శ్రీ మద్భాగవతము - దశమ (10వ) స్కందము
70 - జరాసంధుని బందీలు శ్రీకృష్ణుని వద్దకు దూతను పంపుట
శ్రీశుక మహర్షి పలికెను --- తెల్లవారబోవుచుండగా శ్రీకృష్ణ మూర్తులచే కంఠమునందు కౌగిలించబడిన శ్రీకృష్ణపత్నులు కూయుచున్న కోళ్లను నిందించిరి. వారు విరహము కలుగుచున్నదనే ఆదుర్దాను కలిగియుండిరి.
మందారవృక్షముల గాలి తగిలి తుమ్మెదలు గానము చేయుచుండ, పక్షులు నిద్ర చెడి శ్రీకృష్ణుని స్తోత్రపాఠకులు వలె నిద్ర లేపుచున్నవాయన్నట్లు కూసినవి.
ప్రియుడగు శ్రీకృష్ణుని వక్షఃస్థలమును కౌగిలించిన విదర్భరాజకుమార్తెయగు రుక్మిణికి ఆ బ్రాహ్మముహూర్తము నచ్చలేదు. ఎందుకంటే, అప్పుడు కౌగిలికి వియోగము కలుగును.
శ్రీకృష్ణ భగవానుడు తెల్లవారు జామున లేచి నీటితో పాదములను కడుగుకొని ఆచమనము చేసి ప్రసన్నమగు ఇంద్రియములు గలవాడై ప్రకృతి
(దేహేంద్రియములు) కి అతీతమైన ప్రత్యగాత్మను ధ్యానించెను.
ప్రత్యగాత్మకు బ్రహ్మ అనే పేరున్నా ధ్యాతకంటే వేరుగా లేదు. రెండవది లేని ఆత్మ వినాశము లేనిది. సాధకుని స్వరూపమైన ఆత్మ యందు ఏ కాలమునందైననూ అవిద్యాదిదోషములు లేవు. ఈ జగత్తు యొక్క సృష్టిస్థితిలయములకు హేతువులైన సత్త్వరజస్తమోగుణాత్మకమైన మాయాశక్తిచే ఉపలక్షితమయ్యే ఆత్మ సచ్చిదానందఘనము.
అథాప్లుతోఽoభస్యమలే యథావిధి క్రియాకలాపం పరిధాయ వాససీ,
చకార సంధ్యోపగమాది సత్తమో హుతానలో బ్రహ్మ జజాప వాగ్యతః।
తరువాత శ్రీకృష్ణ భగవానుడు స్వచ్ఛమగు నీటిలో స్నానము చేసి జంట వస్త్రములను ధరించి సంధ్యావందనము మొదలైన కర్మసమూహమును యథావిధిగా చేసి, అగ్నియందు హోమము చేసి, మౌనియై గాయత్రిని జపించెను.
ఆయన సావధానుడై ఉదయిస్తున్న సూర్యుని యెదుట నిలబడి ప్రార్థించి, తన అంశలైన దేవతలకు, మహర్షులకు, పితృదేవతలకు తర్పణములనిచ్చి, పెద్దలను, వేదవేత్తలను పూజించెను.
ఆయన ప్రతిదినము వేదవేత్తలనలంకరించి వారికి మంద (సుమారు 13 వేలు) మొదటి కాన్పు గంగిగోవులను దూడలతో సహా ఇచ్చెను. ఎక్కువ పాలనిచ్చే ఆ గోవులకు కొమ్ములపై బంగారముతో, గిట్టల కొనలకు వెండితో తొడుగు వేయబడెను. వాటిపై మంచి వస్త్రములను కప్పి మెడలో ముత్యాల హారములు వేయబడెను. వీటికి తోడుగా ఆయన వారికి పట్టు వస్త్రములను, కృష్ణమగృచర్మలను, నువ్వులను కూడ యిచ్చెను.
ఆయన తన విభూతులే అయిన గోవులను, వేదవేత్తలను, పెద్దలను, తల్లిదండ్రులను నమస్కరించి, ఆవు పాలు మొదలైన మంగళద్రవ్యములను స్పృశించెను.
శ్రీకృష్ణుడు తానే మానవలోకమునకు అలంకారము. ఆయన తనవైన (విలక్షణమైన) పీతాంబరములు, అలంకారములు, ప్రకాశించే మాలలు, చందనము మొదలైనవాటితో తనను తాను అలంకరించుకొనెను.
