శ్రీ మద్భాగవతము - దశమ (10వ) స్కందము
49 - అక్రూరుడు హస్తినాపురమునకు వెళ్లుట
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఆ అక్రూరుడు హస్తినాపురమునకు వెళ్లెను. అక్కడి ప్రతి వస్తువు పురువంశీయులగు మహారాజుల కీర్తికి అద్దము పట్టుచుండెను. అచట ఆయన అంబిక పుత్రుడగు ధృతరాష్ట్రుని, భీష్ముని, విదురుని, కుంతిని చూచెను.
ఆయన అచట బాహ్లీకుని, ఆయన పుత్రుడగు సోమదత్తుని, కృపాచార్యుని, భరద్వాజుని పుత్రుడగు ద్రోణుని, ఆయన పుత్రుడగు అశ్వత్థామను, కర్ణుని, దుర్యోధనుని, పాండవులను, ఇతర ప్రియబంధువులను చూచెను.
గాందిని పుత్రుడగు అక్రూరుడు బంధువులను యథోచితముగా కలుసుకొనెను. వారాయనను బంధువుల క్షేమసమాచారమును అడిగి తెలుసుకొనిరి. ఆయన కూడ వారి క్షేమమునడిగి తెలుసుకొనెను.
ధృతరాష్ట్ర మహారాజు పుత్రులు దుష్టులు. ఆయన మనోబలము తక్కువ. కావుననే, ఆయన ఆ దుష్టుల ఇష్టమునకు అనుకూలముగా నడుచుకొనును. ఆయన ప్రవృత్తిని తెలియగోరి అక్రూరుడు అచట కొన్ని మాసములు నివసించెను.
పాండవులయందు తేజస్సు, శస్త్ర నైపుణ్యము, బలము, పరాక్రమము, వినయము, దయ మొదలగు సద్గుణములు గలవు. ప్రజలకు వారిపై అనురాగము గలదు. దీనిని ధృతరాష్ట్రుని పుత్రులగు దుర్యోధనాదులు సహించ లేకపోయిరి. వారు పాండవుల పై విషప్రయోగము మొదలగు కుట్రలను పన్నిరి. ఇంకనూ వారిపై కుట్రలను పన్నుతూనే ఉన్నారు. ఈ వివరములనన్నింటినీ కుంతి, విదురుడు అక్రూరునకు వివరించి చెప్పిరి.
కుంతి వచ్చిన తన సోదరుడగు ఆ అక్రూరుని వద్దకు వెళ్లెను. ఆమెకు పుట్టిల్లు గుర్తుకు వచ్చి కళ్లు నీళ్లతో నిండెను. ఆమె ఆయనతో నిట్లనెను.
ఓ ప్రియదర్శనా! నా తల్లిదండ్రులకు (శూరుడు, ఆయన భార్య), సోదరులకు, అప్పచెల్లెళ్లకు, సోదరుల పుత్రులకు, దేవకి మొదలైన కులస్త్రీలకు , చెలికత్తెలకు మేము గుర్తు ఉన్నామా?
నా సోదరుడగు వసుదేవుని పుత్రుడగు శ్రీకృష్ణ భగవానుడు భక్తులయందు మిక్కుటమగు ప్రేమ గలవాడు. పొందదగినవాడు. ఆయన, పద్మమువంటి కన్నులు గల బలరాముడు అత్తనగు నా పుత్రులను స్మరించెదరా?
తోడేళ్ల మధ్యలోనున్న లేడి వలె, నేను శత్రువుల మధ్యలో చిక్కుకొని దుఃఖిస్తున్నాను. నన్ను, తండ్రి లేని పుత్రులను ఆయన అనునయవాక్యములతో ఓదార్చునా?
ఓ శ్రీకృష్ణా! ఓ శ్రీకృష్ణా! నీవు మహాయోగివి, సకలప్రాణుల ఆత్మవు, జగత్తును పాలించువాడవు. ఓ గోవిందా! నేను పిల్లలతో కేశపడుతూ నిన్ను శరణు జొచ్చినాను. నన్ను రక్షించుము.
