ముని వరులార! వ్యాసులు తెలుపు చుండ రుద్రుడు కోపించిన మీదట జరిగిన పుణ్య కథను పార్వతి రోషము శంభుని క్రోధము వీరభద్రుని యెక్కయు, భద్రకాలి యొక్క అవతారము దక్ష యజ్ఞ ధ్వంసము శంకరుని ఆద్భుత విక్రమము తిరిగి యాయన మహాత్ముడగు దక్షునికి ప్రసన్నుడగుట రుద్రునకు యజ్ఞ భాగ మిచ్చుట దక్షునికి క్రతుఫలము లభించుట చూచి సంప్రీతులు విస్మితులునై ఋషులు వ్యాసుని తక్కిన కథను దెలుపుమని యడిగిరి. వ్యాస భగవానుడు ఏకామ్ర క్షేత్రమును గురించి వారడుగ నిట్లు తెలుప దొడంగెను.
బ్రహ్మ తెలిపిన పుణ్యకథ నాలించి ముని పుంగవులు యొడలు పులకరింప ఆనంద భరితులై వ్యాసులను కథను గొని యాడిరి.
ఆహా! శంభు దేవుని మహిమ నీవు చక్కగ దెల్పితివి. ఇపుడే కామ్ర క్షేత్రమును గురించి తెలుపుము. విన వలెనని మిక్కిలి కుతూహలముతో నున్నా మనిరి,
వారి వచనము విని లోకేశ్వరుడు చతుర్ముఖుడు భూతలమున పాపహర మగు నా శివ క్షేత్రముం గూర్చి మునుల కిట్లు తెలిపెను.
సర్వ పాపహరము పరమ దుర్లభము కోటి లింగ సహితము కాశీ క్షేత్ర సమానము ఎనిమిది తీర్థములతో గూడి నదియు నేకామ్ర మని ప్రసిద్ధి గల పుణ్య క్షేత్రమును గురించి చెప్పు చున్నాను. వినుడు. పూర్వకల్ప మందక్కడ నేకామ్ర వృక్షము (ఒంటి మామిడి చెట్టు) ఉన్నందున నా క్షేత్రమున కాపేరు వచ్చినది. అందు సంతుష్టి, పుష్టియు గల స్త్రీ పురుషు లుందరు, పండిత సమూహము తోను, ధన ధాన్యముల తోను గూడినది, గృహ గోపురముల యొత్తిడి గొన్నది, త్రికోణాకార ద్వారబంధ శోభితము, నర్తక బృంద సహితము సర్వ రత్నోప శోభితము, కోట బురుజులతో నొప్పునది, రథికులచే శోభించునది, రాజ హంసలట్లు తెల్లని ప్రాసాదములతో రాణించునది పుర ద్వారములతో నొప్పునదియు తెల్లని ప్రాకారములతో వ్యాప్త మైనదియు, ఆయుధ ధారులచే నభిరక్షితము, కందకములతో రాణించునదియు, వాయు కంపిత బహువర్ణ పతాకా పరిశోభితము, నిరంతరోత్సవ ప్రముదితము, నానా వాద్యధ్వని సంకులము, దేవాలయములు, ప్రాకారములు, ఉద్యాన వనములతో పరమ సుందరము. అందలి స్త్రీలు పరమ సుందరులు, ఆనంద భరితులు, సర్వాభరణ భూషితులు, పద్మ నేత్రలు పూర్ణ చంద్రాననలు కాంచీ నూపుర శబ్ద శోభితలు కొందరు బంగరు చాయ వారు. కొందరు గజ గమనలు. కొందరు పినోన్నత కుచభారా వనమ్రలు దివ్యగందాను లిప్తలు, కొందరు కర్ణా భరణ భూషితలు, మరి కొందఱు మదవతులు, సుశ్రోణులు, కొందరు నగుమోము గలవారు, అపుడించుక వెలువడు పలు వరుస గలవారు కొందరు బింబా ధరోష్టులు కొందురు మధుర స్వర మనోహరులు. తాంబూల రంజిత ముఖులు, ప్రియ దర్శనులు, మనోహారిణులు, క్రియ వాదినులు, నిత్య యౌవన గర్వితలు. అందరు దివ్యాంబరా భరణ థారిణులు, పరమ పతివ్రతలు ఆ క్షేత్రమున యువతులు అప్సరస్స మానులు, క్రీడా విలాసినులు, రేయిం బవళ్ళు తమ తమ గృహము లందు ఆనంద భరితులై యుండు ఉత్తమ గృహిణులు. అచట పురుషులు రూప యౌవన గర్వితులు, సర్వ లక్షణ సంపన్నలు నిగనిగ మెరయు మణి మండనములు ధరించు వారు. బ్రహ్మణాది వర్ణముల వారు స్వధర్మ నిరతులు. అందు వారాంగనలు కూడ పరమ సుందరులై యెప్పుదురు. ఊర్వసీ, మేనకాది దేవ సుందరీ మణుల యందమున నొప్పువారు. సంగీతాది