శ్రీ మద్భాగవతము - దశమ (10వ) స్కందము
24 - శ్రీకృష్ణుడు ఇంద్రయాగమునాపుట
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- శ్రీకృష్ణ భగవానుడు బలరామునితో గూడీ ఆ బృందావనమునందే నివసించుచుండెను. గోపాలకులు ఇంద్రయాగమునకు ఉద్యమించుచుండుటను ఆయన చూచెను.
సకలప్రాణులకు ఆత్మ యై సర్వమునకు సాక్షి యగు శ్రీకృష్ణ భగవానునకు వారి అభిప్రాయము తెలియును. ఐననూ, ఆయన నందుడు మొదలుగా గల పేదలకు వినయముగా మనుసు గించి స్పంచేము
ఓ తండ్రీ! నాకు చెప్పడు. మీరు ఉత్సాహముగా చేయదల పెట్టిన ఈ కార్యమేమి? ఈ యజ్ఞమునకు ఫలమేమి? దేవత యెవరు ? సాధనమేది? యజమానుడెవరు?
ఓ తండ్రీ! నాకు వినాలని చాల కోరిక గలదు. (మీరు పెద్ద కోరికతో చేయుచున్నారు). కావున, నాకీ విషయమును చెప్పడు. ఏలయన, ఈ లోకములో సర్వమును ఆత్మరూపముగా చూసే సజ్జనులకు తనవారు, పరాయివారు అనే తేడాలు ఉండవు. వారికి మిత్రులు, ఉదాసీనులు, శత్రువులు అనే విభాగములు ఉండవు. అట్టివారికి దాచి పెట్టదగిన కార్యమేదియు ఉండనే ఉండదు.
శత్రువునకు వలే ఉదాసీనునకు కూడ రహస్యకార్యమును చెప్పరాదు. కాని, మిత్రుడు ఆత్మవంటివాడని పెద్దలు చెప్పెదరు (కాన, మిత్రునకు రహస్యమును చెప్పదగును).
మానవుడు తెలిసి మరియు తెలియకుండా కూడ కర్మలను చేయును. తెలిసి చేసినవానికి కర్మ సిద్దించును. కాని, తెలియకుండా చేయువానికి కర్మ అదే స్థాయిలో ఫలమునీయదు.
అది యట్లుండ, ఈ వైదికకర్మ అనే ఉపాయమును గురించి మీరు ముందుగా విచారము చేసినారా? లేక, ఇరీ, లౌకికమైన కర్మయేనా? ప్రశ్నించుచున్న నాకు సరిగ్గా చెప్పుడు.
నందుడిట్లు పలికెను --- ఇంద్రభగవానుడు వర్షాధిపతి. మేఘములు ఆయనకు తన రూపములే. అవి అంతటా వర్షించి ప్రాణులకు ప్రీతిని కలిగించి, ప్రాణములను నిలబెట్టును.
అబ్బాయీ! మనమే కాకుండా ఇతరమానవులు కూడ నీటిని వర్షించే మేఘములకు ప్రభుడగు దేవేంద్రుని ద్రవ్యములతో పూజించెదరు. ఆ ద్రవ్యములు ఆయన అనుగ్రహించిన వర్షము వలన ఉత్పన్నమైనవే.
ఆ యాగము చేయగా మిగిలిన ద్రవ్యములతో జనులు జీవిస్తూ ధర్మార్థ కామములను సాధించుకొనెదరు. మానవుల కృష్యాది వ్యాపారములకు ఫలమును ఉత్పన్నము చేసేది వర్షాధిపతియగు ఇంద్రుడే.
ఈ విధముగా ఈ ధర్మము. పరంపరగా వచ్చుచున్నది. దీనిని ఏ వ్యక్తి యైతే భోగాసక్తి వలన, ధనలోభము వలన, దానిని వ్యతిరేకించువారి భయము వలన, లేదా దేవతాద్వేషము వలన విడిచి పెట్టునో, అట్టి వానికి, శుభము కలుగదు.
శ్రీ శుక మహర్షి ఇట్లు పలికెను --- నందుడు మరియు గోకులములో నివసించే ఇతరులు చెప్పిన ఆ మాటను విని, శ్రీకృష్ణ భగవానుడు తండ్రితో నిట్లనెను. ఆయన పలుకులు ఇంద్రునకు కోపము తెప్పించెను.
