అర్జును డప్పుడు కృష్ణ బలరామ శరీరములను వెదకి వానికిని మఱి యితర శరీరములకు సంస్కారమును గావించెను. మఱియును అష్ట మహిషులు రుక్మిణి మొదలగు వారు హరి శరీరమునం బుట్టిన యగ్ని యందు బ్రవేశించిరి. రేవతియు బలరాము దేహము గౌగలించు కొని తత్స్పర్శ వలన గలిగిన యానందముచే చల్లబడిన యగ్ని యందు ప్రవేశించెను. ఆపై నర్జునుడు వారికి ప్రేత కృత్యములను యథా విధిగ జరిపి తక్కిన జనమును వజ్రుని దీసికొని వెళ్ళెను.
ద్వారవతి నుండి బయలు దేరిన వేల కొలది కృష్ణ భార్యలకు వజ్రునికి నతడు రక్షణ యిచ్చి యాదరించెను. కృష్ణునిచే భూమికి గొని రాబడిన సుధర్మ యను దేవ సభ పారిజాత వృక్షము స్వర్గమునకు వెళ్ళి పోయెను. హరి మేదినిని విడిచి స్వర్గా రోహణము చేసిన నాడే కలి నల్లని శరీరముతో భూమికి దిగెను. మహా సముద్రము నిర్జనమైన ద్వారకను ముంచి వేసెను. ఒక్క కృష్ణ గృహమును మాత్రము ముంచ లేదు. ఆ గృహ మందెపుడును భగవంతు డీనాటికిని యుండుటచే నేడును సముద్రుడు తన హద్దుదాటి దాని నాక్రమింపడు. అది మహాపుణ్య స్థానము సర్వపాప హరము. విష్ణువు క్రీడించిన స్థానము. దానిని దర్శించిన పాపము వోవును.
పార్ధుడు ధాన్యధన సమృద్ధ మైన పంచనద దేశమందు యాదవ జనమున కంతకు నివాస మేర్పరచెను. అవ్వల కలి ప్రభావము చేత మానవులలో లోభగుణ మంకురించెను. భర్తలను గోల్పోయిన స్త్రీలు చోరులకు సంబంధించిన వారిని ధనుర్ధారి యైన యొక్క అర్జునుడు తీసికొని పోయి రక్షణ యిచ్చుట చూచి లోభ వశులై పాపులైన యాభీరులు (అడవి మూకలు) పొగరు గొని యొండొరు లిట్లు ఆలోచించిరి. ఈ అర్జును డొక్కడు విల్లుగొని భర్తలు చని పోయిన స్త్రీజనమును గొనిపోవు చున్నాడు. మనలను లెక్కచేయుట లేదు. కనుక మన బలము జూపింతము. భీష్మ ద్రోణ జయద్రధ కర్ణాది వీరులను జంపి గర్వమెక్కి గ్రామ వాసులగు మన బలమేదో యెరుగ కున్నాడు. బలాఢ్యు లగు పెక్కు గ్రామముల వారి నందరిని అవమానించు చున్నాడు. మీరెవ్వరును బదులు పలుక వలదు. అన కర్రలు కత్తులు గొని దస్యులు (గూండాలు) వేల కొలది పరువు లెత్తిరి. అంత నర్జునుడు వెను దిరిగి యయ్యా భీరులం గని “మీరు బ్రతుక దలతురేని వెనుకకు పొండు” అన నాతని మాటను ధిక్కరించి వాండ్రెల్ల స్త్రీలను కృష్ణ భార్యలను నర్జునుని చెంత నుండి లాగికొని పోయిరి.
అంత నర్జునుడు యుద్ధ మందు వమ్మువోయి గాండీవము నెక్కుపెట్ట బూనెను. కాని అతని కశక్య మయ్యె. కష్టము మీద నెక్కు పెట్టినను క్షణములో నది శిథిలమై పోయెను. దివ్యాస్త్రము లతనికి జ్ఞాపకమే రాలేదు. చేనున్న తక్కిన యస్త్రములను వారిపై విసరెను. కాని యవి యన్నియు గ్రుంగి పోయి శత్రు భేదముం జేయ వయ్యెను. ఖాండవ వన దహన సమయమున నగ్ని యిచ్చిన యక్షయ బాణములు కూడ అప్పుడు క్షయించి పోయినవి. గోపాలురతో పోరుచున్న యర్జునునికి హైన్య స్థితి వచ్చెను. అపుడర్జునుడు శరజాలముచే బలాఢ్యులగు రాజులను నేను గెలుచుట కృష్ణుని యొక్క బలమే యని తలంచెను. అతడు చూచు చుండగనే యుత్తమ స్త్రీ వర్గమును ఆ భీరులు లాగికొని పోయిరి. కొందరు స్త్రీలు తమంతనే కామ ప్రవృత్తితో ఆ మూక వెంట పడిపోయిరి. ఆర్జునుడు శస్త్రాస్త్రములచే గొట్టు చుండ వాండ్రు పకపక నవ్వు చుండిరి. ఇట్లు మ్లేచ్ఛులు పార్థుడు చూచు చుండగనే వృష్ణ్యంధక కులాంగనల నందరం గొనిపోయిరి.
