వాయు మహా పురాణము
5 - సృష్టి ప్రకరణము
లోమహర్షణుడిట్లు పలికెను: - ఓ విప్రులారా! నేను మరియొక కాలములో చేయబడిన సృష్టిని గురించి వివరించితిని. ఈ కాలము పరమేశ్వరునికి పగలు అని తెలుసుకొనుడు-పరమేశ్వరుని రాత్రి పగటితో సమానమైన వ్యవధిని కలిగియుండును. సృష్టికాలము పరమేశ్వరుని పగలు అనియు, ప్రలయము రాత్రి అనియు చెప్పబడును. సామాన్య జనుల క్షేమమును గోరి, పరమేశ్వరునకు పగలే గాని, రాత్రి ఉండదని, ఉపచారము (కల్పన)గా పండితులు చెప్పుదురు . ప్రజలు, ప్రజాపతులగు ఋషులు, మునులు, బ్రహ్మలోకమునందుండే సనత్కుమారుడు మొదలగు ఋషులు, ఇంద్రియములు, ఇంద్రియ గోచరములగు పదార్థములు, ఐదు మహాభూతములు, తన్మాత్రలు (సూక్ష్మభూతములు), మనస్సు, బుద్ధి అనునవి, జ్ఞాన స్వరూపుడగు పరమేశ్వరుని పగటి యందు ఉన్నవి. పగలు పూర్తి కాగానే ఆయన యందు లీనమగును. రాత్రి పూర్తి కాగానే మరల జగత్తు సృష్టింపబడును.
కార్యరూపమగు జగత్తు ఉపసంహరింపబడెను. సమస్త ప్రాణులు తమలో లీనము కాగా, ప్రధాన పురుషులు ఇద్దరు సమాన ధర్మముగలవారై ఉండేను. ప్రధానము (ప్రకృతి) యందు తమస్సత్య గుణములు సమముగా నుండెను. వాటిలో ఒకటి ఉద్రేకమును పొందినపుడు మరల సృష్టి కలుగును. గుణములు సమముగానున్న అవస్థ ప్రలయ మనియు, గుణములలో విషమ స్థితి కలిగినపుడు సృష్టి అనియు చెప్పుదురు. నువ్వు గింజలలో నూనేవలే, పాలలో నేయివలె, రజోగుణము తమస్సత్యగుణముల యందు అవ్యక్తమునాశ్రయించి ఉండును. పరమేశ్వరుడు రాత్రి భాగమునంతను గడుపగా, పగలు ప్రారంభమయ్యేను. అపుడు మరల ప్రకృతి నుండి సృష్టి బయలుదేరెను. పరమేశ్వరుడు సర్వోత్కృష్టమగు యోగము యొక్క ప్రభావము వలన, ప్రధాన పురుషుల యందు అండము నందు తీవ్రమగు కదలికను కలుగజేసెను. ఆ విధముగా క్షుణ్ణము చేయబడిన ప్రధానము నుండి రజోగుణము బయల్వెడలేను.
బీజము నుండి అంకురము వచ్చునట్లు చేయునది జలము. అటులనే, గుణవైషమ్యమును పొందిన ప్రధానము నుండి ప్రాణులు జన్మించునట్లు చేయునది రజోగుణము. ఈ విధముగా గుణములలో క్షోభను కలుగజేయగా, ముగ్గురు దేవతామూర్తులు జన్మించిరి. సర్వప్రాణులకు ఆశ్రయమైన ఆ దేవతలు సర్వ శ్రేష్ఠులు. వారి తత్యము తెలియ దుష్కరము. వారు శరీరాకారమును ధరించిరి. రజో గుణము బ్రహ్మగను, తమో గుణము అగ్నిగను, సత్య గుణము విష్ణువుగను పరిణమించెను. రజోగుణము ప్రముఖముగా గల బ్రహ్మ సృష్టికర్త అయినాడు. తమోగుణము ప్రముఖముగా గల అగ్ని కాలరూపుడైనాడు. సత్యము ప్రధానముగా గల విష్ణువు ఉదాసీనుడగ నున్నాడు. ఈ ముగ్గురు దేవతలు మూడు వేదములుగను, మూడు అగ్నులు గను ప్రకాశించుచున్నారు. వీరు పరస్పర సహకారముతో జగత్కార్యమును నిర్వహించుచున్నారు.
వీరు ఒకరిని మరియొకరు ధరించుచున్నారు. ఒకరికి మరియొకరు ఆధారముగా, ఒకరితో మరియొకరు కూడి, జగత్కార్యమునందు ప్రవర్తిల్లుచున్నారు. వీరు ఒకరినొకరు విడిచి క్షణకాలమైననూ ఉండరు. దేవతలకు కూడా దైవము పరమేశ్వరుడు. మహత్తు కంటే ఉత్కృష్టమైనవాడు విష్ణువు. రజోగుణము యొక్క ఉద్రేకము గల బ్రహ్మ సృష్టి కార్యమునందు ప్రవర్తిల్లును. పురుషుడు పరుడు (సర్వోత్కృష్టుడు) అనియు, ప్రకృతి పర (సర్వోత్కృష్టమైనది) అనియు చెప్పబడినది. ఈ ప్రకృతి మహేశ్వరునిచే అధిష్ఠితమై, సర్వదా ఆయనచే ప్రేరితమై ప్రవర్తిల్లుచున్నది. బ్రహ్మగారు మొదలగు మహాత్ములు తదను సారముగా తమ క్షేత్రములలో తమ ధర్మములను ప్రేమతో నిర్వర్తించుచున్నారు.