ఆయన కరిగిన నేతిలో మరియు అద్దములో ముఖము చూసుకొని, ఆవు, ఎద్దు, బ్రాహ్మణుడు, దేవత అనువాటిని మంగళము కొరకు చూచెను. ఆయన అంతఃపురములో పని చేయువారికి, పౌరులకు కూడ అన్ని వర్ణముల వారికి భోగ్యములగు వస్తువులనిప్పించి, అమాత్యులు మొదలైన రాజప్రకృతులను కూడ సంతోష పెట్టి తాను ఆనందించెను.
ఆయన మాలలు, తాంబూలము, చందనము మొదలైన వాటిని ముందుగా వేదవేత్తలకు, మిత్రులకు, అమాత్యులు మొదలైన రాజప్రకృతులకు, భార్యలకు ఇచ్చి, తరువాత తాను వినియోగించెను.
అంతలో రథసారథి సుగ్రీవము, మణిపుష్పకము మొదలైన గుర్రములతో కూడిన రథమును ఎదురుగా దగ్గరకు తీసుకువచ్చి నమస్కరించి నిలబడెను. ఆ రథము చాల అచ్చెరువు గొలుపుచుండును.
తరువాత శ్రీకృష్ణుడు సారథి చేతులను చేతితో పట్టుకొని, తూర్పు పర్వతమును సూర్యుడు వలె, ఆ రథమునెక్కెను. సాత్యకి, ఉద్ధవులు ఆయన వెంట ఉండిరి.
అంతఃపురమునందలి యువతులు సిగ్గు ప్రేమలను కలబోసిన చూపులతో ఆయనను చూస్తూ విడిచిపెట్టకుండిరి. అయినా, ఆయన కష్టముతో వారిని విడిచి నవ్వుకుంటూ మనస్సును దోచి నిష్క్రమించెను.
ఓ పరీక్షిన్మహారాజా! యాదవులందరు చుట్టుపారియుండ శ్రీకృష్ణుడు సుధర్మ అనే సభయందు ప్రవేశించెను. ఆ సభలో కూర్చున్నవారికి శరీరమును వృద్ధాప్య మరణములు, ప్రాణశక్తిని ఆకలి దప్పికలు, మనస్సును సుఖదుఃఖములు అనే ఆరు జీవనతరంగములు బాధించవు.
ఆ సభలో శ్రీకృష్ణ ప్రభుడు సింహాసనముపై కూర్చుని తన కాంతిచే దిక్కులను ప్రకాశింపజేస్తూ ప్రకాశించెను. యాదవశ్రేష్ఠుడగు ఆయన పురుషశ్రేష్ఠులగు యాదవులచే, ద్యులోకమునందు చంద్రుడు నక్షత్రగణములచేతను వలె, చుట్టువారబడియుండెను.
ఓ పరీక్షిన్మహారాజా! ఆ సభలో విదూషకులు పలువిధముల హాస్యవినోదములతో, నాట్యాచార్యులు మరియు నాట్యభామలు వేర్వేరుగా నాట్యములతో శ్రీకృష్ణ ప్రభుని సేవించిరి.
మద్దెళ్లు, వీణలు, డోళ్లు, పిల్లనగ్రోవులు, తాళములు మరియు శంఖముల ధ్వనులతో సూతులు, మాగధులు, వందులు పాడి, నాట్యమాడి, స్తోత్రములను కూడ చేసిరి.
ఆ సభయందు కూర్చున్న కొందరు వ్యాఖ్యానకుశలురగు బ్రాహ్మణులు వేదమంత్రములను వ్యాఖ్యానించిరి. కొందరు పవిత్రమగు కీర్తి గల పూర్వమహారాజుల కథలను కూడ చెప్పిరి.
ఓ పరీక్షిన్మహారాజా! ఆ సభకు ఇదివరలో చూడబడని ఒక వ్యక్తి వచ్చెను. ద్వారపాలకులు ఆతనిని గురించి శ్రీకృష్ణ భగవానునకు విన్నవించి ప్రవేశ పెట్టిరి.
ఆతడు శ్రీకృష్ణ భగవానునకు చేతులు జోడించి నమస్కరించి, జరాసంధుడు బంధించుట వలన రాజులకు కలిగిన దుఃఖమును గురించి విన్నవించెను.
జరాసంధుని దిగ్విజయయాత్రలో ఏ రాజులైతే తమ వినయమును ప్రకటించలేదో, వారిని ఇరవై వేలమందిని ఆతడు బలాత్కారముగా గిరివ్రజమునందు బంధించినాడు.
ఓ శ్రీకృష్ణా! శ్రీకృష్ణా! నీ స్వరూపము ఇంద్రియములకు, మనస్సునకు గోచరము కాదు. నీవు శరణు జొచ్చినవారి భయములను బాపెదవు. భేదబుద్ధి గల మేము సంసారమునకు భయపడి నిన్నే శరణు వేడినాము.
