వాయు మహా పురాణము
32 - యుగ ధర్మనిరూపణం
వాయువు పలికెను:- ఆ పైన ప్రణవము (ఓంకారము) యొక్క నిశ్చయ స్వరూపమును జెప్పబోవు చున్నాను. ఓంకారము అక్షర రూపమై నశింపని బ్రహ్మము. మొదటి నుండియు అది మూడు వర్ణములు గలది అని చెప్పబడినది-1. ఏ యోంకారమునకు సంబంధించినదిగా యేయే వర్ణము ఎట్లు (జన్మించునదిగా) చెప్పబడినదో అట్లే దేవతలు, ఋక్కులు యజస్సులు, సామములు ఋగ్యజుస్సామ వేదముల మూడు) వాయువు, అగ్ని, జలము (అనుమూడు భూతములు)-2. ఆయక్షరమైన ఓంకారము నుండీయే పుట్టినవి. అట్లే మరికొందరు దేవతలకును దేవతలైన పదునాలుగురు మహాత్ములు గూడ బుట్టిరి-3. వారిలో నందరిలో నున్నవాడు తక్కినియంతట నున్నవాడు సమస్త యోగములను దెలిసినను యా మహాదేవుడు లోకముల ననుగ్రహించుటకై ఆదియైన వాడనియు, మధ్యయైనవాడనియు, అస్తమైనవాడనియు జెప్పబడుచున్నాడు-4. దేవదేవుడైన మహేశ్వరాత్మకమై నశింపని యా ఓంకారాక్షరము నుండి సప్తర్షులు, పితృదేవతలతో గూడిన దేవతలును బయలువెడలిరి.
ఇహ పరలోకముల హితము కొఱకే పరమ పదమును జెప్పుదురు. యుగముల పేరులతో గుర్తింపబడిన (పేరిడబడిన) కాలమునకు పూర్వమే నాతో చెప్పబడినది-6, చక్రమువలె తిరుగుచున్నవానియందు తిరుగుచుండు కృత-త్రేత-ద్వాపర కలియుగములచే కాలము గుర్తింపబడినది.
అపుడు దేవతలు కాలమునకు వశులై భయము జేందిరి. తమతో కాలమును కొలువలేకపోయిరి-8. అపుడు మన్వంతరాదిలో వారు మౌనము వహించిరి. అపుడు కాలమునకు భయపడినవారై ఋషులు, దేవతలు, మహాతపస్వియైన యింద్రుడును-9, వేయి సంపూర్ణ సంవత్సరములు మనస్సును తీవ్రముగా సమాధిలోనుంచి మహాదేవుని శరణుబొందిరి-10. ఈ కొలుడు దేవేశుడు నాలుగు మూర్తులు (ఆకారములు) గలిగి నాలుగు ముఖములు గలవాడు. ఓ మహాదేవ! ఓ మహేశ్వర! లోతైన యీ కాలము నెవరు తెలియగలరు?
ఆ తరువాత మహాదేవుడు ఆ నాలుగు ముఖములుగల కొలుని చూచేను. భయపడవలదనెను. మీ కోరిక యేమియో తీర్చబడుగాక- అనెను–12.
