శ్వేత మాధవుని దర్శించి ప్రళయ మందేకార్ణవ మైన తఱి మత్స్యావతార మెత్తిన మాధవుని దర్శింప వలెను. వేదములను హరించిన హిరణ్యాక్షుని సంహరించి వేద రక్షణము చేసిన మొదటి యవతార మెత్తిన విష్ణువును నమస్కరించి నరుడు దుఃఖ విముక్తు డగును. విష్ణు లోకమును బడయును. మరల నీ పుడమికి వచ్చి వత్సమాధవ స్వామి నిచట దర్శించి దాతయు, ఐశ్వర్య భోక్తయు, యజ్ఞ కర్తయు, విష్ణు భక్తుడును సత్యవ్రతుడునై హరి సన్నిధాన మొంది మోక్షము వడయును. సర్వకామ ప్రదమయిన మత్స్య మాధవ మాహాత్మ్యమును వర్ణించితిని.
అనవిని మునులు స్వామి! సముద్ర జల మార్జనము స్నానము దానము చేయుట యందు వలన గల్గు నశేష ఫలము చెప్పుమని యడుగ బ్రహ్మ యిట్లనియె.
మునులార! వినుండు. భక్తి మనసు నందుంచిన సముద్ర జల మార్జనము మార్కండేయ హ్రదమందు ప్రాతః స్నానము ఉత్తమ పుణ్యఫల మిచ్చును. చతుర్దశి యందు పూర్ణిమకు స్నానము జేసిన యశ్వమేథ ఫల మందును. మార్కండేయ హ్రదము, కృష్ణ వటము బలరాముడు మహోదధి యింద్రద్యుమ్న సరస్సునను వీనికి పంచ తీర్థములని పేరు. జ్యేష్ఠ పూర్ణిమ జ్యేష్ఠా నక్షత్రము కలసి వచ్చిన పుణ్య కాలమున ఈ తీర్థ సేవనము పరమ శుభమని చెప్ప బడినది. త్రికరణముల చేతను శుద్ధుడయి రాగ ద్వేషాదులను ద్వంద్వములను బాసి కల్ప వృక్షమును బోలిన మర్రి చెట్టునకు స్నాన పూర్వకముగ ప్రదక్షిణము జేసి విష్ణువునకు కూడ ముమ్మార్లు వలగొనిన వాడు సప్త జన్మ పాపముల నుండి ముక్తుడయి కోరిన సద్గతి బడయును. ఆ వట వృక్షమునకు వటేశ్వరుడు కృష్ణుడు, పురాణ పురుషుడు అను పేరులు మూడు కృతాది యుగము లందు గీర్తింప బడినది. కృత యుగము నందు నీ వృక్ష ప్రమాణము ఒక యోజనము. త్రేతా యుగము నందు నాల్గవ వంతు తగ్గినది. ద్వాపర మందు సగము యోజనము. కలిలో దానిలో సగము వైశాల్యమని చెప్పబడెను. ఎడమ పాదమున ప్రణవమును దక్షిణ పాదమున నకారము వామ కటి యందు మోకారము కుడి వైపున నాకారము నాభి యందు రాకారము యెడమ భుజమున “య” కారమును కుడి భుజమున ణాకారము శిరస్సున “య”కారమును న్యాసము చేయ వలెను. క్రిందను మీదను హృదయ మందును ఇరు ప్రక్కలను పుష్ఠ భాగమునను నారాయణుని ధ్యానించి నారాయణ కవచ పారాయణము ప్రారంభించ వలెను. గోవిందాది నామములతో తూర్పు మొదలుగ నలుదిక్కుల యందును విష్ణువు, మొదలుగా గల నామములతో నాగ్నేయాది విదిక్కుల యందు (మూల లందు)ను విష్ణువు రక్షించుగాక యని పలుక వలెను. వరాహ మూర్తి భూతలము నందును త్రివిక్రముడు మీదను రక్షించుగాక యని పలికి నారాయణుడను నేనెయని యాత్మాను సంధానము చేయవలెను. (అద్వైతమును) అభేదమును సాధింప వలెను.
