విశాలమైన హిమవత్పర్వతము మీద విమానముల సమ్మర్ధ మధిక మయ్యెను. పార్వతి స్వయంవర సన్నాహము నందు గిరిరాజు తన కుమార్తె యభిప్రాయము హరునిపై నుండుట నెఱింగియును, వంశాచారము పాలించుటకు స్వయంవర వార్తనెల్ల లోకము లందును జాటింపించెను. దేవ దానవ సిద్ధ గంధర్వాదు లందఱి సమక్షమున నా కూమారి బ్రహ్మ వరకు గల దేవత లందు పరమేశ్వరుని వరించునేని యదినా పుణ్యము నంన్తవనీయము. నా అభ్యుదయములకది అనుకూలము. అని మదినెంచి తన నగరము రత్న తోరణా లంకృతము లొనర్చి స్వయముగా చేసెను.
హిమవంతుడు చాటించిన స్వయంవర వార్త విని యఖిల భువన వాసు లయిన యువకులరుదెంచిరి. నేనును నక్కడ గిరి రాజు ప్రార్థనచే నెల్ల యోగులు సిద్ధులు సేవింప దేవతలతో నేగి పద్మాసన మందు పవిష్టుడనై యుంటిని. దివ్యాంబరాంగరాగ హారాది భూషణములం దాల్చి సురరాజు వేయి కన్నులతో నయ్యుత్సవముం దిలకింప మద ధారలం గురియు మహిత గజరాజ మైరావతము నెక్కి వచ్చెను. తేజః ప్రభావము వలన నెల్లదిశల వెలిగించుచు చలత్పతాక మగు (జెండా నెగురు చున్న) బంగారు విమాన మెక్కి భాస్కరుం డరుదెంచెను. తేజమ్మున బలమ్మున శాసనమున నసదృశుడై మణి మయోజ్వల కుండలములు ధరించి యాదిత్య మండలంబు నుండి భగుడును నమర మూర్తి సూర్యుడట్లగ్ని యట్లు వెలుగు విమానమున నేతెంచెను. యముడును దండంబు గొని భయంకర మహిష వాహన మెక్కి జవంబున పెద్ద పర్వత మట్లొడ్డునుం బొడవుం గల్గి మంగళ మూర్తియై మణిమయ స్వర్ణ భూషణ మంజుల వేషియై యచ్చటకు విచ్చేసెను. సర్వ జగత్ప్రాణుడైన సమీరణుడు విమాన మెక్కి సురా సురులకు వెఱగు గూర్చు తేజంబున నరుదెంచెను. వహ్నియు దివ్య విమాన మెక్కి వర వేషధారియై వచ్చి సురేంద్రుల నడుమ వెలుంగుండెను. సర్వ ధనాధ్యక్షుడగు కుబేరుడు కాంతిచే వేషముచే నెల్ల సురాసురుల నాప్యాయన మొంద జేయుచు పుష్పక విమాన మెక్కి యరుగు దెంచెను. నవరత్న విచిత్ర విమాన మెక్కి చామన చాయ మేనివాడు సువిచిత్ర వేషుడు పరిమళ పుష్ప మాలను ధరించి సుధాంశు డరుదెంచెను. పర్వతముల వలెనున్న విష్ణువు గదం దాల్చి గరుడు నెక్కి యేగు దెంచెను. పరమ సుందరులు దేవలోక భిషగ్వరులు అశ్వినీ దేవత లిరువురు నొక్కటే విమాన మెక్కి ముచ్చట గొల్పు వేషములతో నటకు వచ్చిరి. అగ్ని వర్ణమైన విమాన మెక్కి జ్వలనార్క ప్రభతో నాగ పరివారముతో సహస్ర ఫణామణి మండలుడగు నాగేంద్రు డప్పు డేతెంచెను.
