శ్రీ మద్భాగవతము - దశమ (10వ) స్కందము
43 - శ్రీకృష్ణుడు కువలయాపీడమునుద్ధరించి మల్లరంగములో ప్రవేశించుట
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- శత్రువులను తపింపజేసే ఓ రాజా! తరువాత బలరాముడు శ్రీకృష్ణుడు స్నానాదికమును ముగించిరి. వారు మల్లుల ధ్వనులను, దుందుభుల ధ్వనులను విని, చూచుటకై విచ్చేసిరి.
శ్రీకృష్ణుడు మల్లరంగము యొక్క ద్వారమును సమీపించి అక్కడ కువ లయాపీడమనే ఏనుగును చూచెను. అది మావటీనిచే నియంత్రించబడెను.
శూరవంశోద్భవుడగు శ్రీకృష్ణుడు నడుము కట్టును బిగించి గిరజాల ముంగురులను కలిపి కట్టెను. ఆయన మేఘగర్జన వలె గంభీరమైన వాక్కుతో మావటీనితో నిట్లనెను.
ఓ మావటీ! ఓ మావటీ! విలంబము లేకుండా ప్రక్కకు జరిగి మా ఇద్దరికీ దారిమ్ము. లేనిచో, నిన్నీ నాడు ఏనుగుతో సహా యమపురికి పంపెదను.
ఈ విధముగా శ్రీకృష్ణుడు అదలించగా, మావటివానికి కోపము వచ్చెను. ఆతడు (అంకుశముతో పొడిచి) ఏనుగునకు కోపము వచ్చునట్లు చేసెను. అడి. కాలముచే ప్రాణుల ఆయుర్దాయమును హరించే యముని పోలియుండెను. దానిని ఆతడు కృష్ణుని పైకి తోలెను.
ఆ గజేంద్రము ఆ శ్రీకృష్ణునకు అభిముఖముగా పరుగెత్తి తొండముతో వేగముగా ఆయనను పట్టుకొనెను. ఆయన దానిని పిడికిలితో కొట్టి తొండమునుండి విడిపించుకొని, కాళ్ల మధ్య దూరి దానికి కానరాకుండెను.
బాగా కోపించిన ఆ ఏనుగు ఆ ఏనుగు ఆ శ్రీకృష్ణ భగవానుని కంటితో చూడలేకపోయినా, ముక్కుతో పసిగట్టి తొండముతో వెదికి పట్టుకొనెను. ఆయన బలముగా దాని పట్టునుండి తప్పించుకొనెను.
మహాబలశాలియగు ఆ ఏనుగును శ్రీకృష్ణుడు తోక పట్టుకొని, గరుడుడు సర్పమును వలె, అవలీలగా ఉన్నదానిని ఉన్నట్లుగా ఇరవై ఐదు ధనుస్సుల (వంద బారల) దూరమును లాగివేసెను.
ఆ ఏనుగు కుడి యెడమలకు తిరుగుచుండగా ఆ శ్రీకృష్ణ భగవానుడు కూడ, చుట్టూ తిరుగుచున్న దూడ తోక పట్టుకున్న పిల్లవాడు (ఒకప్పటి బాలకృష్ణుడు) వలె, ఎడమ కుడివైపులకు తిరిగెను.
తరువాత ఆయన ఆ ఏనుగునకు ఎదురుగా వచ్చి చేతితో కొట్టి చుట్టూ గట్టిగా పరుగెత్తుతూ, అది వేసే ప్రతి అడుగునందు తాను దానికి దొరికిపోయినాడా యన్నట్లు కనబడుతూ, దానినే పడగొట్టెను.
ఆయన పరుగెత్తుతూ నేలపై పడెను. కోపించియున్న ఆ ఏనుగు ఆయన పడి ఉన్నాడనే తలచి రెండు దంతములతో పొడిచెను. కాని, ఆయన ముందు క్షణమే లేచి క్షణమే లేచి తప్పించుకొనుటచే దెబ్బ నేలకు తగిలెను.
ఆ గజేంద్రము యొక్క పరాక్రమము వ్యర్థము కాగా, దానికి చాల కోపము వచ్చెను. పైగా, మావటీండ్రు దానిని రెచ్చగొట్టుచుండిరి. అప్పుడది కోపముతో శ్రీకృష్ణునకభిముఖముగా పరుగెత్తెను.
మధువు అనే రాక్షసుని సంహరించిన శ్రీకృష్ణ భగవానుడు మీదకు ఉరుకుచున్న ఆ ఏనుగును సమీపించి, దాని తొండమును చేతితో గట్టిగా పట్టుకొని నేలపై పడవేసెను.
శ్రీకృష్ణ భగవానుడు సింహము వలె అవలీలగా, క్రింద పడిన ఆ ఏనుగు యొక్క దంతమునూడబెరకి దానితో ఏనుగును, మావటీండ్రను కూడ సంహరించెను.
