శ్రీ మద్భాగవతము - దశమ (10వ) స్కందము

Table of Contents

90 - శ్రీకృష్ణ భగవానుని లీలా విహారము

శ్రీ శుక మహర్షి ఇట్లు పలికేను --- లక్ష్మీపతియగు శ్రీకృష్ణ భగవానుడు తన ద్వారకానగరమునందు సుఖముగా నివసించుచుండెను. సకలసంపదలతో సమృద్ధమైన ఆ నగరమును యాదవశ్రేష్ఠులు సేవించిరి.

నూతనయౌవనముయొక్క కాంతీ గల ఆ నగరస్త్రీలు ఉత్తమ వేషములను దాల్చి ప్రాసాదములయందు బంతి, పాటలు మొదలగు వాటితో క్రీడించెడివారు. ఆ స్త్రీలు మెరుపు వలె ప్రకాశించెడివారు.

ఆ నగరములోని మార్గములు నిత్యము మదమును స్రవించే ఏనుగులతో రద్దీగానుండును. అచట బాగా అలంకరించుకున్న భటులు, గుర్రములు, బంగారము వలె మెరిసిపోయే రథములు ఉండెను.

ఉద్యానములతో, ఉపవనములతో సంపన్న మైన ఆ నగరము పుష్పించిన చెట్ల వరుసలలో ప్రవేశించే తుమ్మెదలచే, పక్షులచే అంతటా నినదింప జేయబడెను.

 పదునార వేల భార్యలకు ఈ శ్రీకృష్ణుడు ఒకే ఒక ప్రియుడగు భర్త. గొప్ప సంపదలు గల వారి గృహములయందు ఆయన అన్ని అద్భుత మగు రూపములను దాల్చీ రమించెను. ఆ గృహములకు ఆనుకొని ఉన్న జలాశయములలోని జలములు పూర్తిగా వికసించిన సౌగంధిక పుష్పములు, ఎర్రదామరలు, పద్మముల పుప్పొడులతో సువాసితములై యుండెను. ఆ గృహములలో కూతలు కూసే పక్షుల గుంపులు ఉండెను.

గొప్ప వైభవము గల శ్రీకృష్ణుడు నదుల నీటిలో ప్రవేశించి విహారించేను. ఆయనను యువతులు కౌగిలించగా వారి స్తనములయందలి కుంకుమ ఆయన అవయవములకు అలదుకొనెను.

గంధర్వులు, సూతులు, మాగధులు, వందులు మద్దెళ్లను, డోళ్లను, తప్పెటలను, వీణను వాయిస్తూ ఆయన కీర్తిని గానము చేసెడివారు.

శ్రీకృష్ణ భగవానుని పత్నులు నవ్వుతూ ఆయనపై పిచికారీలతో నీళ్లను పోసి తడి పెడివారు. ఆయన కూడ వారిపై నీళ్లను పోసి తడుపుతూ, యక్ష ప్రభుడగు కుబేరుడు యక్షస్త్రీలతో వలే, క్రీడించేను.

శ్రీకృష్ణ పత్నుల వస్త్రములు తడియుటచే ఊరువులు, స్తనముల భాగములు ప్రకటమగుచుండెను. వారు నీటిని ఆయన పై చల్లుచుండగా పెద్ద కొప్పులలోని పువ్వులు జారిపోవుచుండెను. ఆయన చేతిలోని పిచికారీని లాగుకొనగోరి ఆయనను వారు కౌగిలించుచుండిరి. ఆ సమయములో పుట్టిన ప్రేమచే కలిగిన ఉత్సాహముచే ముఖముల శోభ ఇనుమడించి వారు విశేషముగా ప్రకాశించిరి.

శ్రీకృష్ణుడా యువతులపై పలుమార్లు నీటిని చల్లగా, వారాయన పై తిరిగి నీటిని చల్లుచుండిరి. ఆయన మెడలోని మాలకు వారి స్తనముల కుంకుమ తగుల్కొనెను. ఆటయందలి పట్టుదలచే ముంగురుల సమూహమును కట్టిన బంధము కదిలిపోవుచుండెను. ఆడు యేనుగులచే చుట్టువారబడిన గజేంద్రుడు వలె, ఆయన వారితో కూడి రమించెను.

