శ్రీ మద్భాగవతము - దశమ (10వ) స్కందము

Table of Contents

44 - శ్రీకృష్ణుడు చాణూరాదులను కంసుని సంహరించి ఉద్ధరించుట

శ్రీశుక ఉవాచ ।

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- మధువును మట్టుబెట్టిన శ్రీకృష్ణ భగవానుడీ విధముగా చర్చించి నిశ్చితమగు సంకల్పమునకు వచ్చెను.ఆయన చాణూరుని, రోహిణి పుత్రుడగు బలరాముడు ముష్టికుని ఎదుర్కొనిరి.

వారు (మల్లక్రీడలో) నెగ్గాలనే కోరికతో ఒకరిని మరియొకరు చేతులతో చేతులను, కాళ్లతో కాళ్లను కూడ బంధించి బలముగా పట్టి లాగిరి.

వారిద్దరు (శ్రీకృష్ణ - చాణూరులు, బలరాము - ముష్టికులు) ఒకరినొకరు మోచేతులను మోచేతులతో, మోకాళ్లను మోకాళ్లతో, తలను తలతో, వక్షఃస్థలమును కూడ వక్షఃస్థలముతో కొట్టుకొనిరి.

ఒకరిని మరియొకరు పట్టి గిర గిర త్రిప్పుట, త్రోసివేయుట, కౌగిలిలో బిగించుట, క్రింద పడద్రోయుట, ముందుకు దుముకుట, వెనుకకు తగ్గుట మొదలగు విన్యాసములతో ఒకరి ఉద్యమమును మరియొకరు అడ్డుకొనిరి.

వారు ఒకరినొకరు జయించగోరి ప్రతిస్పర్ధి దేహమును ముద్దగా చేసి పైకెత్తుట, చేతులను పట్టి పైకెత్తుట, విదలించి కొట్టుట, నేలపై నొక్కి ఉంచుట మొదలైన విన్యాసములతో, ఒకరి దేహమునకు మరియొకరు పీడను కలిగించిరి.

ఓ పరీక్షిన్మహారాజా! స్త్రీలందరు గుంపులుగా కలిసివచ్చిరి. వారా యుద్ధమును చూసి దయ గలవారై, ఇది బలహీనులకు బలవంతులతో జరిగే యుద్ధము, అని ఒకరితోనొకరు చెప్పుకొనిరి.

అయ్యో! రాజు యొక్క సభలోని జనులకు ఇది పెద్ద అధర్మము. ఎందుకంటే, చూచుచుండగనే (రాజుననుసరించి) బలహీనులగు పిల్లలకు బలవంతులగు మల్లులతో జరుగుచున్న యుద్ధముననుమోదించుచున్నారు.

అవయవములన్నింటియందు వజ్రము యొక్క చేవ కలిగి గొప్ప పర్వతమును పోలిన మల్లులెక్కడ? మిక్కిలి సుకుమారమైన దేహములు గల ఇంకా యౌవనము రాని ఆడుకునే పిల్లలెక్కడ? (పోలిక లేదు).

ఈ సభాసదులకు నిశ్చయముగా ధర్మమునుల్లంఘించిన పాపము కలుగును. ఎక్కడనైతే అధర్మము బలపడునో, ఆ స్థానము ఏదైనా, అచట ఉండరాదు.

సభ్యులలోని దోషము గురించి తెలిసిన బుద్ధిమంతుడగు వ్యక్తి ఆ సభకు పోరాదు. ఎందుకంటే, అక్కడకు వెళ్లిన వ్యక్తి సత్యము తెలిసి పాపమును చెప్పకున్నా, తప్పుగా చెప్పినా, తెలిసి నాకు తెలియదని చెప్పినా కూడ పాపమును పొందును.

శత్రువగు చాణూరుని చుట్టూ పరు గెత్తుచున్న శ్రీకృష్ణుని పద్మమువంటి ముఖమును చూడుడు. చెమట బిందువులతో నిండిన ఆ ముఖము నీటి బిందువులతో కూడిన పద్మపు మొగ్గను పోలియున్నది.

బలరాముని ముఖము కొంచెము ఎర్రనైన కళ్లతో, ముష్టికుని యెడల కోపముతో, నవ్వు యొక్క వేగముతో శోభిల్లుచున్నది. మీకు కనబడ లేదా?

ఆహా! గోకులమునందలి స్థానములు పావనములు. ఎందుకంటే, కైలాసాధిపతియగు శివునిచే మరియు లక్ష్మీదేవిచే ఆరాధించబడే పాదములు ఈ పురుషోత్తముడు మనుష్యవేషముతో ఎవరికీ తెలియకుండా అచట సంచరించును. బలరాముడు తోడు కాగా, ఈయన అడవియందలి రంగు రంగుల పూల మాలను దాల్చి, గోవులను కాపలా కాస్తూ, వేణువును వాయిస్తూ, వివిధ క్రీడలతో విహరించును.

