విద్యావిద్యా - క్షరాక్షర - బుద్ధత్వా ప్రతిబుద్ధత్వ ప్రతిపాదనము
ఓ నృపసత్తమా! ఇంత వరకును నీకు సాంఖ్య దర్శనమును తెలిపితిని. ఇక మీద విద్యావిద్యల తత్త్వమును క్రమా నుసారము తేలిపెదను. ఎఱుగుము. సృష్టి ప్రళయములు జనన మరణములు ధర్మములుగా నుండి సంసార చక్రము నందు సంసరించు వాడు అవ్యక్త తత్త్వమును వివేచించి తెలిసికొన జాలడు. ఒకదాని కంటె మఱి యొకటి ఉత్తరోత్తరము విద్యా రూపము అయినది. పైదాని కంటె ముందఱిది అవిద్యా రూప మయినది. విద్య అవిద్య అనుభేదము రెండు స్థూల స్థూలతర సూక్ష్మాసూక్ష్మతర తత్త్వముల నడుమ నుండెడి యోగ్యతా భేదముచే చేయు నిర్ణయము. ఇది సాంఖ్య తత్త్వవేత్తలు వివేచించి ప్రతిపాదించిన విషయము. ఎట్లనిన, వరుసగా 1.కర్మేంద్రియములు 2. జ్ఞానేంద్రియములు 3. పంచ తన్మాత్రలు లేదా విషయములు 4. మనస్సు (5. పంచభూతములు) 6. అహంకారము 7. బుద్ధి 8. అవ్యక్తము ఇవి వరుసగా ఒక దానికంటె మఱి యొకటి విద్యా రూప మయినవి. అనగా ఉత్తరోత్తరము సూక్ష్మతర మయినవి. అన్నిటి కంటె విద్యా రూపమయి నది పంచ వింశలి తమమగు పరమాత్మ తత్త్వము.
ఇక క్షరాక్షర తత్త్వమును తెలిపెదను, వివేచించగా వ్యక్తము అవ్యక్తము అను రెండును క్షరములే. అవి రెండును అక్షరములే. ఇది కొంత సంశయ జనకము గాను విచిత్రము గాను కనబడి నను రెండును క్షరమును అక్షరమును అగు ననుటకు హేతువు ఏమో సాంఖ్య దర్శన వివేచ నానుసారము ప్రతిపాదింతును. వాస్తవ స్థితిలో రెండును ఆదియు నాశమును లేనివే. రెండును సర్వశక్తి మంతము లగు ఈశ్వర తత్త్వములే. రెండును పరమార్థ తత్త్వములే. ఎట్లన పంచ వింశకత్త్వము అనబడు పరమార్థ తత్త్వము సృష్టి, ప్రళయ, జనన మరణ, రూప సంసార ప్రవృత్తికై మొదట అవ్యక్తమై క్రమముగా మహదాదిగా భూత భౌతిక సృష్టి వరకు తన్ను తానే మాయా వశమున పరిణమింప జేసికొని ఇట్టి తనలో సృష్టి కాలమున తాను ప్రవేశించుచు ప్రళయ కాలమున ఈ వ్యక్త సంసార రూప మగు తన్నే తనలో లయము చేసికొనుచు ఉన్నది. వరమార్థమున ఇవి యన్నియు అఖండ ఏకైక తత్త్వమే కదా! ఒకే ప్రకృతియే కదా! కనుక వ్యవహారమున మాత్రమే అపరాప్రకృతి, పరాప్రకృతి. క్షరము, అక్షరము అను భేదము. వస్తవ స్థితిలో రెండును క్షరములే, రెండును అక్షరములే. అనగా అక్షర తత్త్వము తన్ను తాను క్షర రూపమున పరిణమింప జేసికొని తన రూపాంతరమే అగు జడ దేహమున తాను ప్రవేశించి ఉపాధిచే తానును క్షరుని వంటి వాడై అహ మను అభిమానముతో కర్తయై భోక్తయై సుఖియై దుఃఖియై వీటికి భయపడి విరక్తుడై ముముక్షువై జ్ఞాతయగు చున్నాడు. అప్పుడు ఈ భ్రాంతి కల్పిత క్షర తత్త్వమును దృష్టిలో ఉంచు కొనగా అక్షర తత్త్వము జ్ఞేయ మగును. ఈ జ్ఞాతయగు క్షర సదృశ తత్త్వము ముక్తు డయినపుడు ఈతడు జ్ఞాతయు కాక జ్ఞేయమును కాక త్రిపుటి లోని జ్ఞాధాత్వర్థ రూపమైన