శ్రీకృష్ణుడు, ఆయన భార్యలు తాము విహారము కొరకై దాల్చిన వస్త్రములను, అలంకారములను గానవాద్యములపై జీవించే నటులకు, నాట్యకత్తెలకు ఇచ్చిరి.

ఆ విధముగా విహరిస్తూ శ్రీకృష్ణుడు తన నడక, కబుర్లు, చూపులు, చిరునవ్వులు, సున్నితమైన హాస్యోక్తులు, గడుసైన హాస్యములు, కౌగిలింతలతో ఆ యువతుల హృదయములను దోచావే సెను సుమా।

ఆ యువతుల చిత్తము మోక్ష ప్రదాతయగు శ్రీకృష్ణుని పై ఏకాగ్రమయ్యెను. వారు మౌనముగా ఆయననే ధ్యానించెడివారు. తరువాత వారు పిచ్చివారు వలే ఆలోచన లేకుండా మాటలాడెడివారు. వారి పలుకులను నేను చెప్పెదను. వినుము.

శ్రీకృష్ణపత్నులు ఇట్లు పలికిరి --- ఓ (ఆడు) లకుముకీ। ఈ జగత్తులో ఈ రాత్రివేళ నీవు నిద్ర మాని రోదిస్తున్నావు. నిద్రించవేమి? శ్రీకృష్ణ భగవానుడు సర్వమును మరచి (సర్వజ్ఞతను ఉపసంహరించి) నిద్రిస్తున్నాడు. ఓ మిత్రురాలా। ఒకచో నీ హృదయము కూడ మాకు వలెనే పద్మములవంటి కన్నులు గల ఆయన చిరునవ్వుతో స్వీకార సూచకముగా విలాసతో చూసే చూపుచే లోతుగా గాయపడలేదు గదా?

ఓ చక్రవాకీ! (ఆడు జక్కవ పక్షి) అయ్యో। రాత్రి నీవు కళ్లు మూసుకొని కరుణముగా బిగ్గరగా విలపించెదవు. భర్త కనబడడా యేమి? లేక, నీవు కూడ మా వలెనే శ్రీకృష్ణ భగవానునకు దాసివై ఆయన పాదములను సేవించిన పూల మాలను కేశపాశముపై ధరించ గోరుచున్నావా యేమి?

ఓయీ! ఓయీ! సముద్రుడా! నీకు నిద్ర పట్టదా? నీ అవస్థ జాగారమేనా? నీవు ఎల్లవేళలా ఆక్రోశిస్తూనే ఉంటావు. నీవు కూడ మా వలెనే శ్రీకృష్ణ భగవానుడు కౌస్తుభాది లాంఛనములనపహరించగా అతిక్రమించ శక్యము కాని అవస్థను పొందియున్నావా యేమి?

ఓయీ చంద్రుడా! నీకు పెద్ద రోగము పట్టుకున్నది. నీ కిరణములకు చీకటి తగ్గేది లేదు గాని, నీవు క్షీణించిపోతున్నావు. నీవు కూడ మాలాగే శ్రీకృష్ణ భగవానుని మాటలను మరచినావా యేమి? నీకు నోరు మూసుకు పోయినదా? నిన్ను చూస్తే అదే అయి ఉండునని మాకు తోచుచున్నది.

ఓ మలయమారుతమా! గోవిందుని ప్రక్క చూపులచే గాయపడిన మా హృదయమునందు కాముని ఉద్దీపింపజేయుచున్నావు. మేము నీకు ఏమి అపకారమును చేసితిమి?

శోభతో కూడిన ఓ మేఘుడా! నీవు యాదవప్రభుడగు శ్రీకృష్ణునకు నిశ్చయముగా ప్రియుడవు. నీవు మావలెనే (ప్రేమకు కట్టుబడి శ్రీవత్సమనే పుట్టుమచ్చ గల శ్రీకృష్ణ భగవానుని ధ్యానించెదవు. ఆయనను మాటి మాటికీ స్మరించి స్మరించి ఉత్కంఠ పెరిగి బేల హృదయముతో నీవు కూడ మావలెనే కన్నీటి ధారలను విడిచి పెట్టుచున్నావు. ఆయనయొక్క ప్రసక్తియే దుఃఖమును కలిగించును.

