శ్రీ మద్భాగవతము - దశమ (10వ) స్కందము

Table of Contents

84 - వసుదేవుని యజ్జోత్సవము

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- సకలప్రాణులలో ఆత్మరూపుడైన శ్రీకృష్ణ భగవానుడు దుఃఖములను పోగొట్టును. ఆయనయందు ఆయన భార్యలకు ఉన్న సర్వస్వార్పణరూపమగు ప్రేమను గురించి విని కుంతి, సుబలపుత్రియగు గాంధారి, ద్రౌపది, ఇతరరాజుల భార్యలు, శ్రీకృష్ణుని భక్తురాండ్రగు గోపీకలు కూడ మిక్కిలి విస్మయమును చెందిరి. వారి కన్నులు నీటితో నిండెను.

ఈ విధముగా పురుషులు పురుషులతో స్త్రీలు స్త్రీలతో సంభాషించు చుండగా, బలరామ శ్రీకృష్ణులను చూచుటకు మహర్షులు అచటకు వచ్చిరి.

వ్యాసుడు, నారదుడు, చ్యవనుడు, దేవలుడు, అసితుడు, విశ్వామిత్రుడు, శతానందుడు, భరద్వాజుడు, గౌతముడు, శిష్యులతో కూడిన పరశు రాముడు, పూజనీయుడగు వశిష్ఠుడు, గాలవుడు, భృగువు, పులస్త్యుడు, కశ్యపుడు, అత్రి, మార్కండేయుడు, బృహస్పతి, ద్వితుడు, త్రితుడు, ఏకతుడు, బ్రహ్మదేవుని పుత్రులగు సనక సనందన సనాతన సనత్కుమారులు, అంగీరసుడు, అగస్త్యుడు, యాజ్ఞవల్క్యుడు, వామదేవుడు, ధౌమ్యుడు మొదలుగా గల ఇతర మహర్షులు విచ్చేసిరి.

అంతవరకు కూర్చున్న పాండవులు, బలరామ శ్రీకృష్ణులు, రాజులు మొదలగువారు జగత్తునకంతకూ వందనీయులైన ఆ మహర్షులను చూచి వెంటనే లేచి నిలబడి నమస్కరించిరి.

అందరు జనులు ఆ మహర్షులను పూజించిరి. బలరాముడు, శ్రీకృష్ణ భగవానుడు వారిని స్వాగతవచనములు, ఆసనము, కాళ్లు కడుగుకోనే నీరు, త్రాగే నీరు, పుష్పమాలలు, ధూపము, అంగరాగములతో యథావిధిగా పూజించిరి.

ఆ మహర్షులందరు మౌనముగా సభలో కూర్చుని వినుచుండగా, శ్రీకృష్ణ భగవానుడు వారినుద్దేశించి ఇట్లు పలికెను. ఆయన అవతరించినది ధర్మపరిరక్షణకే కదా!

శ్రీకృష్ణ భగవానుడిట్లు పలి కెను --- ఆహా! మా జన్మ ధన్యమైనది. మాకు ఆ జన్మయొక్క ఫలము పూర్తిగా లభించినది. దేవతలకు కూడ పొంద శక్యము కాని యోగిపుంగవులను మేము దర్శించినాము.

కొంచెము తపస్సు చేసి దేవుని అర్చామూర్తియందు మాత్రమే దర్శించే మానవులకు మిమ్ములను చూచి స్పృశించి ప్రశ్నించుట, ప్రణమిల్లుట, పాదములను పూజించుట, అర్ఘ్యాదులనిచ్చుట సంభవమేనా?

కేవలము జలాశయములు మాత్రమే తీర్థములనియు, మట్టితో రాళ్లతో చేసిన విగ్రహములు మాత్రమే దేవతలనియు అనుకోరాదు. అవి చాల కాలము సేవించినప్పుడు మాత్రమే పావనము చేయగా, సజ్జనులు దర్శనము వలననే పావనము చేయుదురు.

భేదబుద్దితో ఉపాసించినవాని పాపమును అగ్ని, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, పృథివి-జలము-వాయువు-ఆకాశముల అధిష్టానదేవతలు, వాగ్దేవి, మనస్సు అధిష్టాన దేవత పోగొట్టరు. కాని, గంట సేపు మహాత్ముల (అద్వయ-ఆత్మనిష్ఠుల) కు సేవ చేసినచో, పాపము నశించును.

