శ్రీ మద్భాగవతము - దశమ (10వ) స్కందము
80 - కుచేలోపాఖ్యానము - శ్రీకృష్ణుడు సుదాముని స్వాగతించుట
పరీక్షిన్మహారాజు ఇట్లు పలికెను --- పూజనీయుడవగు ఓ మహర్షీ! మోక్ష ప్రదాతయగు శ్రీకృష్ణుడు అనంతమైన శక్తి గల మహాత్ముడు. ఓ ప్రభూ! ఆయన మహిమను సూచించే లీలలు ఇంకనూ ఏవి గలవో, వాటిని మేము వినగోరుచున్నాము.
ఓ మహర్షీ! కామనలనే బాణములచే విషాదమును పొంది వివేకమును తెలుసుకున్న ఎవ్వాడు శ్రీహరియొక్క కల్యాణకరగాథలనుండి విమించును? (ఎవ్వడైననూ విరమించడు). అట్టివాడు పవిత్రకీర్తియగు శ్రీహరియొక్క గాథలను పలుమార్లు వినును.
ఆ శ్రీహరి గుణములను స్తుతించే వాక్కే వాక్కు. ఆయన కొరకు కర్మలను చేసే చేతులే చేతులు. స్థావరజంగమములగు , ప్రాణులలో ఆత్మరూపుడై నివసించే ఆ శ్రీహరిని స్మరించే మన స్సే మనస్సు. ఆయనయొక్క పావనగాథలను వినే చెవులే చెవులు.
ఆ శ్రీహరికి ప్రతిమ మొదలైనది కదలని రూపము, భక్తులు కదిలే రూపము. ఈ రెండు రూపములకు నమస్కరించే తలయే తల. ఈ రెండు రూపములను చూచే కన్నులే కన్నులు. మరియు శ్రీహరియొక్క, ఆయన భక్తుల యొక్క పాదోదకమును సేవించే అవయవములే అవయవములు.
సూత మహర్షి ఇట్లు పలికెను --- పరీక్షిత్తు ప్రశ్నను విని పూజనీయుడు, వ్యాసపుత్రుడు అగు శుకుని హృదయము వాసుదేవ భగవానునియందు నిమగ్నమయ్యెను. ఆయన యిట్లు పలికెను.
శ్రీశుక మహర్షి పలికెను - కృష్ణునకు ఒక బ్రాహ్మణమిత్రుడు ఉండెను. బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడగు ఆతడు ఇంద్రియభోగములయందు విరక్తుడై, ఇంద్రియములను జయించి ప్రసన్నమగు మనస్సు కలిగియుండెను.
గృహస్థుడైన ఆ సుదాముడు అనుకోకుండా ఈశ్వరేచ్చచే లభించిన దానితో జీవికను గడుపుచుండెను. చివికిన వస్త్రములను ధరించే ఆయన భార్య ఆకలికి కృశించియుండును. ఆమె కూడ ఆయననే పోలియుండును.
దారిద్యముచే వ్యాకులమైన చిత్తము గల ఆ పతివ్రత ముఖములో రక్తము లేదు. ఆమె వణుకుతూ భర్తకు ఎదురుగా వచ్చి ఇట్లు పలికెను.
ఓ పూజనీయా! పూజనీయులగు తమరి మిత్రుడు యాదవశ్రేష్ఠుడగు శ్రీకృష్ణ భగవానుడు సాక్షాత్తుగా లక్ష్మీదేవికి భర్త. బ్రాహ్మణభక్తి గల ఆయన శరణాగతులకు రక్షకుడు గదా!
ఓ మహాత్మా! ఆయన సజ్జనులకు సర్వోత్కృష్టమగు ఆశ్రయము. తమరు ఆయన వద్దకు వెళ్లుడు. కుటుంబీకుడవై కష్టపడుచున్న తమరికి ఆయన అధికమగు ధనమునీయగలడు.