ఈ లోకములో ఈ మానవుడు నిషిద్ధకర్మలపై ప్రీతి గలవాడై, నీవు బోధించిన నీ అర్చన అనే తనను ఉద్ధరించే ధర్మము విషయములో అజాగ్రత్తగా నుండును. అంతలోనే బలవంతమైన కాలము వేంటనే వీని జీవితాశను వమ్ముచేయును. కాలమునకు అజాగ్రత్త లేదు. ఆ కాలము నీ రూపమే. నీకు నమస్కారమగుగాక!
జగన్నాథుడవగు నీవు దుష్టులను శిక్షించి సత్పురుషులను రక్షించుటకై నీ అంశయగు బలరామునితో కూడి లోకమునందవతరించితిని. కాని, మరియొక రాజు ఒకడు (జరాసంధుడు) నీ ఆదేశమునుల్లంఘించి మమ్ములను బంధించినాడా? లేక, మేము మా కర్మఫలముననుభవించుచున్నామా? ఈ సంగతి మాకు తెలియకున్నది.
ఓ ఈశ్వరా! రాజ్యాధికారమునందలి సుఖము కల వంటిది, పరాధీనమైనది. ఆత్మానందము నిష్కాములచే నీనుండి పొందబడును. కాని, నీ మాయచే మోహితులమై మిక్కిలి దీనులమగు మేము దానిని విడిచి, నిత్యభయనిధానమగు శవమువంటి దేహముతో సంసారభారమును మోస్తూ ఈ లోకములో కష్టపడుచున్నాము.
నీ పాదములకు ప్రణమిల్లినవారి దుఃఖములు దూరమగును. కావున, నీవు బంధించబడిన మమ్ములను మగధరాజనే పేరు గల కర్మబంధమునుండి విడిపించుము. పదివేల యేనుగుల బలము గల ఒక్క మగధరాజు రాజులను భవనమునందు, సింహము గొర్రెలను వలె, బంధించినాడు.
ఓ శ్రీకృష్ణా! సంసిద్ధముగా నుండే సుదర్శనచక్రము గల నీకు పరాజయము లేదు. అనంతశక్తిమంతుడవగు నీవు జరాసంధుని యుద్ధములో పద్ధెనిమిది సార్లు పరాజితుని చేసితివి. కాని, మానవుల చేష్టననుకరించే నిన్ను ఆతడు ఒక్కసారి జయించి గర్వమును పొంది నీ సంతానమగు మమ్ములను పీడించుచున్నాడు. ఆ విషయమై యోగ్యమగు చర్యను చేపట్టుము.
దూత ఇట్లు పలికేను --- మగధదేశరాజగు జరాసంధునిచే బంధించబడిన ఆ రాజులు దర్శనమును కోరి తమరి పాదములమూలమును శరణు జొచ్చినారు. వారికి సుఖమును కలిగించుడు.
రాజుల దూత ఈ విధముగా చెప్పుచుండగనే, నారదమహర్షి ఆవిర్భవించెను. ఆయన బంగరు వన్నె గల జటల ముడితో సూర్యుడు వలె గొప్పగా ప్రకాశించెను.
సకలలోకపాలకులకు పాలకుడైన శ్రీకృష్ణ భగవానుడా నారదుని చూచి, సభ్యులతో మరియు అనుచరులతో బాటుగా ఆనందముతో లేచి నిలబడి తల వంచి నమస్కరించెను.
మహర్షి ఆసనమును స్వీకరించిన పిదప, శ్రీకృష్ణుడు శ్రద్ధతో యథావిధిగా పూజించి, మధురములైన మాటలతో ప్రీతిని కలిగిస్తూ ఇట్లు పలికెను.
ఇప్పుడు ముల్లోకములు అభయముగానున్నవా? లోకములను పర్యటించే తమరి వలన చాల లాభము (సంగతి తెలియుట) కలదు సుండీ!
ఎందుకంటే, ఈశ్వరునిచే రచించబడిన ఈ ముల్లోకములలో మీకు తెలియనిది ఏదీ లేదు. కాబట్టి, పాండవులు ఏమి చేయగోరుచున్నారు? అని మేము తమరిని ప్రశ్నించుచున్నాము.
శ్రీనారద మహర్షి ఇట్లు పలికెను --- ఓ ప్రభూ! నీ మాయ జగత్తును సృష్టించిన బ్రహ్మదేవుని కూడ మోహపెట్టును. నీవు ప్రాణులలో వ్యాపించియున్ననూ నీ శక్తులగు సత్త్వరజస్తమోగుణములు, బూడిదనిప్పును వలె, నీ ప్రకాశమును కప్పివేయును. నీ మాయను అతిక్రమించుట శక్యము కాదు. అట్టి నీ మాయను నేను పలుమార్లు చూచితిని. కావున, నాకు నీ ప్రశ్నలు వింత కాదు.
