గోష్ఠ మందు గార్గ్యుని బావమరది యతనని (పురోహితుని) యదువులదరి సన్నిధి యందు షండుడని (నపుంసకుడని) తూల నాడెను. యాదవు లందఱు నవ్విరి. అంత నతడు కినుక గొని దక్షిణా పథమునకు వచ్చి యదు వంశ భయంకరుడగు పుత్రునిం గోరి తపస్సు చేసెను. ఆతడు శివు నారాధించుచు లోహచూర్ణ మాత్రము దిని యుండెను. హరు డాతనికి సంతుష్టుడై పండ్రెండవ సంవత్సరమున వర మిచ్చెను. పుత్ర సంతతి లేని యాతనిని యవనాధీశ్వరుడు గౌరవించెను. వాని యంగనతో నతడు సంగమించి నంతట భ్రమర (తుమ్మెద) సమాన ప్రభగల కొడుకు పుట్టెను. కాల యవనుడను పేరు గల వానిని వజ్ర కఠినమైన రొమ్ము గల వానిని తన రాజ్యమున పట్టాభిషేకించి యడవికిం బోయెను.
ఆ కాల యవనుడు బలమున మదమెక్కి యవనిం గల బలవంతులు రాజు లెవ్వడని యడుగ నారదుండు యాదవులని తెల్పెను. వాడు కోటివేల మంది మ్లేచ్ఛులతో జతురంగ బలముతో పెద్ద యుద్యమము సేసెను. దినదిన మెండ లంబడి వాడు పయనించి కసిగొని యాదవులను గూర్చి మధురాపురి కేగెను. అంతట గృష్ణు డిట్లా లోచించెను యవనులచే యాదవులము నశించుట చూచి మాగధుడు (జరాసంధుడు) యుద్ధమున కేతెంచును. మాగధుని బలము క్షీణించి నపుడు యవనుడు వచ్చును ఈ విధముగ రెండు వైపుల నుండియు యాదవులకు కష్టము వచ్చి పడినది. అందుచే యాదవుల కొరకభేద్య మైన దుర్గ మొకటి నిర్మించెదను. తద్రక్షణచే నబలలు (స్త్రీలు) కూడ యుద్ధము చేయ గలరు. అట్టి యెడ పృష్టి యదు వంశముల వారి మాట చెప్పనేల? నేను మత్తుకొని కాని ప్రమత్తుడనై కాని యున్నను నిద్ర పోయినను నెటకేని ప్రవాసము వెళ్ళిన గాని యాదవుల లోకువ చూచి శత్రువులు వారిపై నెక్కువ విజృంభింపరు. అని గోవిందు డాలోచించి మహా సముద్రుని పండ్రెండు యోజనముల మేర నిమ్మని (సముద్రమును దూరముగా తొలగుమని కోరి) యచట ద్వారకాపుర నిర్మాణము సేసెను. అది మహోద్యానములు పెద్దకోట పెక్కు తటాకములు ప్రాకారములతో నింద్ర రాజధాని యమరావతి వలె నుండెను. మధురాపుర వాసుల నక్కడికి గొనివచ్చి యందుంచి కాల యవనునికి దగ్గరగా నుండునని తాను మధుర కేగెను. అందుండి సైన్యము తరలింప బడగా దాన నిరాయుధుడై యటకేగి నంత నతనిని గాల యవనుడు చూచెను. వాడాయన వాసుదేవుడని గ్రహించి చేత నాయుధము బూని మహా యోగులేని మనసుల చేబట్ట రాని యా స్వామిని వెన్నంటి తరిమె. అట్లు తరుమ బడి కృష్ణు డచ్చట ముచుకుందుడను రాజు మహా పరాక్రముడు నిద్రించు చున్న గుహలో బ్రవేశించెను. ఆ యవనుడు నటదూరి యట పరుండి యున్న నరుని గని కృష్ణు డనుకొని పాదముచే దన్నెను. అతడు కన్ను తెఱచి చూచిన క్షణములో యవనుడగ్నిచే గాలి పోయెను. ఆ ముచుకుందుడు మున్ను దేవాసుర యుద్దమున కేగి మహా రాక్షసు లందఱిం జయించి దేవతలను నిద్ర కావలెనని కోరెను. వారును నిదురించిన నిన్నెవ్వడు వచ్చి లేపునో వాడు దేహమునం బుట్టిన యగ్నిచే నప్పుడ భస్మము గాగలడు అని వర మిచ్చిరి.