గోషికలు ఏమి తపస్సును చేసిరో? ఎందుకంటే, వారు ఈ శ్రీకృష్ణుని లావణ్యము యొక్క సారమైన ముఖమును కన్నులతో సానము చేసెదరు. ప్రతి క్షణము నూతనమైన ఈ రూపముతో సమానమైనది గాని, గొప్పది సమానము గాని మరియొకటి లేదు. పొంద శక్యము కాని ఈ రూపము ఇతరములగు ఆభరణాదులచే సిద్ధించేది కాదు. రూపము కీర్తికి, శోభకు, ఈశ్వరభావమునకు ఏకైకనిత్యనివాసస్థానము.

            గోపికలు ధన్యలు. వారి బుద్ధి ఈ శ్రీకృష్ణుని పై ప్రేమతో నిండినది. పాదములతో ముల్లోకములను కొలిచిన ఈ భగవానుని తలపు వారి కళ్లకు నీటిని, కంఠమునకు డగ్గుత్తికను కలిగించును. పనులను చేసుకునేటప్పుడు కూడ వారి మనస్సు ఆయనమీదనే లగ్నమై యుండును. పాలసు పితుకుట, ధాన్యమును దంపుట, పెరుగు చిలుకుట, నీళ్లు చల్లుట, ఉయ్యాలనూపుట, ఏడ్చే పిల్లవానిని సముదాయించుట, (ఆ పిల్లలకు స్నానము చేయించుట), మొక్కలకు నీళ్లసు పోయుట, ఇంటిని తుడుచుట, స్నానమును చేయుట మొదలగు పనులను చేసుకుంటూ వారు ఈ శ్రీకృష్ణుని లీలలను గానము చేయుదురు.

ఈతడు గోవులతో బాటుగా ఉదయమే గోకులమునుండి అడవికి వెళ్లి సాయంకాలమగుసరికి వేణువును వాయించుకుంటూ తిరిగి వచ్చును. గోపికలు మహాపుణ్యవతులు. వారా వేణునాదమును విని వెంటనే బయటకు వచ్చి మార్గములో చిరునవ్వుతో కూడిన ఆయన ముఖమును చూచెదరు. ఆయన వారివైపు దయతో చూచును.

భరతవంశీయులలో శ్రేష్ఠుడవగు ఓ పరీక్షిన్మహారాజా! స్త్రీలు ఇట్లు మాటలాడుచుండగనే పాపనాశకుడగు శ్రీకృష్ణ భగవానుడు శత్రువును అంతమొందించుటకు సంకల్పించెను. ఆయన యోగసిద్ధులకధీశ్వరుడు.

బలరామకృష్ణుల తల్లిదండ్రులగు దేవకీవసుదేవులు కారాగారములో ఉండిరి. స్త్రీల భయపూర్ణమగు పలుకులు వారి చెవిన పడినవి. వారికి తమ పుత్రుల శక్తి గురించి తెలియదు. పుత్రులయందలి ప్రేమచే శోకముతో వారు చాల ఆదుర్దాను, మనస్తాపమును పొందిరి.

శ్రీకృష్ణ భగవానుడు, చాణూరుడు ఒకరితోనొకరు పలురకములైన ఆయా మల్లయుద్ధపద్ధతులతో యుద్ధమును చేసిరి. బలరాముడు, ముష్టికుడు కూడ అటులనే యుద్ధము చేసిరి.

శ్రీకృష్ణ భగవానుడు చేతులతో, మోకాళ్లతో కొట్టిన దెబ్బలు వజ్రము యొక్క దెబ్బలవలె చాల కఠోరముగా నుండెను. ఆ దెబ్బలకు చాణూరుని వయవములు నుజ్జు అగుచుండెను. ఆతనికి అధికమగు పీడ కలిగెను.

ఆ చాణూరుడు డేగ యొక్క వేగమువంటి వేగము గలవాడు. వాడు కోపముతో పైకెగిరి రెండు చేతులను పిడికిలిగా చేసి, వసుదేవపుత్రుడగు శ్రీకృష్ణ భగవానుని వక్షఃస్థలము పై కొట్టెను.

శ్రీకృష్ణ భగవానుడు మాలచే కొట్టబడిన ఏనుగు వలె ఆ దెబ్బకు చలించలేదు. ఆయన చాణూరుని రెండు చేతులను గట్టిగా పట్టుకొని పలు మార్లు గిర గిరా త్రిప్పెను.

