వాయు మహా పురాణము
37 - భువనవిన్యాసో
సూతుడనెను:- శీతాంత్య పర్వత శ్రేష్ఠమునకును కుముంజ పర్వతమునకును మధ్యనున్న కొండ పల్లములు పసులు మేయు కంచెలును. అనేక పక్షుల నాదములచే ధ్వనించినవి. అనేక ప్రాణులచే సేవింపబడినవీ-1. మూడు వందల యోజనముల పొడవైనవి. నూరు యోజనములు విశాలమైనవి. అచట చక్కని రసవంతమై స్వచ్చమైన త్రాగునీటిచే సుందరమైన సరోవరమున్నది-2. అది, మంచి సుగంధముగలిగి, ఓడలంతటి తెల్లకమలములచేతను లక్షదళములు గల మహాపద్మములచే నలంకరింపబడినదీ-3. పెద్ద పడగలచే సమీపింపనలవి కాని మహాసర్పములు నివసించినది, అందలి జలము దేవదానవ గంధర్వులచే స్నానాదులచే స్పృశింపబడి పవిత్రమైనది-4. అది పుణ్యమైన (శ్రీసరస్సు) అను పేరు గల సరోవరము. భూమియందును దీవియందును ప్రకాశించినది. నిర్మలజలములతో నిండినది. సర్వప్రాణులకు రక్షణనిచ్చు గృహము వంటీది -5.
అచట పద్మవన మధ్యమున నొక మహాపద్మము గలదు. అది కోటి దళములతో బాగుగా కదలాడు చుండును. ఉదయించు సూర్యుని తేజము గలది-6. నిత్యము వికసించునది. వాడి రాలిపోనిది. కదలాడుటచే పెద్ద మండలము గలది. (వలయాకారము గలది) చక్కని కింజల్కములతో నొప్పినది, మదించిన తుమ్మెదలతో ధ్వనింపబడినది-7. ఆ పద్మమున నిత్యమును సాక్షాత్తుగా భగవతియైన లక్ష్మీదేవియే యుండును. (ఈ విధముగా) ఈ పద్మము ఆకారము దాల్చిన లక్ష్మీదేవికి ఆవాసము ఇట సంశయము లేదు-8.
ఆ సరస్సు యొక్క తూర్పుతీరము సిద్ధులు నివసించినది. అచట నిత్యము పుష్ప ఫలములతో మనోహరమైన గొప్ప బిల్వవనము గలదు. అది నూరు యోజనముల వెడల్పై మూడు యోజనముల పొడవైనది. అర్ధక్రోశము ఎత్తైన శిఖరములు గలిగి వేల శాఖలతో గొప్ప బోదెలతోను కూడిన వేలకొలది మహావృక్షములతో వ్యాకులమైనది-10.1/2 బంగారము వలె పచ్చనివియు, తెల్లనివియునై -11. అమృతము వంటి రుచి గలవియు, దుందుభులంతటి లావైనవియు, సువాసన గలవియు, క్షీణించి పోవుచున్నవియు, రాలిపోవుచున్నవి యునైన మారేడు పండ్లచే నాభూమి యంతయు వెదజల్ల బడినట్లుండును-12. ఆ వనము శ్రీవనమని సర్వలోకములలో ప్రసిద్ది జెందినది. గంధర్వులు, కిన్నరులు, యక్షులు, మహానాగులు, వీరిచేత సేవితమైనది. (నివసింపబడినది.) ప్రతినిత్యము బిల్వఫలములను దీను సిద్ధులచే వ్యాపించియున్నది. అనేక భూత (ప్రాణి) సంఘములచేతను నిత్యము సేవింపబడినది-13,14. ఆవనమున నిత్యము భగవతియైన సాక్షాత్తు లక్ష్మియే యుండును. ఆమె సిద్ధసంఘములచే నమస్కరింప బడినదై సన్నిహితు రాలైయుండును-15.