సకల కళా నిపుణులు. ప్రియ వాదినులు. సర్వ లక్షణ లక్షితులు, నృత్యగీత విశారదులు. సర్వ రమణీ రమణీయ గుణ గర్వితలు. వాలు చూపులలో మాటలలో నిపుణులు, కురూపులు, కుబుద్దులు, పరద్రోహ పరాయణులు, నందు గాన రారు. వారి కటాక్ష ప్రసరణ మాత్రమున మానవులు మోహా వివశులగుదురు. నిర్ధనులు, మూర్ఖులు పర ద్వేషులు, రోగులు, లోభులు మాయకులు, జగత్ర్ప సిద్ధమైన ఆ క్షేత్రమున నుండరు, సర్వసుఖ సంచారము. సర్వసత్త్వ సుఖకరము, సర్వసన్య సంభరితము. సర్వజన సంకులము. అందు కల ఫల వృక్షములు ఎందును లేవు. అందలి యుద్యానములు నందన వనోపమములు, సర్వర్తు కుసుమ ఫల భారావనమ్ర వృక్ష శోభితములు.
అందు శుక పిక చకోర చక్రవాత ప్రముఖ సకల పక్షికుల కిలకిలారావ సంకులము లగు వనములు, సరస్సులు దిగుడు బావులు, చూడ ముచ్చట గొల్పు చుండును. అందు కమలములు కలువలు ఎర్ర తామరలతో నిండిన పుణ్య సరస్సు లెటు చూసినను కన్నుల పండువు చేయు చుండును. అయట పరమ శివుడు సన్నిహితుడు. ఆ పరమేశ్వరుడు భూమి యందున్న నదులు పుష్కరిణులు చెరువులు నూతులు సాగరములు అనువాని నుండి జల బిందువులను సేకరించి సురలతో నా పుణ్య క్షేత్రమును బిందు సరమను తీర్థమును నిర్మించెను. మార్గశీర్ష బహుళాష్టమి నాడు జితేంద్రియుడై యచట యాత్ర చేసి శ్రద్ధతో స్నానము చేసి వాజ్నియమ మూని దేవర్షి పితృ తర్పణ మాచరించి తిలాంజలులు చేసిన వాడు అశ్వమేధ ఫలమందును. గ్రహణ పర్వ కాలమున విషువమున (సమ రాత్రిందిన కాలమున) సంక్రమణ మందు అయన సమయమున యుగాదు లందు షడశీలితిని (తుల మొదలు కొని 86వ రోజున వచ్చెడి పుణ్య కాలము. ఇది సంవత్సరమునకు నాలుగు పర్యాయములు వచ్చును. ద్విస్స్వభావ రాశి యందే యిది వచ్చును.) మఱి యితర శు భసమయము లందు ధనాది పుణ్య దానములు చేసిన వారు ఇతర తీర్థముల కంటె నూరురెట్ల ఫలము నందుదురు. ఆ బిందు సరస్తీర్థము నందు పితృ దేవతలకు పిండ ప్రదానము చేసిన వారు పితృ దేవతలకు అక్షయ తృప్తిని కలుగ జేసిన వారగుదురు సంశయము లేదు.
అటుపై నింద్రియముల నిమిడించు కొని వాక్కును నిగ్రహించు కొని, శివాలయ మునకు (ఏకామ్రేశ్వ రాలయము) ఏగి అందు శంకరుని పూజింప వలెను. ఆ మున్ను ఆలయమునకు ముమ్మారు ప్రదక్షిణము చేయ వలెను. ఆవునేతితో గో క్షీరముతో శుచియై స్వామి కభిషేకించి చందనము, కుంకుమయు పూసి యవ్వల ఉమాపతి యగు చంద్ర మౌళీశ్వరుని పుష్పములచే పవిత్రము లగు బిల్వార్క కమలాదు లచే నాగమ విధానమున వైదిక మంత్రములతో నారాధించ వలెను. దీక్షా పరుల పూజా విధాన మిది. దీక్ష నొందని వారు మూల మంత్రము తోను నామముల తోను అర్చించ వలెను. ఈ విధముగ గంధ పుష్పాదులతో షోడశో పచారముల తోను నృత్య గీతాదులతోను నారాధించి పాప విముక్తు లగుదురు. రూపసి యువకుడు నగును. ఇరువది యొక్క తరముల వారి నుద్ధరించి దివ్యాభరణ ముల దాల్చి, చిరు గంటలు మ్రోయు బంగరు విమానమున గంధర్వా ప్సరసాదులు కీర్తింప స్వదిశల మిరుమిట్లు గొల్పుచు తుదకు శివ లోకము చేరును. అచటి భక్తులతో భూత ప్రళయ పర్యంత మచట నుండి భూ లోకమునకు వచ్చి యోగి గృహము నందు చతుర్వేది యగును. అచట పాశుపత దీక్షగొని మోక్షము నొందును.