శ్రీకృష్ణ భగవానుడిట్లు పలికెను --- జీవుడు కర్మ చేతనే పుట్టి కర్మ చేతనే మరణించును. జీవుడు కర్మ చేతనే సుఖదుఃఖభయ క్షేమములను పొందుచున్నాడు.
జీవుల కర్మలకు ఫలమునిచ్చే ఈశ్వరుడొకడు ఉన్నట్లైతే, ఆ ఈశ్వరుడు కూడ కర్మలను చేసినవానికే ఫలమునిచ్చును. కర్మను. చేయనివానికి ఆయన కూడ ఫలమునీయలేడు గదా!
మానవులకు పూర్వసంస్కారములచే కలిగించబడే సుఖదుఃఖములను మార్చే శక్తి ఇంద్రునికి లేదు. ఈ లోకములో తమ తమ కర్మల ఫలములననుభవించే ప్రాణులకు అట్టి ఇంద్రునితో పని యేమున్నది?
జీవుడు స్వభావము (ఆజ్ఞానము) నకు వశుడై స్వభావమునే అనుసరించును. దేవతలు, రాక్షసులు, మానవులతో సహా సకలజగత్తు స్వభావమునందే నిలిచి యున్నది.
జీవుడు కర్మచే ఉత్కృష్టనికృష్ణములగు దేహములను పొంది విడిచి పెట్టుచుండును. శత్రువు, మిత్రుడు, ఉదాసీనుడు, గురువు కర్మఫలముగనే లభించెదరు. ఈశ్వరకృప కూడ పుణ్యకర్మాధీనమే.
కావున, మానవుడు కర్మను బాగుగా పూజించవలెను. వ్యక్తి స్వభావమునకు వశుడైయున్నంతవరకు స్వధర్మమునాచరించవలెను. వ్యక్తి దేనిచే సుఖముగా మనగల్గునో, అదియే వానికి దైవము.
అయోగ్యురాలగు యువతి విటుని ఆశ్రయించినట్లుగా, ఎవడైతే ఒకదానిని బ్రదుకు దెరువుగా చేసుకొని జీవించి మరియొకదానిని జీవికకై ఆశ్రయించునో (సేవించునో), అట్టివాడు దాని వలన క్షేమమును పొందడు.
బ్రాహ్మణునకు వేదము, క్షత్రియునకు భూపాలనము, వైశ్యునకు వార్త, శూద్రునకు వారికి సేవలనందించుట అనునవి జీవిక కాదగును.
వ్యవసాయము, వర్తకము, గోవులను పాలించుట, ధర్మవడ్డీ వ్యాపారము అని వార్త నాల్గు రకములుగా నున్నది. మన కైతే ఎల్లవేళలా గోపాలనమే జీవిక.
సత్త్వగుణము స్థితికి, రజోగుణము సృష్టికి, తమోగుణము ప్రళయమునకు హేతువులు. స్త్రీపురుష సంయోగముచే పలు రకముల ప్రాణులతో విరాజిల్లే జగత్తు రజోగుణము కారణముగా పుట్టుచున్నది.
రజోగుణముచే ప్రేరితములై మేఘములు అంతటా జలములను వర్షించును. ప్రాణులు ఆ జలములతోనే జీవించును. దేవేంద్రుడు చేసేదేమున్నది? (ఏమీ లేదు).
ఓ తండ్రీ! మనకు దేశములు గాని, నగరములు గాని, గ్రామములు గాని, గృహములు గాని లేవు. మనము ఎల్లవేళలా అడవులయందు పర్వతములపై నివసించువారము.
కావున, గోవులను, వేదవేత్తలను, పర్వతమును ఆరాధించే యజ్ఞమును ఆరంభించుడు. ఇంద్రయాగముయొక్క సామగ్రి యేది గలదో, దానితో ఈ యాగమును నిర్వర్తించుడు.
పాయసము, పప్పు, గోధుమ రవ్వ ఉప్మా, అప్పములు, చేగోడీలు మొదలైన పలు రకముల వంటలను చేయుడు. అందరి ఇళ్లలోని పొలను, పెరుగును కూడ తీసుకురండు.
