శ్రీ మద్భాగవతము - దశమ (10వ) స్కందము
56 - స్యమంతకమణి వృత్తాంతము
శ్రీశుక మహర్షి ఇట్లు పలి కెను --- శ్రీకృష్ణుని యెడల అపరాధము చేసిన సత్రాజిత్తు స్వయముగా ప్రయత్నము చేసి తన కుమార్తెను సమంతకమనే మణితో సహా ఆయనకిచ్చి వివాహము చేసెను.
రాజు ఇట్లు పలి కెను --- ఓ మహర్షీ! సత్రాజిత్తు శ్రీకృష్ణుని యెడల చేసిన అపరాధమెట్టిది? ఆతనికి స్యమంతకమణి ఎక్కడిది? ఆయన శ్రీకృష్ణభగవానునకు కుమార్తెనిచ్చి వివాహము చేయుటకు కారణమేమి?
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- సత్రాజిత్తు గొప్ప సూర్యభక్తుడు. సూర్యునికి కూడ ఆయనంటే ప్రీతి. ఆయన భక్తికి సంతోషించి సూర్యుడాయనకు సమంతక మణిని ఇచ్చెను.
ఓ పరీక్షిన్మహారాజా! ఆతడా మణిని మెడలో దాల్చి సూర్యుడు వలె ప్రకాశిస్తూ ద్వారకకు వచ్చెను. తేజస్సు కారణముగా జనులాతనిని కన్నెత్తి చూడ (గుర్తించ) లేకపోయిరి.
జనులాయనను దూరమునుండి చూచినని తలపోసిరి. ఎందుకంటే, ఆయన తేజస్సు వారి చూపును అపహరించెను. వారు పాచికలాడుచున్న శ్రీకృష్ణ భగవానునకు విన్నవించిరి.
ఓ నారాయణా! నీవు శంఖచక్రగదాధారివి. నిన్ను యశోద త్రాటితో నడుమునందు కట్టివేసెను. గోవిందా! పద్మములవంటి కన్నులు గల నీవు యదువంశమునానందింప జేయుచున్నావు. నీకు నమస్కారమగు గాక!
ఓ జగన్నాథా! వాడి కిరణములు గల ఈ సూర్యుడు నిన్ను చూడగోరి వచ్చుచున్నాడు. ఆయన కాంతి మండలము జనుల కన్నులకు మిరుమిట్లు గొల్పి చూడ లేకుండా చేయుచున్నది.
ఓ ప్రభూ! గొప్ప గొప్ప దేవతలు కూడ ముల్లోకములలో నిన్ను పొందే ఉపాయమును గురించి అన్వేషించెదరు సుమా! నీవు యాదవులలో రహస్యముగా ఉన్నావని తెలిసి నిన్ను చూచుటకై సూర్యుడు వస్తున్నాడు.
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- పద్మములవంటి కన్నులు గల శ్రీకృష్ణుడు అమాయకులగు ఆ జనుల మాటను విని నవ్వి, ఇట్లు చెప్పెను -- ఈతడు సూర్యభగవానుడు కాడు; మణితో ప్రకాశించుచున్న సత్రాజిత్తు.
సత్రాజిత్తు రాకను పురస్కరించుకొని ఆతని ఇంటిలో మంగళోత్సవము చేయబడెను. ఆయన శోభాయుక్తమైన స్వగృహములో ప్రవేశించి, దేవుని పూజామందిరములో వేదవేత్తలచే స్యమంతకమణిని స్థాపింపజేసెను.
ఓ పరీక్షిన్మహారాజా! ఆ స్యమంతకమణి ప్రతిదినము ఎనిమిది బారువుల బంగారమును ఉత్పన్నము చేయును. దానిని ఎక్కడ స్థాపించి పూజిస్తారో అక్కడ కరువు, మారకరోగములు, గ్రహపీడలు, పాములు, మనోవ్యాధులు, రోగములు, అమంగళములు, చోరులు ఉండరు.
ఒకప్పుడు శూరవంశీయుడగు శ్రీకృష్ణుడు సత్రాజిత్తును ఆ మణిని యాదవప్రభుడగు ఉగ్రసేనుని కొరకు ఇండని కోరెను. ఆయన కోరికకు భంగమును కలిగించకూడదనే వివేకము ధనలోభియగు సత్రాజిత్తునకు లేకుండెను. ఆతడా కోరికను మన్నించనే లేదు.
ఒకనాడు ప్రసేనుడు (సత్రాజిత్తు సోదరుడు) గొప్ప కాంతి గల ఆ మణిని మెడలో కట్టుకొని గుర్రమెక్కి అడవిలో వేటాడుతూ సంచరించెను.
ఒక సింహము ప్ర సేనుని, గుర్రమును చంపి ఆ మణిని లాగుకొని కొండ ఎక్కుతూంటే, ఆ మణిని కోరి జాంబవంతుడు దానిని చం పెను.
ఆ జాంబవంతుడున్నూ మణిని గుహలో తన పిల్లవానికి ఆటవస్తువుగా చే సెను. అన్నగారు సత్రాజిత్తు తన తమ్ముడు కానరాకుండుటచే చాల దుఃఖమును పొందెను.
