శ్రీ మద్భాగవతము - దశమ (10వ) స్కందము
68 - సాంబుని వివాహము
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ పరీక్షిన్మహారాజా! జాంబవతి పుత్రుడగు సాంబుడు యుద్ధములో జయించే స్వభావము గలవాడు. దుర్యోధనుని కుమార్తెయగు లక్ష్మణ స్వయంవరమునందుండగా, ఆయన ఆమెను తీసుకుపోయెను.
కౌరవులు కోపించి ఇట్లనిరి --- ఈ బుడతడు పొగరుమోతు. మనలను తిరస్కరించి తనను ప్రేమించని కన్యను బలాత్కారముగా తీసుకు వెళ్లినాడు.
ఈ పొగరుమోతును బంధించుడు. యాదవులేమీ చేయగలరు? వారు మన ఈయబడి మన అనుగ్రహముచే వర్ధిల్లజేయబడిన రాజ్యముననుభవించుచున్నారు.
తమ కొడుకు బంధించబడినాడని విని యాదవులు ఇక్కడకు వచ్చే పక్షములో మనము వారి గర్వమునడంచెదము. అప్పుడు వారు ప్రాణా యామాదులచే నియంత్రించబడిన ఇంద్రియములు వలె చల్లబడెదరు.
ఈ విధముగా తలచి కురువృద్ధుల అనుమతిని పొంది కర్ణుడు, శలుడు, భూరిశ్రవసుడు, యజ్ఞకేతువు, దుర్యోధనుడు సాంబుని బంధించే ప్రయత్నమునారంభించిరి.
ధృతరాష్ట్రుని పుత్రులు తన వెంట తరుముటను చూచి మహారథియగు సాంబుడొక్కడే అందమైన ధనుస్సును పట్టుకొని సింహము వలె నిలిచెను.
కోపించిన ఆ ధనుర్దారులకు కర్ణుడు నాయకుడు. వారాతనిని బంధించ గోరి, నిలు నిలు అంటూ దగ్గరకు వచ్చి బాణములతో ముంచెత్తిరి.
కురువంశశ్రేష్ఠుడవగు ఓ పరీక్షిన్మహారాజా! అల్పమృగములు సింహమును వలె, కౌరవులు ఆతనిని అన్యాయముగా కొట్టిరి. యాదవవం శమునానందింపజేసే ఆ సాంబుడు ఇంద్రియగోచరము కాని స్వరూపము గల శ్రీకృష్ణుని పుత్రుడు. ఆతడు వారి ఆ చేష్టను సహించి ఊరుకోలేదు.
ఆతడు అందమైన ధనుస్సును టంకారము చేసి కర్ణుడు, భీష్ముడు మొదలైన వీరులందరిని, వారి ఆరు రథములను ఒకేసారి వేర్వేరుగా అంతే సంఖ్యలో బాణములతో కొట్టెను.
ఆతడు గొప్ప ధనుస్సు గల రథికులను, ఒక్కొక్క బాణముతో వారి సారథులను, నాలుగు బాణములతో నాలుగు గుర్రములను కొట్టెను. ఆతని ఆ చాతుర్యమును వారు కొనియాడిరి.
వారందరు కలిసి సాంబుని రథము లేనివానినిగా చేసిరి. వారిలో నలుగురు నాలుగు గుర్రములను, ఒకడు సారథిని కొట్టిరి. ఆరో వాడు ధనుస్సును విరుగకొట్టెను.
యుద్దములో కౌరవులు ఆ సాంబుని కష్టముతో రథహీనుని చేసి విజయమును పొందిరి. అప్పుడు దుర్యోధనుడు సాంబకుమారుని, తన కుమార్తెను కూడ తీసుకొని తన నగరమును ప్రవేశించెను.
ఓ పరీక్షిన్మహారాజా! నారదుడు చెప్పగా సాంబుని ఆ వృత్తాంతమును విని యాదవులు చాల కోపించిరి. ఉగ్ర సేనమహారాజుచే ప్రేరితులై వారు కౌరవుల పై యుద్ధమునకు సన్నద్ధులైరి.
కలిదోషమును పోగొట్టే బలరాముడైతే కౌరవయాదవకలహమును ఇష్ట పడలేదు. ఆయన యుద్ధసంసిద్ధులైన ఆ యాదవశ్రేష్ఠులకు నచ్చజెప్పెను.