ఇట్లా పాపాత్ముని యవనునిం గాల్చి మధుసూదనుం గని ఎవడ వీవన నేను చంద్ర వంశమున వసుదేవునికి బుట్టి నాడను యాదవుడ నని హరి పల్కెను. ముచుకుందుడు విని వృద్ధ గార్గ్యుని మాట స్మరించి సర్వేశ్వరుండని యెఱింగి హరికి ప్రణతుడై యిట్లనియె. అవును నిన్నెఱుగుదును నీవు విష్ణు నంశమున నుదయించిన వాడవు. మున్ను గార్గ్యుడు ఇరువది యెనిమిదవ ద్వాపరము చివర యదు వంశమున హరి యవతారము జరుగు నని చెప్పెను. అతడే నీవు. మర్త్యుల కుపకారము చేయ దయ చేసిన వాడవు. సంశయము లేదు. నీ అప్రాకృత దివ్య తేజము నేని సహింప లేను. అని మహామేఘ గర్జా గంభీరమైన ధ్వనితో ముచుకుందుడు కృష్ణ స్వామి నిట్లు స్తుతించెను.
ముచుకుందుడు:
స్వామి! దేవాసుర యుద్దములం దుద్భటులైన దైత్యు లెందఱో నీ తేజమునకు దట్టుకొన లేక పోయిరి. అట్టి నీ తేజస్సు నేనోర్వ జాలను. సంసార పతితమైన జంతువునకు నీవొక్కడివే దిక్కు. ప్రసన్నుల యార్తిని హరించు నీవు నా యెడ ప్రసన్నుడవు గమ్ము. నా అశుభమును హరింపుము. సముద్రములు పర్వతములు నదులు మేదిని గగనము వాయువు నీరు అగ్నియు నీవే. పురుషుని కంటె మిగుల పరమై వికల్పాత్మక మైన యెల్ల జన్మము లందు వ్యాపించి శబ్దాది విషయ స్పర్శ లేక వృద్ధి క్షయ జరాదులు లేక యున్న కేవలమైన వస్తువు నీవే. నీవలనన చరా చరాత్మకము స్థూలము సూక్ష్మము నైన జగత్తు పొడమినది. పొడము చున్నది. పొడమ నున్నది. మూర్తము అమూర్తము నైవదెల్ల నీవలన నైనదే. నీ కంటె మఱి యేదియు లేదు. సంసార చక్ర పరిభ్రమణము సేయుచు తాపత్రయ తప్తుడనైన నాకాత్యంతిక సుఖమంద లేదు. దుఃఖములను సుఖములని యెండ మావులను జలాశయములని యనుకొంటిని. అది ఎక్కడ లేని యుడుకుం దెచ్చి పెట్టినది. రాజ్య సుఖము పుత్రమిత్ర కళత్రాదికము శబ్దాది విషయ భోగము సుఖమని మఱిగిన నాకు తుదకది తాపాత్మకముగా పరిణ మించినది. దేవలోక గతి నందితిని గాని యా దేవ గణము నాసాహాయ్యము గోరినది. తండ్రీ! శాశ్వతమైన నిర్వృతి (పరమ తృప్తి) యెక్కడ? సర్వ జగత్ప్రభవ స్థానమును నిన్నారాధింపక యా శాశ్వతానంద మెవడు పొందును? నీమాయచే మూఢులై జన్మ మృత్యు జరాది పాపానుభవముల నంది ప్రేతపతిం జూతురు. అవ్వల కాలపాశములం గట్టువడి యతి దారుణముగ నరకము లందనేక విధములగు దుఃఖము లందురు. ఇది నీ విశ్వ స్వరూపము. నేను విషయ లోలుడనై నీ మాయచే మోహితుడనై మమకారమను మురికి గుంటలో తిరుగాడు చున్నాను. పరమేశ్వర! నిన్ను స్తుతిపాత్రుని శరణందు చున్నాను. సంసార శ్రమచే నుడికిల్లిన మనసుతో నిర్విణ్ణుడనై (దుఃఖినై) పరమ పదమైన పరంధామ మైన నీ యందు ముచ్చట గొన్నాడను.
Summary of chapter 89 of the Brahma Purāṇa is as follows:
Balarāma, moved by nostalgia and longing, returns to Vṛndāvana to visit the gopīs and cowherds who had loved him and Kṛṣṇa in childhood. The reunion is joyful; the gopīs share their grief at Kṛṣṇa's prolonged absence, and Balarāma consoles them with assurance of the Lord's grace. The chapter depicts the unchanging devotion of the Vṛndāvana community even years after Kṛṣṇa's departure.