మానవులు మృత్యువుతో కూడిన సంసారమునకు భయపడుచుందురు. వారికి రక్షణనిచ్చేది ఈశ్వరుడవగు నీయొక్క మోక్ష ప్రదమగు పాదపద్మముకంటె మరియొకటి నాకు కానరాదు.
శ్రీకృష్ణుడు గుణసంస్పర్శ లేని పరబ్రహ్మ, పరమాత్మ. ఆయన మాయాశక్తికి అధీశ్వరుడు, జ్ఞానఘనుడు. ఓ శ్రీకృష్ణా! నేను నిన్ను శరణు వేడుచున్నాను.
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ పరీక్షిన్మహారాజా! మీ తాత తల్లి ఈ విధముగా తన వారిని, జగన్నాథుడగు శ్రీకృష్ణుని కూడ గుర్తు చేసుకొని దుఃఖితురాలై బిగ్గరగా రోదించెను.
కుంతీ సుఖమే అక్రూరుని సుఖము. ఆమె దుఃఖము ఆయనకు కూడ దుఃఖమే. ఆయన గొప్ప కీర్తి గల విదురునితో గూడి కుంతిని, ఆమె పుత్రుల జన్మకు హేతువులైన దేవతల మహిమను ప్రస్తావించి ఓదార్చెను.
అక్రూరుడు తిరిగి వెళ్లబోవువాడై ధృతరాష్ట్రుని వద్దకు వెళ్లెను. ఆ రాజునకు పుత్రలాలస మెండు. ఆయనకు పాండవుల యెడల పుత్రులతో సమానమైన ప్రేమ లేదు. అక్రూరుడు బంధువుల మధ్యలోనున్న రాజుతో, బంధువులైన శ్రీకృష్ణాదులు ప్రేమతో చెప్పిన మాటలను చెప్పెను.
అక్రూరుడిట్లు పలికెను --- ఓయీ! ఓయీ! ధృతరాష్ట్రా! విచిత్రవీర్యుని పుత్రుడవగు నీవు కురువంశీయుల కీర్తిని వర్దిల్ల జేసెదవు. నీ తమ్ముడు పాండువు మరణించిన పిదప నీవు ఇప్పుడు ఇప్పుడు సింహాసనమును అధిష్ఠించితివి.
నీవు ధర్మముగా భూమిని పాలిస్తూ, సచ్ఛీలముతో జనులను రంజిల్ల జేస్తూ, బంధువులయందు సమబుద్ధి కలిగి ఉన్నచో, సద్గతిని కీర్తిని పొందగలవు.
దీనికి భిన్నముగా నీవు విరుద్ధముగా చేసినచో, జనులు నిన్ను నిందించుటయే గాక, నీవు నరకమును పొందెదవు. కావున, నీవు నీ పుత్రులయందు, పాండుపుత్రులయందు సమానముగా వ్యవహరించుము.
ఓ రాజా! ఈ లోకములో ఎవడైననూ ఎప్పుడైననూ దేనితోనైననూ, తన దేహముతోనైననూ, నిత్యము కలిసియుండుట సంభవము కాదు. భార్య, పిల్లలు, బంధువులు మొదలగువారితో నిత్యసంవాసము అసంభవమని వేరుగా చెప్పవలయునా? (చెప్పనక్కర లేదు).
జీవుడు ఒంటరిగా పుట్టి, ఒంటరిగానే పుణ్యపాపములననుభవించి, ఒంటరిగానే గిట్టును.
నీటిలో నివసించే ప్రాణుల సర్వస్వమైన నీటిని ఆ నీటిలో నివసించే ఇతరప్రాణులు త్రాగివేయును. అదే విధముగా, మూర్ఖుడు అధర్మముతో ధనమును ప్రోగు చేయును. మేము నీకు పోషించదగినవారము అని కబుర్లను చెప్పి ఇతరులు వాని ధనమును లాగుకొనెదరు.