ఆంతట జిష్ణువగు (అర్జునుడు) కష్టము! కష్ట మనుచు భగవంతునిచే విడువ బడితి నని యేడ్చెను. అదే ధనుస్సు అవే యమ్ములు అదే రథము అవే గుఱ్ఱములు. వేద విదుడు వేదా నుష్ఠాతయు కాని వానికి చేసిన దానము వలె నొక్క యడుగులో సర్వము వమ్మై పోయినది. ఆహా! విధి యెంత బలీయము. ఆ మహానుభావుడు లేనంతట వట్టి చేతగాని దద్దమ్మనై పనికి మాలిన వారిచే నవమానింప బడితిని. అవే బాహువులు అదే పిడికిలి. అదేచోటు. ఆ అర్జునుడనేయై యున్నాను. పుణ్యముతో నాస్వామితో నెడబాటు ననంతయు నిస్సారమై పోయినది. నా యర్జునత్వము భీముని భీమత్వము కృష్ణుని వలన నీయ బడినవే. నిజము. ఆయన లేమి నీ చచ్చు గొల్లలకు నేను బెండు వడితిని.
ఇట్లర్జునుడు పలుకుచు నింద్ర ప్రస్థమున కేగి యాదవ కుమారుడగు వజ్రుని యందు రాజును గావించెను. అవ్వల నడవిలో నున్న వ్యాసుని మహానుభావుని దర్శించి సమీపించి యడకుప దోప నమస్కరించెను. అట్లు మ్రొక్కిన యర్జునుని వ్యాస భనవానులు తేరి పార జూచి యర్జునుడే యని నిశ్చయమునకు వచ్చి పార్ధా! ఈ విధముగ మిక్కిలి వన్నె దరిగి యున్నాడ వేమి? గొర్రెల పరాగము వెంబడింప వలసి వచ్చెనా? బ్రహ్మ హత్యకు బాల్పడితివా? గెలుపునం దాశా భంగమై దుఃఖము గల్గెనా! విన్న వోయి యున్నాడవు. నిన్ను యాచింప వచ్చిన సాంతాని కాదులను లేదని నిరాకరించి పంపితివా! (సాంతానికుడు = పుత్రుడు మొదలగు వాడు) అగమ్యా గమనము జేసితివా! (కూడని స్త్రీతో సంగమము) ప్రభ దరిగి యుండుటకు గారణ మేమి! విప్రులకు బెట్టక నీవొక్కడవే మధు రాన్నములను దింటివా? కాక దీనుల ధనములను హరించితివా? సూర్య వాతమునకు (వడ దెబ్బకు) గురి కాలేదు కదా! ఎట్లు శోభ గోల్పోయి తివి? దృష్టి దోషము తగిలెనా నభోదక స్పర్శ కల్గినదా! (గోళ్ల యొక్క స్పర్శ కల్గిన యుదక మశుచి యన్న మాట) మట్టి కుండ నీటిచే ప్రోక్షింప బడితివా! (తడుప బడితివా) నీకన్న తక్కువ వారిచే గెలువ బడితివా! ఇట్లు ఛాయ దరిగి యున్నావేమి? పార్థుడంతట నిట్టూర్పు పుచ్చి భగవంతుడ! వినుము అని తన పరాభవ వృత్తాంతమును జరిగినది జరిగిన ట్లిట్లు చెప్పెను.
