బ్రహ్మ మహా పురాణము
237 - జ్ఞానినాం మోక్షప్రాప్తి నిరూపణమ్
వేద విధి ననుసరించి కర్మల నాచరించ వలెననియు కర్మలను విడువ వలెననియు మీరు చెప్పు చున్నారు. ఇది పరస్పరము విరుద్ధముగా నున్నది. కావున కర్మల నాచరించినచో ఏ గతి కలుగునో వానిని విడిచి విద్యను, జ్ఞానమును ఆశ్రయించినచో ఏ గతి కలుగునో విన కుతూహల మగుచున్నది. తెలుపుడు. అని మునులు వ్యాసుల నడిగిరి.
ముని శ్రేష్ఠలారా! మీరడిగినది చెప్పెదను. కర్మమయ మగు క్షర తత్త్వమును విద్యామయ మగు అక్షర తత్త్వమును కర్మానుష్ఠానము వలన విద్యా లాభము వలన కలుగు గతులను కూడ వివరింతును. వినుడు. ఈ ప్రశ్నలకు సమాధానము చాల గహన గంభీర మైనది. ధర్మ మున్నది అనుచునే అదే ధర్మము లేదని చెప్పుట పరస్పర విరుద్ధము. వేదానుసారి యగు ప్రవృత్తి మార్గము విద్యాను సారియగు నివృత్తి మార్గము అని రెండు మార్గములు కలవు. కర్మము బంధ హేతువు. విద్య ముక్తి హేతువు. అందుచే తత్త్వము నెఱిగిన మునులు కర్మల నాచరింపరు. కర్మల నాచరించుటచే షోడశ తత్త్వ రూపుడగు పురుషుడు మరణించి మరల పుట్టును. విద్యచే అక్షర రూపుడై ముక్తి నందును. (షోడశ కలలు అనగా ముఖ్య ప్రాణము, శ్రద్ధ, పంచ భూతములు ఇంద్రియములు, మనస్సు, అన్నము, వీర్యము, తపస్సు, వేద మంత్రములు, కర్మములు, లోకములు, నామము ఇవి పదునారు ప్రశ్నోపనిషత్ = 6 ప్రశ్న , 4 మంత్రము) అపరా విద్యను ఆశ్రయించిన వారు కర్మలను మెచ్చుచు జన్మ మరణ పరంపరలో చిక్కి దేహముల తోనే ఆనందించు చుందురు. పరా విద్యను ఆశ్రయించిన వారు ధర్మ తత్త్వము నెఱిగిన వారు కావున నది నీరు త్రావువారు బావి నీటిని మెచ్చ నట్లు కర్మ మార్గమును మెచ్చరు. కర్మా నుష్ఠానము వలన సుఖ దుఃఖములను జన్మ మరణములను పొందుదురు. విద్యచేత దుఃఖ శోకములు కాని జన్మ మరణములు కాని హాని వృద్ధులు కాలేని స్థానమును పొందుదురు. అవ్యక్తము అచలము ధ్రువము అవ్యాకృతము అనామయము అమృతము యోగముచే ప్రాప్యము అగు పరబ్రహ్మ స్థానమును పొందుదురు. అట్టివారు సుఖ దుఃఖముల వంటి ద్వంద్వముల చేతను సంకల్ప కృతము లగు కర్మల చేతను బాధింప బడక అన్ని ప్రాణుల యందు మైత్ర భావము హితబుద్ధి కలిగి యుందురు. పురుషుడును (జీవుడు) కర్మ మయుడు విద్యా మయుడు అని రెండు