అవివేకి ప్రాణములను, సంపదలను, పుత్రాదులను తనవనే భావనతో అధర్మమును చేసి పోషించును. వాడు జీవితములో ఆత్మజ్ఞానము లేక అకృతార్థుడుగనే మిగిలిపోవును. ఆ ప్రాణములు, సంపదలు, పుత్రాదులు కూడ వానిని పరిత్యజించును.
అవివేక తన ధర్మమునందు రుచిని కోల్పోయి పురుషార్థపరిజ్ఞానము లేనివారై పురుషార్థమునుండి జారిపోవును. అట్టివాడు పుత్రాదులచే పరిత్యజించబడినవాడై పాపమును మూట గట్టుకొని దుఃఖముతో నిండిన నరకములో పడిపోవును.
ఓ రాజా! నీవు సర్వసమర్ధుడవు. ఈ లోకము కల, ఇంద్రజాలము, మనస్సు యొక్క విలాస అని తెలుసుకొసుము. నీవు నీ మనస్సును వశము చేసుకొని సమచిత్తుడవు, శాంతుడవు కమ్ము.
ధృతరాష్ట్రుడిట్లు పలికెను --- ఓ అక్రూరా! నీవు మథురలో అన్నదానమును చేసిన పుణ్యాత్ముడవు. మరణించబోవు మానవునకు అమృతము దొరికినచో, వానికి దానిపై చాలు అనే భావన కలుగదు. అదే విధముగా, నీవు చెప్పిన కల్యాణకరమగు వచనములపై నాకు చాలు అనే భావన కలుగుట లేదు.
ఓ ప్రియదర్శనా! నీ వచనము సత్యము. అయిననూ పుత్రునియందలి ఆసక్తిచే విషమము మరియు చంచలము అగు నా హృదయమునందు, మేఘమునందలి మెరుపు వలె, నిలబడుట లేదు.
ఈశ్వరుని నిర్ణయమును విధముగా చేయగల మొనగాడెవడు? (ఎవ్వడూ లేడు). అట్టి ఈశ్వరుడు భూమి యొక్క భారమును తగ్గించుటకై యదువంశమునందు అవతరించి యున్నాడు.
పరమేశ్వరుని మాయాశక్తి యొక్క మార్గము ఊహకు అందదు. ఆ ఈశ్వరుడు ఆ మాయాశక్తితో ఈ జగత్తును సృష్టించి, తరువాత దానియందు అంతర్యామిగా ప్రవేశించి, సత్త్వరజస్తమోగుణముల మేళవింపుతో వైవిధ్యమును కలుగజేయును. సంసారమనే చక్రము యొక్క భ్రమణమునకు ముఖ్య కారణము ఆ పరమేశ్వరుని లీలయే. ఆ లీల యొక్క స్వరూపము మస్తిష్కమునకు అందేది కాదు. అట్టి పరమేశ్వరుని కొరకు నమస్కారము.
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- యదువంశీయుడగు అక్రూరుడు ఈ విధముగా , ధృతరాష్ట్ర మహారాజు యొక్క అభిప్రాయమును తెలుసుకొనెను. ఆయన బంధువుల వద్ద సెలవు తీసుకొని మరల మథురానగరమునకు వెళ్లెను.
కురువంశీయుడవగు ఓ పరీక్షిన్మహారాజా! అక్రూరుడు పాండవుల యెడల ధృతరాష్ట్రుని ప్రవృత్తిని బలరామ శ్రీకృష్ణులకు చెప్పెను. ఆయన పంపబడినది. దాని కొరకే గదా!
శ్రీమద్భాగవత మహాపురాణము పదవ స్కంధములో అక్రూరుడు హస్తినాపురమునకు వెళ్లుటను వర్ణించే నలుబది తొమ్మిదవ అధ్యాయము ముగిసినది (49).
దశమ స్కంధ పూర్వార్ధము ముగిసినది.
హరిః ఓమ్, తత్సత్, శ్రీకృష్ణార్పణమస్తు.