ఎవడైతే వాతపిత్త శ్లేష్మములతో నిర్మాణమైన శవప్రాయమగు దేహము ఆత్మయని, భార్య-పుత్రుడు మొదలగువారు తనవారని, మట్టితో చేసిన ప్రతిమ మాత్రమే దేవతయని, జలాశయము మాత్రమే తీర్థము (పావనము) అని తలపోయునో, అట్టివాడు ఏనాడైననూ ఆత్మతత్త్వనిష్ణులగు మహాత్ములయందు ఆత్మ-స్వీయ-పూజనీయ-పావనబుద్దిని చేయడు. అట్టి వాడు ఎద్దు, గాడిదలవంటి వాడు మాత్రమే.

శ్రీశుక మహర్షి ఇట్లు పలి కెను --- మొక్కవోని బుద్దిశక్తి గల శ్రీకృష్ణ భగవానుని ఈ వచనములను వేదవేత్తలగు మహర్షులు కూడ తెలియలేక పోయిరి. వారి మాటను విని బుద్ధి భ్రమించుట వలన మిన్నకుండిరి.

సర్వేశ్వరుడగు శ్రీకృష్ణ భగవానుడు తాను మహర్షులకు విధేయుడై ఉండుటను గురించి మహర్షులు చాల సేపు విచారించి, జనులకు ఆదర్శము కొరకు ఆయన అట్లు చేయుచున్నాడని నిశ్చయించిరి. జగత్తునకు తండ్రియగు ఆయనతో వారిట్లనిరి.

మహర్షులు ఇట్లు పలికిరి --- తత్త్వవేత్తలలో శ్రేష్ఠులమై దక్షాది. ప్రజాపతులను శాసించే మేము కూడ ఆ భగవానుని మాయచే మోహితులమగుచున్నాము. ఆ భగవానుడు మానవరూపములో గూఢముగా నుండి మానవుల చేష్టలననుకరిస్తూ మనకు సేవ చేయుచున్నాడు. ఆహా! ఆయన లీల చాల చిత్రమైనది.

పరబ్రహ్మ నిష్కాముడు, అద్వితీయుడు. ఆ బ్రహ్మ తానే ఉపాదానమై అనేకప్రకారములుగా ఈ జగత్తును సృష్టించి, పాలించి, ఉపసంహరించుచున్నాడు. అయిననూ, జగత్తు బ్రహ్మను బంధించుట లేదు. కుండ, బాన మొదలైన మట్టి యొక్క వికారములచే ఒకే పృథివి అనేకనామరూపములను కలిగియుండుట దీనికి దృష్టాంతము. ఆహా! పరబ్రహ్మ అవతరించి చేసిన సాధు సేవాది కృత్యములు. కేవలము అనుకరణము మాత్రమే.

నీవు ప్రకృతికి అతీతమైన పరబ్రహ్మవు. అయినప్పటికీ, నీవు దుష్టులను శిక్షించి నీ భక్తులను రక్షించుటకై సమయము వచ్చినప్పుడు సత్త్వగుణప్రధానమగు రూపమును దాల్చెదవు. నీవు వర్ణాశ్రమముల అభి మానముతో నీ లీల ద్వారా పురాతనమగు వేదధర్మమును నిలబెట్టెదవు.

వేదము నీ శుద్ధమైన హృదయము. సాధకుడు తపస్సు, స్వాధ్యాయము, ఇంద్రియనిగ్రహముల ద్వారా ఆ వేదమునందు కారణ కార్యములను, వాటికి అతీతమైన సదన బ్రహ్మను సాక్షాత్కరించుకొనును.

ఓ పరబ్రహ్మా! కావున, శాస్త్రమే ప్రమాణముగా గల పరమాత్మకు శ్రేష్ఠమైన ఉపలబ్ధస్థానమగు బ్రాహ్మణత్వమును నీవు పూజించుచున్నావు. కావుననే, నీవు బ్రాహ్మణభక్తులలో అగ్రేసరుడవు.

సత్పురుషులు పొందేది నిన్నే. ఈ నాడు నిన్ను కలుసుకొనుటచే మా పుట్టుక, విద్య, తపస్సు, చూపు కూడ సఫలములైనవి. ఎందుకంటే, నీవు కల్యాణములకు పరమావధివి.

మొక్కవోని విజ్ఞానశక్తి గల శ్రీకృష్ణ భగవానుని మహిమ (స్వరూపము) ఆయన యోగమాయచే కప్పివేయబడినది. వ్యక్తియొక్క అంతరతమ చైతన్యస్వరూపుడైన ఆ శ్రీకృష్ణ భగవానుని కొరకు నమస్కారము.