విధములు. వీరిలో కర్మమయ పురుషుడు చంద్రుని వలె సుకుమార స్పర్శ కలిగి చంద్ర కల వంటి సూక్ష్మ కలా రూపమున నుండును. అని ఋగ్వేద పురుషుడు చెప్పెను. దానిని విస్తరించి అనుగానము చేయుదును. వస్త్రములో దారపు ఏసె వలె సూక్ష్మ మగు ఆ తత్త్వము సులభముగా మాటలతో చెప్పుటకు గాని ఇంద్రియములతో చూచుటకు గాని శక్యము కాదు. పంచ తన్మాత్రలు గుణ త్రయము మనో బుద్ధ్య హంకారములు అంతఃకరణ త్రయము అనెడి ఏకాదశ తత్త్వ వికారములు షోడశ కలలు కర్మలు గుణములు మూర్తీ భవించిన తత్త్వముగా ఆ కర్మమయ పురుషుని తెలియ వచ్చును. అతడు ఈ షోడశ కలామయ మగు దేహమును ఆశ్రయించి సముద్ర జలము నందు ప్రతిబింబించిన చంద్రుడు వలె నుండి యోగ సాధనచే జయింప బడు తత్త్వమై క్షేత్రజ్ఞుడని వ్యవహరింప బడుచుండును. తమస్సు రజస్సు సత్త్వము ఈ మూడును జీవుని గుణములు. జీవుడు ఆత్మ యొక్క గుణము. ఆత్మ పరమాత్మ యొక్క గుణము. ఈ గుణ త్రయాత్మక మగు ఈ దృశ్య ప్రపంచము అంతయు ఈ సప్త లోకములను ఈ జీవుని సృష్టియే అని క్షేత్రతత్త్వము నెఱిగిన వారి వచనము.
ప్రకృతి యొక్క వికారములు అగు దృశ్య ప్రపంచము క్షేత్రజ్ఞు డనబడు ఆత్మ తత్త్వము అను ఈ రెంటిలో అవి ఇతని నెరుగ జాలవు. కాని అతడు వాని నెరుగును. సమర్థుడగు సారథి మేలైన గుఱ్ఱములతో రథమును నడిపి నట్లు మనస్సుతో ఐదు జ్ఞానేంద్రియము లతో ఆయా పనులు చేయించును. ఇంద్రియముల కంటె ఇంద్రియము లతో అనుభవించు విషయములు వాటి కంటె మనస్సు మనస్సు కంటె బుద్ధి బుద్ధి కంటె హిరణ్య గర్భుడను తత్త్వము దాని కంటె జగద్బీజ మగు అవ్యక్త మను ఈశ్వర తత్త్వము దాని కంటె అమృత తత్త్వము ఒక దానికంటె మఱియొకటి సూక్ష్మ తరములు. అమృత తత్త్వము కంటె సూక్ష్మ తరము లేదు. అదే అందరకును కడపటి గమ్య స్థానము. ఈ విధముగా సర్వ భూతముల యందు రహస్యముగా ప్రత్యక్తత్త్వమై యున్న పరాత్మ తత్త్వము బహిర్గతమై ప్రకాశింపక కనబడక యుండును. కాని సూక్ష్మ దృష్టి కల మహనీయులు నిశిత మగు బుద్ధితో చూడ గలుగుదురు. పంచ జ్ఞానేంద్రియముల మనస్సున లీనము చేసి ఆ ఆఱిటితో సుఖ విషయము లను ఆలోచింపక అనుభవింపక జ్ఞాన సంపన్న మగు మనస్సును పరతత్త్వ ధ్యానమున నిలిపి తనపై ఇంద్రియములను అధికారము చేయ నీయక ప్రశాంత మనస్కు డగు వాడు