పెండ్లి కుమారులట్ల లంకరించు కొని బృందారక బృంద మేతెంచెను. గంధర్వ రాజు తన సంఘముతో నప్సరసలతో నింద్రాజ్ఞంగొని యమ్ముచ్చటం గనుగొన వచ్చెను. మఱి కిన్నర కింపురుష నాగ గణంబులు వచ్చిరి. అందరిలో నమరేంద్రుడు శచీపతి చూడ ముచ్చటైన సొంపున వెలింగెను. సురాసుర జనని శంభుపత్ని యని పురాణము లందు గీర్తింప బడినది పరాప్రకృతి మున్ను దక్ష కోపమునకు గురియై హిమవంతు నింటికి కార్యావసరము గొని వచ్చినది. దివ్య విమాన మందు దేవకాంతలు వింజామరలు వీవ సర్వ ఋతువు లందలి పువ్వులతో సంతరింప బడిన మాలంగొని సత్వరముగ నామె స్వయంవరమునకు బయలు దేరెను.
అట్ల రుదెంచు గిరిరాజ కన్యంగని యామెను బరీక్షింప నెంచి శంభుడు పంచ శిఖల ముచ్చట గొల్పు శిశువై యాదేవి యొడిలో నల్లన నిదురించెను. ఆదేవి చూచి ప్రీతినంది యా రహస్యంబు గ్రహించి దానభిలషించిన పతిగా నెఱింగి యా పాపనిం దన హృదయ మందు నిలిపి స్వయంవర మండపము నుండి వెనుదిరిగి వెళ్ళి పోయెను. ఎవడీ శిశువు? ఇచటి కెట్లు వచ్చినాడు! అని మిక్కిలి మోహపడి సురలు కేకలిడిరి. ఇంద్రుడు వజ్రంబూని నిలువబడి యా శిశువుచే నపుడ స్తంభితుండయ్యె. భగుడెత్తిన చేయి యెత్తి నట్లయుండె. విష్ణువు శిరః కంపనమును జేయుచు శంకరుని వంక జూచెను. అపుడు నేను (బ్రహ్మ) కలత బడి ధ్యానమున నిలిచి యా క్షణ మయాదేవి యొడిలోని బాలుడు బాలేందుధరుడని గ్రహించితిని. తెలిసి నంత లేచి నిలువబడి యా దేవదేవు చరణములకు మ్రొక్కి పురాణములచే సామ సంగీతములచే గుహ్యము లయిన పుణ్య నామావళిచే పెక్కు రీతులం బొగిడితిని.
ఇట్లు పరమేశ్వరుని నుతించి స్తంభించిన దేవతలం గని మీరీ పాపని శంకరుడని యెఱుంగ లేరైరి. పొండు! శరణ మందుడు. నేను మీతో శరణా గతుండ నయ్యెద నన నాత్రిదశులు భావ శుద్ధితో నా శర్వుని కానతు లైరి. శీఘ్ర ప్రసన్నుడు కాన స్వామి, వారి యెడ జాలివడి యందరిని మున్నట్లు స్వస్థులం జేసెను ఇది యైయిన వెనుక నీశ్వరుడు త్రిలోచనములతో కూడిన అద్భుతమైన శరీరము దాల్చెను. ఆ తేజమునకు వారు కనులు మిరుమిట్లు గొన జూడలేక కనులు మూసి కొనిరి. ఆయన వారికి తన మూర్తి జూడ ననువైన చూపు ననుగ్రహించెను వారుం దాన నా యీశ్వరుం జూచి యాయన నిట లాక్షుండని యెఱింగిరి. వారందరు కనుగొను చుండ నప్పుడ యద్దేవి యా దేవదెవు పాదమ్ముల స్వయంవర మాల నలంకరించెను. “బాగు బాగు” అని యెల్ల వేల్పులు నుతించిరి. ఆ దేవితో గూడ తలలు వాల్చి నమస్కరించిరి. అపుడు నేను హిమవంతునితో నిట్లంటిని. “పూజనీయుడ వైవు వందనము సేయ దగుదువు. ఈశ్వరుని తోడి సంబంధ మిది నీ భాగ్యమ్ము కానిమ్ము. కల్యాణ మహోత్సవమున కెందులకు విలంబము” అన హిమవంతుడు మ్రొక్కి యిట్లనియె.