భోజ-వృష్టి-అంధకవంశముల యాదవులకు ప్రభుడగు శ్రీకృష్ణుడు జగత్తునకు తండ్రి. ఆయన ఇప్పుడు ద్వారకానగరమునందున్నాడు. ఆయనయొక్క కలువవంటి పాదమును స్మరించువానికి ఆయన తనను కూడ ఇచ్చివేయును. భజించువానికి మిక్కిలి అభీష్టములు కాని అర్థకామములనిచ్చునని వేరుగా చెప్పవలయునా?
ఆ బ్రాహ్మణుని భార్య ఈ తీరున పలుమార్లు మెత్తగా ప్రార్థించెను. ఉత్త మమగు కీర్తి గల శ్రీకృష్ణుని దర్శనమే గొప్ప లాభమని ఆయన తలచెను.
ఆయన ఈ విధముగా మనస్సులో బాగా ఆలోచించి వెళ్లుటకే నిశ్చయించుకొనెను. ఓ కల్యాణీ! ఇంటిలో బహుమతి ఈయదగ్గది ఏదైనా ఉందా? ఉంటే ఇమ్ము (అని భార్యను అడిగెను).
ఆమె బ్రాహ్మణగృహములలో యాచించి నాలుగు పిడికిళ్ల అటుకులను సంపాదించి, వాటిని గుడ్డ ముక్కలో కట్టి బహుమతిగా ఇచ్చుటకై భర్తకు ఇచ్చెను.
బ్రాహ్మణశ్రేష్ఠుడగు ఆ సుదాముడు వాటిని తీసుకొని, నాకు శ్రీకృష్ణుని దర్శనమెట్లు కలుగునో? అని ఆలోచిస్తూ ద్వారకకు పయనమయ్యెను.
ఆ బ్రాహ్మణుడు మూడు రాజమార్గములను (సేనానివేశములను), మూడు ప్రహరీలను కూడ దాటి ముందుకు వెళ్లాను.
అంధకవృష్టివంశీయులగు యాదవులు శ్రీకృష్ణ భగవానుని ఆరాధకులు. వారి గృహములను చేరుట దుర్ఘటము. వారి గృహములకు, పదహారు వేల శ్రీకృష్ణుని భార్యల గృహములకు మధ్యలో శ్రీకృష్ణుని (రుక్మిణి) గృహము గలదు. వేదవేత్త యైన ఆ బ్రాహ్మణుడు ఆ గృహములనన్నింటినీ దాటుకొని శోభాయుక్తమగు ఆ గృహములోనికి ప్రవేశించి, బ్రహ్మానందమును పొందినవాడు వలె ఆయెను.
ప్రియురాలగు రుక్మిణియొక్క శయ్య ను అధిష్టించియున్న శ్రీకృష్ణ భగవానుడు ఆయనను దూరమునుండి చూచెను. ఆయన వెంటనే లేచి నిలబడి ఎదు రేగి ఆనందముతో రెండు చేతులను చాచి కౌగిలించుకొనెను.
వేదవేత్త, జ్ఞాని అగు సుదాముడు శ్రీకృష్ణుని ప్రియమిత్రుడు. ఆతని రాకకు ప్రీతుడైన శ్రీకృష్ణుడాతని. శరీరముతోడి స్పర్శ వలన మహానంద మును పొంది పద్మములవంటి కన్నులనుండి ఆనందాశ్రువులను విడిచెను.
ఓ పరీక్షిన్మహారాజా! తరువాత లోకములను పవిత్రము చేసే శ్రీకృష్ణ భగవానుడు ఆయనను శయ్య పై కూర్చుండబెట్టి, స్వయముగా పూజకు సామగ్రిని తెచ్చి, ఆ మిత్రుని పాదములను కడిగి, ఆ నీటిని తలపై చల్లుకొని, దివ్యమగు పరిమళద్రవ్యములను, గంధమును, అగురును, కుంకుమను ఆయనకు అలదేను.