ముక్తి పొందును. ఇంద్రియముల కన్నిటికి వశుడయి ధ్యానము తత్త్వముపై నిలుప లేక ఆత్మను మనశ్చాంచల్యము నకు వదలిన వాడు మృత్యువును, సంసారమును పొందును. సర్వ సంకల్పము లను అణచి చిత్తమున సత్త్వ గుణమును నింపి తత్త్వ విచారణా పరుడు కావలెను. చిత్తము నిర్మల మగటచే ఇది శుభము ఇది అశుభము అను భేదబుద్ధి తొలగి అత్యంత సుఖమును పొందును. చిత్త ప్రసాదము గాఢసుషుప్తి సుఖము వలె స్వచ్ఛ మయినది. అప్పుడు చిత్తము గాలిలేని చోట దీపము వలె నిశ్చలమై ప్రకాశించును. ఈ తత్త్వ విచార శాస్త్రము సర్వవేద రహస్యము. ఐతిహ్యములచే అగమములచే లభించదు. ఆత్మ జ్ఞనము కలిగించునది. భృగువను నతనికి అతని తండ్ర యగు వరుణు డుపదేశించినది. పెరుగును మథించి నవనీతమును వలె కాష్ఠము మథించి అగ్నిని వలె ధర్మ సత్య ప్రతిపాదకము లగు శాస్త్రములను పదివేలు కొలదిగ సంవత్సరముల పాటు మథించి తత్త్వ వేత్తలు ముముక్షువులకు ముక్తిని సంపాదించు ఈ తత్త్వమును వారి నుద్ధరించుటకై బయల్పరచిరి. వేద విద్యాధ్యయనము చేసిన వానికి దీనిని తెలుప వలెను. ప్రశాంత చిత్తము ఇంద్రియ నిగ్రహము తపస్సు వేదార్థ జ్ఞానము పెద్దలను అనువర్తించుట అననూయత బుజు ప్రవర్తనము చెప్పినట్లు చేయుట అను మంచి లక్షణములు లేని వానికిని తర్క శాస్త్రముతో బుద్ధి చెడిన వానికిని కొండె గానికిని ఆత్మస్తుతి చేసికొను వానికిని అతడు భూమి నంతటిని ప్రతి ఫలముగా ఇచ్చినను బోధించ రాదు. ఇది అన్ని ధనముల కంటె జ్ఞానముల కంటె శ్రేయో రూపము. రహస్య తరము. మనుష్యులకు దుర్లభము. మహర్షులు దర్శించినది. ఉపనిషత్తులలో తెలిప బడినది. ఓ మహర్షులారా! మీరు నన్నడిగితిరి కావున తెలిపితిని. అదంతయు వింటిరి. నాకు తెలిసినది మీకు సంశయము కలిగినది ఏదైన అడుగుడు. చెప్పెదను.
ఓ భగవన్! ఋషి సత్తమా! అధ్యాత్మమును మాకు ఇంకను విస్తరించి తెలుపుము.
విప్రులారా! పృథివి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము అను పంచ మహా భూతములను వాటి యందు నిలిచి యున్న భూత స్రష్టయగు పరమాత్ముడును అనునదియే అధ్యాత్మము.
వీనిలో వేనికి రూపము కలదు? వేనికి రూపము లేదు? ఇవి శరీరమున ఎట్లు ఉన్నవి? ఇంద్రియము లును వాని గుణములను ఏవి? ఎట్లు వానిని గుర్తించ వలెను?