అటుపై నీ క్రింది మంత్రమును జపింప వలెను. ఆ మంత్ర భావమిది. మనుజులలో నగ్నిని నీవు. అనగా వైశ్వా నరాగ్నియను జఠరాగ్ని నీవె. కామోద్దీపనము చేయు వీర్యాధానము చేయు వాడవు నీవె. సర్వ భూతములకు ప్రధాన భూతము నీవు. సర్వజీవులకు ప్రభువవు. అమృతములకు సరణివి. అనగా జన్మ స్థానము. దేవతలకు మూల పురుషుడవు. నా పాపము హరింపుము. ఓ తీర్థ రాజమా! నీకు నమస్కారము. ఆపైన స్నానము చేయ వలెను. స్నాన మవసరమూ లేదు. ఆతీర్థ జలము లందు వైదిక మంత్రములతో నభిషేకము చేసి మార్జనము చేసు కొన్నను చాలు. మోకాళ్ళు నీళ్ళలో నిలిచి యఘమర్షణ ఋక్కులను మూడావృత్తులు జపించుచు స్నానము చేసిన నశ్వమేధ యాగఫలము వచ్చును. గట్టునకు వచ్చి మడి బట్టలను ధరించి ప్రాణాయా మాచరణములను జేసి సంధ్య నుపాసించి సూర్యోపస్థనము జెప్పి పూలతో జలాంజలి యిచ్చి బాహువులు మీదికెత్తి సూర్యు నుద్దేశించి నూట యెనిమిది మార్లు జపించ వలెను. నిలువ బడి ఇంకను గల సౌర మంత్రములను జపించ వలెను. సూర్యు నుద్దేశించి ప్రదక్షిణము జేసి నమస్కరించి తూర్పు ముఖమై బ్రహ్మ యజ్ఞము దేవర్షి పితృ తర్పణములను గోత్రములతో పితృ దేవతలకును తర్పణము చేయ వలెను. దేవతా తర్పణ మయిన తరువాతనే పితృ తర్పణమున కధికారి యగును. శ్రాద్ధ కాలమందు హోమ కాలమందు నొంటి చేతితో జేయ వచ్చును. తర్పణము రెండు చేతులతో జేయ వలెను.
తర్పణము చేయువాడు నీటిలో నిలబడి యొడ్డున తర్పణము చేసిన యెడలను, వొడ్డున కూర్చుండి నీటిలో తర్పణము చేసినను అది ఆయా దేవతలకు జెందదు. వృథా యగును. పితృ తర్పణము నీటిలో జేయరాదు. కుపితుడై చేయ రాదు. ఒంటి చేతితో చేయరాదు. గట్టు మీదికి వచ్చి శుచియైన చోట పితృ తర్పణము చేయ వలెను. ఉదక మందు పాత్రల యందు జేయరాదు. అట్లు చేసిన నది పితృ దేవతలకు నందదు. భూమి యందు జేసిన పితృ తర్పణము అక్షయము అందు కొరకె నేను భూమి నిచ్చితిని. జలము భూమిలో పుట్టినది. భూమి యందు బారు చున్నది. భూమి యందే లయమగు చున్నది. కావున పితృ తర్పణమునకు భూమి ప్రధాన స్థానము. అగ్రములతో నున్న దర్భలను తూర్పు అగ్రములుగ పఱచి దేవతలకును, దక్షిణా గ్రములుగ పఱచి పితృ దేవతలకును తర్పణము జేయ వలెను.
Summary of chapter 60 of the Brahma Purāṇa is as follows:
The five sacred spots (Pañcatīrthī) within the Puruṣottama kṣetra are described and their individual and combined merits are praised. Each of the five tīrthas is associated with specific divine events and bestows specific blessings. The practice of visiting all five in sequence is prescribed as supremely meritorious.