దేవా! నా అభ్యుదయమున కెల్ల నీవె కారణము. అనుకొనని యనుగ్రహ మిది. నా కొదవినది పితామహ! వివాహ మెట్లు ఎపుడు సేయ నగునో యదెల్ల నీవ నడుప వలయును. అన విని నేను యిట్లంటిని.
హిమవంతుని మాటవిని శివునితో “వివాహ మగు గాక” అని నేననగా నా లోకేశు డగు శంకరుడ ట్లేయగు గాక! అనగా మేమందరము నందమైన కల్యాణ పురము నిర్మించితిమి. నవ రత్నములు మూర్తిని ధరించి కల్యాణ వేదికను స్వయముగ నలంకరించి నవి. అందలి కుడ్యములు స్ఫటికములు భూమి మరకత మాణిక్య మయము. స్తంభములు స్వర్ణ మయములు. ద్వారము లందు ముక్తా హారములు తమంత వ్రేలినవి. అమ్మణుల జిగ జిగ మెఱయించుచు నమ్ముందు సోమ సూర్యులు స్వప్రభల వెలయించిరి. శివభక్తిని ప్రకటించుచు వాయువు మనోహర పరిమళముల వెదజల్లుచు నందందు వాహ్యాళి వెడలెను. చతు స్సముద్రములు శక్రాది సురలు దేవ నదులు మహా నదులు సిద్ధులు మునులు గంధర్వాప్సరో యక్ష రాక్షస నాగ కిన్నర చారణలు జల చరులు ఖేచరులు తుంబు నారదులు హాహా హూహూ ప్రముఖ దేవ గాయదులు రమ్య మంగళ వాద్యములు గొని యమ్మండపమునకు వచ్చిరి. ఋషులు వేద గీతములు మేళవించిరి. జగన్మాతలు దేవ కన్యలు పాటలు పాడిరి. అప్సరస లాటలాడిరి. ఆఱు ఋతువులు నానా సువాసనల సుఖావహములై మూర్తిమంతులై హిమవంతుని యింటి కేతెంచి యీశ్వరు నుపచరించినవి. వర్షర్తు సమాగమము మంత్ర ధ్వని గర్జములతో నీల జీమూత ప్రభలతో కేకారవ మనోహర మయూర నృత్యములతో విలోల పింగళ రుచి విలాసి విద్యుల్లతా దకచకద్యుతులతో కుముద కుసు మాపీడ శుక్లములగు బలాక మాలికలతో నపుడ పొడమిన శిలీంధ్ర కందళీ లతా ద్రుమ హృద్యతర పల్లవ మంజరులతో చల్లని వానధారల కలరి మేల్కొని సేయు కప్ప యరుపులతో, మానవతు ప్రియు యెడ పొలియలు వాసి తమంత ప్రియుల కౌగిలికిం దార్చు ముచ్చటలతో నును మబ్బుల చాటున నల్లనల్లన తొంగి చూచు శశిరేఖ సొగసుతో మేఘము చాయ చాయగులుకు నింద్ర చాపము చూపు సొంపుతో చిత్ర విచిత్ర సుమ పరిమళములచే భావితంబయి మధుర వాసనల చింత చల్లని జల సంపర్కము నంది వీచు మనోహర మంద మందానిలములచే నల్లనల్లనంగదలు సురాంగనల లలితాలకటనములతో గర్జించు మేఘములు గ్రమ్మిన యిందుబింమ్ము డంబరముతో తొలకరి వాన చినుకులు ముత్యాల మురు గొని పచ్చలు దాపిన్ల మెఱయు గరిక దుబ్బులు నబ్బురము గొల్పు పచ్చని కాంతులతో హంస నూపురంబులతో సమున్నత పయోధర శాలినియై వర్షఋతు సుందరి సుందరపు కల్యాణ మండపము నలంకరించెను. నీలమేఘ గర్జనలకు హంసలు బెదరినవి. స్వచ్ఛములైన సలిల ధారలకు కలువలు వినమ్రము లైనవి. పరిమళ కుసుమ కింజల్క పరాగ పరిభూషి తాంగియై వర్ష ఋతువు పార్వతీ వివాహమునకు తనను ముస్తాబు చేసికొనెను.