నా తమ్ముడు మణిని మెడలో పెట్టుకొని అడవికి వెళ్లినాడు. వానిని బహుశః శ్రీకృష్ణుడే చంపి ఉండును, అని ఆ సత్రాజిత్తు అనెను. ఆ మాటను విని జనులు ప్రతివాని చెవిలో గుసగుసలాడిరి.
శ్రీకృష్ణ భగవానుడు తన పై చల్లబడిన ఆ బురద (అపకీర్తి) ను గురించి వినేను. ఆయన దానిని తుడిచివేయుటకై కొందరు పురజనులతో కూడి ప్రసేనుని ఆచూకీని వెదుక్కుంటూ అడవికి వెళ్లాను.
అడవిలో సింహముచే చంపబడిన ప్రసేనుని, వాని గుర్రమును జనులు చూచిరి. ఆ తరువాత కొండ శిఖరము పై జాంబవంతునిచే చంపబడిన ఆ సింహమును కూడ జనులు చూచిరి.
జాంబవంతుని గుహ కళ్లు పొడుచుకున్నా కానరాని చీకటితో నిండి భయమును గొల్పుచుండెను. శ్రీకృష్ణ భగవానుడు జనులను బయట నిలబెట్టి తానొక్కడే ఆ గుహలో ప్రవేశించేను.
ఆ గుహలో పిల్లవానికి ఆటవస్తువుగా చేయబడిన ఆ గొప్ప మణిని ఆయన చూచెను. దానిని తీసుకొని నిశ్చయించి, ఆయన పిల్లవాని దగ్గరకు వెళ్లి నిలబడెను.
ఇదివరలో ఎన్నడూ చూడని ఆ మనిషిని చూచి దాది భయపడినది వలె అరిచెను. బలవంతులలో శ్రేష్ఠుడగు జాంబవంతుడు ఆ అరుపు విని కోపించి పరుగెత్తుకు వచ్చెను.
ఆ జాంబవంతుడు కోపించిన కారణముగా, (రామావతారములో) తన ప్రభువగు శ్రీకృష్ణ భగవానుని ప్రభావమును గుర్తించలేకపోయెను. ఆయన మామూలు మనిషి అని తలచి, ఆతడాయనతో యుద్దమునకు దిగెను.
ఒకరినొకరు జయించగోరే వారిద్దరు, మాంసము కొరకు డేగలవలె, మిక్కిలి సంకులమైన ద్వంద్వయుద్ధమును చేసిరి. ఆయుధములతో ప్రారంభ మైన ఆ యుద్ధము రాళ్లతో, చెట్లతో, భుజములతో కొనసాగెను.
వారు ఒకరినొకరు పిడుగుపాటువంటి పిడిగుద్దులతో కొట్టుకుంటూ రాత్రింబగళ్లు విశ్రాంతి లేకుండా ఇరవై ఎనిమిది రోజులు యుద్ధము చేసిరి.
శ్రీకృష్ణుని పిడిగుద్దులచే జాంబవంతుని అవయవములు, కీళ్లు నుగ్గు నుగ్గు ఆయెను. ఆతనికి బలము క్షీణించి, దేహము చెమటతో తడిసి ముద్దాయెను. ఆతడు చాల ఆశ్చర్యపడి శ్రీకృష్ణునితో నిట్లనెను.
సకలప్రాణులలోని ప్రాణశక్తి, ఇంద్రియ శక్తి, మనశ్శక్తి, దేహశక్తి నీవే. సకలజగత్తును సృష్టించి పాలించే సర్వసమర్థుడగు విష్ణువు నీవేనని నేను గుర్తు పట్టుచున్నాను. పూర్ణ బ్రహ్మవు నీవే.
జగత్తును సృష్టించే ప్రజాపతులను సృష్టించేది నీవే. సృష్టించబడే పంచభూతములు మొదలగువాటి సత్త యేది గలదో అది నీవే. కాలస్వరూపుడవగు నీవు ఇంద్రాదిప్రభువులను కూడ శాసించెదవు. జీవుల అంతరతమమగు ఆత్మవు నీవే..
కొంచెము పైకి వచ్చిన కోపముతో నీవు చూసిన చూపులకు సముద్రములోని మొసళ్లు, తిమింగిలములు క్షోభిల్లగా, సముద్రుడు దారిని ఇచ్చెను. దానిపై కట్టిన సేతువు నీ కీర్తిని చాటుచునే యున్నది. నీవు లంకను నాశము చేసితివి. నీ బాణములచే కొట్టబడిన రాక్షసుల తలలు నేల గూలినవి.
ఓ పరీక్షిన్మహారాజా! ఈ విధముగా శ్రీకృష్ణ భగవానుని స్వరూపమును జాంబవంతుడు గుర్తించెను. దేవకీసుతుడగు అచ్యుతుడాయనతో నిట్లనెను.
