వాయు మహా పురాణము
12 - యోగోపసర్గం నిరూపణం
సూతుడు పలికెను:- ఆపైన (యోగముచే) తత్యమును దర్శించిన దేహికి (ఉత్పాతము రోగము) విఘ్నములు గలుగు విధమును, దోషములు బుట్టు విధమును జెప్పబోవుచున్నాను-1. యోగమును దెలిసి యోగరోగియైన వాడు (యోగమును సరిగాననుసరించనందున గలిగిన రోగములు గలవాడు) ఉపస్పష్టుడు వాడు మనుష్య సంబంధములై వివిధములైన కోరికలను, ఋతువును, స్త్రీలను, విద్యాదాన ఫలమును కోరును-2. యోగరోగి అగ్ని హోత్రమును, హవిస్సును, యజ్ఞమును అట్లే వీని యజ్ఞశాలను, మాయా కర్మను, ధనమును, స్వర్గమును కోరును-3. వీడు కర్మలతో దగులుకొన్నవాడు. అవిద్యకు (అజ్ఞానమునకు) వశమైనవాడు. వానిని ఉపస్పష్టుని (విప్నువంతుని) వానిని (యోగరోగిగా) తెలిసికొని వదిలివేయవలెను. నిత్యము బ్రహ్మపరుడైన యోగి ఉపసర్గము (యోగ విఘ్నము యోగరోగము నుండి విముక్తుడగును- 4. యోగ రోగములను విఘ్నములను జయించిన వాడును శ్వాసను జయించినవాడును ఐన దేహికి గూడ సాత్త్యికములు రాజసములు తామసములు నైన రోగములు కలుగుచుండును .
వినుటలో ప్రతిభ, దేవతల దర్శనము, భ్రమావర్తము (భ్రమలేకుండుట) అనునవి సిద్ది లక్షణముగా గుర్తింపబడినవి-6. విద్య, కావ్యము, శిల్పము, సమస్తమును వాక్కుచే వరింపబడును. (అతని వాక్కులోనివి యన్నియును గనబడును). విద్యా ప్రయోజనములు గూడ నొతనికి సంప్రాప్తించును. ఇది యాతని ప్రభావమునకు లక్షణము (గురు)-7. నూరు యోజనముల దూరము నుండియైనను వినదగిన శబ్దములను వినును. సర్వజ్ఞుడును, విధిజ్ఞుడు (బ్రహ్మజ్ఞుడు)ను నైన యోగి పిచ్చివానివలే యుండును.
మహాయోగియైన వాడు యక్షులను, రాక్షసులను గన్ధర్వులను దివ్యులను మనుషులను (దేవతలను మనుష్యులను) తెలియును. ఇది యాతని యుపసర్గమునకు (రోగమునకు ఉత్పాతమునకు) గుర్తు-9. దేవతలను, దానవులను, గన్ధర్వులను, ఋషులను పితృదేవతలను చూచును. అన్ని విధములుగా నాతనిని ఉన్మత్తునిగా జెప్పవలె-10. అన్తరాత్మతో ప్రేరేపింపబడుచున్నవాడై భ్రమతో తిరుగుచుండును. భ్రమతో భ్రాంతిజెందిన బుద్దిగలవాని యొక్క సమస్త జ్ఞానము నశించును-11. అన్తరాత్మతో ప్రేరేపింపబడిన వానికి జనశ్రుతిగాని జీవనోపాయముగాని చిత్తమును నశింపజేయును. జీవనోపాయచింతనముచే నిండిన బుద్దిగలవానికి సమస్త జ్ఞానము నశించును.