వేదవేత్తలగు బ్రాహ్మణులు యథావిధిగా అగ్నులయందు హోమమును చేయవలెను. మీరు వారికి పలు రకముల ఆహారమునిచ్చి, పాలిచ్చే ఆవులను దక్షిణగా ఈయవలెను.
పశుహింసకులు, నేరస్థులు మొదలైన పతీతుల వరకు, అంతిమముగా వీధి కుక్కలకు కూడ అర్హతకు తగ్గట్లుగా వస్తువులనిండు. గోవులకు గడ్డిని పెట్టుడు. పర్వతమునకు నైవేద్యమును పెట్టుడు.
భుజించి సుగంధములనలదుకోని మంచి వస్త్రములను దాల్చి మంచి సొమ్ములను పెట్టుకొని, గోవులకు, వేదవేత్తలకు, అగ్నులకు, గోవర్ధన పర్వతమునకు కూడ ప్రదక్షిణములను చేయుడు.
ఓ తండ్రీ! ఇది నా అభిప్రాయము. నచ్చినచో ఆచరించుడు. ఈ యాగము గోవులకు, వేదవేత్తలకు, గోవర్ధన పర్వతమునకు, నాకు కూడ ప్రీతికరమైనది.
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- కాలస్వరూపుడైన శ్రీకృష్ణ భగవానుడు ఇంద్రుని గర్వమునడంచ గోరి ఇట్లు చెప్పెను. నందుడు, సునందుడు మొదలుగా గలవారు ఆ మాటను బాగున్నది అంటూ స్వీకరించిరి.
మధువు అనే రాక్షసుని సంహరించిన శ్రీకృష్ణ భగవానుడెట్లు చేప్పెనో, వారదే విధముగా సర్వమును చేసిరి. వారు వేదవేత్తలచే స్వస్తివాచనమును చేయించిరి. ఆ ఇంద్రయాగసంభారములతో గోవర్ధన పర్వతమునకు, వేదవేత్తలకు, గోవులకు సకలములైన ధూపదీపనైవేద్యాదులను, గోవులకు గడ్డిని వారు. ఆదరముగా సమర్పించిరి. తరువాత వారు గోసంపదలు ముందు నడువగా పర్వతమునకు ప్రదక్షిణమును చేసిరి.
ఆ గోపాలకులు వేదవేత్తల ఆశీర్వచనములను తీసుకొనిరి. గోపికలు కూడ బాగుగా అలంకరించుకొని ఎద్దులను కట్టిన బళ్లనెక్కి శ్రీకృష్ణుని పరాక్రమ గాథలను గానము చేసిరి.
శ్రీకృష్ణుడైతే గోపాలకులకు విశ్వాసమును కలిగించుటకై పర్వతము పైన మరియొక పెద్ద శరీరము గల రూపమును దాల్చెను. పర్వతమును నేనే అని చెప్పి, ఆయన అధికమగు నైవేద్యమును భక్షించెను.
ఆ శ్రీకృష్ణుడు గోకులవాసులతో కూడి స్వయముగా ఆ తన రూపము కొరకు నమస్కారము చేసెను. ఆశ్చర్యము! చూడుడు. ఈ పర్వతము రూపు దాల్చి మనలననుగ్రహించినది, (అని వారు పలికిరీ).
కోరుకున్న రూపమును దాల్చే ఈ పర్వతము అడవిలో ఉంటూ అవమానించే జనులను హింసించును. కావున, మనల మరియు గోవుల క్షేమము కొరకై దీనికి నమస్కరించెదము.
ఈ విధముగా ఆ గోపాలకులు వసుదేవపుత్రుడగు శ్రీకృష్ణునిచే ప్రేరితులై గోవర్ధనపర్వతమును, గోవులను, వేదవేత్తలను ఆరాధించిరి. తరువాత వారు శ్రీకృష్ణునితో గూడి గోకులమునకు వెళ్లిరి.
శ్రీమద్బాగవత మహాపురాణము పదవ స్కంధము పూర్వార్ధములో శ్రీకృష్ణుడు ఇంద్రయాగమునాపుటను వర్ణించే ఇరువది నాల్గవ అధ్యాయము ముగిసినది (24).