ఆ పైని శరద్దృతు లక్ష్మి మేఘ కంచుకము దొలగించు కొని పద్మకోశకుచ శోభయై హంస నూపుర మనోహరయై దిశలు తెలివిగొన విస్తీర్ణము లైన సైకతములు పిరుదులుగా మధు రకూజిత హంస మేఖలయై వికసించిన నల్ల కలువ లనెడి నయనముల సొంపుతో పండిన దొండ పండనెడి యధర శోభతో మొల్ల మొగ్గ లనెడి దంత కాంతితో వినూత్న శ్యామ లతికా వినీల రోమరాజితో చంద్రాంశు గౌరహార వితానముతో సర్వ బృందారక బృంద హృదయా రవిందము లనుల్లాస పరచుచు శరద్దృతు లక్ష్మి మనోహర మత్త భ్రమరకుల కలగీత స్వర భాషిణియై చలత్కుముద చారుకుండల మండితయై రక్తాశోక శాఖా నిర్గత లలిత సుకుమార పల్లవాంగుళియై పలు వన్నెల పూలచీర దాల్చి రక్తో త్పలాగ్ర చరణయై జాతీ పుష్ప సఖన వ్యనఖ రుచియై రంభా స్తంభర మణీయోరు రుచియై చంద్ర వదనయై సర్వా లంకార భూషితయై సర్వ లక్షణ లక్షితయై నిర్ముక్త నీలమేఘ కంచు కాంచిత వసనయై పూర్ణేందు బింబ ప్రతిబింబ వదనయై సానురాగ యగు నాయిక వోలె నీలాంభోజ లలిత నయనయై రవిక రవిక చకమల సుస్తనియై నానా కుసుమ రజః పరిమళ పవన ప్రహ్లాదినియై కల హంస నూపుర రవభవ్యయై గిరి సుత కల్యాణ మునకు శరద్దృతు లక్ష్మి తన్ను సింగారించు కొని వచ్చెను.
అవ్వల మిక్కిలి చలువల వెదజల్లు జలముల మించుచు మేమంత శశిర ఋతు దేవతలు ఆ వివాహమునకు వచ్చిరి. హిమవంతుడు ఆ ఋతు విలాసినులు ప్రాలేయ చూర్ణముల వర్షించు చుండ రజత హర్తపగిది రాణించెను.
అమ్మంచు సోనలచే ఘనీ భావము నంది హిమవంతుడు చూపరులకు క్షీర సాగరమట్లు మవోహరు డాయెను. ఒకానొక దుర్జనుడు సాధు పరిచర్యఁ జేసి కృతార్థు డైనట్లు ఆధరాధర సార్వభౌముడు హేమంత శిశిర పర్యాయ శోభచే నింపు కొల్పెను. మంచు గవిసిన మహిత శృంగములచే శ్వేత ఛత్ర ఛాయలో నున్న చక్రవర్తి యట్లు వెలుగొందెను.