మనస్సుతో తెల్లని వస్త్రమునుగాని గొంగళిని గాని చుట్టుగా గప్పుకొని తరువాత వెంటనే పరమమైన బ్రహ్మను అనుధ్యానింపవలెను-13. ఆ కారణములన ఆత్మ సిద్ధిని గోరువాడు తన యొక్క (ఆత్మ యొక్క) దోషములను, సంభవించిన ఉపసర్గములను యోగవిఘ్న దోష (రోగములను) మేధావియై వదిలివేయవలెను-14. ఋషులు, దేవతలు, గంధర్వులు, యక్షులు, ఉరగులు మహాసురులును ఉపసర్గలలో రగులుకొని మరల మరల తిరుగుచుందురు. కావున యోగి యెల్లప్పుడు యోగయుక్తుడై అల్పాహారియై, ఇంద్రియములను జయించినవాడై సుప్తుడై శిరమున సూక్ష్మములలో యోగధారణను నిలుపవలేను.
ఆ తరువాత, యోగయుక్తుడు, జతనిద్రుడునైన యోగికి చివర మరల ప్రాణములను పేరుగల ఉపసర్గలు కలుగును-17. మొదట యోగముతో సమస్త పృథివిని ధారణ చేయవలె, ఆ తరువాత జలమును, ఆ తరువాత అగ్నిని, (వాయురూపమైన ప్రాణముతో చిత్తమునొకచో నిలుపుట యోగధారణ గావున వాయుభూతము ప్రత్యేకముగ జెప్పబడలేదు) ఆ తరువాత ఆకాశమును, ఆ తరువాత నందం యొక్క మనస్సును-18, తరువాత దానికి పరమైన మనస్సుతోగూడిన బుద్దిని యతి (యమముగలవాడు) యైన వాడు అతి ప్రయత్నముతో యోగధారణ చేయవలెను. సిద్దుల యొక్క చిహ్నములను చూచి చూచి వదిలివేయవలేను.
పృథివిని యోగ ధారణ జేయువానికి పృథివీ మహా భూతము సూక్ష్మమై ప్రవర్తించును. జల (భూత)ములను యోగధారణ జేయువానికి జలమహాభూతము సూక్ష్మమగును. చల్లని రసము (జలము) లన్నియు సూక్ష్మములై అమృతముతో సమానమగును-20. తేజో భూతమును యోగధారణ జేయువానికి తేజో మహాభూతము సూక్ష్మమగును. తనను తేజస్సుగా భావించి తన్ను తేజముగానే చూచును-21. ఓ ప్రభూ తనను వాయువునుగా భావించి తన్ను వాయువుగల మండలముగా జూచును. ఆకాశమును యోగధారణ జేయువానికి ఆకాశ మహాభూతము సూక్ష్మమగు-22. తనను వాయువులు గల మండలమైన మహాభూతవాయువునుగా భావించి వాయుమహాభూతము సూక్ష్మముగానగును. తనను సూక్ష్మ వాయు మండలముగా జూచును. అచటి నుండి దానియొక్క ఘోష (శబ్దము) గూడ బయలుదేరును-23. అట్లే మనస్సును యోగధారణ జేయువానికి మనస్సు సూక్ష్మమై ప్రవర్తిల్లును. అపుడు వాడు మనస్సుతో సర్వభూతముల (ప్రాణుల) మనస్సును ప్రవేశించును. బుద్ధిచేత బుద్ధిని యోగధారణ జేసినప్పుడు చక్కగా (అంతయు) తెలిసికొని మేలుకొను-24. యోగజ్ఞుడైనవాడు ఈ యేడు సూక్ష్మములను దెలిసికొని మేధావియై పరిత్యజించి తన బుద్ధిచే పరమాత్మను బొందును.