శ్రీకృష్ణుడు మరణించిన ఏనుగును విడిచి పెట్టి చేతిలో దంతముతో మల్లరంగమును ప్రవేశించి దంతమును భుజముపై నుంచెను. ఆయన శరీరముపై ఏనుగు మదము, రక్తము డాగులు పడెను. పద్మమువంటి ముఖము పై మొలకెత్తుచున్న చెమట బిందువులతో ఆయన శోభిల్లెను.
ఓ సరీక్షిన్మహారాజా! బలదేవుడు, దుష్టజనశిక్షకుడగు శ్రీకృష్ణ భగవానుడు శ్రేష్ఠమగు ఏనుగు దంతమే ఆయుధము కాగా, మల్లరంగ మును ప్రవేశించిరి. కొద్దిమంది గోపాలకులు వారిని చుట్టువారి యుండిరి.
శ్రీ కృష్ణుని మల్లులు పిడుగని, సామూన్యజసులు గొప్ప మనిషియని, యువతులు రూపు, దాల్చిన మన్మథుడని, గోపాలకులు తమ వాడని, దుష్టులైన రాజులు తమను శిక్షించువాడని, తల్లిదండ్రులు పిల్లవాడని, భోజరాజగు కంసుడు మృత్యువని, అజ్ఞానులు ప్రాకృతమానవుడని, యోగులు పరమాత్మతత్త్వమని భావించెడివారు. ఆయన అన్నగారితో
కలిసి మల్లరంగమును ప్రవేశించెను.
ఓ పరీక్షిన్మహారాజా! ధైర్యశాలియే. కువలయాపీడమును సంహరించి జయింప శక్యము కాకుండా నిలబడి యున్న వారిద్దరిని చూచి ఆతడు అధికమైన ఉద్వేగమును పొందెను.
గొప్ప భుజశక్తి గల వారిద్దరు మల్లరంగమును చేరి గొప్ప వేషము వేసుకున్న నటులు వలె ప్రకాశించిరి. వారు రంగు రంగుల వేషములను, ఆభరణములను, పుష్పమాలలను, వస్త్రములను ధరించిరి. వారు తమ కాంతిచే చూచువారల మనస్సును దోచివేయుచుండిరి.
ఓ పరీక్షిన్మహారాజా! నగరమునుండి పల్లెలనుండి వచ్చి ఆసనములపై కూర్చున్న జనులు ఆ పురుషోత్తములిద్దరిని చూచి మహానందమును పొందిరి. వారి కన్నులు, ముఖములు విప్పారెను. వారు వారిద్దరి ముఖమును కళ్లతోనే పానము చేసిరి. అయిననూ, వారికి తృప్తి కాలేదు.
జనులు వారిద్దరిని కళ్లతో త్రాగుచున్నారా యన్నట్లు, నాలుకతో ఆస్వాదించుచున్నారా యన్నట్లు, ముక్కు పుటములతో ఆఘ్రాణించుచున్నారా యన్నట్లు, చేతులతో కౌగిలించుచున్నారా యన్నట్లు చూచిరి.
వారిద్దరి రూపమును, సద్గుణములను, మాధుర్యమును, నిర్భయత్వమును, నైపుణ్యమును చూచి జనులకు వారి లీలలు గుర్తుకు వచ్చినట్లుండెను. జనులు వారిద్దరి గురించి తాము చూచిన (ధను ర్భంగాది) దానిని, విన్న (గోవర్ధనోద్ధరణాది) దానిని ఒకరితోనొకరు చెప్పిరి.
దుఃఖములను పోగొట్టే నారాయణ భగవానుడే సాక్షాత్తుగా ఈ లోకములో వీరిద్దరి రూపములో వసుదేవుని ఇంటియందు తన అంశ (స్వరూపము) చే అవతరించెను సుమా!
ఈ శ్రీకృష్ణుడైతే దేవకికి పుట్టినవాడు. ఈతనిని వసుదేవుడు గోకులమునకు కొనిపోయెను. అచట నందుని ఇంట్లో ఈతడు ఇంత కాలము రహస్యముగా ఉంటూ పెరిగి పెద్దవాడాయెను.
పూతన, సుడిగాలి రూపము గల తృణావర్తుడు, శంఖచూడుడు, కేశి, ధేనుకుడు, ఇంకా ఇట్టి రాక్షసప్రవృత్తి గల ఇతరులు (అఘాసురుడు ఇత్యా దులు, ఈతనిచే వధించబడిరి. ఈతడు జంట మద్ది చెట్లను నేల గూల్చెను.
ఈతడు గోవులకు రక్షకుడు. ఈతడు వాటిని కార్చిచ్చునుండి కాపాడినాడు. ఈతడు కాలియసర్పము యొక్క పొగరును అణచినాడు. ఈతడు ఇంజునకు కూడ గర్వభంగమును చేసినాడు.