ఆ వేగమునకు వాని పై ప్రాణములు పైనే పోయెను. శ్రీకృష్ణుడు వానిని నేలపై వేసి కొట్టెను. ఆభరణములు, కేశములు, మాలలు చెల్లాచెదరై వాడు ఇంద్రుని పూజకై నిలబెట్టిన జెండా వలె నేల గూలెను.

బలరామముష్టికుల యుద్ధము కూడ అదే రీతిలో సాగెను. ముందుగా ముష్టికుడు బలశాలియగు బలరాముని తన పిడికిలితో కొట్టగా, ఆయన వానిని అరచేతితో గట్టిగా చెంపకాయ కొట్టెను.

ఆ దెబ్బకు ఆ ముష్టికుడు వణికిపోయి చాల పీడను పొందెను, వాడు నోటినుండి రక్తమును క్రక్కుతూ ప్రాణములు పోయి, గాలిచే పెకిలించివేయబడిన చెట్టువలె, నేల పై గూలెను.

ఓ పరీక్షిన్మహారాజా! తరువాత వరుసలో కూటుడు ముందుకు వచ్చెను. యోద్ధలలో దిట్టయగు బలరాముడాతనిని తిరస్కారపూర్వకముగా ఎడమ చేతి పిడికిలితో కొట్టి అవలీలగా సంహరించెను .

అదే సమయమునందు శ్రీకృష్ణుడు కాలితో శలుని తలను ఊడగొట్టి, తోశలకుని రెండుగా చీల్చెను. వారిద్దరు ఆ విధముగా నేల గూలిరి.

చాణూర ముష్టిక కూట శల తోశలకులు (ఈ తీరున) సంహరించబడిరి. మిగిలిన మల్లులందరు ప్రాణములను కాపాడుకొనగోరి పారిపోయిరి.

అప్పుడు వాద్యములు మ్రోగించబడెను. బలరామకృష్ణుల కాలి యందెలు శబ్దమును చేయుచుండెను. వారు తమ మిత్రులైన గోపాలకులను చేయి పట్టుకు లాగి వారితో కలిసి మల్లుల చేష్టలను చేస్తూ విహరించిరి.

కంసుని తప్పించి జనులందరు బలరామకృష్ణులు చేసిన పనికి హర్షమును పొందిరి. బ్రాహ్మణ శ్రేష్ఠులు, సజ్జనులు బాగు, బాగు అని కొనియాడిరి.

మల్లులలో శ్రేష్ఠులు సంహరించబడగా మిగిలినవారు పారిపోయిరి. అప్పుడు కంసుడు తన వాద్యముల వారిని ఆపి స్పష్టముగా ఈ మాటను పలికెను.

వసుదేవుని పుత్రులగు బలరామకృష్ణులు దుష్టమగు చేష్టలు గలవారు. వారిని నగరమునుండి బహిష్కరించుడు. గోపాలకుల లాగుకొనుడు. దుర్బుద్ధియగు నందుని బంధించుడు.

వసుదేవుడు దుర్బుద్ధి, ముర్బుద్ధి, పరమదుష్టుడు. వానినైతే వెంటనే చంపివేయుడు. ఉగ్రసేనుడు నా తండ్రియే అయినా, తన అనుచరులతో కూడి శత్రువుల పక్షములో చేరినాడు.

కంసుడీ విధముగా వదరుచుండగా శ్రీకృష్ణునకు చాల కోపము వచ్చెను. ఆయన బలమేమియు క్షీణించలేదు. ఆయన లాఘవముచే వేగముగా పైకెగిరి ఎత్తైన సింహాసనమునెక్కెను.

కంసుడు కత్తిని చేతబట్టి ఆకాశములో డేగ వలె కుడి ఎడమలకు తిరుగుచుండెను. శ్రీకృష్ణుని తేజస్సు మిక్కిలి సహించ శక్యము కానిది. ఆయన వెంటనే వానిని, పపుత్రుడగు గరుడుడు పామును వలె, బలముగా గట్టిగా పట్టుకొనెను.

శ్రీకృష్ణ భగవానుడు స్వతంత్రుడు, జగత్తునకు ఆశ్రయమైనవాడు. ఆయన అల్లల్లాడే కిరీటము గల కంసుని జుట్టు గట్టిగా పట్టుకొని ఎత్తైన సింహాసనమునుండి మల్లరంగముపై పడవైచి వాని పైన తాను పడెను.

ఓ పరీక్షి ద్రాజా! జనసమూహము చూచుచుండిరి. సింహము ఏనుగును వలె, శ్రీకృష్ణుడు మరణించిన ఆ కంసుని నేలపై లాగెను. అప్పుడుజనులందరు కలిసి అయ్యో! అయ్యో! అంటూ చాల పెద్ద శబ్దము చేసిరి.

