శ్రీ మద్భాగవతము - దశమ (10వ) స్కందము

Table of Contents

78 - దంతవక్త్ర విదూరథుల ఉద్దారము

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- దుర్బుద్ధియగు దంతవక్తూడు పరలోకమును పొందిన శిశుపాల శాల్వ పౌండ్రకుల యెడల వారి పరోక్షములో మైత్రిని నెరపుచుండెను.

ఓ పరీక్షిన్మహారాజా! గొప్ప బలము గల దంతవక్తూడు బాగా కోపించి ఒక్కడే పాదచారియై చేతిలో గదతో (ద్వారకలో) ప్రత్యక్షమయ్యెను. ఆతడు నడుస్తూంటే భూమి కంపించెను.

ఆ విధముగా వచ్చుచున్న దంతవక్తని శ్రీకృష్ణుడు చూచెను. ఆయన వేగముగా గదను తీసుకొని రథమునుండి క్రిందకు దుమికి, చెలియలి కట్ట సముద్రమును వలె, వానిని నిలువరించెను.

మిక్కిలి గర్వించియున్న కరూషదేశాధిపతియగు దంతవక్తుడు గదను పైకెత్తి శ్రీకృష్ణ భగవానునితో నిట్లెనెను --- మహానందము! ఈ నాటికి నీవు నా కంట బడితివి.

ఓ కృష్ణా! నీవు మాకు మేనమామ కొడుకువి. కాని, నీవు నా మిత్రులకు ద్రోహము చేసి, నన్ను చంప గోరుచున్నావు. ఓ మూర్ఖ! కావుననే, నేను వజ్రమును పోలిన గదతో నిన్ను సంహరించగలను.

ఓ అజ్ఞానీ! దేహమునందు సంచరించే వ్యాధి వలె, నీవు బంధు రూపములో నున్న శత్రువు. మిత్రులయందు నాకు ప్రీతి మెండు. నేను నిన్ను సంహరించి, ఆ విధముగా మిత్రుల ఋణమును తీర్చుకొనెదను.

ఆతడీ విధముగా శ్రీకృష్ణుని పరుషవచనములతో, అంకుశము మొదలగువాటితో ఏనుగును వలె, బాధ పెడుతూ తల పై. గదతో కొట్టి సింహము వలె నాదమును కూడ, చేసెను.

యదువంశ శ్రేష్ఠుడగు శ్రీకృష్ణుడు యుద్ధములో గదచే కొట్టబడిననూ చలించకుండా, బరువైన కౌమోదకీ గదతో వానిని వక్షఃస్థలము పై కొట్టెను.

దంతవక్తుని హృదయము గద దెబ్బకు పగిలి ఆతడు నోటిగుండా రక్తమును గ్రక్కుతూ జుట్టు విరబోసుకొని, చేతులను కాళ్లను చాచి నేల పై పడి మరణించెను.

ఓ పరీక్షిన్మహారాజా! తరువాత మిక్కిలి సూక్ష్మమైన అద్భుతతేజస్సు, చేదిరాజగు శిశుపాలుని వధ సందర్భములో వలెనే, సకలప్రాణులు చూచుచుండగా శ్రీకృష్ణునియందు ప్రవేశించెను.

వాని సోదరుడు విదూరథుడు. ఆతడు తన సోదరుని వధచే శోకసముద్రములో మునిగిపోయెను. ఆతడు కత్తి డాలు పట్టుకొని నిట్టూర్పులు విడుస్తూ శ్రీకృష్ణుని వధించాలనే కోరికతో వచ్చెను.

ఓ పరీక్షిన్మహారాజా! ఆ విదూరథుడు కుండలములను, కిరీటమును దాల్చి శ్రీకృష్ణుని మీదకు వచ్చుచుండగా, ఆయన పదునైన ధారగల చక్రముతో వాని తలను కూడ నరికివే సెను.

సౌభవిమానముతో కూడిన శాల్వుడు, దంతవక్తడు, వాని సోదరుడగు విదూరథుడు అను వీరిని ఇతరులు సుతరాము సహించలేరు. వీరిని సంహరించి శ్రీకృష్ణుడు దేవతల, మానవుల ప్రశంసలనందుకొనెను.