అదియంతయు చే(ముదును (నెరవేర్తును) ఈ పరిశ్రమ వ్యర్థముగాదు. భగవంతుడైన (మహా) దేవుడు అనెను. కాలుడు (కాలము) జయింప నలవికానివాడు-13. ఈతని ముఖము తెల్లనిదై నాలుగు నాలుకలు గలదియై కనబడును. కృతయుగమన్నది ఇది. ఇది ఆ కాలుని యొక్క ముఖము. (ప్రారంభము) ఈతడు దేవతా శ్రేష్ఠుడైన బ్రహ్మ, యముడు ముఖము-14. ఏదైతే నాచే ఎజ్జనీకాంతిగల మూడవదిగా ఓ ద్విజులారా! మీకు జెప్పబడినదో అది మూడు నాలుకలు గలిగి (పెదవులను) నాకుచున్నట్లుగా గనబడునది త్రేతాయుగము-15. ఇచట మహేశ్వరుని వలన యజ్ఞప్రవృత్తి జరుగును. అందువలన ఇచట యజ్ఞము నిర్వహింపబడును. మూడు నాలుకలు, మూడర్నులు ఓ బ్రాహ్మణులారా! అగ్నులు వేల్వబడి కాలజిహ్వ ప్రవర్తించును-16. ఈ భయంకరమై, రెండు నాలుకలుగలిగి, యెరుపుగోరోచనమువంటి రంగుగలిగిన ముఖమునందు రెండు పాదములు గలవాడనై నేనుందును. కావున నది ద్వాప(ద)రమనుయుగము-17. ఈ నల్లనై, యెఱ్ఱని కన్నులు గలిగి, ఒక నాలుక గలిగి, విశాలమై శ్యామమై మాట మాటికి పెదవుల నాకుకొనుచున్న-18, ముఖమునుండి ఘోరమై సర్వలోక భయంకరమైన కలియుగమేర్పడినది. ఈ కలియుగకల్పమునకు ఇది నాల్గవదియై భయంకరమైన ముఖము-19, ఆయుగమున ముఖము (ప్రారంభము) గాని అంతముగాని యుండదు. ఆయుగమున ప్రజ గూడ కాలగ్రస్తయగును-20.
కృతయుగమున బ్రహ్మ పూజ్యుడు. త్రేతాయుగమున యజ్ఞము పూజ్యము, ద్వాపరయుగమున విష్ణువు పూజ్యుడు. నాలుగు యుగములలోను నేను పూజ్యుడను-21. బ్రహ్మ, విష్ణువు, యజ్ఞము ఇవి కాలము యొక్క మూడు కళలు. అన్ని కాలములయందును చతుర్మూర్తియై మహేశ్వరుడును-22. నేను జనుడను (జనించినవాడను) పుట్టించు వాడను, కాలస్వరూపుడను. కాలమును ప్రవర్తింప జేయువాడను. అట్లే యుగకర్తను. అన్నిటికంటే పరుడైన పరాత్పర స్వరూపుడను. అన్నిటికంటే నుత్కృష్ణులైన వారియందు సక్తుడను-23. .
కావున ఓ సురోత్తములారా! కలియుగమునుబొంది లోకముల హితమును కారణముగాజేసికొని, దేవతల అభయము కొఱకు దేవమానవలోకముల రెంటిని-24. భవ్యుడను (శుభమైనవాడను) పూజింపదగినవాడను గూడనగుదును. ఓ మహాతేజోవంతులారా కలియుగమునుబొంది భయపడరాదు-25. ఈ విధముగా జెప్పబడిన యాదేవతలందరును ఋషులతో గూడి తలలు వంచి నమస్కరించి యా జగత్పతియైన మహాదేవునితో నిట్లనిరి-26.
దేవర్షయ ఊచ:-
దేవతలును ఋషులును అనిరి:- మహాతేజుడు మహాకాయుడు మహావీర్యు(బలు)డు మహాకాంతి మంతుడు సర్వభూతములకు భయంకరుడు అయిన కాలుడు (సమయము) నాలుగు ముఖములు గలవాడెట్లు?
మహాదేవ ఉవాచ:-
మహాదేవుడనెను:- ఈ కాలస్వరూపుడు నాలుగాకారములు గలవాడు. నాలుగు కోరలు గలవాడు. నాలుగు ముఖములు గలవాడు. లోకసంరక్షణము కొఱకు అంతట సంచరించును-28. చరాచరమైన ప్రపంచ మందంతటను ఈతని కసాధ్యము లేదు. కాలము భూతములను సృజించును మరల క్రమముగా సంహరించును-29. అందరును కాలమునకు వశులై నడుచుకొందురు. కాలమెవ్వరి వశమున నుండదు. కావున నెల్లప్పుడు కాలము సమస్త భూతములను తమ తమ పనులలో బ్రవర్తింపజేయును-30.
ఈతని వీరోచితమైన నడకలో పూర్వము చెప్పబడిన పదములు డెబ్బదియొక్కటి. కాలము నడచుచు గడచినప్పుడు మన్వంతరక్షయమగును-32.