శ్రీకృష్ణ భగవానుడు (లోపల) ఆత్మస్వరూపుడు, (బయట) కాలస్వరూపుడు. కాని, ఈ రాజులు గాని, ఆయనతో కలిసి ఒకే చోట నివసించే యాదవులు గాని, ఆయన స్వరూపమునెరుగరు.

నిద్రించే వ్యక్తి స్వప్నములో గుణకార్యములగు పదార్థములను సత్యములని దర్శించును. ఆతడు పేరు మాత్రమే అయి (మిథ్యా భూతము) మనస్సుచే తెలియబడే రూపము తానే యని భ్రమ పడును. తాను ఆ రూపముకంటె అతీతమైన జాగ్రద్వ్యక్తినని ఆతడు తెలియడు.

ఇదే ప్రకారముగా, భోగ్యములయందు ఇంద్రియముల ప్రవృత్తిచే మనిషి చిత్తము వ్యాకులమై వివేకము నష్టమగును. అట్టివాడు కేవలము నామరూపాత్మకమగు జగత్తునందు సదనమైన నిన్ను తెలియలేడు.

నీ పాదము పాపముల గుట్టలను నశింపజేసే గంగాతీర్థమునకు పుట్టినిల్లు. పరిపక్వ మైన చిత్తేకాగ్రత గల యోగులు నీ పాదమును హృదయములో నిలి పెదరు. మేము అట్టి నీ పాదమును దర్శించితిమి. వర్ధిల్లిన భక్తిచే సాధకుని అంతఃకరణ (లింగశరీర) రూపమైన పరిచ్చిన్నజీవభావము నశించి నీయందు ఐక్యమై జీవన్ముక్తి లభించును. కావున, మమ్ములను భక్తులను చేసి అనుగ్రహించుము.

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ పరీక్షిన్మహారాజా! నీవు రాజువైనా ఋషివి. మహర్షులీ విధముగా శ్రీకృష్ణుడు, ధృతరాష్ట్రుడు, ధర్మరాజుల వద్ద సెలవు తీసుకొని, తమ ఆశ్రమములకు వెళ్లుటకు నిశ్చయించుకొనిరి.

ఆ మహర్షుల ప్రయాణసన్నాహమును చూచి గొప్ప కీర్తిమంతుడగు వసుదేవుడు వారి వద్దకు వెళ్లి పాదములను పట్టుకొని ప్రణమిల్లి ఏకాగ్రమగు చిత్తముతో నిట్లు పలికెను.

వసుదేవుడిట్లు పలికెను --- ఓ మహర్షులారా! సకల దేవతలు మీయందే గలరు. నా మాట వినుడు. కర్మచే కర్మవాసనల పూర్తి నాశము ఎట్లు కలుగును? ఆ విషయమును మాకు చెప్పడు.

నారద మహర్షి ఇట్లు పలికెను --- ఓ వేదవేత్తలారా! శ్రీకృష్ణుడు బుడతడని తలచిన వసుదేవుడు తనకు శ్రేయస్సును గురించి తెలియగోరి మనలను ప్రశ్నించుట అనే ఈ సందర్భము పెద్ద విడ్డూరము కాదు.

ఏలయనగా, దగ్గరగానున్నదానిని మానవులు అనాదరము చేసెదరు. ఉదాహరణకు, గంగ ఒడ్డున ఉన్నవాడు శుద్ధి కొరకు ఇంకో నదికి వెళ్లును.

ఆ ఈ ఈశ్వరుని స్వరూపచైతన్యము కాలముచే గాని, జగత్తుయొక్క సృష్టి స్థితిలయములచే గాని, తనంత తానుగా గాని, ఇతరము వలన గాని, సత్త్వాదిగుణముల వలన గాని, దేనివలనైనా నశించదు. ఇది నిశ్చయము.

అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశము (మృత్యుభయము) అనే చిత్తమలములు గాని, పుణ్యపాపకర్మలు గాని, సుఖదుఃఖరూపమైన కర్మఫలములు గాని, సత్త్వరజస్తమోగుణముల ప్రవాహములైన దేహాదులు గాని, రెండవది లేని ఈశ్వరుని జ్ఞానమును ఖండించలేవు. మేఘములు, మంచు, గ్రహణము సూర్యుని కప్పివేయునని అజ్ఞాని తలచును. అదే విధముగా, ఈశ్వరునినుండియే ప్రకటమైన ప్రాణము, బుద్ధి మొదలగునవి ఈశ్వరుని కప్పివేయునని అజ్ఞాని తలపోయును. వాస్తవముగా సూర్యుడు గాని, ఆత్మ గాని దేనినైననూ కప్పివేయబడదు).