చంద్రుని గ్రహములు వలే, బ్రాహ్మణులు వంశములోని పెద్దలు చుట్టువారి రాగా, బలరాముడు సూర్యుడు వలే వెలిగిపోయే రథము పై హస్తినాపురమునకు వెళ్లాను.
బలరాముడు హస్తినాపురమునకు వెళ్లి నగరమునకు బయట ఉద్యానములో నుండెను. కౌరవుల అభిప్రాయమును తెలియగోరి ఆయన ఉద్ధవుని ధృతరాష్ట్రుని వద్దకు దూతగా పం పెను.
ఆ ఉద్దవుడు అంబిక పుత్రుడగు ధృతరాష్ట్రునకు, భీష్ణద్రోణబాహ్లికులకు, దుర్యోధనునకు కూడ యథావిధిగా నమస్కరించి, బలరాముడు వచ్చియున్నాడని చెప్పెను.
అతీశయించి హీతకారియగు బలరాముడు వచ్చినాడని విని ఆ కౌరవులందరు గొప్ప ప్రీతిని పొందిరి. వారు ఆ ఉద్ధవుని సత్కరించి, మంగళద్రవ్యములను చేతబట్టుకొని బలరామునకు ఎదు రేగిరి.
వారు బలరాముని వయస్సు మొదలైన సందర్భములకు తగ్గట్లుగా కలుసుకొని సత్కారముగా గోవును, స్వచ్చమగు జలమును నివేదించిరి. వారిలో ఆయన మహిమ తెలిసినవారు తల వంచి నమస్కరించిరి..
బంధువులు క్షేమముగా ఆరోగ్యముగా ఉన్నారని విని, ఒకరినొకరు మంగళకుశలప్రశ్నలను వేసిరి. తరువాత బలరాముడు దైన్యము లేని వచనమునిట్లు పలికెను.
సర్వసమర్థుడగు ఉగ్ర సేనుడు రాజాధిరాజు. ఆయన మీకు దేనిని ఆజ్ఞాపించెనో దానిని ఏకాగ్రచిత్తులై విని శీఘ్రముగా అమలు చేయుడు.
మీరు చాలమంది ఒంటరియగు సాంబుని అధర్మముగా జయించి బంధించినారు. ఆతడు . కన్యను తీసుకువెళ్లుట క్షత్రీయోచితధర్మమే. అయినప్పటికీ, బంధువులు కలిసి మెలిసి ఉండాలనే కోరికచే మీరు చేసిన ఆ పనిని సహించుచున్నాను.
బలదేవుని వచనము పరాక్రమము, ఉత్సాహము, బలములచే నిరంకుశమై తన శక్తికి తగ్గట్లుగానుండెను. దానిని విని కౌరవులు చాల కోపించి ఇట్లు పలికిరి.
ఆహా! ఎంత పెద్ద చిత్రమో! కాలముయొక్క గతిని అతిక్రమించుట శక్యము కాదు. కిరీటముచే సేవించబడే తలను నిశ్చయముగా పాదరక్ష అధిష్టించ గోరు చున్నది.
కుంతీవివాహముతో మాకీ యాదవులతో సంబంధమేర్పడినది. మేము వారితో కలిసి భుజించి కూర్చుని నిద్రించితిమి. వీరికి రాజసింహాసనమును మేమే ఇచ్చితిమి. ఈనాడు వీరు మాతో సమానస్థాయిని పొందించబడిరి.
మనము పట్టించుకోకపోవుట చేతనే వీరు వింజామరల జంట, శంఖము, తెల్లని గొడుగు, కిరీటము అనే రాజచిహ్నములను, మహారాజుకు తగ్గ ఆసనమును, శయ్యను ఉపభోగించుచున్నారు.
పాములకు పాలు పోస్తే అవి పోసేవానిపై పగ పట్టును. అదే విధముగా, రాజచిహ్నములనిచ్చిన మనకు యాదవులు శత్రువులైనారు. మన అనుగ్రహముచే పైకి వచ్చిన యాదవులీ నాడు సిగ్గు విడిచి మనలనాజ్ఞాపించుచున్నారు. ఏమి దురదృష్టము!
సింహము వేటాడినదానిని పొట్టేలు ఎట్లు తినగలదు? అదే విధముగా, భీష్ణుడు, ద్రోణుడు, అర్జునుడు, కర్ణుడు మొదలైన కౌరవులు ఈయకుండా ఇంద్రుడైనా దేనినైననూ ఎట్లు ఉపభోగించగల్గును? (ఉపభోగించలేడు).