ఈతడు పెద్ద కొండను ఏడు రోజులు నిరంతరముగా ఒక్క చేతితో ఎత్తి పట్టుకొని గోకులమును వర్షము, సుడిగాలి, పీడుగులనుండి కాపాడెను.
ఈతని ముఖము పై ఆనందము, చిరునవ్వుతో కూడిన చూపులు ఎల్లవేళలా ఉండును. గోపికలు ఈతని ముఖమును చూస్తూ పలు రకముల దుఃఖములను శ్రమ లేకుండా ఆనందముతో అధిగమించిరి.
ఈతడు యదువంశమును అన్ని విధములుగా రక్షించుననియు, వీని చాల గొప్ప ప్రసిద్ధి గల వంశము సంపదను, కీర్తిని, గొప్పదనమును కూడ పొందగలదని పెద్దలు చెప్పుచున్నారు.
పద్మమువంటి కన్నులతో శోభిల్లే ఈతడు ఈ శ్రీకృష్ణుని అన్నయగు బలరాముడు. ప్రలంబుడు, వత్సాసురుడు, బకుడు, ధేనుకుడు మొదలైన రాక్షసులను ఈతడు సంహరించెను.
జనులు ఇట్లు చెప్పుకొనుచుండిరి. వాద్యములు మ్రోగుచుండెను. అప్పుడు శ్రీకృష్ణ బలరాములను సంబోధించి చాణూరుడిట్లు పలికెను.
నందుని పుత్రుడవగు ఓ శ్రీకృష్ణా! ఓ బలరామా! మీరిద్దరు వీరులని పేరు వడసినవారు, వీరులచే సమ్మానించబడువారు. మీరు మల్ల యుద్ధములో నిపుణులని విని కంసప్రభుడు చూడ గోరి ఆహ్వానించినాడు.
రాజునకు మనోవాక్కాయములతో ప్రీతిని కలిగించే నిశ్చయముగా శ్రేయస్సును పొందెదరు. దీనికి విరుద్ధముగా ఆచరించువారు హానిని పొందెదరు.
గోపాలకులు దూడలను కాయుదురు. ఆనందముగా జీవించెదరు. వారు అడవులలో ప్రతిదినము గోవులను మేపుతూ మల్లయుద్ధమును ఆటగా ఆడెదరు. ఈ విషయము అందరికీ తెలిసినదే.
ఓయీ! కాబట్టి మీరు మేము కూడ రాజునకు ప్రీతిని కలిగించెదము. అట్లు చేసినచో, రాజు (సకలప్రాణిరక్షకుడు) సకల ప్రాణి రూపుడు గనుక, సకల ప్రాణులు మన యెడల ప్రసన్నములగును.
ఆ మాటను విని శ్రీకృష్ణుడు మల్లయుద్ధము తమకు కూడ అభీష్టమేనని తలపోసెను. ఆయన వానికి తన అనుమోదమును తెలిపి దేశకాలములకు తగిన మాటను ఇట్లు పలికెను.
అడవులలో తిరిగే మేము కూడ భోజదేశప్రభువగు ఈ కంసుని ప్రజలమే. కావున, మేము ఎల్లవేళలా వీనికి ప్రియమును చేసెదము. పైగా, అట్లు రాజునకు ప్రీతిని కలిగించుట మాకు గొప్ప అనుగ్రహము. (మేము రాజునకు ప్రియమగు మల్లయుద్ధమును నిత్యము అడవిలో చేయుట మాపై ఈశ్వరుని గొప్ప అనుగ్రహమే).
ఓ మల్లా! మేము పిల్లలము. కాబట్టి ఔచిత్యమునతిక్రమించకుండా మాతో సమానమైన బలము గలవారితో మేము మల్లయుద్ధక్రీడను చేయగలము. సభాసదులకు అధర్మము (అన్యాయమును చూచుట) అంటుకోనివిధముగా మల్లయుద్ధము జరుగవలెను.
చాణూరుడిట్లు పలికెను --- నీవు, బలరాముడు పాలు త్రాగే పిల్లలు కాదు, వీధిలో ఆటలాడే పిల్లలు కాదు. మీరిద్దరు బలవంతులలో శ్రేష్ఠులు. వేయి ఏనుగుల బలము గల కువలయాపీడమును నీవు అవలీలగా చంపితివి.
కావున, బలశాలురగు మీరిద్దరు మల్లయుద్ధమును చేయవలెను. దీనిలో నిశ్చయముగా అన్యాయము లేదు. వృష్ఠి వంశీయుడవగు ఓ కృష్ణా! నీ పరాక్రమమును నాపై చూపుము. ముష్టికుడు బలరామునితో యుద్ధమును చేయగలడు.
శ్రీ మద్బాగవత మహాపురాణము పదవ స్కంధములో
శ్రీకృష్ణుడు కువలయాపీడము నుద్ధరించి మల్లరంగములో ప్రవేశించుటను వర్ణించే
నలుబది మూడవ అధ్యాయము ముగిసినది (43).