భగవంతుడీ విధముగా దేవర్షి పితృదానవులకు జెప్పి, వారందరిచే నమస్కరింపబడి యటచనే యంతర్థాన మందెను 33. ఈ విధముగా ఆ భగవంతుడు కాలమున దేవర్షి- పితృ-దానవులను మరల మరల సంహరించును. మరల మరల బుట్టించును-34. అందువలన మన్వంతరమున గూడ భగవంతుడైన యీశుడు కాలభయమున దేవర్షి-పితృ-దానవులచే పూజింపబడును-35.
కావున బ్రాహ్మణుడు అన్ని విధముల ప్రయత్నముతో మహాదేవునిగూర్చి తపము జేయవలె. మహాదేవుని శరణుబొందిన దానికి గొప్పపుణ్యఫలము లభించును. కావున దేవతలు స్వర్గమునకు వెళ్ళి భూతలమున దిగి-36, యా దేవతలును ఋషులును అతిభయంకరమైన కలిని బొంది ధర్మపరాయణులై మిక్కిలి తపము జేయగోరుదురు. కలినిబొంది మరల మరల అవతారములను జేయుదురు-37.
ఈ విధముగా కాలాన్తరమున వేలకొలది గతించినవారందరు వైవస్వత మన్వంతరమున దేవర్పులు రాజర్షులును అగుదురు. ఆవిధముగనే-38, పురువంశరాజైన దేవాషియు, ఇక్ష్వాకువంశమునబుట్టిన మనువును మహాయోగబలముతో గూడిన వారై కాలాన్తరమును జేరియుండిరి-39. ఆ కలియుగము క్షీణింపగా, కలియుగము కృతయుగముగా జేయబడగా, మరల సప్తర్షులతోబాటు త్రేతాయుగము తప్పక రానుండగా, క్షత్రియవంశములకుజెందినవారు (మరల) రాగలవారుగా జెప్పబడిరి-40. (కృతవ్రేతల ప్రతిష్టాంతమైన ద్వాపరాన్తమునను ఋషులతోబాటు క్షత్రియులు రాగలరు. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగమును గడచిపోగా కలియుగమున వారందరు పాతకులైన నరులుగానే యుందురని చెప్పబడినదీ-41.
ఏడు మన్వన్తరముల యొక్క సంతానమే శ్రుతికి స్మృతికిని అర్థము. ఈ విధముగా నీ యందటియందును యుగము లక్ష యక్రమములుండును అట్లే-42. పరస్పరముగా యుగములలో బ్రహ్మక్షత్రియుల పుట్టుక జరుగును. క్షయము ననుసరించి వారినుండి ప్రవర్తిల్లిన ప్రకృతి (స్త్రీలు మొదలగువారి ప్రకృతి యెట్లుండునో తెలియును-43. జమదగ్ని పుత్రుడైన పరశురామునిచే క్షత్రము (జాతి) నిశ్శేషముగా వసుధాధిపులైన (రాజులైన) క్షత్రియులచేత (వారు చంపబడుటచేత) వారిస్త్రీలందరు కులటలు (వ్యభిచారిణులు)గా జేయబడిరి. ఆ విధముగా స్వర్గమునుబొందిన (చనిపోయిన) వారిని నేను మీకు జెప్పెదను వినుడు44.
ఇక్ష్వాకు వంశమునకు ఐడుడను వానిని మూలముగా జెప్పుదురు. వరుస గట్టుట వలన భూలోకమున నితరక్షత్రియులు రాజులుగా నుండిరి-45. తరువాత ఐడుని వంశమున బుట్టినవారు ఇక్ష్వాకు రాజులు. వారి నుండి వచ్చిన వేవంద కులములు రాజ్యాభిషేకము జేయబడినవి-46. భోజులను రాజవంశములు గూడ వందరాజ్యము నందభి షేకింపబడినవి. వాని విస్తారము రెండింత లైనవి. భోజక్షత్రియ వంశము మూడు వందలైనవి. అది దిక్కులననుసరించి (వాని ప్రకారము) నాలుగు విధములైనవి 47. వారిలో గతించిన రాజులను జెప్పెద వినుడు. ప్రతి వింధ్యులకు సంబంధించినవారు వంద (గతించిరి) అట్లే హైహయులు వంద (గతించిరి)-48. ధృతరాష్ట్రునకు సంబంధించిన వారు నూట ఒక్కటీ (గతించిరి) జనమేజయులు ఎనుబది బ్రహ్మ దత్తలకు సంబంధించినవారు వంద. వీర్యవంతులైనవారికి సంబంధించిన కులములు వందయు గతించిరి-49. తరువాత పౌలులకు సంబంధించినవారు వంద, కాశీకుశాదులు (కాశీ-కుశదేశమునకు సంబంధించినవారు) వంద గతించిరి. అట్లే గతించిన శశబిందువులు వేయికి మించి యుండిరి. వారందరు లక్ష దక్షిణలతో గూడిన యశ్వమేధ యజ్ఞములు జేయు చుండిన వారే-50.