శబ్దము ఆకాశపు గుణము, చెవి దానిని గ్రహించు ఇంద్రియము. శూన్యము దేహములో దాని ఉనికి. స్పర్శ వాయువునకు గుణము. ప్రాణ వాయువు దేహమున దాని రూపము. చేష్ట, చలనము దాని వ్యాపారము. రూపము అగ్నికి గుణము. నేత్రము దాని ఇంద్రియము. విపాకము దేహమున దాని వ్యాపారము. రసము, రుచి, నీటికి గుణము, నాలుక దాని ఇంద్రియము, చెమట దేహమున దాని రూపము. గంధము భూమికి గుణము. ముక్కు దాని ఇంద్రియము. శరీరము దాని రూపము. మనస్సు, బుద్ధి, స్వభావము, ఇవి స్వతః సిద్ధము లైనవి. ఇవి ఈ భూత గుణములకు అతీతములు. బుద్ధితో వాటిని వివేకులు నిగ్రహించు కొందురు. శబ్దాది గుణములు, విషయములు బుద్ధిని ప్రేరించును. బుద్ధి ఇంద్రియములను ప్రేరించును. మనస్సుతో ఇంద్రియములు ఆరు, బుద్ధ ప్రేరణ లేనిచో గుణ విషయ అనుభవమునకు లేదు. కనుక అది ఆరింద్రియము లపై ఏడవ తత్త్వము క్షేత్రజ్ఞుడగు జీవుడు ఎనిమిదవ తత్త్వము. క్షేత్ర మనగా దేహము. దాని యందుండి ఆయా కర్మలు చేయుచు వాని ఫలముల ననుభవించు జీవుడు క్షేత్రజ్ఞుడు. వీనిలో చక్షుస్సు మొదలగు ఇంద్రియములు రూపము మొదలగు విషయముల గ్రహించును. మనస్సు సంకల్ప వికల్పములను సంశయమును కలిగించునున. బుద్ధి, ఇది ఇట్టి దని నిశ్చయమును కలిగించును. క్షేత్రజ్ఞుడు వీటి సహాయమున ఆయా పనులు చేయు చుండును. సత్త్వ రజస్తమో గుణములును స్వతఃసిద్ధము లైనవి. ఇవి అన్ని భూతముల యందును సమత్వము తోనే ఉండును. కాని జీవులలో ఎవరి యందేది అధికముగా నుండునో వారికి దానిని బట్టి ప్రవృత్థులు కలుగు చుండును. ప్రహర్షము, ప్రీతి, ఆనందము, నిశ్చల చిత్తము అన్నిటిని తన అధీనములో ఉంచుకో గలుగుట. ఇవి సత్త్వ గుణ లక్షణములు. అభిమానము, వ్యర్థముగా మాటాడుట,లోభము, మోహము, క్షమ ఇవి రజో లక్షణములు. అధిక మోహము, మూఢత్వము, ఏమరుపాటు, బద్ధకము, నిద్ర, ఎచ్చరిక, మెలకువ లేకుండుట తెలియ వలసిన వాటిని ఎంతో శ్రమ మీద కాని తెలిసి కొన లేకుండుట, ఇవి తమోగుణ లక్షణములు.
భావములను సృజించునది మనస్సు. అధ్యవసాయమును, నిశ్చయమును, కలిగించునది బుద్ధి. ఆనందము మొదలగు భావములను అనుభూతి పొందునది హృదయము అని కర్మలకై జీవుని ప్రేరించు తత్త్వములు మూడు విధములు. ఈ అంశములను ఇట్లు వివరించుకొన వలయును, ఇంద్రియముల కంటె సూక్ష్మ తరములు శబ్ద స్పర్శ రూప రస గంధము లనెడి విషయములు. వాటి కంటె సూక్ష్మ తరము మనస్సు. దానికంటె సూక్ష్మ తరము బుద్ధి. బుద్ధి కంటె సూక్ష్మ తరమై ఈ అన్నింటి చేత పని చేయించు వాడు జీవుడు. కాని జీవునకు గల ఉపకరణము లలో బుద్ధియె సూక్ష్మ తమము. ఈ స్వతంత్ర శక్తి కల బుద్ధిలో సంకల్ప వికల్పములు కలిగిన స్థితియే మనస్సు. అట్లే బుద్ధియే వినుచో శ్రోత్రము స్పృశించు చోత్వక్ చూచుచో చక్షుస్సు, రుచి చూచుచో రసన, వాసన చూచుచో ఘ్రాణము అని ఐదింద్రియములుగా వ్యవహరింప బడును. జీవుని ఆశ్రయించి యుండు ఈ బుద్ధి ఆయా భావములను బట్టి వ్యవస్థ నొందును. అవి 1. సుఖము 2. దుఃఖము. 