వసంతుడును గిరికన్య కల్యాణమునకు వచ్చెను. సురల కుసురాంగనలకు మదనోద్రేక కరములైన మంద మంద మలయా నిలములును స్వచ్ఛాఁబు పూరముల నించుచు సరస్సులును సరసి జోత్పల సంభారముల బూని విమల రస పూర్ణములై ముత్తైదువు లపగిది ముస్తాబు చేసికొని పార్వతి పెండ్లి పేరంటమునకు వచ్చెను. ఇంచించుక స్ఫుట మగుచున్న పయోధ రాగ్రములచే (మేఘములచే) దర్శనీయ లగు కుమారి కలట్లు మిక్కిలి శోభించెను. నాత్యుష్ణ శీతము లైనవై, కుసుమ కింజల్క చూర్ణ కపిశీ కృతములై చక్రవాకముల జంటల కలకలా రావములచే ప్రతిధ్వను లీనుచు సరస్సులు ముచ్చుట గొల్పెను. ఐరావతాది దిగ్గజములు లలిత గమనముతో ఆనందో త్కటము లయి యద్రికన్య ఉద్వాహ మునకు నడచెను. ప్రియంగు వృక్షము లామ్ర వృక్షములను అన్యోన్యము బెదరించు కొను చున్నవా యన్నట్లు కుసుమ మంజరులతో హృదయ రంజకము లయ్యెను. తెల్లని హిమ శృంగము లందు కుసుమిత ములైన తిలక వృక్షములు శుభ కార్యమని యెంచి వచ్చిన వృధ్ధ జనమో యనునట్లు భాసించెను. పుల్లాశోక లతికలు సాల తరువుల గౌగిలించుకొని కాముకుల కంఠమును గౌగలించు కొను కామినీ జనమట్లు చూడ ముచ్చట గొలిపెను. ఆ వసంత వేళ కదంబనీప తాళ తమాల సరళ కపిత్థ అశోక, సజ్జ అర్జున కోవిదార పున్నాగ నాగేశ్వర కర్ణికార లపంగ కాలాగురు సప్తవర్ణ న్యగ్రోధ శోభాంజన నారికేళ ప్రముఖ సకల వృక్ష కదంబము పూలతో పండ్లతో మనోహర కుసుమాంగ రాగములతో హృదయంగ మము లయ్యెను. చిత్ర విచిత్ర వర్ణము లయిన రెక్కలచే టిట్టిభక కలవింక బలాకాది జల విహంగములతో పద్మోత్పల మీనములతో గూడిన సరస్సులనుండి సుశీతల సుగంధ వాయువులు కొమ్మల రెమ్మలం గదలించి రాల్చిన పూవులతో నగ కుమారి వివాహ మండప ప్రాంత భూములు పరస్పర సమ్మేళన మందిన ఋతువుల చిహ్నములతో శోభా వహములై రాజిల్లెను.
అట సమద షట్పద కుల గీతములు మంగళ గీతము లయ్యెను. తుమ్మెదలు ముసరిన కలువలచే నల్లనివై, తెల్లని మృణాల లతలచే తెల్లనివై రక్తారవిందములచే రక్తములై సరోవర నీరములు నయన మనోహర ములయ్యెను. కొన్ని కొలనులు బంగారు తామర పూవుల నలముకొని మిక్కిలి సొంపు నింపు చుండెను. కొన్ని యెడల వైడూర్య మణి నాళమయ ములై కమల వనములు విలసిల్లెను. హేమసోపా పంక్తులతో నానా విహంగ కలకూజితములతో కమలోత్పల వనములతో గూడిన దిగుడు బావులు భావ మధురములయి రాణించెను. కుసుమిత కర్ణికారములతో నీహారాద్రి సమున్నత శృంగములు హేమమయము లట్లు రంజిల్లెను. ఇంచు కించుకగ విప్పారి అల్ల నల్ల వీచు గాలులకు కదులుచు నెత్తావుల నించు పాటల కుసుమములచే దెసలు పాటలము లయ్యెను. (ఎఱుపెక్కెను) నిండ బూసిన కృష్ణ తరువులు, అర్జునములు నీలా శోకములు నల్లనల్లన విరియు విరుల తోడి యందమున స్పర్థగొని యెండొరుల మించి శోభిల్లినవి. గిరి నితంబము లందెల్లెడ వీచు గాలుల కూగుచు హోరు మని మ్రోతనించు కింశుకము వనములు అంత రాంతరముల నీల మేఘ సంఘాతములు క్రమ్ము కొన్నవా యనిపించు తమాలతరు కుంజములచే నచ్చమైన హిమగిరి చూడ ముచ్చట యయ్యెను.
కొమ్మల రెమ్మల నిండ పూసి రాలిన పూవులతో చందనములతో చంపక ములతో ప్రమత్త పుంస్కోకిలాలాపములతో గిరిరాజు మిక్కిలి రంజిల్లెను. కోకిల లకల కూజితము లాలించి నీల కంఠములు పురిప్పి కేక లిడుచు నాట్యము లారంభించిన. వాని సడిని పుప్ప బాణుండు పుష్టిగొని గీర్వాణాంగనల గురిచేసి విరి బాణములు విసర దొడగెను. ఎండ తీవ్రమై జలాశయము లెండి తనువులకు సుఖము నిండ నత్తఱి గ్రిష్మర్తువు గిరికన్య పెండ్లికి వచ్చి గిరిరాజు నుప చరించెను.
