శ్రీ మద్భాగవతము - దశమ (10వ) స్కందము

Table of Contents

53  - శ్రీకృష్ణుడు రుక్మిణిని రక్షించుట

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- యాదవవంశనందనుడగు ఆ శ్రీకృష్ణుడు విదర్భరాజకుమారియగు రుక్మిణియొక్క సందేశమును విని నవ్వెను. ఆయన ఆ బ్రాహ్మణుని చేతిని చేతితో పట్టుకొని ఇట్లనెను.  

శ్రీకృష్ణ భగవానుడిట్లు పలికెను --- ఆమెకు వలేనే నాకు కూడా ఆమెయందే మనస్సు లగ్నమై రాత్రి నిద్ర కూడ పట్టుట లేదు. రుక్మినాయందలి ద్వేషము వలన రుక్మిణికి నాతో వివాహము కాకుండా అడ్డు పడినాడని నాకు తెలుసు.

శిశుపాలాదులు క్షత్రియాధములు. వారిని యుద్ధములో పరాభవించి గొప్ప సుందరియగు ఆ రుక్మిణిని, కట్టెనుండి అగ్నిజ్వాలను వలె, తీసుకు వచ్చెదను. ఆమె నన్నే శరణు వేడినది.

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- మధువును సంహరించిన శ్రీకృష్ణ భగవానుడు రుక్మిణి యొక్క వివాహ నక్షత్రము (రెండు రోజుల పిదప) ను గురించి తెలుసుకొని, ఓ దారుకా! వెంటనే రథమును సిద్దము చేయుము, అని సారథితో పలికెను.

శైవ్య సుగ్రీవ మేఘపుష్ప బలాహకములనే గుర్రములతో పూన్చిన రథమును ఆ సారథి దగ్గరగా తెచ్చి, దోసిలి యొగ్గి ఎదుట నిలబడెను.

శూరపుత్రుడగు శ్రీకృష్ణుడు బ్రాహ్మణుని రథమెక్కించి తాను ఎక్కెను. వేగముగా నడిచే గుర్రములు లాగగా వారా రథముపై ఒక్క రాత్రి గడచు సరికి ఆనర్త దేశమునుండి విదర్భదేశమును చేరుకొనిరి.

కుండినపురమునకు ప్రభువగు ఆ భీష్మక మహారాజు పుత్రునియందలి ప్రేమచే పరవశుడాయెను. ఆయన తన కుమార్తెయగు రుక్మిణిని శిశుపాలునకు ఇచ్చి వివాహము చేయబోవువాడై, ఏర్పాట్లను చేయించెను.

ఆ నగరములోని దారులు, రాజమార్గములు, కూడళ్లను తుడిచి నీళ్లను చల్లిరి. నగరమును రంగు రంగుల టెక్కెములతో, పతాకలతో, తోరణములతో బాగుగా అలంకరించిరి.

ఆ నగరమునందలి స్త్రీలు, పురుషులు పుష్పమాలలను, పూలను, సుగంధద్రవ్యములను, ఆభరణములను కలిగియుండిరి. అచటి గృహములు సంపన్నములై అగరు ధూపమును కలిగియుండెను.

ఆయన పితృదేవతలను, దేవతలను చక్కగా యథావిధిగా పూజించి, వేదవేత్తలను భుజింపజేసి, నియమానుసారముగా పుణ్యాహవాచనమును చేయించెను.

అందమైన పలువరుసలు గల రుక్మిణీ చక్కగా స్నానము చేసెను. ఆ కన్య చేతులకు మంగళము కొరకై రక్షలను కట్టిరి. ఆమెను కొత్త వస్త్రముల జంటతో, గొప్ప ఆభరణములతో అలంకరించిరి.

బ్రాహ్మణోత్తములు పెళ్లికూతురునకు ఋగ్వేద యజుర్వేద సామవేదమంత్రములతో రక్షను కట్టిరి. అథర్వవేదపండితుడైన పురోహితుడు గ్రహముల శాంతి కొరకు హోమమును చేసెను.