ఓ కోకిలా! నీవు రమణీయమగు కంఠముతో ప్రియమగు ధ్వనిని చేసెదవు. నీ శబ్దములు మృతునైననూ బ్రదికించును. ఈనాడు నీకు నేను ఏమీ ప్రియమును చేయవలెనో నాకు చెప్పుము.

పెద్ద మనసు గల ఓ పర్వతమా! ఉలుకు పలుకు లేకుండా ఉన్నావు. ఏదో గొప్ప విషయాన్ని ధ్యానిస్తున్నావా యేమి? మేము స్తనములచే వలె నీవు శిఖరముతో వాసు దేవుని పాదమును ధరించ గోరుచున్నావా యేమి?

సముద్రపత్నులగు ఓ నదులారా! ప్రియభర్త, మథురాధిపతి అగు శ్రీకృష్ణుని ప్రేమతోడి చూపు లభించక ఆయనచే దోచివేయబడిన హృదయములు గల మేము చాల చిక్కిపోతిమి. మా వలెనే మీకు కూడ, అయ్యో!, ప్రియభర్తయగు సముద్రుని అనుగ్రహము మేఘము ద్వారా లభించలేదు. ఈ వేసవిలో జలాశయములు ఎండి, కలువల శోభ తొలగి మీరు కూడ మావలెనే కృశించి యున్నారు.

ఓ హంసా! స్వాగతము, కూర్చుండి పాలను త్రాగుము. . ఓయీ! శూరవంశీయుడగు శ్రీకృష్ణుని వృత్తాంతమును చెప్పుము. నీవు ఆయన దూతవని మాకు తెలుసు. పరాజయమునెరుగని శ్రీకృష్ణుడు సుఖముగా ఉన్నాడా? ఆయన ప్రేమ స్థిరము కాదు. మాకు చెప్పిన మాటలు ఆయనకు గుర్తులో ఉన్నాయా? మేమాయనను ఎందువలన ప్రేమిస్తున్నామో? క్షుద్రుని దూతవగు ఓ హంసా! కోరికలను తీర్చే ఆయనను ఇచ్చటకు పిలువుము. కాని, లక్ష్మిని మాత్రం తీసుకురావద్దు. స్త్రీలలో అనన్యప్రేమ గలది లక్ష్మి ఒక్కతేయేనా? (కాదు).

ఈ విధముగా యోగిపుంగవులకు ప్రభుడగు శ్రీకృష్ణ భగవానునిపై ఇటువంటి (అనన్య) ప్రేమను చేసి, ఆయన పత్నులు సర్వోత్కృష్టమగు మోక్షఫలమును పొందిరి.

అనంతములగు గానములు శ్రీకృష్ణుని అనేకవిధములుగా కీర్తించినవి. ఆయన గురించి విన్నంత మాత్రాన స్త్రీల మనస్సులు బలముగా ఆకర్షించబడును. ఆయనను చూస్తూ ఉండే ఆయన భార్యల మనస్సులు ఆకర్షించబడునని వేరుగా చెప్పవలయునా?

జగద్గురువగు శ్రీకృష్ణుని భార్యలు ఆయనకు భర్త అనే భావనతో ప్రేమతో చక్కగా పాదములను నొక్కుట మొదలగు పరిచర్యలను చేసిరి. వారి తపస్సును ఏమని వర్ణించవలెను?

సత్పురుషులకాశ్రయమగు శ్రీకృష్ణ భగవానుడీ విధముగా నిరంతరముగా వేదవిహితమైన ధర్మమునాచరిస్తూ, గృహమే ధర్మార్థకామములకు నిలయమని లోకమునకు ప్రదర్శించెను.