మఱియు తరువుల నుండి విరుల రాల్చి ప్రాలేయ గిరి శృంగముల సింగారించెను. పాటల కుసుమ విస్తీర్ణ కదంబార్జున సుమనోహర వాయువులు చల్లగ వీచెను. దిగుడు బావులు కచకమల కేసర పుంజ రంజితములై యెఱుపెక్క దరుల కలహంస కదంబము లచ్చపు జిగి నెంతేని ముచ్చట గొలిపెను. పూల గోరింటలు పువ్వుల తెలినిగ్గుల నెఱనీటు గులుకు భ్రమరములకు వలపు గూర్చు చుండెను. హిమశైల శాలని తంబములం బొగడలు నలువంకల తావులు జిమ్ము పూవుల రాసులం గ్రుమ్మరించిన. ఓముని ప్రవరులారా! వింటిరే ఇట్లారు ఋతువులు గౌరీ వివాహ కౌతుకమునకు కుతూహలము గొని కుసుమ విచిత్ర శృంగార తరులతా బృందముతో నందముగా నేతెంచినవి. మంగళ వాద్యములు మ్రోయ నిట్లు సాగిన కల్యాణ వైభవమున బ్రాహ్మణ సముదాయములతో శైలపుత్రిని సకలాభరణ భూషితం గావించి వెంటగొని నేను స్వయముగా పుర ప్రవేశముం జేయించితిని. అవ్వల నీశ్వరునితో నేను బ్రహ్మస్థాన మందుండి నీ వివాహ నిమిత్తముగ నగ్ని యందాజ్యాది హవిస్సులను హోమము నిర్వహించెద నాజ్ఞ యిమ్మని యడిగితిని.
ఏమి చేయ నుద్దేశింప బడిన దదెల్ల నో సురేశ్వర! నీ యిష్టాను సారము గావింపుము, నీ వన్న యట్లంతయు నే నొనరింతును.
అమ్మాట కానందబడి నేను కుశలంగొని యాద్దేవుని యొక్కయు దేవి యొక్కయు హస్తములను యోగ బంధమున జత సేసితిని. శ్రుతి గీతము లయిన మహా మంత్రములు మూర్తి మంతములయి సన్నిధి సేయ నగ్నియు హర్భాగముల స్వయముగా నందుకొన కృతాంజలి వుటుండయ్యె. యథావిధిగ నమృత రూపమైన హవిస్సును హోమము చేసి సనాతనులయ్యు నూతను లయిన యా దంపతులు చేయి చేయి యుంగొని నగ్నికి ప్రదక్షిణము నొనరించి యవ్వల వారి చేయి విడిపింప సర్వ దేవతలు నామానస పుత్రులు సిద్ధులు ప్రహృష్టాంతరంగులై నన్న నుగమింప నందఱము వృష ధ్వజున కా పెండ్లి వేళ ప్రణామములు గావించితిమి. ఇట్లా సనాతన మిధునమునకు యోగము చేతనే యీ వివాహ మహోత్సవము జరిగినది. ఈ యందము మున్నెన్నడు దేవత లేని గాంచి యెఱుంగరు. ఈ మహేశ్వర స్వయంవర కల్యాణ వృత్తాంతము మీకెల్ల వినిపించితిని. ఇది సకల జగత్కల్యాణ కరము.
Summary of chapter 36 of the Brahma Purāṇa is as follows:
After their sacred marriage, Śiva and Umā take leave of Himavat and Menā and depart for their abode on Kailāsa. The parting of Umā from her parents is described with tender emotion; Menā's grief at her daughter's departure is movingly depicted. The chapter celebrates the establishment of Śiva and Pārvatī as the cosmic couple ruling from Kailāsa.