ఈ విధముగ యుగములతో బాటు గతించిన రాజర్షులు సంక్షేపముగ జెప్పబడిరి. వారిని పూర్తిగా జెప్పుట సాధ్యము గాదు-51. వీరు యయాతి వంశవర్ధనులుగా నుండిరి లోకములను ధరించిన వీరుద్యుతి మంతులుగ కీర్తింపబడిరి-52. వీరు దుర్లభములై బ్రహ్మలోకమునకు సంబంధించిన యైదువరములు పొందిరి. అవి- ఆయువు, పుత్రులు, ధనము, కీర్తి ఈశ్వర సంబంధమైన భూతి (ఐశ్వర్యము)-53. ఈ పంచవర్గమును ధరించుట వల్లను, వినుట వల్లను బుద్ధిమంతులు బ్రహ్మ లౌకికులై బ్రహ్మలోకమును బొందుదురు-54. కృతయుగము నాలుగు వేలయేండ్లు. దానికి అన్ని వందలే (నాలుగువేలే) సంధ్యలు సంధ్యాంశమును గూడనారీతియే-55. కృతయుగమున ప్రక్రియాపాదము నాలువేలనబడినది, కావున నాలుగువందలు సంధ్యలు. సంధ్యాంశము గూడ నంతియే-56. త్రేతాదియుగములు ఏడు వేలయేండ్లు. దానికి గూడ మూడువందల సంధ్యలు. సంధ్యాంశములు గూడ మూడువందలు- అనబడినవి-57. త్రేతాయుగమున అనుషంగ పాదము మూడువేల యేండ్లు, ద్వాపరమున రెండువేల యేండ్లని చెప్పబడినవి-58. దానికి గూడ రెండువందలు సంధ్యలు, సంధ్యాంశములు గూడ రెండువందలే. ద్వాపరమున ఉపోద్ఘాతమనునది మూడువపాదమనబడును-59. సంఖ్యావేత్తలగు జనులు కలిని వేయి యేండ్లుగనే చెప్పుదురు. దానికిగూడ సంధ్యలు నూరు సంధ్యాంశములు గూడ నూరే-60. కలియుగమున సంహారపాదము నాలుగవదిగా జెప్పబడినది. సంధ్యలతోను సంధ్యాంశలతోను గూడినవి నాలుగు యుగములు-61. ఇది పండ్రెండు వేలయేండ్లుగలది నాలుగు యుగముల సమూహము అని చెప్పబడినది. ఈ విధముగ పాదములతో శ్లోకముల సంఖ్య ఐదు ఐదు వేలు-62. అట్లే సంధ్యా సంధ్యాంశకముల తోనే తక్కినవి రెండు వేలు. ఈవిధముగ కవులు పురాణమును పండ్రెండు వేలదిగా జెప్పుదురు-63. వేదము నాలుగు పాదములుగలదైనట్లే యుగముగూడ నాలుగు పాదములుగలది. యుగము నాలుగు పాదములు గలదిగా బ్రహ్మ స్వయముగా నిర్మించినట్లే దేవతలకు గూడ పూర్వము బ్రహ్మచే నాలుగుపాదములు గలదిగా యుగము చెప్పబడినది-64.
ఇది శ్రీవాయుప్రోక్తే మహాపురాణమున యుగధర్మనిరూపణమను ముప్పది రెండవ అధ్యాయము.