గొప్ప దైన గృహస్థధర్మముననుష్ఠించిన శ్రీకృష్ణునకు పదునారు వేల ఒక వంద (ఎనిమిది) మంది భార్యలు ఉండిరి.

ఓ పరీక్షిన్మహారాజా! యువతీలలామలగు వారిలో రుక్మిణి మొదలగువారు ఎనమండుగురు ప్రముఖులు. వారు, వారి పుత్రుల వివరములు ఇదివరలో చెప్పబడినవి.

జగన్నాథుడగు శ్రీకృష్ణుని సంకల్పము అమోఘము. తనకు ఎంతమంది భార్యలు గలరో వారియందు ఆయన ఒక్కొక్క భార్యయందు పదేసి పుత్రులను కనెను.

భయంకరమగు పరాక్రమము గల వారిలో పద్దెనిమిది మహారథులు విపులమగు కీర్తిని గడించిరి. వారి పేర్లను నేను చెప్పెదను. వినుము.

ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు (మనుమడు), దీప్తిమంతుడు, భానుడు, సాంబుడు, మధువు, బృహద్భానుడు, చిత్రభానుడు, వృకుడు, అరుణుడు, పుష్కరుడు, వేదబాహుడు, శ్రుతదేవుడు, సునందనుడు, చిత్రబాహుడు, విరూపుడు, కవి, న్యగ్రోధుడు అనునవి వారి పేర్లు.

మహారాజా! మధువును వధించిన శ్రీకృష్ణ భగవానుని పుత్రులగు వీరి లోనున్నూ రుక్మిణి పెద్ద కొడుకు ప్రద్యుమ్నుడు తండ్రిని పోలియుండెను.

మహారథుడగు ఆ ప్రద్యుమ్నుడు రుక్మియొక్క కుమార్తెను వివాహమాడెను. వారికి పదివేల ఏనుగుల బలము గల అనిరుద్ధుడనే పుత్రుడు కలిగెను.

రుక్మికి కూతురు కొడుకైన అనిరుద్ధుడు రుక్మి కొడుకు కూతురుని వివాహమాడెను. వారికి పుట్టినవాడు వజ్రుడు. ముసలము నిమిత్తముగా యదువంశము నాశనము కాగా, వజ్రుడు మాత్రమే మిగిలెను.

వజుని పుత్రుడు ప్రతిబాహుడు. ఆయన పుత్రుడు సుబాహుడు. ఆయన పుత్రుడు శాంత సేనుడు. ఆయన పుత్రుడు శతసేనుడు.

ఈ వంశమునందు దరిద్రులు, అధికసంతానము లేనివారు, తక్కువ ఆయుర్దాయము గలవారు, తక్కువ పరాక్రమము గలవారు, బ్రాహ్మణభక్తి లేనివారు పుట్టలేదు. ఇది నిశ్చయము.

ఓ పరీక్షిన్మహారాజా! యదువంశములో పుట్టి లోకప్రసిద్దమైన కర్మలను చేసిన వ్యక్తుల సంఖ్యను నిర్ధారించుట కొన్ని వేల సంవత్సరములచేనైననూ సంభవము కాదు.

యదువంశములోని బాలకులకు శిక్షణను గరపిన ఆచార్యుల సంఖ్య మూడు కోట్ల ఎనభై ఎనిమిది లక్షలు అని వినికిడి.

యాదవులు మహాత్ములు. వారి సంఖ్యను ఎవడు లెక్కించగలడు? ఆ ఉగ్ర సేనుని రాజ్యములో 1 00 00 00 00 00 000 (పది లక్షల కోట్ల) మంది జనులు ఉండిరి.

దేవాసురసంగ్రామములో మరణించిన భయంకరులగు రాక్షసులు మానవులై పుట్టి గర్వముతో ప్రజలను పీడించిరి.

ఓ పరీక్షిన్మహారాజా! వారిని శిక్షించుటకై శ్రీహరి దేవతలనాదేశించగా, వారు యదువంశములో జన్మించిరి. వారియొక్క వృష్టి-అంధక-ఇత్యాది కులము (మానవ సముదాయము) లు నూట ఒకటి ఉండెను.

