శ్రీ మద్భాగవతము - దశమ (10వ) స్కందము
81 - కుచేలోపాఖ్యానము - కుచేలుడు ఐశ్వర్యమును పొందుట
శ్రీ శుక మహర్షి ఇట్లు పలికేను --- శ్రీకృష్ణ భగవానునకు సకలప్రాణుల అంతరంగము విదితమే. ఆయన ఈ విధముగా బ్రాహ్మణశ్రేష్ఠుడగు సుదామునితో కబుర్లాడుతూ చిరునవ్వుతో ఆయనతో నిట్లనెను.
సత్పురుషులకు ఆశ్రయమగు శ్రీకృష్ణ భగవానుడు బ్రాహ్మణభక్తుడు. ఆయన నవ్వుతూ ప్రేమ నిండిన కన్నులతో బ్రాహ్మణుడగు సుదాముని చూస్తూ ఇట్లు పలికెను.
శ్రీకృష్ణ భగవానుడిట్లు పలికెను --- ఓ మహాత్మా! నీవు ఇంటినుండి నాకై ఏదేని ఉపహారమును తెచ్చితివా? భక్తులు ప్రేమతో సమర్పించేది అల్పమే అయినా, నాకు అదే అధికము. భక్తి లేనివాడు సమర్పించేది అధికమే అయినా, నాకు ప్రీతిని కలిగించలేదు.
విశుద్ధమగు అంతఃకరణము గల ఏ భక్తుడైతే ప్రేమతో నాకు పత్రమును గాని, పుష్పమును గాని, ఫలమును గాని, నీటిని గాని సమర్పించునో, భక్తితో సమర్పించబడిన దానిని నేను ప్రేమతో స్వీకరించెదను.
ఓ పరీక్షిన్మహారాజా! లక్ష్మీపతియగు శ్రీకృష్ణ భగవానుడిట్లు చెప్పిననూ, ఆ బ్రాహ్మణుడు సిగ్గుతో తల వంచుకొని, గుప్పెడు మాత్రమే ఉన్న అటుకులను ఆయనకు ఈయలేదు.
సకలప్రాణుల అంతఃకరణసాక్షియగు శ్రీకృష్ణ భగవానునకు ఆతడు వచ్చిన కారణము ఎరుకయే. ఆయన ఇట్లు తలపోసెను -- ఈయన ఇదివరలో ఎన్నడూ సంపదను కోరి నాయందు భక్తిని చేయలేదు.
నా మిత్రుడైతే పతివ్రతయగు తన భార్యకు ప్రియమును చేయగోరి నా వద్దకు వచ్చినాడు. నేనీయనకు దేవతల కైనా దొరకని సంపదలనిచ్చెదను.
ఆయనీ విధముగా తలపోసి, ఆ బ్రాహ్మణుని ఉత్తరీయమునుండి గుడ్డలో కట్టిన అటుకుల మూటను, ఇదేమిటి? అంటూ తానే పైకి తీసెను.
అరే! మిత్రమా! ఇది నా కొరకు తెచ్చినదే. ఈ అటుకులంటే నాకు పరమప్రీతి. ఓయీ! ఇవి నాకు, జగత్తునకు (జగద్రూపుడనగు నాకు) తృప్తిని కలిగించును.
అని పలికి ఆ పరమేశ్వరుడు ఒక గుప్పెడు అటుకులను ఒకేసారి తిని, రెండవ గుప్పెడును తినుటకై తీసుకొనెను. అంతలో లక్ష్మీదేవి చేతిని పట్టుకొనెను. ఆమెకు ఆయనయే సర్వస్వము.
జగత్తునకు ఆత్మ యైన ఓ దేవా! నీ సంతోషమునకు కారణమై ఇహపరములయందు వ్యక్తికి సకలసంపదల సమృద్ధి కలుగుటకు నీవు ఇంతమాత్రము తీసుకున్నచో చాలును.
ఆ బ్రాహ్మణుడు భుజించి నీటిని త్రాగి ఆ రాత్రి శ్రీకృష్ణ భగవానుని మందిరములో నివసించెను. ఆయనకు స్వర్గములో ఉన్నట్లుగా తోచెను.
జగత్తును పాలించే స్వాత్మారాముడైన శ్రీకృష్ణ భగవానుడు మరునాడు ఆయనకు నమస్కరించి మార్గములో కొంత దూరము వెంట నడిచి ఆనంద మును కలిగించెను. అప్పుడు సుదాముడు తన గృహమును చేరెను.
ఆ సుదాముడైతే సిగ్గుపడి తానైతే శ్రీకృష్ణుని ధనమును కోరలేదు; ఆయన ధనమునీయలేదు. భగవానుని దర్శనముచే ఆనందించి ఆయన తన యింటికి వెళ్లెను.