జ్ఞానమును కాక వీట న్నిటికిని అతీతమగు చిద్రూపి జ్ఞాన తత్త్వమగు చున్నాడు. కనుక ఈ వివేచనము ననుసరించి ఏది యవ్యక్తము? ఏది వ్యక్తము? ఏది క్షరము? ఏది అక్షరము? అంతయు క్షరమే. అంతయు అక్షరమే. అంతయు వ్యక్తమే. అంతయు అవ్యక్తమే. అక్షరుడే మాయా వశమున క్షరుడై సగుణుడై నపుడు క్రమముగా సంసార విషయములపై నిర్వేదము చెంది విరక్తుడై సాంఖ్య వివేచనముచే తాను నిర్గుణుడ ననియు తాను పరాప్రకృతియే యనియు ఎరుగును. అపుడు అపరా ప్రకృతి స్థితిని విడిచి శుద్ధు డగును. అప్పుడు ఇతనికి ఏ దుఃఖములును ఉండవు. కేవలము సుఖ, ఆనంద, శుద్ధ స్వరూపుడగు చున్నాడు. సుఖ దుఃఖ మిశ్ర స్వరూపము తొలగు చున్నది. సంసారమున సంసరించ వలసిన బంధము దూరమగు చున్నది.
ఇట్లు క్షర స్థితి నుండి అక్షర స్థితికి, మిశ్రస్థితి నుండి శుద్ధతా స్థితికి పోవుట లోని క్రమమునే అప్రతి బుద్ధత్వ దశనుండి ప్రతి బుద్ధత్వ దశకు పోవుట అందురు. అది ఎట్లనిన, సుఖ దుఃఖ సంమిశ్ర మగు ఈ సంసారము నందు గల దోషములను గుర్తించి విరక్తుడైన జీవుడు ఇట్లను కొనును, నేను ఇంత కాలమును ఏమి చేసితిని? నీటిలో నున్న చేప ఆ నీరు వేరు నేను వేరు అని తెలియక ఆ నీరుతన కొరకే యున్నట్లు భావించి కొని ఆ నీటిని విడువ లేక ఆ మహాజల రాశిలోనే ఒకచోటి నుండి మరియొక చోటికి సంచరించుచు దాని నుండి బయటకు వచ్చినచో తన గతి ఏమగునో యని భయపడు నట్లే నేనును నన్నీ దృశ్య ప్రపంచము కంటె అతీత మగు, భిన్న మగు తత్త్వమునుగా ఎఱుగక ఇంత కాలము సుఖ దుఃఖ సంమిశ్రమును జనన మరణ పరంపరా బహుళమును నగు ఈ సంసార ప్రవాహములో కొట్టుకొని పోవు చుంటిని. ఇక్కడ నున్న వారందరును నా వలెనే యున్నారు. కాని ఈ అవ్యక్త, జ్ఞేయ, అక్షర తత్త్వము విమల మైనది. నేనును పూర్వము ఇట్టి స్థిలోనే యుంటిని. ఇంత వరకు అజ్ఞానముచే కలిగిన సంమోహముచే ప్రవృత్తుడనై అజ్ఞుడనుగా ఉంటిని. దీనికి అంతటికిని సంసర్గము అతి సంసర్గము కారణము. దీనికి వశీభూతుడ నై ఇంత కాలమును ఉత్తమ మధ్యమాధమ స్థితులను వాని వ్యత్యాసమును కూడ గుర్తించ లేకపోతిని. ఇంక మీదట కూడ నేను ఈ స్థితిలోనే ఇట్లుండ జాలను. ఆ స్థిర స్థితికి పోవలెను. ఇంత కాలమును ఈ అపరాప్రకృతి తో సహవాసముచే వంచితుడనై ఇట్లుంటిని. ఇక వంచితుడను కాజాలను. నేను వస్తుతః నిర్వికారుడను. వికారములను పొందితిని. ఇది ఈ అపరాప్రకృతి యొక్క అపరాధము కాదు. నా యపరాధమే. తాత్త్విక స్థితికి పరాఙ్ముడనై ఈ మాయా కల్పిత సుఖముల యందు ఆసక్తుడ నైతిని. వాస్తవమున రూపము లేని నేను బహు రూడుడనై మమకారా హంకారాభి మానములకు వశుడనై యుంటివి. నిర్మముడ నగు నేను మమకార వశుడనై ఆయా జన్మల యందు వికృత రూపుడనై తెలివిని కోల్పోయి అహంకారముతో సమత్వమును పొంది దానిని వదలుకొన లేకుంటిని. ఈ అపరాప్రకృతి తన్ను బహు రూపములతో పరిణమింప