పరీక్షిన్మహారాజా! తరువాత, సకలరాజులు, శ్రీకృష్ణ భగవానుడు, బల రాముడు వినుచుండగా, మహర్షులు వసుదేవుని సంబోధించి ఇట్లు పలికిరి.

సకలయజ్ఞములకు పాలకుడగు శ్రీహరిని శ్రద్దతో యజ్ఞములను చేసి ఆరాధించవలెను. కర్మచే కర్మవాసనల వినాశమునకు ఇదియే చక్కని ఉపాయమని నిర్ధారించబడినది.

ఇదియే అంతఃకరణమునకు సుఖశాంతులనిచ్చే తేలికయైన ఉపా యము, ధర్మము అని జ్ఞానమే చూపుగా గల మహాత్ములు నిరూపించిరి.

ఉపనయనసంస్కారము గల గృహస్థుడు న్యాయార్జితమైన తెల్ల (శుద్ధ) ధనముతో పూర్ఖుడగు శ్రీహరిని శ్రద్ధతో యజ్ఞము చేసి ఆరాధించవలెను. ఇదియే శ్రేయస్సును పొందించే ఉపాయము.

ఓ వసుదేవా! వివేకి యజ్ఞదానముల ద్వారా ధనమునందలి ఇచ్చను, ఇంటియందలి భోగముల ద్వారా భార్య, సంతానము అనువాటియందలి ఇచ్చను, కాలముచే సర్వము నశించునని భావించుటచే స్వర్గాది లోకములయందలి తన కామనను విడిచి పెట్టవలెను. వివేకులందరు గృహ స్థులుగా ఉండి ఈ కామనలను విడిచి తపస్సుకై అడవికి వెళ్లాడివారు.

ఓ ప్రభూ! బ్రాహ్మణుడు దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు ఋణ ముతో పుట్టును. ఈ మూడు ఋణములను క్రమముగా యజ్ఞము, అధ్య యనము, సంతానములచే తీర్చకుండా సన్న్యసించువాడు పతితుడగును.

గొప్ప బుద్ధి గల ఓ వసుదేవా! నీవైతే ఇప్పటికి పితృదేవతల, మహర్షుల ఋణములు రెండింటినుండి విముక్తిని పొందితివి. యజ్ఞముల ద్వారా దేవతల ఋణమును కూడ తీర్చి సన్న్యసించుము.

ఓ వసుదేవా! నీవు నిశ్చయముగా ప్రేమభక్తితో బ్రహ్మాండములకు అంతర్యామియగు శ్రీహరిని అర్చించితివి. కావుననే, ఆయన మీ దంపతులకు పుత్రుడై జన్మించినాడు.

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను - పెద్ద మనసు గల వసుదేవుడు ఆ మహర్షుల వచనమును విని, వారికి తల వంచి నమస్కరించి, ప్రసన్నులను చేసుకొని, వారినే ఋత్విక్కులుగా వరించెను.

ఓ పరీక్షిన్మహారాజా! ధర్మపూర్వకముగా వరించబడిన ఆ మహర్షులు ధర్మాత్ముడగు ఈ వసుదేవునిచే ఆ సమంతపంచక క్షేత్రమునందు ఉత్తమమైన మంత్రద్రవ్యాదులు గల యజ్ఞములను చేయించిరి.

ఓ పరీక్షిన్మహారాజా! ఆ వసుదేవుని యజ్ఞదీక్ష సాగుచుండెను. యాదవులు స్నానము చేసి పద్మ(బీజముల)మాలలను, మంచి వస్త్రములను ధరించిరి. రాజులు బాగుగా అలంకరించుకొనిరి.

ఆ వసుదేవుని భార్యలు కూడ మంచి వస్త్రములను దాల్చి, మెడలో హారములను వేసుకొని, చందనాదులనందుకొని, మంగళద్రవ్యములను పట్టుకొని ఆనందముతో యజ్ఞశాలకు విచ్చేసిరి.

