బ్రహ్మ మహా పురాణము
38 - మదన దహనమ్
మహా దేవుడు నిజభవన మందాసనమున గూర్చుండ దుష్టుడగు మన్మథు డాయనను వేధింప నేతించెను. అది యెరింగి యయ్యాత తాయిని శిక్షింప నిటలాక్షుండు తృతీయ నేత్రమున వీక్షింప నమ్ముక్కంటి మంట కెఱయై యనంగుడు మూర్చ వడెను. ఆయన సతి రతి మిక్కిలి శోకించెను. అంత జాలిగొని యా యుమా శంకరులు రతీ దేవింగని యిట్లనిరి.
కల్యాణీ! శరీరము లేకయు నీ భర్త పూర్వ మట్లు సర్వకార్య సమర్ధుం డగును. విష్ణువు కృష్ణావతార మెత్తినపు డాతనికి కుమారుడై నీ పతి జనింప గలడు అని వర మిచ్చిరి.
అచట నప్సరస లాడిరి గంధర్వులు పాడిరి. కొందరు దివ్య వాద్యములను వాయించిరి. కొందరు స్తుతించిరి. ఇంద్రయ మాగ్ని తుల్యులగు ప్రమథ గణములతో నిట్లు శివుడు కూడి విహరించుచు దేవికి బ్రియమ్ము గూర్ప నాగిరిని విడువ డయ్యెను. ఆ మీద దేవేశుండేమి కావించెనని ఋషు లడుగ.
భగవంతుడా హిమ గిరి శిఖరంబున దేవికి వినోదము గూర్ప ప్రమధ గణములు పలు రూపులు దాల్చి యాడునట్లొనర్చి దేవికి బరిహాసము గల్పించెను. అటుపై గిరికన్య యొంటరిగ బంగారు పీఠముపై గూర్చున్న జనని సన్నిధి కేగెను. మేనా దేవియు దేవరూపిణియగు శర్వాణి కాసనమిడి యాదరించి యామె కూరుచున్న తర్వాత నిట్లు పలుకరించెను.
కుమారీ! చిర కాలమునకు నీవు వచ్చితివి. ఆట వస్తువుల లేమికి గురియై భర్తతో నాడుకొను చున్నావు. ఎవ్వరు లేనివారు దిక్కు లేనివారో వారీ విధముగ నీ మగని వలె వినోదింతురు.
అని తల్లి పలుక విని పార్వతి యంతరంగ మందంతట సంతోష పడలేక పోయెను. మిక్కిలి యోర్మితో గూడి యామె కించుకయు బదులీయ దయ్యెను. మరియు దల్లిచే విడువ బడి యేగి మహా దేవుని కిట్లనియె.
స్వామి! దేవ దేవేశ్వర! ఈ పర్వత మందు వసింపను. ఓ తేజోనిధీ! ఈ భువనములంటెందేని నాకు వేఱొక నివాస మేర్పరుపుము.
అన విని దేవి! నివాసార్ధమై నే నెల్లపుడు చెప్పు చున్నను వేఱొక నివాస మున కెన్నడు నిష్ట పడ వైతివి. ఇప్పుడు నీ యంతట నీవే ఓ కళ్యాణి! వేఱొక నివాసము నెందులకు వెదకెదవో? నాకది తెలువు మన దేవి యిట్లనియె.
మహానుభావుడు మా తండ్రి యింటి కిప్పుడే నేను వెళితిని. మాయమ్మ యచ్చట నన్నుగని యేకాంతమున నాకా సనాదులిడి యాదరించి యిట్లనియె. ఉమా! నీ మగడు దరిద్రుడు. నిరంతరము నాట వస్తువులతో (బొమ్మలతో) నాడు కొనును. దేవతల కటువంటి యాట కూడ దనెను. మహాదేవ! నీవు ప్రమథ గణములతో పలు రకములగు భూత ప్రేత పిశాచములతో వినోదింతువు. వృషభ వాహన! అది మాయమ్మ కిష్టము గాదనియె.
ఈశ్వరుడది విని యాదేవిని పరిహసింప జేయుట కిట్లనియె.
ఇంతీ! మీయమ్మ యన్నది సత్యము. నీకేల కోపము? నేనిదిగో కృత్తి వాసుడను. నిర్వాసుడను. శ్మశాన వాసిని. నిలువ నీడ లేని వాడను. అడవులలో కొండలలో గుహలలో దిగంబరుల గుంపులతో దిరుగుదును. మీయమ్మ యెడ గినియకుము. తల్లికి సాటి యగు చుట్టము మఱిలేదు. అని హరుడన నా యిల్లాలు నాకు బంధువులతో బనిలేదు. నేను సుఖ పడు మార్గ మేదైన చేయ మనియె.
పరమేశ్వరుడు ప్రియురాలి ప్రీతి కొఱకామెతో కైలాసము నుండి ప్రమథ గణ పరివారముతో సురసిద్ద సేవితమగు మేరువున కేగెను.
Summary of chapter 38 of the Brahma Mahā Purana is as follows:
After the destruction of his sacrifice, Dakṣa and the surviving Devas seek Śiva's forgiveness and compose a prayer of surrender. Śiva, propitiated by Dakṣa's sincere penance and prayer, restores the sacrifice, revives the slain Devas, and grants appropriate boons. The chapter concludes the Dakṣa episode with reconciliation and teaches that Śiva, though fearsome when offended, is the supreme bestower of grace when properly propitiated.