శ్రీకృష్ణుడు మిత్రుని పరిమళభరితములైన ధూపములతో, దీపముల పంక్తులతో పూజించి, తాంబూలమును గోవును కూడ సమర్పించి, స్వాగతమును పలికెను.
చివికిన వస్త్రములను దాల్చిన ఆ బ్రాహ్మణుడు మురికిగా, శరీరమంతా నరములేనా యన్నట్లు కృశించియుండెను. సాక్షాత్తు రుక్మిణీదేవి ఆయనకు వింజామరలు వీస్తూ పరిచర్య చేసెను.
స్వచ్చమగు కీర్తి గల శ్రీకృష్ణుడు మలినవేషధారియగు బ్రాహ్మణుని మహానందముతో సత్కరించుటను చూచిన అంతఃపురజనులు చకితులైరి.
మలినవేషమును దాల్చిన ఈ బికారి వద్ద సంపద సున్న. ఈ లోకము లోని జనులు ఏవగించుకొనే ఈ అధముడు ఏమి పుణ్యమును చేసినాడో?
ఎందుకంటే, ముల్లోకములకు గురువగు శ్రీకృష్ణ భగవానుడు శయ్య పైనున్న రుక్మిణీ (లక్ష్మీ) దేవిని విడిచి పెట్టి, అన్నగారిని వలె, ఈయనను కౌగిలించుకొనినాడు.
ఓ పరీక్షిన్మహారాజా! వారిద్దరు ఒకరినొకరు చేతులను పట్టుకొని, తాము పూర్వము గురుకులములో ఉంటూండగా ఘటిల్లిన మనోహరములైన వృత్తాంతములను చెప్పుకొనిరి.
శ్రీకృష్ణ భగవానుడు పలికెను – మహాత్మా! నీకు ధర్మము తెలియును. నీవు గురువునకు దక్షిణ ఇచ్చి గురుకులమునుండి ఇంటికి వచ్చి స్నాతక వ్రతమును చేసి యోగ్యమగు యువతిని వివాహమాడితివా? లేదా?
ఓ విద్వాంసుడా! గృహస్థుడవైననూ నీ మనస్సు ఇతరులకు వలె తరుచుగా కామనలచే ఆకర్షించబడదు. పైగా, నీవు సంపదల విషయ ములో అధికమగు సంతోషమును పొందుట లేదని నాకు తెలియును.
నేను లోకమునకు ఆదర్శముగానుండుటకై కర్మలను చేయుదును. అదే విధముగా, కొందరు కామనల ఆకర్షణ లేకుండా ఈశ్వరీయప్రకృతియొక్క కార్యములగు వాసనలను విడిచి పెట్టి కర్మలను చేయుదురు.
ఓ మహాత్మా! గురుకులములో మనిద్దరి నివాసము నీకు గుర్తున్నదా? ఉపనీతుడు గురుకులములో నివసిస్తూ, తెలియదగిన ధర్మాదులను తెలుసుకొని అజ్ఞానమునతిక్రమించి మోక్షమును పొందును.
ఓయీ! ఈ లోకములో జన్మనిచ్చిన తండ్రి మొదటి గురువు. ఉపనయనమైన పిదప సత్కర్మల సంస్కారమునిచ్చే వేదాధ్యాపకుడు రెండవ గురువు. ఆశ్రమములవారికి ఆత్మజ్ఞానమునుపదేశించువాడు మూడవ గురువు. వీరు నేను వలే పూజనీయులు.
ఓ మహాత్మా! ఎవరైతే గురురూపములోనున్న నా ఉపదేశముచే సంసారమనే సముద్రమును దాటివే సెదరో, వారు వర్ణాశ్రమముల వారిలో పరమార్థము బాగా తెలిసినవారు సుమా!
