శ్రీ మద్భాగవతము - దశమ (10వ) స్కందము
76 - యాదవులకు శాల్వునితో యుద్ధము
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ పరీక్షిన్మహారాజా! రాజసూయ వృత్తాంతమును విన్న పిదప, లీలకై మానవరూపముతో అవతరించిన శ్రీకృష్ణ భగవానుని మరియొక లీలను గురించి కూడ వినుము. ఆయన సౌభమనే విమానమునకు ప్రభువగు శాల్వుని వధించెను.
శాల్వుడు శిశుపాలుని మిత్రుడు. రుక్మిణి వివాహానికి ఆతడు వచ్చి యుద్ధములో జరాసంధుడు, దంతవక్తుడు మొదలగువారితో బాటుగా యాదవుల చేతిలో పరాజయము పాలైనాడు.
రాజులందరు వినుచుండగా శాల్వుడిట్లు ప్రతిజ్ఞ చేసెను -- ఈ భూమిపై యాదవులు లేకుండా చేసెదను. నా పౌరుషమును చూడుడు.
ఓ పరీక్షిన్మహారాజా! మూర్ఖుడగు ఆ శాల్వుడు ఈ విధముగా ప్రతిజ్ఞ చేసి, దినములో ఒక్కసారి గుప్పెడు బూడిదను మాత్రమే తిని, సర్వశక్తిమంతుడు, ప్రాణులకు పాలకుడు అగు శివుని ఆరాధించెను.
పార్వతీపతియగు శివభగవానుడు తొందరగా సంతోషించే దైవము. సంవత్సరము తరువాత ఆయన తనను శరణు జొచ్చిన శాల్వుని వరమును కోరుమని ప్రేరితుని చే సెను.
యథేచ్చగా సంచరిస్తూ దేవతలు, అసురులు, మానవులు, గంధర్వులు, నాగులు, రాక్షసులు ఛేదించలేనిదై యాదవులకు హడలు పుట్టించే విమానము (ఎగిరే నగరము) ను ఆతడు వరముగా కోరేను.
కైలాసవాసియగు శివుడు సరేనని శత్రునగరములను జయించే మయుని ఆదేశించెను. ఆయన సౌభమనే లోహమయమైన (ఎగిరే) పురమును నిర్మించి శాల్వునకిచ్చెను.
చీకటికి నిలయమై సమీపించుట శక్యము కానిదై యథేచ్చగా సంచరించే విమానము ఆ శాల్వునకు లభించేను. ఆతడు ఇదివరలో యాదవులతో కలిగిన వైరమును స్మరిస్తూ ద్వారకకు వెళ్లాను.
భరతవంశశ్రేష్ఠుడవగు ఓ పరీక్షిన్మహారాజా! ఆ శాల్వుడు పెద్ద సేనతో ద్వారకానగరమును ముట్టడించి, నగరము చుట్టూ ఉండే అడవులను, నగరములోని ఉద్యానములను, గోపురములను, నగరద్వారములను,భవనములను, బురుజులను, గోడలను, క్రీడాస్థానములను అన్నింటినీ భగ్నము చేయజొచ్చెను. ఆ గొప్ప విమానమునుండి ఆయుధములు, రాళ్లు, చెట్లు, పిడుగులు, పాములు, వడగళ్లు ధారలుగా వర్షించెను.
భయంకరమగు సుడిగాలి వీచి దిక్కులన్నీ దుమ్ముతో కప్పివేయబడెను. ఓ రాజా! త్రిపురములు భూగోళమును వలె, సౌభమనే విమానము శ్రీకృష్ణుని ద్వారకానగరమునీ విధముగా పీడించుచుండగా, అక్కడ ఎవరి కైననూ శాంతి లభించలేదు.
గొప్ప కీర్తి గల ప్రద్యుమ్న భగవానుడు వీరుడు. తన ప్రజలు పీడించ బడుచుండుటను గాంచి ఆయన రథమెక్కి, భయపడకుడు, అని పలికెను.
సాత్యకి, చారుదేష్ణుడు, సాంబుడు, అక్రూరుడు, ఆతని సోదరులు, హార్దిక్యుడు, భానువిందుడు, గదుడు, శుకుడు, సారణుడు మరియు ఇతరులు గొప్ప ధనుర్దారులు, రథనాయకులకు నాయకులు. వారు కవచమును వేసుకొని బయల్వెడలిరి. రథములు, ఏనుగులు, గుర్రములు, పదాతులతో కూడిన సైన్యము వారికి రక్షణగా వచ్చెను.
తరువాత శాల్వుని సైన్యమునకు యాదవులతో, రాక్షసులకు దేవతలతో వలె, గగుర్పాటును కలిగించే దొమ్మి యుద్ధము జరిగెను.
రుక్మిణి యొక్క పుత్రుడగు ప్రద్యుమ్నుడు సౌభమనే విమానమునకు అధిపతియగు శాల్వుని ఆ మాయలనైతే, ఉష్ణ కిరణుడగు సూర్యుడు రాత్రియొక్క చీకట్లను వలె, క్షణకాలములో నశింపజేసెను.