దానవిధి తెలిసిన వారిలో శ్రేష్ఠుడగు ఆ రాజు వేదవేత్తలకు బంగారము, వెండి, వస్త్రములు, బెల్లము కలిపిన నువ్వులు, పాలిచ్చే ఆవులు అనువాటిని దానము చేసెను.

ఇదే విధముగా చేదిదేశప్రభుడగు దమ ఘోష మహారాజు కూడ తన పుత్రుడగు శిశుపాలుని కొరకు వివాహమునకు యోగ్యమైన (నాందీశ్రాద్ధాది) మంగళకర్మలనన్నింటినీ మంత్రవేత్తలచే చేయించెను.

మదమును స్రవించే ఏనుగులు, బంగరు మాలలు గల రథములు, పదాతులు, గుర్రములు అనువాటిచే వ్యాపించబడిన సైన్యములు చుట్లువారి రాగా ఆయన కుండిననగరమునకు పయనమయ్యెను.

విదర్భరాజగు భీష్మకుడైతే ఆ దమ ఘోషునకు ఎదు రేగి ఆనందముతో సమ్మానించి, ముందే ఏర్పాటు చేసిన మహలులో విడిది చేయించెను.

శాల్వుడు, జరాసంధుడు, దంతవక్తూడు, విదూరథుడు, పౌండ్రకుడు మొదలుగా గల వేలాది మంది చేదిదేశనాయకుడగు శిశుపాలుని పక్షమునకు చెందినవారు. వారు శ్రీకృష్ణ బలరాములను ద్వేషింతురు. వారందరు పెళ్లి కూతురగు రుక్మిణీకి శిశుపాలునితో వివాహమును సాధించుటకై యుద్ధమునకు సన్నద్ధులై ఆ కుండిననగరమునకు వచ్చిరి.

ఒకచో శ్రీకృష్ణుడు బలరాముడు-సాత్యకి మొదలైన యాదవులతో కూడి వచ్చి రుక్మిణిని కొనిపోయే పక్షములో, ఒక్కటిగా అయి ఆయనతో యుద్ధము చేసెదము, అని ఆ రాజులందరు మనస్సులో నిశ్చయించు కొనిరి. వారు సంపూర్ణ మైన సైన్యముతో, వాహనములతో విచ్చేసిరి.

శత్రుపక్షీయులగు రాజుల ఈ సైన్యసన్నాహమును గురించి, శ్రీకృష్ణుడు పెళ్లికూతురును కొనిపోవుటకై ఒంటరిగా వెళ్లుటను గురించి విని, బలరామ భగవానునకు యుద్ధము వచ్చుననే శంక కలిగెను.

తమ్మునియందలి ప్రేమ బలరాముని ముంచెత్తెను. ఆయన ఏనుగులు, గుర్రములు, రథములు, పదాతులు గల పెద్ద సైన్యము తోడు రాగా వేగముగా కుండిన నగరమును చేరెను.

భీష్మకుని కుమార్తెయగు రుక్మిణి సుందరి. ఆమె శ్రీకృష్ణుని రాకను కోరుచుండెను. తాను పంపిన బ్రాహ్మణుడు ఇంకనూ తిరిగి రాలేదు. అప్పుడామె ఇట్లు తలపో సెను.

అయ్యో! అల్పభాగ్యురాలగు నా వివాహమునకు ఇంక మూడు జాముల వ్యవధి మాత్రమే గలదు. పద్మములవంటి కన్నులు గల శ్రీకృష్ణుడింకనూ రాలేదు. ఆయన రాకుండుటకు కారణము నాకు తెలియదు. నా సందేశమును కొనిపోయిన బ్రాహ్మణుడైననూ ఈ నాటికి కూడ తిరిగి రాలేదు.

శ్రీకృష్ణుని మనస్సు నిర్దుష్టమైనది. ఆయన ప్రయత్నమును చేసి నన్ను వివాహమాడుటకై వచ్చుట లేదు. ఆయన నిశ్చయముగా నాలో ఏవగించుకొనదగిన దోష మును దేనినో చూచియుండును.

