శ్రీ మద్భాగవతము - దశమ (10వ) స్కందము

Table of Contents

19 - శ్రీకృష్ణుడు గోవులను గోపాలకులను దావాగ్నినుండి రక్షించుట

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- గోపాలకులు ఆటలలో నిమగ్నులై యుండగా యథేచ్చగా మేయుచున్న వారి గోవులు గడ్డిచే ఆకర్షితములై చాల దూరము వెళ్లి, దట్టని అడవిని ప్రవేశించినవి.

మేకలు, గోవులు, గేదెలు ఒక అడవినుండి మరియొక అడవిలోనికి వెళూ, రెల్లు గడ్డి ఉన్న అడవిలోనికి ప్రవేశించినవి. అవి వేసవి తాపముచే దప్పిక గొని ఆక్రోశించుచుండెను.

శ్రీకృష్ణుడు, బలరాముడు, సుదాముడు మొదలుగా గల ఆ గోపాలకులకు పశువులు కనబడలేదు. వారు ఆటలలో మునిగినందుకు పశ్చాత్తాపపడిరి. అప్పుడు వెదికిననూ వారికి పశువుల జాడ తెలియలేదు.

 వారికి ఆ పశువులే బ్రదుకు దెరువు. అవి కనబడకపోవుట వలన వారి చిత్తములు వ్యాకులమయ్యేమ. గోవులు సేవించిన గడ్డి మైదానములలో గడ్డి పరకలు వాటి డెక్కలచే, దంతములచే త్రింపబడి యుండును. ఆ గడ్డిని బట్టి, వాటి డెక్కల గుర్తులను బట్టి దారిని తెలుసుకుంటూ ఆ దారి వెంబడి వారు వెళ్లిరి.

 రెల్లు గడ్డి దట్టముగానున్న అడవిలో వారి పశుసంపద దారి తప్పి ఆక్రోశించుచుండెను. వారా గోవులను కనుగొనిరి. వారు కూడ. అలసి దప్పికతో నుండిరి. వారా గోవులను ఆ అడవినుండి వెనుకకు మళ్లించిరి.

శ్రీకృష్ణ భగవానుడు మేఘగర్జనవంటి గంభీరమగు స్వరముతో ఆ ఆవులను పిలిచేను. తమ పేర్లను వింటూనే. అవి మహానందమును పొంది, అంబారవముతో బదులు చెప్పినవి.

అప్పుడు అనుకోకుండా (ఈశ్వరేచ్ఛచే) పెద్ద కార్చిచ్చు ఆవిర్భవించెను. అది భయంకరమగు కొరివిలతో కదిలే మరియు కదలని  ప్రాణులను అధికముగా మ్రింగివేస్తూ అడవిలోని ప్రాణులను అన్ని వైపులనుండియు వినాశము చేయజొచ్చెను. ఆ అగ్నికి వాయువు తోడై ప్రేరేపించెను.

 ఆ కార్చిచ్చు చుట్టుకుంటూ మీదకు వచ్చుచుండెను. దానిని చూచి గోపాలకులు, గోవులు కూడ భయపడిపోయిరి. ఆ గోపాలకులు బలరామునితో కూడియున్న శ్రీకృష్ణుని, మరణమునకు భయపడి పీడితులైన జనులు శ్రీహరిని వలే, శరణు వేడి పలికిరి.

ఓ శ్రీకృష్ణా! శ్రీకృష్ణా! నీవు గొప్ప వీరుడవు. ఓ బలరామా! నీ పరాక్రమమునకు హద్దులు లేవు. మేము కార్చిచ్చుచే కాల్చివేయబడుతూ శరణు వేడుచున్నాము. మమ్ములను నీవు కాపాడ తగుదువు.

ఓ శ్రీకృష్ణా! నీకు సకలధర్మములు తెలియును. నీ బందుగులమగు మేము నశించ వలసిన వారము కాము. ఇది నిశ్చయము. ఎందుకంటే, మాకు రక్షకుడవు, పరమగతివి నీవే.

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ప్రియమిత్రుల దీనమైన మాటను విన్న శ్రీకృష్ణ భగవానుడు - భయపడకుడు, కళ్లను మూసుకొనుడు -- అని పలికెను.

వారు సరే అని కళ్లను మూసుకొనిరి. యోగసిద్దులకధీశ్వరుడగు శ్రీకృష్ణ భగవానుడు భయమును గొల్పే అగ్నిని నోటితో త్రాగి వారిని ఆపదనుండి విడిపించెను.

తరువాత వారు కళ్లను తెరచి చూచుసరికి మరల భాండీరమనే మర్రి వద్దకు చేర్చబడిరి. తాము, గోవులు - కూడ కార్చిచ్చునుండి విముక్తలగుటను గాంచి వారు ఆశ్చర్యచకితులైరి.

శ్రీకృష్ణుడు యోగమాయచే వారిని కార్చిచ్చునుండి కాపాడెను. ఆయనయొక్క ఆ యోగశక్తిని చూచి వారు ఆయన దేవతయని తలచిరి.

దుష్టజనశిక్షకుడగు శ్రీకృష్ణుడు బలరామునితో గూడి సాయంకాలము గోవులను వెనుకకు మళ్లించి గోకులమునకు వెళ్లాను. ఆయన దారిలో పిల్లనగ్రోవి పై వివిధస్వరములను పలికిస్తూ ఉంటే చుట్టూ ఉన్న గోపాలకులు ఆయనను స్తుతించిరి.

 గోవులను పాలించే శ్రీకృష్ణుని చూడగానే గోపికలకు మహానందము కలిగెను. ఆయన లేకుండా వారికి క్షణము వంద యుగముల వలె నుండెను.

శ్రీమద్బాగవత మహాపురాణమునందు పదవ స్కంధము పూర్వార్ధములో శ్రీకృష్ణుడు గోగోపాలకులను దావాగ్నినుండి రక్షించుటను వర్ణించే పందొమ్మిదవ అధ్యాయము ముగిసినది(19).