మద్దెళ్లు, డోళ్లు, శంఖములు, భేరీలు, తప్పెటలు, కొమ్ము బూరాలు మొదలైనవి మ్రోగినవి. నటులు, నాట్యకత్తెలు నాట్యమాడిరి. సూతులు, మాగధులు స్తుతించిరి. గంధర్వులు, మంచి కంఠము గల వారి భార్యలు కలిసి పాడిరి.

  దీక్షితుడైన వసుదేవుడు కాటుక పెట్టుకొని, దేహమునకు వెన్న రాసు కొనెను (దీక్షా నియమములు). ఆయన పదునెనిమిది భార్యలతో, నక్షత్రములతో కూడిన చంద్రుని పోలియుండెను. ఋత్విక్కులాయనను యథావిధిగా అభిషేకించిరి.

యజ్ఞదీక్షయందున్న వసుదేవుడు మృగచర్మను కప్పుకొనెను. వస్త్రములు, కంకణములు, హారములు, కాలియందెలు, కుండలములతో బాగా అలంకరించుకున్న ఆ భార్యలతో గూడి ఆయన గొప్పగా రాజిల్లెను.

ఓ పరీక్షిన్మహారాజా! ఆ వసుదేవుని ఆ ఋత్విక్కులు రత్నములు పొదిగిన పట్టు వస్త్రములను దాల్చి సభాసదులతో గూడి, వృత్రాసురుని వధించిన ఇంద్రుని యజ్ఞమునందు వలె, విశేషముగా ప్రకాశించిరి.

జీవులకు ప్రభువులగు బలరామ శ్రీకృష్ణులు అప్పుడు తమ తమ బంధువులతో, తమ విభూతులు (అంశలు) అయిన పుత్రులతో, భార్యలతో కూడి ప్రకాశించిరి.

పురోడాశాది ద్రవ్యములు, మంత్రములు, కర్మలకు ప్రభువు శ్రీహరియే. జ్యోతిష్ణోమము మొదలైన ప్రకృతియాగములచే, సౌరము మొదలైన వికృతియాగములచే, అగ్నిహోత్రము మొదలైన పేర్లు గల యాగములచే వసుదేవుడు ఆయనను ప్రతియజ్ఞమునందు యథావిధిగా ఆరాధించెను.

తరువాత ఆ - వసుదేవుడు తగిన సమయములో బాగుగా అలంకరించుకున్న ఋత్విక్కులకు తాను కూడ అలంకరించి యథావిధి దక్షిణలనిచ్చెను. మరియు, అలంకరించిన గోవులను, భూమిని, కన్యలను చాల ధనముతో బాటు యిచ్చెను.

వేదవేత్త లైన ఆ మహర్షులు పత్నీసంయాజయాగమును, అవభృథ స్నానమునకు చెందిన కర్మలను అనుష్టించిరి. అపుడు వారు యజమాను డగు వసుదేవుని ముందడుకొని పరశురామకుండములో స్నానము చేసిరి.

వసుదేవుడు, ఆతని భార్యలు స్నానము చేసి వస్త్రములను, భూషణములను స్తోత్రపాఠకులకు ఇచ్చిరి. తరువాత వసుదేవుడు బాగుగా అలంకరించుకొని, సకలవర్ణముల వారికి, కుక్కలవరకు ప్రాణులకు ఆహారమును సమర్పించెను.

ఆయన బంధువులను, వారి భార్యలను, పిల్లలను, విదర్భ కోసల కురు కాశి కేకయ సృంజయదేశముల రాజులను, అధికమగు పూజాసామగ్రిని సమర్పించి, పూజించేను.

వసుదేవుడు సభాసదులను, ఋత్విక్కులను, దేవతల గణములను, మానవులను, ఇతరప్రాణులను, పితృదేవతలను, చారణులను పూజించెను. వారు శ్రీనివాసుడగు శ్రీకృష్ణ భగవానుని అనుమతి తీసుకొని, యజ్ఞమును కొనియాడుతూ వెళ్లిరి.

ధృతరాష్ట్రుడు, ఆయన తమ్ముడు విదురుడు, కుంతీపుత్రులగు ధర్మరాజభీమార్జునులు, భీష్ముడు, ద్రోణుడు, కుంతి, కవలలు నకులసహ దేవులు, పూజనీయులగు నారద వ్యాసులు, మిత్రులు, సంబంధీకులు, బంధువులు తమ బంధువులైన యాదవులను కౌగిలించుకొనిరి. ప్రేమ వలన యాదవుల మనస్సులు ఆర్గములాయెను. వారందరు విరహము వలన కష్టముగా వెళ్లిరి. ఇతరజనులు కూడ తమ దేశములకు వెళ్లిరి.