దురదృష్టవంతురాలనగు నాకు విధాత, మహేశ్వరుడు అనుకూలురు కారా? రుద్రుని పత్ని, పర్వతపుత్రి, సతీదేవి అగు గౌరీదేవి నా యెడల - అప్రసన్నురాలా యేమి?

 పెళ్లికూతురగు రుక్మిణియొక్క మనస్సును శ్రీకృష్ణుడు దోచెను. ఆమె ఈ విధముగా తలపోస్తూ ఇంకనూ సమయమున్నదని తెలిసి, కన్నీటితో నిండిన కన్నులను మూసుకొనెను.

ఓ పరీక్షిన్మహారాజా! ఈ విధముగ -- పెళ్లికూతురగు రుక్మిణి శ్రీకృష్ణుని రాకకై ఎదురు చూచుచుండగా, ఆమె ఎడమ తొడ, చేయి, కన్ను అదిరి రాబోయే శుభమును సూచించినవి.

తరువాత శ్రీకృష్ణునిచే పంపబడిన ఆ బ్రాహ్మణోత్తముడే అంతఃపురము నందు సంచరిస్తూ ప్రకాశిస్తున్న రాజపుత్రియగు రుక్మిణిని చూచెను.

హర్షముతో నిండిన ఆ బ్రాహ్మణుని నడకలో తొట్రుపాటు లేదు. ఆయనను చూచి పుణ్యాత్మురాలగు రుక్మిణి లక్షణములను గుర్తు పట్టెను. ఆమే స్వచ్చమగు చిరునగవుతో ప్రశ్నించెను.

యదునందనుడగు శ్రీకృష్ణుడు వచ్చినాడనియు, ఆయన రుక్మిణిని తీసుకువెళ్లేదనని చెప్పిన యథార్థమగు వచనమును కూడ ఆ బ్రాహ్మణుడు రుక్మిణికి విన్నవించి, శ్రీకృష్ణుని స్తుతించెను.

శ్రీకృష్ణుడు వచ్చేడని తెలిసి విదర్భరాజపుత్రి మహానందమును పొందెను. ఆ బ్రాహ్మణునకు ఇష్ట మైన మరొకదానిని దేనిని ఈయవలెనో తెలియక ఆమె ఆయనకు నమస్కరించెను.

బలరామ శ్రీకృష్ణులు తన కుమార్తెయొక్క వివాహమును చూడాలనే ఉత్సాహముతో వచ్చినారని విని, భీష్మక మహారాజు ఉపహారములను తీసుకొని వాద్యముల ధ్వనితో వారికి యెదు రేగెను.

ఆయన మధురద్రవ్యములను, నిర్మలమైన వస్త్రములను, అభీష్టము లైన ఉపహారములను తీసుకువచ్చి యథావిధిగా చక్కగా పూజించేను.

గొప్ప బుద్ధిశాలియగు ఆ భీష్మకుడు వారిద్దరికి, వారి సైన్యమునకు, వారి అనుచరులకు శోభాయుక్త మైన నివాసమునేర్పాటు చేసి యథావిధిగా అతిథిమర్యాదలను చేసెను.

ఆయన ఈ విధముగా సమావేశమైన రాజులకు వారి వారి పరాక్రమము, వయస్సు, సైన్యము, సంపదలకు తగ్గట్లుగా సకలములైన భోగ్యములతో గొప్ప మర్యాద చేసెను.

శ్రీకృష్ణుడు వచ్చినాడని విని కుండిననగరవాసులు వచ్చి ఆయనయొక్క పద్మమువంటి ముఖమును కళ్లతో తనివి తీరా చూచిరి.

ఈయనకు భార్య అగుటకు తగిన యువతి రుక్మిణియే గాని మరియొకరు కాదు. దేహమునందు, మనస్సునందు దోషములు లేని ఈయన కూడ భీష్మకపుత్రికయగు రుక్మిణికి బాగా తగిన భర్త.