సకలప్రాణుల ఆత్మ యైన నేను గురుశుశ్రూష చే సంతోషించినట్లుగా యజ్ఞముచే గాని, సంతానము (గృహస్థధర్మము) చే గాని, తపస్సుచే గాని, సర్వమునుండి ఉపసంహారము (సన్న్యాసధర్మము) చే గాని సంతోషించను.
ఓ మహాత్మా! మనము గురువుగారివద్ద నివసిస్తుండగా జరిగిన ఘటన నీకు గుర్తున్నదా? ఒకనాడు గురువుగారి భార్య మనలను పొయ్యిలోకి కట్టెలను తెమ్మని నియోగించెను.
ఓయీ బ్రాహ్మణా! మనము పెద్ద అడవిని ప్రవేశించితిమి. అప్పుడు వర్షాకాలము పోయి శీతకాలము వచ్చెను. కాని, అప్పుడు చాల పెద్ద సహించ శక్యము కాని గాలివాన వచ్చెను. మేఘములు కఠోరముగా గర్జించేను.
అంతలో సూర్యుడస్తమించి దిక్కులు చీకటిచే ఆవరించబడెను. అంతా జలమయమై ఎత్తుపల్లములు తెలియకుండెను.
ఆ అడవిలో పెద్ద గాలివానచే గట్టిగా కొట్టబడు చున్న మనము జలప్రళయములో దిక్కు తోచక ఒకరినొకరు చేతులు పట్టుకొని వ్యాకుల మనస్కులమై పలుమార్లు పరిభ్రమించితిమి.
మన గురువగు సాందీపని ఆచార్యుడు ఈ సంగతి తెలిసి సూర్యుడుదయించగానే మనలను వెదుకుతూ బయలుదేరెను. ఆపదలో నున్న మనలను ఆయన కనుగొనెను.
అయ్యో! ఓ పుత్రులారా! మీరు మా కొరకై చాల దుఃఖమును సహించినారు. ప్రాణులకు తమ దేహము, ప్రాణము చాల ప్రియమైనవి. మీరు వాటిని కూడ లెక్క పెట్టకుండా నా సేవయందు నిమగ్న మైనారు.
ఏలయన, శిష్యుడు నిష్కటమగు ప్రేమతో సకలపదార్థములను, దేహమును కూడ గురువునకు సమర్పించవలెను. మంచి శిష్యులు గురువునకు నిశ్చయముగా ఇట్టి సేవను చేయవలెను.
నాయనలారా! బ్రహ్మచారులలో మీరు శ్రేష్ఠులు. మీకు మనోరథములు సత్యమగుగాక! మీరు అధ్యయనము చేసిన మంత్రములు ఇహపర ములలో తొలగిపోని సారము గలవి (ఫలమునిచ్చే శక్తి గలవి) అగుగాక!
గురువుయొక్క గృహమునందు నివసించిన మనకు ఇటువంటి అనేకములగు అనుభవములు కలిగినవి. గురువు యొక్క అనుగ్రహముచే మాత్రమే మానవుడు పూర్ణుడై ప్రశాంతిని పొందును.
సుదాముడిట్లు పలికెను --- ఓ దేవాధిదేవా! నీవు జగత్తునకు తండ్రివి. సత్యసంకల్పుడవగు నీతో గూడి మేము గురుకులవాసమును చేసితిమి. అట్టి మాకు పొందబడనిది ఏమి ఉండును?(ఏమీ లేదు).
ఓ ప్రభూ! కల్యాణములకు నిలయమగు శబ్ద (వేదరూపమగు) బ్రహ్మ నీకు దేహము. అట్టి నీవు గురుకులవాసము చేయుట కేవలము మానవులననుకరించే లీల మాత్రమే.
శ్రీమద్భాగవతము పదవ స్కంధము ఉత్తరార్ధములో కుచేలోపాఖ్యానములో శ్రీకృష్ణుడు సుదాముని స్వాగతించుటను వర్ణించే ఎనుబదియవ అధ్యాయము ముగిసినది (80).