గుణములలో విషమ స్థితి ఏర్పడుట వలన ప్రధానము (ప్రకృతి, అవ్యక్తము) ఈశ్వరాధిష్ఠితమై జగత్సృష్టి యందు ప్రవర్తిల్లుచున్నది. ప్రధానము కారణ రూపములో అసత్ అనియు, కార్య రూపములో సత్ అనియు చెప్పబడుటచే సద సదాత్మకమగును. బ్రహ్మగారు, మహత్తు అను జంట దాని నుండి ఒక్కసారిగా పుట్టెను. పరబ్రహ్మయనబడు క్షేత్రజ్ఞుడు అవ్యక్తమును వ్యాపించి, దేహేంద్రియములతో గూడి బ్రహ్మగారి రూపములో సృష్ట్యాది యందు ప్రకటమయ్యెను. ప్రథమజీవుడగు బ్రహ్మగారు బుద్ధి శాలియై, తేజశ్ళాలియై ప్రకాశించెను.
ఆ ప్రథమ జీవుడు జగత్సృష్టి యందు ప్రవర్తిల్లెను. ఆయన సాటిలేని జ్ఞానముతో, ఈశన శక్తితో, ధర్మముతో, జ్ఞాన వైరాగ్యములతో ప్రకాశించెను. ప్రథమ శరీరాభిమాని యగు బ్రహ్మగారి బుద్ది ధర్మముతో, ఈశన శక్తితో నిండియుండెను. ఆయన మనస్సులో దేనిని సంకల్పించిననూ, అది అవ్యక్తము నుండి పుట్టుచుండెను. ఆయన స్వభావము చేతనే జితేంద్రియుడు, విశేషగుణ సంపన్నుడు, దేవతలకు అధిపతియగుట వలన ఇది సంభవమయ్యెను. పురుషుడు చతుర్ముఖ బ్రహ్మ అయేను. ఆయనయే సంహారకుడగు కాల స్వరూపుడాయెను. స్వయంభువు (స్వయముగా నుండువాడు, పుట్టుకలేనివాడు) అనంత శిరస్సులు గలవాడు (సమస్త ప్రాణిరూపుడని భావము) నగు పురుషునకు మూడు అవస్థలు గలవు. సత్యరజస్సులు ప్రముఖముగా గల బ్రహ్మ, రజస్తమస్సులు ప్రముఖముగా గల సంహారకుడు, సత్యము ప్రముఖముగా గల పురుషుడు అను మూడు గుణ ప్రయుక్తములగు అవస్థలు స్వయంభువు యగు పరమాత్మకు గలవు. ఆయన బ్రహ్మరూపుడై లోకములను సృజించును. సంహారకుడై లోకములనుపసంహరించును. అసంగుడగు పురుషుడు అనునది మూడవ అవస్థ.
బ్రహ్మగారు పద్మము లోపలి భాగము వలె నుండును. సంహారకుడగు కాలుడు కాటుక కాంతి గలవాడు. పురుషుడు పద్మము వంటి నేత్రములు గలవాడు. పరమాత్మ యొక్క రూపము ఇట్లుండెను. యోగశక్తి సంపన్నుడగు పరమేశ్వరుడు తన లీలచే వివిధ ఆకారములను ధరించి, వివిధ క్రియల నాచరించుచూ, వివిధ నామములతో వివిధ దేహములలో ప్రకటమై, మరల వాటిని, అంతర్ధానమొనర్చుచుండును. ఆయన మూడు రూపములలో, మూడు వేర్వేరు గుణములతో ప్రకటమగుటచే త్రిగుణుడనబడును. వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ద అను నాల్గు రూపములలో విభాగమును పొందుటచే చతుర్వ్యూహుడు అని కీర్తించబడును. జీవదేహమునందు చైతన్యరూపుడుగ నుండి సుషుప్తిలో స్వరూపమును పొందును. స్వప్నములో స్వయం ప్రకాశముతో విస్తరించును. జాగ్రదావస్థలో విషయసంస్కారముల ననుభవించును. జీవుని వివిధ అవస్థలలో ఏకరూపము (అహంప్రత్యయరూపము)గ నుండును. కాన, పరమేశ్వరునకు ఆత్మయను సార్థక నామము కలిగినది. ఆయన సర్వవ్యాపకుడగుటచే ఋషి అనియు, సర్వముపై అధిపతియగుటచే ప్రభువు అనియు, సర్వమును ప్రవేశించుటచే విష్ణువు అనియు కీర్తింపబడును.