బంగరు తోక, లోహపు కొన, నునుపైన కణుపులు గల ఇరవై ఐదు బాణములతో ప్రద్యుమ్నుడు శాల్వుని సేనాయకుని కొట్టెను.
తరువాత శాల్వుని వంద, సైనికులను ఒక్కొక్కటి, సారథులను పదేసి, రథములను మూడేసి బాణములతో కొట్టెను.
మహామనస్వియగు ప్రద్యుమ్నుడు చేసిన ఆ గొప్ప అద్భుతకార్య మును చూచి రెండు పక్షముల సైనికులు అందరు ఆయనను కొనియాడిరి.
మయునిచే మాయలను నింపీ చేయబడిన ఆ విమానము ఒకప్పుడు ఒకే రూపమును, మరియొకప్పుడు అనేకరూపములను కలిగియుండెను. ఒకప్పుడు కనబడి మరియొకప్పుడు మాయమయ్యే ఆ విమానము శత్రువుల ఊహకైననూ అందకుండెను.
ఆ సౌభమనే విమానము కొరివి చక్రము వలె గిర గిర తిరుగుతూ ఒక ప్పుడు నేల పై, ఒకప్పుడు ఆకాశములో, మరియొకసారి పర్వతశిఖరము పై, ఇంకో సమయములో నీటిలో, ఎక్కడైననూ నిలకడ లేకుండ నుండెను.
శాల్వుడు, వాని సైనికులు, సౌభవిమానము ఎక్కడెక్కడ కొంచెమైనా కనబడునో, అక్కడక్కడ యాదవ సేనానాయకులు బాణములను విడిచిరి.
యాదవులు ప్రయోగించిన బాణములు అగ్నిసూర్యులవలె మండుతూ విషసర్పములు వలె సహించ శక్యము కాకుండెను. వాటిచే శాల్వుని విమానము, సైన్యము కూడ పీడింపబడుటయే గాక, ఆతడు మూర్ఛిల్లెను.
యాదవవీరులు గెలిస్తే ఇహమును, మరణిస్తే పరమును జయించాలనే ఆకాంక్ష గలవారు. శాల్వుని సేనాపతులు ఆయుధముల సమూహములతో పీడించిననూ వారు తమ తమ యుద్ధ క్షేత్రమును విడిచి పెట్టలేదు.
ద్యుమంతుడని ప్రసిద్ధి గాంచిన శాల్వుని అమాత్యుడు బలశాలి. వానిని ప్రద్యుమ్నుడు ముందుగా చాల పీడించేను. ఆతడు ఆయనను సమీపించి లోహపు గదతో కొట్టి సింహనాదము చేసెను.
దారుకుని పుత్రుడే శత్రుసంహారకుడగు ప్రద్యుమ్నుని సారధి. ఆతనికి యుద్ధధర్మము తెలియును. గదచే ప్రద్యుమ్నుని వక్షఃస్థలము పగులగా, ఆతడాయనను యుద్ధక్షేత్రమునుండి దూరముగా తీసుకుపోయేను.
శ్రీకృష్ణ పుత్రుడగు ప్రద్యుమ్నుడు ఘడియ కాలములో తెలివిని పొందెను. ఆతడు సారథితో నిట్లనెను – అయ్యో! ఓ సారథీ! నన్ను యుద్ధభూమినుండి దూరముగా తీసుకుపోవుట అనేది తప్పు.
నేను తప్ప యాదవుల కులములో పుట్టినవాడు యుద్దమునుండి దూరమైనట్లుగా ఎన్నడూ వినలేదు. సారథి పిరికి మనస్సు వాడగుట వలన నాకీ దోషము (అపకీర్తి) ప్రాప్తించినది.
యుద్ధమునుండి క్షేమముగా కొనిరాబడిన నేను తండ్రులగు బలరామ శ్రీకృష్ణుల వద్దకు వెళ్లినప్పుడు, వారు నన్ను ప్రశ్నిస్తే, నాకు యోగ్యమైన ఉత్తరమును ఏమని చెప్పను?
నా సోదరుల భార్యలు నవ్వుతూ నిశ్చితముగా నాతో ఇట్లు పలుకగలరు -- ఓ వీరా! యుద్ధములో శత్రువుల యెదుట నీవు నపుంసకుడ వేట్టైతివి? చెప్పుము, చెప్పుము.
సారథి ఇట్లు పలికెను --- ఓ చిరంజీవీ! ధర్మము తెలిస్తే నేనీ పనిని చేసితిని. నీవు సమర్థుడవు. ఆపదలోనున్న రథికుని సారథి, సారథిని రథికుడు రక్షించవలెను.
శత్రువు నిన్ను గదతో కొట్టగా నీవు మూర్చిల్లి పీడను పొందితివి. ఈ విషయమును గుర్తించియే నేను నిన్ను యుద్ధరంగమునుండి దూరముగా తీసుకుపోతిని.
శ్రీమద్భాగవతము పదవ స్కంధము ఉత్తరార్ధములో యాదవులకు శాల్వునితో యుద్ధమును వర్ణించే డెబ్బది ఆరవ అధ్యాయము ముగిసినది (76).