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఆ దుష్టకౌరవులు తమది గొప్ప వంశమని, తమకు భీష్ముడు మొదలగు గొప్పవారు బంధువులని, తమకు సంపద గలదని ఉత్కటమైన గర్వము కలిగియుండిరి. వారు పలుకకూడని పలుకులను బలరామునకు వినిపించి తమ నగరమునకు తిరిగి వెళ్లిరి.
బలరామ భగవానునకు కౌరవుల దుష్టత్వమును చూచి, పలుకరాని పలుకులను కూడ విని నిండా కోపము వచ్చెను. ఆయనను చూడ శక్యము కాకుండెను. ఆయన పలుమార్లు గట్టిగా నవ్వుతూ ఇట్లు పలికెను.
పలురకముల గర్వముతో పొగ రెక్కిన దుష్టులు శాంతిని కోరరు. ఇది నిశ్చయము. పశువులకు కట్టె వలె, శిక్షయే వారి పొగరును శాంతింప జేయును.
ఆహా! చాల కోపించిన యాదవులకు, కోపించిన కృష్ణునకు కూడ మెల్లగా నచ్చజెప్పి నేను వీరికి సుఖశాంతులను కోరి ఇక్కడకు వచ్చితిని.
అట్టి వీరు మందబుద్దులు, కలహప్రియులైన దుష్టులు. అట్టి (శాంతి కోరే) నన్నీ దురహంకారులు తిరస్కరించి పలుమార్లు దుర్భాషలాడిరి.
భోజవృష్టి-అంధకవంశీయులగు యాదవులకు శాసకుడగు ఉగ్రసేనుడు రాజాధిరాజు కాడా? (అవును). ఇంద్రుడు, అగ్ని మొదలైన లోకపాలకులు ఆయన ఆదేశమును పాలించెదరు.
శ్రీకృష్ణుడు సుధర్మ అనే దేవసభను స్వాధీనము చేసుకొని, పారిజాతమనే స్వర్గమునందలి వృక్షమును తెచ్చి భోగించుచున్నాడు. ఆతడు రాజసింహాసనమునకు అర్హుడు కాడా? (అర్హుడే).
శ్రీకృష్ణ భగవానుని పాదముల జంటను సాక్షాత్తు సర్వేశ్వరియగు లక్ష్మీదేవి ఉపాసించును. ఆ లక్ష్మీపతి ఛత్రచామరాది రాజమర్యాదలకు తగడా? (అర్హుడే).
శ్రీకృష్ణ భగవానుని పద్మములవంటి పాదముల ధూళిని సకలలోకపాలకులు కిరీటములతో కూడిన శిరస్సులపై ధరించెదరు. బ్రహ్మదేవుడు, శివుడు, నేను కూడ ఆయన అంశయగు హిరణ్యగర్బుని అంశలము. భక్తులచే సేవించబడే గంగాదితీర్థములను కూడ పావనము చేసే ఆ ధూళిని మేము, లక్ష్మీదేవి కూడ చిరకాలము ధరించెదము. అట్టి ఆయనకు తగిన రాజసింహాసనము ఎక్కడనున్నది? (లేనే లేదు).
యాదవులు కౌరవులిచ్చిన చిన్న రాజ్యమునుపభోగించుచున్నారా ? మేము పాదరక్షలమా? కౌరవులు స్వయముగా (మేము ఎక్కిన) శిరసా ?
ఆశ్చర్యము! సంపదచే గర్వించిన దురభిమానులు నిషాలో ఉన్నవారు వలె, సందర్భశుద్ధి లేని పరుషవచనములను పలి కెదరు. శిక్షించే సామర్థ్యము గల ఎవడు అట్టి మాటలను సహించును? (సహించడు),
ఈనాడీ భూమిపై కౌరవులు లేకుండా చేస్తాను, అంటూ బలరాముడు కోపముతో నాగలి పట్టి, ముల్లోకములను దహిస్తాడా యన్నట్లు లేచి నీలబడెను.
కోపించిన ఆ బలరాముడు నాగేటి చాలు కొనతో హస్తినాపురమనే నగరమును గంగలో పారవేయబోవువాడై ఊడబెరకి లాగేను.