మనమేదైనా కొంచెము పుణ్యకర్మలను చేసి ఉన్నట్లైతే, దానితో ముల్లోకముల సృష్టికర్త ప్రీతి జెంది అనుగ్రహించు గాక! విదర్భరాజపుత్రిని శ్రీకృష్ణ భగవానుడు వివాహమాడు గాక!

అతిశయించిన ప్రేమ చే కట్టి వేయబడిన కుండినపురజనులు ఈ విధముగా చెప్పుకొనిరి. ఇంతలో రక్షభటులు చుట్టువారి రాగా పెళ్లికూతురు రుక్మిణి అంతఃపురమునుండి దేవి ఆలయమునకు వెళ్లెను.

ఆ రుక్మిణియైతే మోక్ష ప్రదాతయగు శ్రీకృష్ణుని పద్మమువంటి పాదమును ఏకాగ్రముగా ధ్యానించుచుండెను. ఆమే చిగురుటాకువంటి గౌరీదేవి పాదమును దర్శించుటకై కాలి నడకన బయటకు వచ్చెను.

రుక్మిణి తల్లులతో కూడి చెలికత్తెలు చుట్టువారి రాగా మౌనముగా నడచుచుండెను. శూరులగు రాజభటులు - కవచములను దాల్చి ఆయుధములను సిద్దముగా పట్టుకొని ఆమెను రక్షించు చుండిరి. మద్దెళ్లు, శంఖములు, తప్పెట్లు, వాద్యములు, భేరీలు అనువాటిని మ్రోగించిరి.

గొప్ప వారాంగనలు పెద్ద సంఖ్యలో పలు రకముల ఉపహారములతో నైవేద్యములతో నడిచిరి. మాలలు, గంధము, వస్త్రములు, ఆభరణము లతో అలంకరించుకున్న బ్రాహ్మణపత్నులు తోడు నడిచిరి. గాయకులు గానము చేయుచుండగా, సూతులు మాగధులు వందులు స్తోత్ర పాఠములను చేయుచుండిరి. వీరందరు పెళ్లికూతురుని చుట్టువారి వెళ్లిరి.

ఆమె గౌరీదేవి ఆలయమును చేరి పద్మములవంటి కాళ్లను, చేతులను కడుగుకొని ఆచమనము చేసి శుచి ఆయెను. అపుడామె ఏకాగ్రచిత్తయై జగన్మాత సన్నిధిని ప్రవేశించెను.

పెద్ద వయస్సు గల బ్రాహ్మణపత్నులు విధివిధానము తెలిసినవారు. వారు ఆ పెళ్లికూతురుచే శివుని అర్ధాంగియగు గౌరీదేవికి, శివునకు నమస్కారమును చేయించిరి.

ఓ జగన్మాతా! గణేశునితో కుమారస్వామితో కూడియున్న నీకు పలుమార్లు నమస్కరించుచున్నాను. నీవు మంగళములనిచ్చెదవు. నాకు శ్రీకృష్ణ భగవానుడు భర్తయగుగాక! నా ఆ కోర్కెను అనుమోదించుము.

జలములు, గంధము, అక్షతలు, ధూపములు, వస్త్రములు, పుష్పమాలలు, రత్నాల మాలలు, అలంకారములు, పలు రకముల ఉపహారములు, నైవేద్యములు, దీపపు వరుసలు అనువాటితో రుక్మిణి భవానీని, శివుని వేర్వేరుగా పూజించెను. అదే విధముగా ఆమె ఆ ద్రవ్యములతో మరియు ఉప్పు, అప్పములు, తాంబూలము, కంఠహారములు, పళ్లు, చెరుకు ముక్కలు అనువాటితో భర్త ఉన్న బ్రాహ్మణస్త్రీలను చక్కగా పూజించెను.

ఆ బ్రాహ్మణస్త్రీలు పెళ్లి కూతురికి ప్రసాదమునిచ్చి ఆశీర్వదించిరి. ఆమె వారికి, గౌరీదేవికి నమస్కరించి ప్రసాదమును స్వీకరించెను.