సమగ్రమగు ఐశ్వర్యము, సామర్థ్యము, కీర్తి, సంపద, జ్ఞానము, వైరాగ్యము అను ఆరు గుణములకు, భగము అని పేరు. అవి కలవాడు గనుక పరమాత్మకు భగవానుడని పేరు. ఆయన రాగమును శాసించువాడు గనుక, 'రాగుడు' అనబడును. ప్రకృతి కంటే ఉత్కృష్టుడు గనుక పరడు అనియు, రక్షించువాడు గనుక 'ఓం' అనియు కీర్తింపబడును. సర్వమును యేరింగినవాడు గనుక సర్వజ్ఞుడనియు, సర్వము ఆయన నుండియే ఉద్భవించినది గనుక సర్వుడనీయు అనబడును. సర్వప్రాణులకు ఆశ్రయము గనుక నారాయణుడనబడును, ఆయన తనను తాను మూడు రూపములుగా విభాగము చేసి, ఒక రూపముతో ముల్లోకముల సృష్టిని, మరియొక రూపముతో స్థితిని, ఇంకొక రూపముతో లయమును చేయుచున్నాడు.
నాల్గు ముఖములు గల హిరణ్యగర్భుడు మున్ముందు ఆవిర్భవించెను. ఆయన సర్వమునకు ఆదియందు ఉండుటచే, ఆది దేవుడనబడును. పుట్టుకలేనివాడు గనుక, అజుడనబడును. ప్రజలనందరిని పాలించువాడు గనుక, ప్రజాపతియనబడును. ఆయన దేవతలందరిలో శ్రేష్టుడగు దేవుడు గనుక, మహాదేవుడనబడును. సర్వలోకములకు ప్రభువగుటచే ఈశ్వరుడనియు, మహాపరిమాణము కలవాడు గనుక బ్రహ్మ అనియు, సత్తా (ఉనికి) రూపుడు గనుక ‘భూతుడు' అనియు చెప్పబడును. క్షేత్రము (విరాట్ దేహము, లేక ప్రాణి దేహము) ను యెరింగినవాడు గనుక క్షేత్రజ్ఞుడనియు, సర్వవ్యాపకుడు గనుక విభుడనియు, దేహము (పురము) నందు నివసించువాడు గనుక పురుషుడనియు బ్రహ్మకు నామములు గలవు. పుట్టుక లేనివాడగుట చేతను, సర్వమునకు ఆది యందుండుట చేతను పరమేశ్వరునకు స్వయంభువు అని పేరు. యజ్ఞములలో ఆరాధింపబడును గనుక యజ్ఞుడనియు, ఇంద్రియ గోచరము కాని తత్త్యమును దర్శించువాడు గనుక కవి యనియు ఆయన కీర్తింపబడును.
బ్రహ్మ జ్ఞానముచే ప్రాజాపత్య స్థానము నతిక్రమించుట సంభవము గనుక ప్రజాపతికి క్రమణుడు అని పేరు. ఈశ్వర స్తుతి రూపములగు వేదములను బ్రహ్మ రక్షించును. ఆయనకు ఆదిత్యుడు, కపిలుడు, అగ్ని, అగ్రజుడు అను నామములు గలవు. బ్రహ్మగారి గర్భమునందు హిరణ్యము (తేజస్సు) ఉండుట వలన, లేదా, ఆయన హిరణ్యము యొక్క గర్భము నుండి జన్మించుట వలన, హిరణ్య గర్భుడు ఆయెనని ఈ పురాణము నిర్వచించుచున్నది. గడచిపోయిన ప్రజాపతుల కాలమును వందల సంవత్సరములలోనైననూ లెక్కించుట సంభవము కాదు. గడచిపోయిన కల్పముల సంఖ్యను బట్టి బ్రహ్మగారి ఆయుర్దాయము (పరము)లో సగభాగము గడచినది. మరియొక సగము ఆయుష్సు మిగిలినది. ఆ తరువాత ప్రలయము సంభవించును. పరములో అంతర్భాగములుగా నుండు కల్పములు కోట్లాది గడచిపోయినవి. ఇంకను అనేక కల్పములు వచ్చుచునే యుండును.
ఓ ద్విజులారా! ప్రస్తుతములో వారాహ కల్పము గడచుచున్నది అని తెలియుడు. ఇది కల్పములలో మొదటిది. దీని యందు గడచిన, నడుచుచున్న, మరియు రాబోవు మనువులు పదునాలు మంది గలరు. వీరిలో స్వాయంభువ మనువు ఒకడు. ఆ చక్రవర్తులచే ఏడు ద్వీపములతో కూడిన, ఈ భూమి అంతా వేయి యుగముల కాలము పూర్తిగా పాలింపబడును. వారి ప్రజాపాలనమును వారి తపస్సును విస్తరముగా వివరించెదను. వినుడు. ఒక మన్వంతరమును గురించి తెలుసుకున్నచో, రాబోవు మన్వంతరములన్నియూ తెలిసినట్లే యగును. గడచిన కల్పములను, వంశములను వర్ణించెదను. వాటిని తెలుసుకొని, రాబోవు వాటి గురించి తదనురూపముగా ఊహించుకొనవలెను.
శ్రీవాయు మహాపురాణములో సృష్టి ప్రకరణము అను ఐదవ అధ్యాయము ముగిసెను.