ఆహా! బ్రాహ్మణులను ఇష్ట దైవముగా భావించే శ్రీకృష్ణుని బ్రాహ్మణభక్తిని నేను చూచితిని. ఎందుకంటే, వక్షఃస్థలము పై లక్ష్మీదేవిని ధరించే ఆయన పరమదరిద్రుడనగు నన్ను కౌగిలించుకొనెను.
దరిద్రుడను, అధికపాపిని అగు నేనెక్కడ? లక్ష్మీదేవికి నివాసమగు శ్రీకృష్ణ భగవానుడెక్కడ ? బ్రాహ్మణుల వంశములో పుట్టినవాడనగుటచే ఆయన నన్ను రెండు చేతులతో కౌగిలించుకొనినాడు.
ప్రియురాలు సేవించే శయ్య పై తన సోదరుడా యన్నట్లు ఆయన నన్ను విశ్రమింప జేసినాడు. అలసిన నాకు ఆయన భార్య వింజామరతో వీచినది.
దేవాధిదేవుడగు శ్రీకృష్ణ భగవానునకు బ్రాహ్మణులే దైవము. ఆయన కాళ్లను నొక్కుట, వీచుట మొదలగు గొప్ప సేవలతో నన్ను దేవతను వలే పూజించేను.
మానవులకు స్వర్గమోక్షములు, భూలో కరసాతలములయందలి సంప దలు, సకల సిద్ధులు కలుగుటకు ఆయన పాదముల పూజయే హేతువు.
ధనము లేని ఈతడు ధనమును పొంది అధికముగా గర్వించి నన్ను స్మరించకుండునని తలచి ఆ దయామయుడు నాకు కొంచెమైననూ ధనమునీయలేదు. ఇదియే నిశ్చయము.
ఈ విధముగా ఆయన ఆ విషయమునే తన మదిలో తలపోస్తూ తన ఇంటి వద్దకు చేరెను. ఆ ప్రదేశము అన్ని వైపులా సూర్యుడు, చంద్రుడు, అగ్నులవలె ప్రకాశించే సౌధములచే చుట్టువారబడియుండెను.
ఆ స్థానమునందు కూసే పక్షుల గుంపులచే వ్యాపించబడిన రంగు రంగుల ఉపవనములు, ఉద్యానములు ఉండెను. అచటి సరస్సులలో ఎర్ర దామరలు, పద్మములు, సౌగంధికపుష్పములు, కలువలు బాగా వికసించి ఉండెను. అచట బాగా అలంకరించుకున్న పురుషులు, లేడి కన్నులవంటి కన్నులు గల యువతులు ఉండిరి.
ఇది యేమిటి? ఇది ఎవని చోటు? అది (ఇదివరకటి స్థానము) ఇదియై ఈ రూపముగా ఎట్లైనది? అని ఆ మహాభాగ్యవంతుడు విచారము చేయు చుండెను. ఇంతలో దేవతల కాంతివంటి కాంతి గల స్త్రీలు, పురుషులు ఆయనను పాటలతో, వాద్యములతో సాదరముగా దోడ్కొని వెళ్లిరి.
భర్త వచ్చినాడని విని ఆయన భార్య మహానందముతో వేగిరపడుతూ వెంటనే, పద్మముల వనమునుండి త్రిలోకసుందరియగు లక్ష్మీదేవి వలె, ఇంటినుండి బయటకు వచ్చెను.
ఆ పతివ్రతకు ప్రేమచే వేగిరపాటుతో బాటు కళ్లు నీటితో నిండెను. ఆమె భర్తను చూచి కన్నులు మూసుకొని బుద్ధితో ఆయనకు నమస్కరించి, మనస్సుతో కౌగిలించుకొనెను.
ఆయన భార్య విమానమువధిష్ఠించిన దేవతాస్త్రీ వలె అధికముగా వెలిగిపోవుచుండెను. ఆమె కంఠములయందు హారములు గల పరిచారికల మధ్యలో ప్రకాశించేను. ఆమెను చూచి ఆయన ఆశ్చర్యపోయెను.
ఆయన లోను కూడ చాల సంతోషించి ఆమెతో గూడి తన భవనములోనికి ప్రవేశించేను. ఆ భవనము మణులు పొదిగిన వంద స్తంభములతో మ హేంద్రునీ భవనమును పోలియుండెను.
ఆ భవనమునందు దంతముతో చేసి వెండితో చేసిన పంకా మొదలైన పరికరములనమర్చిన మంచములపై పాలనురుగువంటి పరుపులు ఉండెను. వింజామరలకు బంగరు కడ్డీలు ఉండెను.
ఆ భవనములో బంగరు కుర్చీలు, మెత్తని శయ్యలు, వ్రేలాడే ముత్యాల సరులతో ప్రకాశించే మేలుకట్టులు ఉండెను.