వికంకమను పర్వతశ్రేష్ఠమునకును మణీశైలమునకును మధ్యన నూరు యోజనముల వెడల్పు రెండుయోజనముల పొడవుగల ఒక విశాలమైన చంపక (సంపెంగ) వనము గలదు-16. అది సిద్దులచేతను చారణులచేతను నివసింపబడినది. పుష్పలక్ష్మి (శోభ)తో చుట్టబడి యెల్లప్పుడు తేజస్సుతో మండుచున్న వానివలె నుండును-17. అర్థక్రోశమున్నతమైన శిఖరములతోను, పెద్దబోదెలతోను ఆకులు గలిగి వికసించిన కొమ్మల శిఖరములచే తమ ఎరుపు మీంచిన పసుపు (బంగారు) వర్ణము గలది యావనము-18. రెండు చేతుల వైశాల్యము గలిగి మూడు చేతుల పొడవు గలిగి, మణిశిలాచూర్ణమువలె నెఱనై తెల్లని కింజల్కములతో నొప్పి వికసించి సుగంధము గల మనోహరపుష్పములచే వ్యాపించినది. ఆవనమంతయు తుమ్మెదలనాదముచే నిండినది-19,20. ఆవనము దానవుల చేతను, దేవగంధర్వులచేతను, యక్షరాక్షసులచేతను, కిన్నరులచేతను అప్సరసలచేతను, మహానాగులచేతను, నివసింపబడినది-21.
అచట భగవంతుడైన కశ్యప ప్రజాపతి యొక్క యాశ్రమము గలదు. అది సిద్ధసాధ్యగణములతో వ్యాపించినది. అనేక వేదనాదములచే నలంకరింపబడినది. తరువాత రెండు పర్వతముల మధ్యన ఇంద్రనీలమణుల చేతను సన్నని ముంజగడ్డి చేతను ఒప్పినది-22. సిద్దులు నివసించిన మహానదియైన ‘సుఖ’ యను నదియొక్క తీరమున, ఏబది యోజనముల పొడవై ముప్పది యోజనముల వెడలైన, అర్ద క్రోశమున్నతమైన తలలుగల మనోహరమైన తాటి వనము గలదు-23. పెద్ద మూలములు (వేళ్ళు) గలిగి, మహాబలము గలిగి, స్థిరములై, దట్టమై, శుభములై, కలువలవలెను కాటుకవలెను ఉండి గుండ్రముగా నున్న పెద్ద (తాటి) పండ్లచే నిండిన వాసనయు రసమును గల తాటి చెట్లతో నొప్పినది. సిద్ధులు నివసించినది-24.
అచట మహేంద్రుని గజశ్రేష్ఠమైన మైరావతము యొక్క నివాసము కలదని చెప్పబడినది. ఆ యేనుగు భద్రము అది యచట నివసించుననియు సర్వలోకములలో ప్రసిద్ధము-25. వేణుమంతమునకును సుమేధమనుశైలమునకును ఉత్తరదిక్కున వేయియోజనముల పొడవై నూరు యోజనముల వెడల్పైన, చెట్ల గుంపులలోను, తీవల గుత్తుల తోను, అల్లిబిల్లిగవల్లుకొన్న తీగల తోను ఒప్పినది. తరువాత గరికవ్యాపించిన భూమి పచ్చిక బయలు ఏ జంతువులు లేనిదిగా గన్పడును-26,27.
నిషధ పర్వతమునకును దేవ పర్వతమునకును ఉత్తరమున వేయి యోజనముల పొడవై నూరు యోజనముల వెడల్పై ఏకశిలా మయమైన భూమి కలదు. అది వృక్షములు తీవపొదలును లేనిది. పాద మాత్రమైన నీటితో నంతట నిండియున్నది-29. అనునివి. మేరువునకు తూర్పుగా కొండ పల్లములలో నుండు కంచెలు. ఇవి యనేకాకారములు గలవి. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠులారా. పూర్వ పూర్వ క్రమముగా నున్నవి. యున్నట్లు అని చెప్పబడినవి.30.
ఇది శ్రీవాయుప్రోక్తే మహాపురాణమున భువనవిన్యాసమను ముప్పదియేడవ అధ్యాయము-37.