యోగ ఐశ్వర్య లక్షణమైన మాయా భూతమునందు యోగధారణ యుక్తుడై యచటనే విడువరాని సంగమును బొంది, దాని చేతనే పూర్తిగా నశించును-26. కావున యోగియైన బ్రాహ్మణుడు సూక్ష్మములను పరస్పర సంసక్తములుగా దెలిసికొని బుద్ధిచేత పరిత్యజించి పరమును బొందును-27. దివ్య చక్షువులై ఋషులైన మహాత్ములు గూడ సూక్ష్మభావములందు సంసంక్తులై కనబడుదురు. అవి దోషములుగా వారియందు గుర్తించబడి నను-28. కావున నెపుడైనను నీట (యోగవిషయమున) సూక్ష్మములందు నిశ్చయమును (ధారణను) జేయరాదు. ఐశ్వర్యము వలన రాగము గలుగును. విరాగము బ్రహ్మయనబడును-29. ఏడు సూక్ష్మములను షడంగునిగా మహేశ్వరుని ప్రధానమును తెలిసికొని వినియోగమును దెలిసినవాడు పరబ్రహ్మను బొందును.
సర్వజ్ఞత్వము, తృప్తి, అనాదిబోధము, స్వతంత్రత, ఎల్లప్పుడు లోపించు శక్తి, అనన్తశక్తి. ఈ యారింటిని విధిజ్ఞులు విభువైన మహేశ్వరునియొక్క యంగములందురు-31. నిత్యము బ్రహ్మయేధనముగా గల యోగి ఉపసర్గల నుండి విముక్తుడగును. శ్వాసను, ఉపసర్గలను, రాగములను జయించిన యోగికి ఈ బహిఃశరీరమున యోగధారణ జేయుట ఒక్కటే సర్వకామికి (అన్ని కోరికలకు సంబంధించినది) యగును-32. యోగయుక్తుడైన బ్రాహ్మణుడు ఆయా చోటులలో ప్రవేశించి మనస్సు వర్ణించిన యోగయుక్తుడైన బ్రాహ్మణుడు పంచభూతములనైన నావేశింపగలడు. ముల్లోకములను గూడ కంపింపజేయగలడు-33. ఈ యోగశక్తిచేత ఈ లోకమున దేహమును వదిలి పెట్టి మరల దేహమును ప్రవేశించగలడు. యోగులకు సూర్యుణ్ణి మనోద్వారముగా జెప్పవలెను-34. ఆదానాది క్రియలకు గూడ సూర్యుడు మనోద్వారమని చెప్పబడును. ఈ విధానముచే సూక్ష్మవర్జితుడైనయోగి ప్రకృతిని దాటి రుద్రలోకమున గొప్పవాడై పూజింపబడును.
అట ఐశ్వర్య గుణమును బొందిన వాడును బ్రహ్మభూతుడును ఐన ప్రభువునుగా జూడవచ్చును. అతడు సమస్త దేవస్థానము లందును తక్కిన యంతటను ఉండక మరలిపోవును(?)-36. పైశాచిక స్థానమచేత తస్థాన ప్రయోగధారణచే, పిశాచములను, రాక్షసస్థానముచే రాక్షసులను, గన్ధర్వుల స్థానముచే గన్ధర్వులను, కుబేర స్థానముచే కుబేరజులను-37, ఇవ్ర స్థానముచే ఇమ్రుని, సోముని స్థానముచే సౌమ్యుని (చంద్ర సంబద్ధుని), ప్రజాపతి స్థానముచే ప్రజాపతిని, సాధింపవలెను 38. బ్రహ్మస్థానముచే తత్ స్థాన (యోగధారణచే) బ్రహ్మజ్ఞాన రూపియైన ప్రభువును దగ్గరగా బిలుచును. ఆ బ్రహ్మయందు సక్తుడైనవాడు ఉన్మత్తుడు. అతని నుండి సర్వము ప్రవర్తించును-39. నిత్యము (ఎల్లప్పుడు) బ్రహ్మరూపుడైన యోగి యీ స్థానములను వదిలివేయవలెను. స్థానములందు (యోగధారణ స్థానములందు) అంటి పెట్టుకొని యుండని బ్రాహ్మణుడు సర్వగతుడగును.
ఇది వాయుపురాణము నందు యోగోపసర్గ నిరూపణమను పండ్రెండవ యధ్యాయము.