ఆ యాదవులకు పాపములను పోగొట్టే శ్రీకృష్ణ భగవానుడే ప్రభువు, ఆదర్శము ఆయెను. సకలయాదవులు ఆయన ఆజ్ఞను పాలించి వర్ధిల్లిరి.

శ్రీకృష్ణునియందు లగ్న మైన చిత్తము గల యాదవులు పరుండుట, కూర్చుండుట, తిరుగుట, మాటలాడుట, క్రీడించుట, స్నానము, భోజనము ఇత్యాది క్రియలలో తమ దేహమును కూడ విస్మరించిరి.

శ్రీకృష్ణుడు యదువంశములో అవతరించి విస్తరింపజేసిన కీర్తిచే, ఆయన పాదములను కడిగిన దేవనది గంగ కూడ తక్కువ తీర్థముగా చేయబడినది. ఆయనను విద్వేషించినవారు, ప్రేమించినవారు కూడ ఆయన స్వరూపమును పొందిరి. ఇతరులు లక్ష్మీదేవికొరకై పాట్లు పడుచుండగా, ఆమె ఆయన సేవలో నిమగ్నమయ్యెను. ఆయన పేరు నుడివినా, విన్నా అమంగళములను పోగొట్టును. ఋషుల వంశములలో ధర్మమునాయన నిలబెట్టెను. కాలమనే చక్రమే ఆయుధముగా గల అట్టి శ్రీకృష్ణుడు భూమి బరువును తగ్గించుట ఆశ్చర్యమేమీ కాదు.

ప్రాణులకు ఆశ్రయమైన శ్రీకృష్ణ భగవానుడు దేవకికి కొడుకై పుట్టినాడనేది మాట వరుసకు చెప్పే మాట మాత్రమే. ఆయన పుట్టుక లేనివాడు. యాదవవీరులు ఆయన సేవకులు. ఆయన తన భుజబలముతో (అనుచరులే భుజములు కాగా) అధర్మమును పొరద్రోలేను. చరాచరప్రాణుల దుఃఖమును పోనాడే ఆయన చక్కని చిరునవ్వుతో శోభిల్లే ముఖముచే బృందావనము లోనే గాక మథురాది నగరములయందు కూడ యువతులకు ప్రేమభావమును, వర్ధిల్ల జేసెను. అట్టి శ్రీకృష్ణుడు సర్వోత్కర్షగానున్నాడు.

ఈ విధముగా పరమాత్మ తన వేదమార్గమును రక్షించగోరి విలాసగా దేహమును స్వీకరించి యాదవులలో శ్రేష్ఠుడగు శ్రీకృష్ణుడాయెను. ఆయన ఆ అవతారమునకు తగిన లీలలను చేసెను. ఈ పరమాత్మయొక్క పాదములయందాసక్తిని కోరే భక్తుడు పాపములను పోగొట్టే ఈ లీలలను శ్రవణము చేయవలెను.

 మోక్ష ప్రదాతయగు శ్రీకృష్ణునియొక్క శోభాయుక్తమగు గాథలను విని - కీర్తించుటచే వాటియందు ఆసక్తి కలుగును. అట్టి ఆసక్తిని ప్రతిక్షణము వర్ధిల్ల జేసుకొనే మానవుడు ఆ పరమేశ్వర స్వరూపమును పొంది, అతిక్రమించ శక్యము కాని కాలముయొక్క వేగమునుండి నివృత్తుడగును (అమృతత్వమును పొందును). ఆ మోక్షమును కోరియే మహారాజులు కూడ రాజ్యాదికమును విడిచి పెట్టి తపస్సు కై అడవికి వెళ్లిరి.

శ్రీమద్భాగవత మహాపురాణము పదవ స్కంధము ఉత్తరార్ధములో

శ్రీకృష్ణ భగవానుని లీలావిహారమును వర్ణించే

తొంబదియవ అధ్యాయము ముగిసినది.

దశమ స్కంధము ఉత్తరార్ధము ముగిసినది.

హరిః ఓమ్, తత్సత్, శ్రీకృష్ణార్పణమస్తు.