బలరాముడు లాగుచుండగా ఆ నగరము పడవవలె అల్లల్లాడుతూ గంగలో పడుచుండెను. దానిని చూచి కౌరవులు కంగారుతో భయపడిరి.
వారు జీవించగోరి లక్ష్మణను, సాంబుని ఎదురుగా నిడుకొని కుటుంబములతో సహా సర్వసమర్థుడగు ఆ బలరామునే శరణు వేడిరి.
ఓ బలరామా! రామా! సర్వమునకు ఆధారము నీవే. మేము మోహము ను పొందిన దుర్బుద్ధులము, నీ మహిమను తెలియలేకపోతిమి. మా అపరాధమును నీవు క్షమించ తగుదువు.
ఓ ఈశ్వరా! జగత్తుయొక్క సృష్టి స్థితిలయములకు ఏకైక హేతువు నీవే. కాని, నీకు వేరే ఆధారము లేదు. ఏలయన, క్రీడాపరుడవైన నీకు ఈ లోకములే ఆట వస్తువులని మహాత్ములు చెప్పెదరు.
ఓ అనంతా! అనంతప్రాణుల రూపములోనున్న నీకు అనంతశిరస్సులు గలవు. ఈ భూమండలమును నీవే తలపై అవలీలగా మోయుచున్నావు. ప్రళయమునందు కూడ నీవు విశ్వమును నీ స్వరూపమునందు విలీనము చేసుకొని, రెండవది లేని పరబ్రహ్మగా మిగిలియుండి శయనించెదవు.
ఓ భగవానుడా! నీ కోపము సకలప్రాణులకు శిక్షణను గరపుట కే గాని, ద్వేషము వలన గాని, ఈర్ష్య వలన గాని కలిగేది కాదు. ఎందుకంటే, సత్త్వగుణప్రధానుడవగు నీవు జగత్తునకు మనుగడనిచ్చి పాలించుటయందు తత్పరుడవై యున్నావు.
ఓ దేవా! నీవే సకలప్రాణులలో ప్రత్యగాత్మరూపుడవై సకలశక్తులను నిలబెట్టుచున్నావు. వినాశము లేని నీవు జగత్తును సృష్టించినావు. నీకు నమస్కారమగుగాక! మేము నిన్ను శరణు జొచ్చినాము.
శ్రీశుక మహర్షి ఇట్లు పలి కెను --- నగరము కంపించుచుండుటచే భయపడీ శరణు జొచ్చిన ఆ జనులు బలరాముని ఈ విధముగా ప్రసన్నుని చేసిరి. ఆయన చాల ప్రసన్నుడై, భయపడకుడని అభయమునిచ్చెను.
దుర్యోధనుడు అరవై యేళ్ల వయస్సు గల పన్నెండు వందల ఏనుగులను, పది వేల గుర్రములను కూడ కట్నముగా ఇచ్చెను.
కుమార్తెయందు మిక్కుటమగు ప్రేమ గల దుర్యోధనుడు సూర్యుడు వలె వెలిగిపోయే ఆరు వేల బంగరు రథములను, మెడలో బంగరు హారములు గల వెయ్యి దాసీలను కూడ కట్నముగా ఇచ్చెను.
యాదవశ్రేష్ఠుడగు బలరామ భగవానుడా సర్వమును స్వీకరించి, పుత్రునితో కోడలితో గూడి వెళ్లాను. ఆయనను బంధువులైన కౌరవులు అభినందించిరి.
తరువాత నాగలియే ఆయుధముగా గల బలరాముడు తన ద్వారకా నగరమును చేరెను. ఆయనపై బంధువులకు అనురాగము మెండు. ఆయన వారిని కలుసుకొనెను. యాదవశ్రేష్ఠుల మధ్యలో సభలో ఆయన కురుదేశములో తాను చేసిన కార్యములనన్నింటినీ వివరించి చెప్పెను.
ఈనాటికీ ఈ హస్తినాపురము బలరాముని పరాక్రమానికి నిశ్చితమైన నిదర్శనంగా గంగానదీతీరమున ఎడమవైపు బాగా ఎత్తుగా గంగ వైపు వాలినట్లుగా కానవచ్చును.
శ్రీమద్భాగవతము పదవ స్కంధము ఉత్తరార్ధములో సాంబుని వివాహమును వర్ణించే అరువది ఎనిమిదవ అధ్యాయము ముగిసినది.