తరువాత ఆమె మౌనవ్రతమును విడిచి రత్నాంగుళీయకముతో శోభిల్లే చేతితో పరిచారికను పట్టుకొని గౌరి ఆలయమునుండి బయటకు వచ్చెను.

ఆ సుందరి శ్రీహరి మాయవలే వీరులను మోహ పెట్టెను. చక్కని నడుము, కుండలములచే అలంకరించబడిన మోము, నడుమునందు కట్టబడిన రత్నాల మొలనూలు అనువాటితో ఆమె శోభిల్లెను. ఆమె స్తనములు యౌవనమును ప్రకటించుచుండ, చూపులు ముంగురుల కారణముగా చంచలములాయెను. స్వచ్చమగు చిరునగవు గల ఆమె క్రింది పెదవి దొండపండు వలె నుండెను. దాని కాంతిచే మల్లె మొగ్గలవంటి దంతములు ఎర్రనగుచుండెను. ధ్వనిస్తూ ప్రకాశించే అందెల కాంతితో శోభిల్లే పొదములతో ఆమె రాజహంస వలే నడచుచుండగా, అచటకు వచ్చియున్న కీర్తిమంతులగు వీరులు చూచిరి. ఆమెను చూడగానే కలిగిన కామనచే పీడించబడిన ఆ వీరులు మోహమును పొందిరి.

            ఆమె ఉత్సవయాత్ర అనే మిషతో తన సౌందర్యమును శ్రీకృష్ణ భగవానుని కొరకు సమర్పించుచుండెను. రాజుల మనస్సులు ఆమె యొక్క సుఖకరమైన నవ్వుచే, సిగ్గుతో కూడిన చూపులచే దోచివేయబడినవి. ఏనుగులు, గుర్రములు, రథముల పైనున్న ఆ రాజులు ఆమెను చూచి మోహితులై ఆయుధములను విడిచి పెట్టి నేల పై పడిరి.

ఆమె ఈ విధముగా పద్మపు మొగ్గలవంటి కాళ్లతో మెల్లగా అడుగులు వేస్తూ శ్రీకృష్ణ భగవానుని రాకకై ఎదురు చూచుచుండెను. ఆమె ఎడమ చేతి గోళ్లతో ముంగురులను సవరిస్తూ సిగ్గుతో కడగంటి చూపులతో, వచ్చి నేలగూలియున్న రాజులను చూచెను. అప్పుడామెకు శ్రీకృష్ణ భగవానుడు కనబడెను.

ఆ రాజపుత్రి రథము నెక్కబోవుచుండగా లక్ష్మీపతియగు శ్రీకృష్ణ భగవానుడు గరుడుడు ధ్వజమునందు గల రథము పై ఆమెనెక్కించి తీసుకొని వెళ్లాను. ఆయన తనను చూచుచున్న శత్రువులను లెక్క చేయలేదు. ఈ విధముగా ఆయన రాజుల మండలమును తిరస్కరించెను.

సింహము తన భాగమును తీసుకొని తోడేళ్ల మధ్యనుండి వెళ్లినట్లుగా, శ్రీకృష్ణ భగవానుడు బలరాముడు మొదలగువారితో గూడి అక్కడనుండి తాపీగా వెళ్లాను.

             జరాసంధుని చెప్పుచేతలలో ఉంటూ అహంకరించిన శత్రువులకు ఆ రుక్మిణీహరణము పెద్ద పరాభవమయ్యెను. వారికి ఆ అపకీర్తి సహింప రానిదాయెను. . వారు ఇట్లు తలపోసిరి -- అయ్యో! మనకు నింద యగుగాక! ధనుర్ధారులమగు మన కీర్తిని గోపాలకులు, సింహముల కీర్తిని లేళ్లు వలె, అపహరించిరి.

శ్రీమద్బాగవత మహాపురాణము పదవ స్కంధములో

శ్రీకృష్ణుడు రుక్మిణిని కొనిపోవుటను వర్ణించే

ఏబది మూడవ అధ్యాయము ముగిసినది.