మా బలము మా తేజస్సు మా వీర్యము మా పరాక్రమము మా సిరి మా కాంతి యెవరో యట్టి హరి మమ్ము వీడి వెళ్ళినాడు. చిరునవ్వుతో ముచ్చటించు మా స్వామి ఆ మహానుభావుడు అన్యుడట్లు మమ్ము విడిచి వెళ్ళినాడు. దానిచే నా సర్వా యుధములు తృణ ప్రాయము లైనవి. అస్త్రములు శస్త్రములు గాండీవము యొక్క మూర్తీ భవించిన సారమెల్ల తానైన యా పురుషోత్తముడు వెళ్ళి పోయినాడు. ఎవని చూపున మమ్ములను శ్రీ జయము సంపత్సమృద్ధి విడువ లేదో యట్టి గోవిందుడు భగవంతుడు విడిచి వెళ్ళి నాడు. భీష్మ ద్రోణులు అంగరాజు (కర్ణుడు) దుర్యోధనాదులు నే ప్రభువు ప్రభావముచే సమూలము నిర్దగ్ధలైరో యట్టి కృష్ణుడు భూమిం బాసినాడు. యౌవనము బాసి హతశ్రీయై వన్నె దరిగి చక్రాయుధుని విరహము వలన నేనొక్కడనే కాదు ఈ పృథివి కుములు చున్నది. ఏ స్వామి యను భావము వలన లీల వలన నేనను నగ్ని యందు భీష్మాదులు మిడుత లైరో యట్టి కృష్ణుని బాసి గొల్లల కోడిపోయితిని. ఎవ్వని యను భావముచే త్రిలోకు ప్రసిద్ధ మైనదో యట్టి గాండీవము కృష్ణుడు లేమిని గొల్లల బడితె లకు లొంగి పోయినది. హరి లేమిని ఎన్నో వేల మంది స్త్రీలు ఆనాధలు వట్టి కట్టెలతో దొంగలచే గొనిపో బడినారు. నా బలమును ధిక్కరించి గొల్లలు నేను గొని వచ్చుచున్న కృష్ణుని యంతః పురమంతయు కర్రలతో నదలించి తోలికొని పోబడినారు. నేను సిరి గోల్పోవుట వింత గాదు. బ్రతికి యుండుట అదే యత్యద్భుతము. నీచుల వలని యవమానమను ఱొంపిని బూసికొని తాత! దిక్కుమాలి సిగ్గుమాలిన వాడ నైతిని.
అర్జునుని దుఃఖము విని దీనుడై యేడ్చు చున్న మహాత్ముడైన యా పాండవుని యొక్క యమ్మాట విని నేనిట్లంటిని. (వ్యాసులు) పార్థ! సిగ్గు పడవలదు. ఏడువకుము. సర్వ భూతముల యెడల కాలము యొక్కగతి యిట్టిదని యెఱుంగుము. భూతముల పుట్టుకకు గిట్టుటకు కాలము కారణము. ఇది కాల నిమిత్త మని యెరిగి స్థైర్యము నొందుము. నదులు సముద్రములు పర్వతములు వసుథ మనుష్యులు పశువుల చెట్లు పాములు కాలముచే నృజింప బడి కాలము చేతనే క్షయించును. సర్వమును కాల స్వరూపముగ దెలిసి శాంతి నొందుము. ధనంజయ! కృష్ణ ప్రభావము నీవన్నది యంతయు నంతే. భార హరణమునకు భూమి యందత డవతరించి నాడు. భూదేవి భార వశయై మున్ను దేవత లందరి దరి కేగినది. అందులకే కామరూపి యైన భగవంతు డవతరించి ఆ పని జరిపి నాడు. రాజులను గూల్చినాడు. తుదకు దాను జన్మించిన వృష్ణ్యంధక కులము గూడ నుప హరించి నాడు. ఇతని కింక నీ భూతలమున జేయవలసి నది కొంచెము కూడలేదు, అందుచే గృత కృత్యుడై భగవంతుడు యథేచ్ఛగా నిర్గమించి నాడు. సృష్టి స్థితి లయములు మూడును శ్రీహరి లీలలే. పార్థ! పరాభవమునకు సంతాప వడకుము. పురుషుల పరాక్రమములు కాగల కాలము లందగు చుండును. బీష్మ ద్రోణాదులు నీచే గూలుట కాలము వలననే. పరమాత్మ యను భావము ననే వారి పరాభవము. తక్కువ వారి వలన నీకు పరాభవము. ఆ దేవుడు స్థితి లయములు చేయు నపుడు అన్య శరీరము లందావేశించు చుండును. కాగ లప్పుడు హరి నీకు సహాయు డయ్యెను. కానపుడు నీ శత్రువులు హరి దృష్టిలో పడినారు. నీవు గాంగేయుని తోడి కౌరవుల నెల్ల గూల్చితి వన్న నెవడు నమ్మును? అట్లే యెందులకు గాని యా భీరుల కోడితి వన్నను నెవడు నమ్మును? ఇవి సర్వ భూతముల యందు హరి యొక్క విలాసము. అతని చేష్ట. నీచే గౌరవులు ధ్వంస మగుట యాభీరులకు నీ వోడుట నీ రక్షణ లోనున్న స్త్రీలు దొంగలచే బడుట యను విషయములో జరిగినది నీకు చెప్పు చున్నాను వినుము.