3. ఏమియు తెలియని మూఢస్థితి. బుద్ధి ఈ మూడు ప్రభావముల కును అతీత మైనది. సముద్రము నదులను చెలియలి కట్టను తనలో ఇముడ్చు కొన్నట్లు బుద్ధి ఆయా భావములను తనలో ఇముడ్చు కొనును. బుద్ధి ఆయా భావముల యందు ప్రవర్తించు నప్పడు గుణములు మూడును తమ తమ ప్రభావమును చూపును. ప్రవృత్తి కాలములో రజో గుణము సత్త్వ గుణముపై తన అధికారము చూపును. ఈ మూడు గుణములును చక్రనాభినేముల నడుమ చక్రపు అరల, ఆకుల వలె బుద్ధి యందు ఇమిడి యుండి ఆయా విషయముల ననుసరించి ప్రవర్తించు చుండును. వివేకులు ఇంద్రియములను మనస్సును కూడ ఆత్మ తత్త్వమును సాక్షాత్కరించు కొనుటకే వినియోగించు కోవలెను. కాని మనస్సును అదుపులో ఉంచు కొననిదే ఇంద్రియములు తమ విషయముల మీద స్వేచ్ఛగా ప్రవర్తించు చున్నంత వరకు ఆత్మ సాక్షాత్కారము సాధ్యము కాదు. కనుక ముముక్షువు వివేకముతో మనస్స హాయమున ఇంద్రియములను నిగ్రహించ వలెను. చీకటి తొలగ గానే లోకము నందలి ప్రాణులకు ఆయా వస్తువులు కనబడు నట్లు అజ్ఞానము తొలగ గానే ఆత్మ సాక్షాత్కారము జరుగును. నీటి పక్షి నీటిలో తిరుగు చున్నను నీరుకాని అచటి మలినములు కాని అంటు నట్లు జీవన్ముక్తు డగు యోగి ఇంద్రియ విషయములలో ప్రవర్తించి నను వాని దోషముల తనికి అంటవు. ఆత్మా నుభవముతో తన యందు తానే ఆనందించు వారు సంచిత కర్మను నశింప జేసికొని ప్రారబ్ధము అనుభవముతో నిశించి సర్వ భూతములు తానై నందున త్రిగుణ సంబంధముచే విషయములలో ప్రవర్తిల్లినను ఆత్మ స్వయం జ్యోతి స్తత్త్వముతో ప్రకాశించును. ఆత్మ గుణములను ఎరుగును. జడము లగుటచే గుణములు ఆత్మను ఎరుగ లేవు. అతడు ధ్యాన యోగముచే త్రిగుణముల తత్త్వమును గ్రహించ గలడు. సత్త్వాది గుణములకును క్షేత్రజ్ఞునకు గల భేదము ఇది. వీనిలో సత్త్వాదులు గుణములను సృజించ జాలవు. ఆత్మ గుణాదులను సృజించ గలదు. ఇట్లు ఇవి వేరు వేరయి యుండియు లోక వ్యవహారమున ఇవి అవినాభావముతో ఒక దానిని మఱి యొకటి ఎడ బాయక యుండును. ఇది ఖనిజ శిల, బంగారముల వంటివి. మేడికాయ, దాని యందలి పురుగుల వంటివి. ముంజదర్భ యందలి ముల్లు వంటివి. ఇవి వేరు తత్త్వము లయి యును కలిసియే యుండును. వీనిని వేరు పరచు కొనుటయే ఆత్మతత్త్వ వివేకము. ఇదియే ఆత్మ సాక్షాత్కారమునకు సాథనము.
Summary of chapter 130 of the Brahma Mahā Purana is as follows:
The advanced stages of yogic practice are described: the nature of dhāraṇā (concentration) on divine objects, the progression from dhāraṇā through dhyāna to samādhi, and the specific signs and experiences accompanying each stage. The liberation (mokṣa) attained through perfected Yoga — identified with the recognition of the Puruṣa's eternal nature as pure witness-consciousness — is affirmed as the supreme fruit of all spiritual endeavor.