శయనైకాదశి, ఉత్థానైకాదశు లందు సంక్రమణము లందు, అయన పుణ్య కాలము లందును, అశోకాష్టమి పవిత్రారోపణము లందును శివ దర్శనము చేయువారు సూర్యప్రభ మగు విమానమున శివ లోకమున కేగుదురు. మేధావంతులు ఎల్ల కాలము శివ దర్శనము చేసి శివలోక మందుదురు. ఈ శివ క్షేత్రమునకు నలుదిక్కు లందు గల రెండున్నర యోజనముల ప్రదేశము భుక్తి ముక్తుల నిచ్చు క్షేత్రము. ఆ క్షేత్రము నందు గల లింగము భాస్కరేశ్వర మనబడును. అచట నున్న కుండమున స్నానముచేసి ఆదిత్యునిచే నర్చింప బడిన ఆ భాస్కరేశ్వరుని దర్శించిన వారు విమానమెక్కి గంధర్వ గానము లవధరించును శివ లోకమున కేగుదురు. అచట నానంద భరితులై ఒక కల్ప కాలము మనోహర భోగముల ననుభవించి పుణ్యక్షయము కాగా భూలోకము చేరి యోగి గృహమునందు పుట్టి వేదవేదాంగ పారగులై సర్వభూత హితము కోరు బ్రాహ్మణులై సర్వసములై మోక్షశాస్త్ర కుశలురై శివయోగ మంది మోక్ష మందుదురు. పూజ్య మైనను అపూజ్య మైనను ఒక శివ లింగము అడవిలో రాచబాటలో నాల్గుదార్లు కలిసిన చోట శ్మశానము నందు గాని యెక్కడో యక్కడా క్షేత్రము నందున్న యెడల దానిం జూచి తొట్రు పడక శ్రద్ధతో మనసు నిలిపి భక్తితో నభిషేకము చేసి సుగంధ పుష్పాదులచే ధూపదీప నైవేద్యాదులచే నమస్కారములచే స్తుతులచే నమస్కరించి సాష్టాంగ దండ ప్రణామము గావించి నృత్య గీతాదులచే యాధా విధిగా నర్చించిన యతడు శివలోక మేగును. స్త్రీ యైనను శ్రద్ధతో శివుం బూజించిన నీ మున్ను జెప్పిన ఫల మందును. ఇందు విమర్శింప బనిలేదు.
ఆ యేకామ్ర క్షేత్రము యొక్క సమగ్ర గుణ విశేషములను పరమేశ్వరుని కంటే మఱి యెవ్వడు వర్ణింప గలడు? ఏ యే స్థితిలో నున్ననను వైశాఖాది మాసము లందు బిందు సరోవర జలమందు స్నానము చేసి యట నున్న శివుని, వరదాత్రి యగు పరమేశ్వరిని ప్రమథ గణములను కుమార స్వామిని గణపతిని నందిని కల్ప వృక్షమును సావిత్రీ దేవిని దర్శింప వలెను. అందు వలన శివుని సాలోక్య మందును. కపిల తీర్థమున యధా విధిగ స్నాన మాచరించి యభీష్టముల నంది శివలోక మందును. ఆ క్షేత్రములనే జితేంద్రియుడై యధావిధి స్తంభ ప్రతిష్ట చేయునతడు ఇరువది యొక్క తరముల కులము నుద్ధరించి శివ లోకమున కేగును. కాశీక్షేత్ర సమయమున శివక్షేత్ర మగు నేకామ్ర క్షేత్రము నందు స్నానము సేసిన యతడు తప్పక మోక్ష మందును.
Summary of chapter 41 of the Brahma Purāṇa is as follows:
The legend of King Indradyumna of Avantī is introduced. A supremely devoted king, Indradyumna yearns to behold Bhagavān Viṣṇu in his physical form. A visiting sage informs him of Puruṣottama (Jagannātha) on the eastern coast. Indradyumna abandons his kingdom and sets out on pilgrimage; the chapter describes his journey and the sacred land of Avantī from which he departs.