ఆ భవనములలోని స్వచ్చమగు గోడలయందు గొప్ప మరకతమణులను, స్పటికములను పొదిగి, రత్నములనే దీపములుగా అమర్చిరి. ఆ భవనములలో గొప్ప యువతులు ఉండిరి.
ఆ బాపడు అచట సకలసంపదల సమృద్ధులను చూచెను. ఆయన సావ ధానచిత్తు డై ఆకస్మికముగా ప్రాప్తమైన సంపదను గురించి ఆలోచించేను.
ఆశ్చర్యము! నేను నిశ్చయముగా సర్వకాలదరిద్రుడను, దురదృష్టవంతుడను. నాకు ఈ విధమైన ఆకస్మిక సంపదకు హేతువు యాదవశ్రేష్ఠుడగు శ్రీకృష్ణ భగవానుని కృపాదృష్టికంటే మరియొకటి అని ఊహించుటయైననూ సంభవము కాదు. ఆయన మహిమ చాల గొప్పది.
దశార్హవంశీయులలో శ్రేష్ఠుడగు నా మిత్రుడు గొప్ప భోగములు గలవాడు. ఎదుట ఏమీ చెప్పకున్నా ఆయన యాచకునకు అధికమునే ఇచ్చును. మేఘము ఎంత వర్షించినా, తాను చాల వర్షించేనని అనుకోదు. అదే విధముగా, ఆయన కూడ తాను ఇచ్చినది అల్పమేనని భావించును.
తానిచ్చినది ఎక్కువే అయినా కొంచెమా అన్నట్లు చేయును. మిత్రుడి చ్చినది కొంచెమే ఐనా, ఎక్కువా యన్నట్లు చేయును. నేను ఒకే గుప్పెడు అటుకులను సమర్పించగా, ఆ మహాత్ముడు ప్రేమతో స్వీకరించెను.
శ్రీకృష్ణుడు గొప్ప మహిమ గల గుణనిధి. ఆయనతో నాకు విశిష్టమగు చెలిమి కలిగినది. నాకు మరల ప్రతి జన్మయందు ఆయనతో మాత్రమే ప్రేమ, ఆయన నాకు హీతకారి యగుట, నాకు ఉపకారము చేయుట, నేనాయనకు సేవ చేయుట, ఆయన భక్తుల తోడి సత్సంగము కలుగుగాక!
పుట్టుక లేని శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా సంపదలలోని దోషము తెలిసినవాడు. ధనికులు గర్వము వలన పతనమగుటను ఆయన యెరుగును. కావుననే, ఆయన దూరదృష్టి లేని భక్తునకు పలు రకముల సంపదలను, రాజ్యాధికారమును, ఐశ్వర్యములను ఈయడు.
ఆ సుదాముడు బుద్దితో ఈ విధముగా నిశ్చయించుకొని దుష్టజనశిక్షకుడగు శ్రీకృష్ణ భగవానునిపై ఓ అధికమగు భక్తిని కలిగియుండెను. ఆయన మెల్లమెల్లగా త్యాగమునభ్యసిస్తూనే ఆసక్తి లేకుండా భార్యతో గూడి ఇంద్రియభోగములననుభవించెను.
దేవాధిదేవుడు, యజ్ఞములకు ప్రభువు, సర్వశక్తిమంతుడు అగు ఆ శ్రీకృష్ణ భగవానుడు దుఃఖములను హరించును. ఆయనకు ప్రభువులు నిశ్చయముగా బ్రాహ్మణులే. ఆయనకు వారిని మించిన దైవము లేదు.
శ్రీకృష్ణ భగవానుడు పరాజయము లేనివాడే అయినా భక్తులకు వశమగును. ఈ సత్యమును ఆయన మిత్రుడగు . ఆ సుదాముడు కనుగొనెను. అపుడాతడు ఆయనను తీవ్రముగా ధ్యానించి అహంకారబంధమును తొలగించుకొనెను. ఆతడు శీఘ్రముగనే సత్పురుషులచే పొందబడే ఆ పరమాత్మస్వరూపమును పొందెను.
శ్రీకృష్ణ భగవానునకు బ్రాహ్మణులే దైవము. ఆయనయొక్క ఈ వృత్తాంతమును, బ్రాహ్మణేభక్తిని వినే మానవునకు ఆ భగవానునియందు భక్తి ఉదయించి సంసారబంధమునుండి విముక్తి లభించును.
శ్రీమద్భాగవతము పదవ స్కంధము ఉత్తరార్ధములో కుచేలోపాఖ్యానములో సుదామునకు సకలైశ్వర్యములు లభించుటను వర్ణించే ఎనుబది ఒకటవ అధ్యాయము ముగిసినది (81).