మున్ను సనాతన బ్రహ్మో పాసనము జేయుచు నష్టావక్రుడు పెక్కేండ్లు నీటనే నివాస ముండెను. ఆసురు లోడిన తరువాత మేరువుపై బెద్ద యుత్సవ మయ్యెను. అది చూడ నేగుచు దేవతా స్త్రీలు ఆతనిం జూచిరి. రంభా తిలోత్తమ మొదలైన వారు నూర్లు వేలుగ నమ్మహాత్ముని స్తుతించిరి. ప్రశంసించిరి. అతడు కంఠము వరకు మునిగి పెను జడలు దాల్చి యుండ వినయమున నమరాంగనలు మ్రొక్కిన బ్రసన్నుడై యిట్లనియె.
నేను ప్రసన్నుడ నైతిని. తామేది కోరిన నిచ్చెదను కోరు కొనుడన
రంభ, తిలోక్తమ మొదలైన వారు నీవు ప్రసన్నుడ వైన మేము పడయని భాగ్యమేమున్న దనిరి.
కాని వారిలో కొందరు ప్రసన్నుడ వైతివేని నిన్ను భర్తగా కోరెద మనిరి.
అట్లేయగు నని యతడు నీళ్ళ నుండి లేచెను. అయ్యెడ నాతని నెనిమిది వంకరలు గల వికృత రూపునిగా జూచిరి. చూచి చాటు వడుచున్న యయ్యింతుల పరిహాస మాతనికి స్పష్ట మయ్యెను.
దాన గోపించి అతడు నా విరూపము చూచి హసించి యవమానము చేసితిరి కావున నా దయ చేతనే బురుషోత్తముని భర్తగ బొంది నా శాపముచే దొంగల చేత జిక్కె దరనెను.
వ్యాసులు:
దానికడలి వారు బ్రతిమాల ఆ ముని యింద్ర లోకమునకు నామీద నేగుదురని యను గ్రహించెను. ఇట్లు అష్టావక్రుని శాపము వలన జరిగిన దానికి నీవు కొంచెము కూడ శోకింప బనిలేదు. ఈ సంహారమే కాదు కొలది కాలములో మీరు నుపసంహరింప బడుదురు. పుట్టిన వానికి గిట్టుటయు మీద నుండుటయు సంచయము క్షయము (ప్రోగు చేయుట పోగొట్టు కొనుట) గలిసి విడివడు టయుం దప్పదు. స్వభావ మని దీని నెరింగిన పండితులు క్రుంగరు పొంగరు. అట్టి పండితుల నడవడిని అలవరుచు కొన్నవారు కూడ వారి వలెనే యున్న వారును గలరు. కావున నరశ్రేష్ఠ! సోదరులతో నిది యెఱింగి రాజ్యము విడిచి తపము సేయ వనమునకు వెళ్ళ దగును. ఈ నా మాటను ధర్మరాజునకు జెప్పుము. ఎల్లుండి సోదరులతో గూడ నుత్తమగతి మహాప్రస్థానము జేయుడు. అని తెలుప బడి పార్థుడు ధర్మరాజు దగ్గరకు వచ్చి యదంతయు తెల్పెను. వారందరు నర్జునుని వచనము విని పరీక్షిత్తును రాజ్యమున నుంచి వనమునకు జనిరి. ఓ ముని శ్రేష్ఠులార! విస్తరముగ నిట్లు యదు వంశము నందు బుట్టిన వాసుదేవుని యొక్క చరిత్రము మీకు దెలిపితిని.
Summary of chapter 105 of the Brahma Purāṇa is as follows:
The path that the soul of the deceased takes after departing the body is described. The messengers of Yama (Yamadūtas), the long journey through various planes, the review of accumulated karma by Citragupta in Yama's court, and the judicial process by which rewards and punishments are assigned are narrated. The chapter serves as a powerful eschatological teaching on the certainty of divine justice and the importance of dharmic living.