మహర్షులు, సిద్ధులు, గంధర్వులు, విద్యాధరులు, మహానాగులు, అప్స రసలు, పితృదేవతల గణములు, యక్షులు, కిన్నరులు, చారణులు శ్రీకృ ష్ణుని విజయమును కీర్తించి పూలను వర్షించిరి. యాదవశ్రేష్ఠులు చుట్టువారి రాగా ఆయన అలంకరించబడిన ద్వారకానగరమును ప్రవేశించెను.

శ్రీకృష్ణ భగవానుడు యోగులకు ప్రభువు, జగత్తునకు శాసకుడు. పశువుల వంటి అజ్ఞానుల దృష్టిలో ఆయన జయించబడినాడని కనబడును. కాని, ఆయన సర్వోత్కృష్టుడుగనే యున్నాడు.

కౌరవపాండవుల యుద్ధసన్నాహమును గురించి విని బలరాముడు ఉదాసీనుడుగా నుండెను. ఆయన పుణ్యనదులయందు స్నానమనే మిషతో పయనమయ్యెను.

బలరాముడు బ్రాహ్మణులతో కూడి ప్రభాస క్షేత్రములో స్నానము చేసి, దేవతలకు పితృదేవతలకు మహర్షులకు తర్పణములనిచ్చి, జనులకు భోజనాదులచే తృప్తిని కలిగించెను. తరువాత ఆయన ప్రవాహమునకు అభిముఖముగా సరస్వతీనది ఉధమస్థానమునకు వెళ్లెను.

ఆయన పృథూదకము, బిందుసరస్సు, త్రితకూపము, సుదర్శనతీర్థము, విశాలతీర్థము, బ్రహ్మతీర్థము, చక్రతీర్థము, తూర్పుగా ప్రవహించే సరస్వతీనది అనే తీర్థములను సందర్శించెను.

భరతవంశీయుడవగు పరీక్షిన్మహారాజా! యమునాగంగానదుల తీరము నందలి క్షేత్రములను, నైమిష క్షేత్రమును కూడ బలరాముడు దర్శించెను. నైమిషములో అప్పుడు మహర్షులు సత్రయాగమును చేయుచుండిరి.

దీర్ఘమగు సత్రయాగమును చేయుచున్న మహర్షులు ఆ బలరాముడు వచ్చినాడని తెలిసి లేచి నమస్కరించి వచ్చినందులకు అభినందించి ఆయనకు యథోచితమగు సత్కారమును కూడ చేసిరి.

పరిజనులతో కూడియున్న ఆ బలరాముడు సత్కారములనందుకొని ఆసనముపై కూర్చుండెను. అపుడు వ్యాసమహర్షి శిష్యుడగు రోమహర్షణుడు కూర్చుని యుండగా ఆయన చూచెను.

సూతజాతికి చెందిన రోమహర్షణుడు లేచి ఎదు రేగలేదు, చేతులొగ్గి నమస్కరించలేదు. పైగా, ఆయన ఆ వేదవేత్తలకంటే ఎత్తైన ఆసనముపై కూర్చుండెను. ఆయనను చూచి బలరాముడు కోపించెను.

అశాస్త్రీయమగు కలయికచే పుట్టిన ఈ దుర్బుద్ధి ధర్మరక్షకులగు ఈ వేదవేత్తలకంటే, మాకంటె కూడ ఎత్తైన ఆసనముపై కూర్చుండుటకు కారణమేమి? ఈతడు వధించ దగినవాడు.

ఈయన పూజనీయుడగు వ్యాసమహర్షికి శిష్యుడై అనేకములగు ధర్మ శాస్త్రములను, ఇతిహాసములను, పురాణములను అన్నింటినీ చదివెను.

ఈతడు ఉద్దండుడు, వినయము లేనివాడు, వ్యర్థముగా పండితుడనని విర్రవీగువాడు. మనోజయము లేని ఈతని విద్య, నటుని చేష్టలు వలె, అభినయమే గాని, ప్రయోజనకారి కాదు.

ఎందుకంటే, నేనీ లోకములో ఈ దుష్టశిక్షణము కొరకే అవతరించితిని. ధర్మమునాచరించకున్నా పైకి కపటముగా ధర్మమును ప్రకటించువారిని నేను వధించెదను. ఏలయన, వారు అధికపాపులు.

సర్వసమర్థుడగు బలరాముడు తీర్థయాత్ర కారణముగా దుష్టసంహా రమునుండి విరమించుకొనెను. అయినా, అది అట్లు జరుగవలసియున్నది. కావుననే, ఆయన చేతియందలి దర్భ కొనతో ఆయనను సంహరించెను.