పద్మములవంటి కన్నులు గల శ్రీకృష్ణుడు గొప్ప దయతో తన సుఖకరమైన చేతితో భక్తు డైన ఆ జాంబవంతుని దేహమును స్పృశించి,ప్రేమతో గంభీరమైన వాక్కుతో నిట్లనెను.
ఓ జాంబవంతా! నేను మణి కొరకై ఈ గుహకు వచ్చితిని. నేనీ మణితో నాకు కలిగిన అసత్యమగు అపవాదును తుడిచివే సెదను.
శ్రీకృష్ణుడిట్లు పలుకగా, ఆ జాంబవంతుడు ఆయనను పూజించుటకై మణితో బాటుగా తన పెళ్లి కాని కుమార్తెయగు జాంబవతిని ఆనందముతో సమర్పించెనట.
జనులు పన్నెండు రోజులు వేచి చూచినా గుహలో ప్రవేశించిన శ్రీకృష్ణుడు బయటకు రాలేదు. అప్పుడు వారు దుఃఖితులై తమ నగరమునకు తిరిగి వెళ్లిరి.
శ్రీకృష్ణుడు గుహనుండి బయటకు రాలేదని విని దేవకీదేవి, రుక్మిణి, వసుదేవుడు, మిత్రులు, బంధువులు దుఃఖించిరి.
దుఃఖితులైన ఆ ద్వారకానగరవాసులు సత్రాజిత్తును తిట్టిపోసిరి. వారు జగత్కారణమగు మాయాశక్తి యైన దుర్గాదేవిని, శ్రీకృష్ణుడు శీఘ్రముగా తిరిగి రావాలని ప్రార్థించిరి.
వారు దేవిని ప్రార్థించగా ఆమె ఆశీస్సులనిచ్చెను. దానిచే ఆ శ్రీకృష్ణ భగవానుడు సిద్ధించిన ప్రయోజనము (అపవాదును తుడిచివేయుట) గలవాడై భార్యయగు జాంబవతితో సహా వారికి కనబడెను. వారు చాల ఆనందించిరి.
ఇంద్రియాధిపతియగు శ్రీకృష్ణ భగవానుడు మరణించినవాడు తిరిగి వచ్చినాడా యన్నట్లు వారికి మెడలో మణితో భార్యతో సహా కనబడెను. వారందరు గొప్ప ఉత్సవమును చేసుకొనిరి..
శ్రీకృష్ణ భగవానుడు ఉగ్ర సేన మహారాజు సన్నిధిలో సభకి సత్రాజిత్తుని ఆహ్వానించి, మణి దొరికిన విధమును చెప్పి, ఆయనకు సమర్పించెను.
ఆ సత్రాజిత్తైతే శ్రీకృష్ణుని వద్దనుండీ మణిని తీసుకొని చాల సిగ్గు పడి తన తప్పునకు పశ్చాత్తాపపడూ తల వంచుకొని తన మహలుకు వెళ్లాను.
బలవంతులగు యాదవులతోడి విరోధము వలన ఆ సత్రాజిత్తు మనస్సు వ్యాకులమాయెను. ఆయన తన ఆ అపరాధమును గురించియే తలపోయుచుండెను. నా తప్పును ఏ విధముగా తుడిచివేయవలెను? శ్రీకృష్ణ భగవానుడు ప్రసన్నుడయ్యే విధమెది? అని చింతిల్లెను.
నేను ముందు చూపు లేని అవివేకిని, ధనమునందు లోభము గల అల్పుడను. నేను ఏమి చేసినచో, నాకు మంగళము కలుగును? జనము నన్ను తిట్టకుందురు?
ఆయనకు స్త్రీలలో రత్న మైన కుమార్తెను, స్యమంతకమణిని కూడ ఇచ్చెదను. ఇదియే చక్కని ఉపాయము. ఇట్లు చేయనిచో, నా అపరాధమును ఇంకో విధముగా తుడిచివేయుట సంభవము కానే కాదు.
సత్రాజిత్తు తన మనస్సులో ఈ విధముగా నిశ్చయించుకొని తనంత తానే పూనుకొని (వసుదేవాదులను సంప్రదించి) కల్యాణియగు కుమార్తె సత్యభామను, సమంతకమణిని కూడ శ్రీకృష్ణునకు సమర్పించెను.
ఆ సత్యభామను వివాహము చేసుకొనవలెనని ఇదివరలో (కృతవర్మ మొదలగువారు) చాలమంది ఉవ్విళ్లూరిరి. సచ్ఛీలము, అందము, పెద్ద మనసు అనే గుణములను కలిగియున్న ఆమెను శ్రీకృష్ణ భగవానుడు యథావిధిగా వివాహము చేసుకొనెను.
ఓ పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణ భగవానుడిట్లు పలి కెను - నేను స్యమంతకమును తీసుకోను. సూర్యదేవుని భక్తుడవగు తమరివద్దనే అది ఉండవలెను. కాని, దాని - ఫలము (బంగారము) మాకు లభించుచునే యుండును.
శ్రీమద్బాగవత మహాపురాణము పదవ స్కంధములో స్యమంతక
వృత్తాంతమును వర్ణించే ఏబది ఆరవ అధ్యాయము ముగిసినది .