భయముతో నిండిన బుద్ధి గల ఆ కంసుడు అన్ని వేళలా నీటినిత్రాగుతూ, మాటలాడుతూ, సంచరిస్తూ, నిద్రిస్తూ, గాలిని పీలుస్తూ,చక్రము ఆయుధముగా గల ఆ శ్రీకృష్ణ భగవానుని తన యెదుట చూచెను.అందువలననే, ఆతడు పొంద శక్యము కాని అదే రూపమును పొందెను.

ఆ కంసునకు కంకుడు, న్యగ్రోధకుడు మొదలగు ఎనమండుగురుతమ్ములు గలరు.
కోపించి అన్నగారి ఋణమునుతీర్చుకొనగోరి బలరామకృష్ణుల పైకి ఉరికిరి.

విధముగా కంసుని తమ్ములైతే అధికమగు వేగముతో కయ్యమునకు కాలు దువ్వుచుండిరి. రోహిణీనందనుడగు బలరాముడుఇనుప గుదీయను పైకెత్తి వారిని, సింహము పశువులను వలె, వధించెను.

ఆకాశములో దేవదుందుభులు మ్రోగినవి. భగవానుని విభూతులైన(అంశలు) బ్రహ్మదేవుడు, శివుడు, ఇంద్రుడు మొదలగువారు హర్షముతోశ్రీకృష్ణునిపై పూలను చల్లి స్తుతించిరి. అప్సరసలు నాట్యము చేసిరి.

ఓ పరీక్షిన్మహారాజా! కంసుని భార్యలు మరియు వాని సోదరుల భార్యలు తమ తమ భర్తల మృతికి దుఃఖించుచుండిరి. వారి కన్నులు కన్నీటితో నిండిపోయెను. వారు తలలను కొట్టుకుంటూ అచటకు వచ్చిరి.

దుఃఖముతో నిండిన ఆ స్త్రీలు వీరశయ్యయైన యుద్ధభూమిలో వాలిపోయిన తమ భర్తలను కౌగిలించుకొని నిరంతరముగా కన్నీటిని విడుస్తూ బిగ్గరగా రోదించిరి.

అయ్యో! ప్రియమైన నాథా! నీవు ధర్మము తెలిసినవాడవు, దయ గలవాడవు, నాథుడు లేని వారియందు ప్రేమ గలవాడవు. నీవు వధించబడగా, నీవారలమైన మేము ఇళ్లు పిల్లలతో సహా హతులమైతిమి.

ఓ పురుష శ్రేష్ఠా! మాకు, ఈ నగరమునకు ప్రభుడవగు నీవు లేకుండా పోయినావు. మాకు, నగరమునకు ఉత్సవము, మంగళము దూరమైనవి. మేము శోభిల్లము, ఈ నగరము శోభిల్లదు.

ఓయీ! నీవు నిరపరాధులగు ప్రాణులకు ఘోరమైన ద్రోహమును చేసితివి. అదియే నిన్నీ దుఃస్థితికి చేర్చినది. ప్రాణులకు ద్రోహమును చేసే ఎవడు సుఖమును పొందును? (ఎవ్వడైననూ పొందడు).

ఈ శ్రీకృష్ణుడు ఈ లోకములోని సకల ప్రాణులను సృష్టించి, పాలించి, తనలో విలీనము చేసుకొనే పరమేశ్వరుడే. ఆయనను అవమానించే వ్యక్తి ఏ దేశమునందైననూ ఏ కాలమునందైననూ సుఖముగా వర్ధిల్లడు.

శ్రీ శుక మహర్షి ఇట్లు పలికెను --- లోకములకు మనుగడనిచ్చే శ్రీకృష్ణ భగవానుడు రాజపత్నులనోదార్చెను. మరణించినవారలకు పరలోకమునకు చెందిన ఏ అపరకర్మను స్మృతికారులు చెప్పిరో, దానిని వధించబడిన కంసాదులకు ఆయన చేయించెను.

తరువాత బలరామకృష్ణులు తల్లిదండ్రులను చెరనుండి విడిపించి వారి పాదములకు తల మోపి నమస్కారమును చేసిరి.

తమకు నమస్కారము చేసిన పుత్రులిద్దరు జగన్నాథులని గుర్తించిన దేవకీవసుదేవులు (అపరాధమగునేమోననే) శంకతో వారిని కౌగిలించుకొనలేదు.

శ్రీమద్భాగవత మహాపురాణము పదవ స్కంధములో

శ్రీకృష్ణుడు చాణూరాదులను కంసుని సంహరించి ఉద్ధరించుటను వర్ణించే

నలుబది నాల్గవ అధ్యాయము ముగిసినది (44).