సంభాషకములు, మహానేత్రములు, శైవాలములు, స్తనపములు, కుముదములు, శాకముండములు, ఉరః సంకీర్ణభౌమకములు-21. శంఖాఖ్యములు, భావిసంద్రములు, ఉత్తరములు, హైమ భౌమకములు, కృష్ణ భౌమములు, సుభౌమములు, మహాభౌమములు అని యివియు, మరి యితరములు ఐన జనపదములు అనేకములు నా చేత చెప్పబడినవి-22,23. (పై పౌరులు బోగికార్థములతో ఆ జనపదముల యొక్కయు. అందు నివసించు వారియొక్కయు విశేషములను జెప్పుచున్నవి. యథాసంభవముగా గమనింపదగినవి.)

ఆ జనపద వాసులు మహాపుణ్యయై మహా గంగయైన మహానదిని (జలమును) తాగుదురు. మొదట ముల్లోకముల బ్రసిద్ధి చెందినదియు చల్లనిదియు చల్లనీటిని బ్రవహించునదియు నైనది-24. అట్లే హంసవసతి, మహాచక్ర, వక్ర కాంచీ సురస, (అను నదులు)-25, శాఖావతీ, ఇంద్ర నదీ, మేఘా, మంగారవాహినీ, కావేరీ, హరితోయా, సోమవార్తా, శతప్రదా-26, వనమాలా, వసుమతీ, పంపా, పంపావతీ, సువర్ణా, పంచవర్ణా పుణ్యా వపుష్మతీ-27, మణీ వ్రతా, సువప్రా, బ్రహ్మభాగా, శిలాశినీ కృష్ణతోయా, పుణ్యోదా, నాగపదీ, శైవాలినీ, మణితలూ, క్షారోదా, అరుణావతీ, విష్ణుపదీ, మహాపుణ్యా-29, హిరణ్యవాహీ, నీలా స్కందకూలా సురావతీ, వామోదా, పతాకా, వేతాలీ ఇవి గంగా మహానదులు నాయికలుగా పరిగణింపబడినవి. చిన్న నదులు, పుణ్యవతులుగా జెప్పబడినవి. ఈ నదులు కీర్తించుట (పలుకుట) చేతగూడ మానవుడు పవిత్రుడగునని నా తలంపు -32.

అది సమృద్ధమైన రాష్ట్రము. విశాలమైనది. అనేక జనపదములుండు దేశములచే వ్యాకులమైనది. అనేక వృక్షములు వనములును గల ఉన్నత దేశము. అనేక పర్వతములతో చక్కగా జుట్టబడినది-33. పురుష స్త్రీ గుణములచే వ్యాపించినది. నిత్యము సంతుష్టమైనది. మంగళమైనది. అనేక ధాన్యములచే ధనములచేతను గూడినది. అనేక రాజులచే పరిపాలింపబడినది 34. అట్టి దేశమున బంగారు వర్ణము గలవారును, శంఖపు చిప్పలవలే తెల్లని వర్ణము గలవారును, మహాకాయులును, మహావీర్యులునునైన పురుషులు పురుష శ్రేష్ఠులుగా జెప్పబడిరి-35. అచట ప్రజలు మహాభాగ్యవంతులై దేవతలతో గూడ సంభాషణమును దర్శనమును, సమస్థానమున గూర్చుండుట మొదలగు గౌరవములను బొందుచుండిరి-36. వారి యాయువు పదివేల యేండ్లుగా జెప్పబడినది. ఆ మహాత్ములయందు ధర్మాధర్మ భేదము లేదు. అహింస, సత్యవచనము వారిలో సహజముగనే యుండినది-37. వారు దేవుడగు శంకరునకును పరమ వైష్ణ వియగు (విష్ణు సహోదరియగు) గౌరికిని యాగపుజానమస్కారములను నిత్యమును జేయుదురు-38.

ఇది శ్రీవాయుప్రోక్తే మహాపురాణమున భువనవిన్యాసమను నలుబది మూడవ యధ్యాయము-43.