శ్రీకృష్ణుడు, బలరాముడు, ఉగ్రసేనుడు, వసుదేవుడు మొదలగు వారు నందుని పెద్ద సత్కారముతో పూజించిరి. బంధువులయందు మిక్కుటమైన ప్రేమ గల ఆయన గోపాలకులతో గూడీ అక్కడ కొంత కాలము ఉండెను.

వసుదేవుడు యజ్ఞమును చేయాలనే కోరిక అనే పెద్ద సముద్రమును తేలికగా దాటివేసెను. ఆయన ప్రీతి జెందిన మనస్సుతో బంధువులతో కూడియుండెను. ఆయన నందుని చేయి పట్టుకొని ఇట్లు పలికెను.

వసుదేవుడిట్లు పలికెను --- అన్నా! దేవుడు మానవులకు ఆసక్తి అనే పేరుతో బంధమును పెట్టినాడు. దానిని విడిచి పెట్టుట శూరులకు, యోగులకు కూడ చాల కష్టమని నేను తలచుచున్నాను.

మీరు ఉత్తమోత్తములు. చేసిన ఉపకారమును మరచే మాయందు మీరు సాటి లేని ఈ ప్రేమను చేసినారు. ఆ ప్రేమకు ప్రత్యుపకారము లేదు. అయినా, అది ఎన్నటికీ నివృత్తము కాదు.

అన్నా! ఇదివరలోనైతే శక్తి లేక మీకు ప్రియమును చేయలేదు. ఇప్పుడు ధనగర్వముచే గ్రుడ్డివారమై ఎదురుగా ఉన్న మిమ్ములను చూచుట లేదు.

మర్యాదనిచ్చే ఓ నందా! శ్రేయస్సును కోరే వ్యక్తికి రాజ్యసంపద కలుగరాదు. ఎందుకంటే, దానిచే వ్యక్తి గ్రుడ్డివాడై తన వారిని, బంధువులను కన్నెత్తి చూడడు.

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ప్రేమచే శిథిలమైన మనస్సు గల వసుదేవుడీ విధముగా ఆ నందుని ప్రేమను గుర్తు చేసుకొని కళ్ల నీళ్లు పెట్టుకొని యేడ్చెను.

యాదవులు నందుని సమ్మానించిరి. ఆయన మిత్రుడగు వసుదేవునకు ప్రీతిని కలిగించువాడై, బలరామ శ్రీకృష్ణుల ప్రేమకు కట్టుబడి, ఈ వేళ రేపు అంటూ మూడు నెలలు నివసించెను.

తరువాత గోకులవాసులకు, నందునకు, ఆయన బంధువులకు యాదవులు చాల విలువైన ఆభరణములను, పట్టు వస్త్రములను, పలు రకముల వెల కట్టలేని సామగ్రిని ఇచ్చి సకలకామనలనీడేర్చిరి.

వసుదేవుడు, ఉగ్ర సేనుడు, శ్రీకృష్ణుడు, బలరాముడు, ఉద్ధవుడు, సాత్యకి మొదలగువారిచ్చిన బహుమతులను తీసుకొని నందుడు వెళ్లాను. యాదవులాయనను సాగనంపిరి.

నందుడు, గోపాలకులు, గోపికలు కూడ శ్రీకృష్ణుని పద్మమువంటి పాదము పై తగుల్కొన్న మనస్సును వెనుకకు తీసుకొనలేకపోయిరి. వారు మథురామండలమునందలి గోకులమునకు వెళ్లిరి.

బంధువులు తిరిగి వెళ్లిరి. వర్షకాలము దగ్గర పడిన సంగతిని గమనించిన యాదవులు తిరిగి ద్వారకకు వెళ్లిరి. వారికి శ్రీకృష్ణుడే దైవము.

యాదవప్రభుడగు వసుదేవుని యజ్ఞమహోత్సవము, బంధువులను దర్శించుట మొదలగు తీర్థయాత్రా విశేషములను వారు ద్వారకలోని జనులకు చెప్పిరి.

శ్రీమద్భాగవతము పదవ స్కంధము ఉత్తరార్ధములో వసుదేవుని యజ్ఞోత్సవమును వర్ణించే ఎనుబది నాల్గవ అధ్యాయము ముగిసినది (84).