నీవు నీ మాయాశక్తిచే ఈ జగత్తును సృష్టించి ఉపసంహరించెదవు. నీ చేష్టను బాగుగా ఎవడు తెలియదగును? ఈ జగత్తు మిథ్యయే అయిననూ, యథార్థమా యన్నట్లు ప్రకాశించుచున్నది. కాని, నీ స్వరూపము కనబడే ఈ జగత్తుకంటె విలక్షణమైనది. అట్టి నీ కొరకు నమస్కారము.
జీవుడు స్థూలసూక్ష్మశరీరములతో తాదాత్మ్యము వలన సంసారములో పడి దుఃఖములననుభవిస్తూ విముక్తిని పొందే ఉపాయమును తెలియకున్నాడు. నీవు లీల కొరకై అవతారములనెత్తి, అట్టి జీవునికొరకు నీ కీర్తి అనే దీపమును వెలిగించినావు. అట్టి నిన్ను నేను శరణు వేడుచున్నాను.
పరబ్రహ్మవగు నీకు తెలియనిదేదీ లేనప్పటికీ, మానవజీవితము ననుకరిస్తున్న నీకు ధర్మరాజు చేయగోరినదానిని గురించి వినిపించెదను. ఆయన నీ తండ్రి సోదరి పుత్రుడు మాత్రమే గాక, భక్తుడు కూడా.
పాండుపుత్రుడగు ధర్మరాజు బ్రహ్మపదము (సామ్రాజ్యము, సర్వులప్రశంస) ను కోరి నిన్ను యజ్ఞములలో శ్రేష్ఠమైన రాజసూయముతో ఆరాధించగలడు. ఆయన ఆకాంక్షను తమరు అనుమోదించుడు.
ఓ దేవా! నిన్ను చూడగోరి దేవతలు, సిద్ధులు మొదలగువారు, కీర్తిమంతులగు రాజులు కూడ నిశ్చయముగా ఆ యజ్ఞమునకు విచ్చేయగలరు.
ఓ ఈశ్వరా! నీవు పరబ్రహ్మ స్వరూపుడవు. నీ కీర్తిని విని, కీర్తించి, ధ్యానించి పతితులు కూడ పవిత్రులగుదురు. నిన్ను చూచి, స్పృశించువారు పవిత్రులగుదురని వేరుగా చెప్పవలయునా?
లోకములకు మంగళములనిచ్చే ఓ దేవా! నీ స్వచ్ఛమగు కీర్తి దిక్కులకు మేలుకట్టు వలె వ్యాపించి, స్వర్గపాతాళభూలోకములయందు వినుతికెక్కినది. నీ పాదములనుండి పుట్టిన నీరు స్వర్గమునందు మందాకిని, పాతాళమునందు భోగవతి, ఈ భూలోకమునందు గంగ అనే రూపములతో జగత్తును పావనము చేయుచున్నది.
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- జరాసంధుని జయించగోరే స్వపక్షీయులగు యాదవులు ఆ సభలో శ్రీకృష్ణుడు యజ్ఞమునకు వెళ్లుటను అంగీకరించలేదు. అపుడు శ్రీకృష్ణ భగవానుడు నవ్వుతూ మధురవచనములతో భక్తుడగు ఉద్ధవునితో నిట్లనెను.
శ్రీకృష్ణ భగవానుడిట్లు పలికెను --- నీవు నిశ్చయముగా మాకు గొప్ప చూపు (జ్ఞాననేత్రము). నీవు హితకారివి. రాజనీతి, దానిచే సాధించదగిన లక్ష్యములు అనువాటి తత్త్వము నీకు తెలియును. ఈ విషయములో మా కర్తవ్యమును గురించి చెప్పుము. మేము శ్రద్ధతో దానిని చేసెదము.
శ్రీకృష్ణ ప్రభుడు సర్వము తెలిసినవాడే అయినా తెలియనివాడు వలె ఈ విధముగా అడిగెను. ఉద్ధవుడు ఆయన ఆదేశమును తల వంచి స్వీకరించి ఇట్లు బదులు చెప్పెను.
శ్రీమద్భాగవతము పదవ స్కంధము ఉత్తరార్ధములో
జరాసంధుని బందీలు శ్రీకృష్ణుని వద్దకు దూతను పంపుటను వర్ణించే
డెబ్బదియవ అధ్యాయము ముగిసినది.