మహర్షులందరి మనస్సులు ఖేదముతో నిండెను. వారు అయ్యో! అయ్యో! అంటూ బలరామదేవునితో నిట్లనిరి -- ఓ ప్రభూ! నీవు అధర్మమును చేసితివి.

యాదవవంశమునానందింపజేసే ఓ బలరామా! మేము సత్రయాగము పూర్తి అయ్యే వరకు ఈయనకు బ్రాహ్మణునకు యోగ్యమైన ఆసనమును, దేహమునకు అలుపు యెరుగని ఆయుష్షును ఇచ్చియున్నాము.

నీవు తెలియక బ్రాహ్మణవధను చేసినట్లే చేసినావు. యోగులకు ప్రభుడవగు నీవు వేదానుశాసనమునకు అతీతుడవు.

జనులను పావనము చేసే ఓ బలరామా! నిన్ను శాసించే ఇతరము లేదు. అయినా, నీవే స్వయముగా ఈ బ్రహ్మహత్యకు ప్రాయశ్చిత్తము చేసి శుద్ధి చేసుకున్నచో, అది జనులకు ఆదర్శము అగును.

శ్రీబలరామ భగవానుడిట్లు పలికెను --- ఆదర్శమును చూపించుట ద్వారా జనులను అనుగ్రహించవలెననే కోరికతో నేను బ్రహ్మహత్యకు ప్రాయశ్చిత్తమును చేయగలను. ముఖ్యపక్షములో ఎట్టి ప్రాయశ్చిత్త నియమము గలదో, దానినే తమరు ఉపదేశించుడు (నేను చేసెదను).

అంతేగాక, ఈయనకు దీరాయుర్దాయమును, బలమును, ఇంద్రియపాటవమును కూడ దేనిని మీరు అపేక్షించెదరో చెప్పడు. నేను యోగమాయచే ఆ సర్వమును సంపన్నము చేసెదను.

మహర్షులిట్లు పలికిరి --- ఓ బలరామా! నీవు ప్రయోగించిన అస్త్రము, నీ ప్రభావము, ఈతని మరణము వ్యర్థము కారాదు (అస్త్రవీర్యము అమోఘమగుట, మృతుడు తిరిగి బ్రదుకకుండుట). మరియు, మా మాట (ఈయనకు ఇచ్చిన వరము) కూడ సత్యము కావలెను. మీరు అట్టి ఉపాయమును చేయుడు.

శ్రీబలరామ భగవానుడిట్లు చెప్పెను --- వ్యక్తి తానే పుత్రుడై పుట్టునని వేదము బోధించుచున్నది. కాబట్టి, ఈయన పుత్రుడు ప్రవక్తయగును. ఆతనికి ఆయుష్టు, ఇంద్రియపాటవము, శరీరబలము ఉండును.

ఓ మహర్షులారా! మీరు గొప్ప విద్వాంసులు. మీ కోరిక యేమియో చెప్పడు. నేను వెంటనే తీర్చెదను. నాకు ప్రాయశ్చిత్తము గురించి తెలి యదు. మీరు విచారణ చేసి యథార్థమగు ప్రాయశ్చిత్తమును చెప్పడు.

మహర్షులు ఇట్లు చెప్పిరి --- ఇల్వలుని పుత్రుడు బల్వలుడని ప్రసిద్ధి గాంచెను. ఆ భయంకరుడగు రాక్షసుడు ప్రతి పూర్ణిమకు, అమావాస్యకు వచ్చి సత్రయాగమును చెడగొట్టుచున్నాడు.

దశార్హవంశీయుడవగు ఓ బలరామా! ఆ పాపి చీము, రక్తము, మలమూత్రములు, మద్యమాంసములను (అగ్నియందు) వర్షింపజేయును. వానిని నీవు వధించుము. అదియే మాకు గొప్ప సేవ కాగలదు.

తరువాత నీవు మిక్కిలి ఏకాగ్రమగు చిత్తముతో పన్నెండు మాసములు నిరంతరముగా తీర్థములయందు స్నానమును చేస్తూ సంచరించుము. భారతఖండమును పరిక్రమణ చేసి నీవు శుద్ధిని పొందగలవు.

శ్రీమద్భాగవతము పదవ స్కంధము ఉత్తరార్ధములో దంతవక్త్ర విదూరథుల ఉద్గారమును వర్ణించే డెబ్బది ఎనిమిదవ అధ్యాయము ముగిసినది (78).