జేసికొని ఇంకను నన్ను తనలో మునిగి యుండు నట్లు ఆజ్ఞాపించు చున్నది. నేనామె యాజ్ఞను పాటించను. ఇప్పటికి నా తప్పు తెలిసినది. నేను అహంమమకార రహితుడను. మమకారము కూడ అహంకార జనితము. ఈ రెంటిని విడిచి నిరామయతా స్థితిని పొందుదును. కాని ప్రతిబోధ రహిత మగు ఈ అపరా ప్రకృతిని ఆశ్రయించి యున్నంత వరకు నేను ఈ పరమార్ధ తత్త్వముతో సామ్యమును పొంది ముక్తుడను కాజాలను. కనుక నేను అందులకై మొదట ఈ అహంతత్త్వముతో సామ్య సహవాస ములను విడిచెదను. ఈమెతో కూడి యున్నంత వరకు నాకు క్షేమము కలుగదు. అని యిట్లు ప్రతి బుద్ధుడై క్షరత్వ వ్యక్తత్వ సగుణత్వ, స్థితులను వదలి అక్షరత్వ, అవ్యక్తత్వ, నిర్గుణత్వ, స్థితికి చేరును. ఓజనక మహారాజా! నీకు ఇట్లు క్షరాక్షర తత్త్వ వివేచన ప్రకారమును ప్రతిపాదించితిని. ఇది సంశయ రహితము. విమలము, విశుద్ధము, సూక్ష్మము. పరంపరా గతమగు సంప్రదాయ సిద్ధమైన మఱియొక అంశము చెప్పెదను. వినుము సాంఖ్యము యోగము అను రెండు దర్శనములను నీకు తెలిపితిని కదా. వానిలో సాంఖ్యమే యోగము. యోగమే సాంఖ్యము. సాంఖ్య దర్శనము శిష్యుల, ముముక్షువుల హితమును కోరి తత్త్వమును విస్పష్టముగా వివేచించి ప్రతిపాదించును. విద్వాంసులగు వారు ఈ శాస్త్రము చాల గొప్పది యని చెప్పుదురు. ఈ శాస్త్రములో ప్రతిపాదించిన విషయమునే యోగ దర్శన మున పునర్భవ పురఃసరముగా అనగా అనుభవ పూర్వకముగా అందుకొను విధానము అధ్యయనము చేయ బడుచున్నది. ఇంత వరకును సాంఖ్యుల పరమార్థ తత్త్వ వివేచన ప్రకారము శాస్త్ర ప్రమాణా నుసారము అనువర్ణించితిని. బుద్ధము, ఆప్రతి బుద్ధము. అక్షరము, క్షరము ఈ రెండును వీటికి రెంటికి నడుమ నున్న బుధ్య మానము అను మూడు తత్త్వములును సాంఖ్య దర్శనమున వేచించ బడును. బుద్దము, అనగా బోధాత్మక మగు పరమార్థ తత్త్వము. అప్రతి బుద్ధ మనగా అపరా ప్రకృతికి మూలమగు మాయా తత్త్వము. బుధ్యమాన మనగా ముముక్షుని శ్రవణ మననాది విచారణావ స్థయును ఆత్మ దర్శనమును కోరి యోగ సాధనచేయు దశయును. యోగ దర్శనము నందు బుధ్య మానత్వ బుద్ధత్వ దశలు మాత్రము అనుభవ దశలో ప్రతిపాదింప బడును.
Summary of chapter 137 of the Brahma Purāṇa is as follows:
The Vasiṣṭha-Janaka dialogue reaches its culmination. Vasiṣṭha delivers his final definitive teaching: the supreme reality is neither merely the Sāṃkhya Puruṣa nor merely the Yoga's concentrated mind, but the ineffable, self-luminous Brahman that pervades and transcends all categories. Janaka, enlightened by this teaching, offers his gratitude and is confirmed in his understanding. The dialogue is declared the essence of all liberation-teaching preserved in the Purāṇa.