శ్రీ మద్భాగవతము - దశమ (10వ) స్కందము
86 - సుభద్రాహరణ వృత్తాంతము - శ్రీకృష్ణుడు బహులాశ్వ శ్రుతదేవుల పూజలనందుకొనుట
పరీక్షిన్మహారాజు ఇట్లు పలికెను --- ఓ మహర్షీ! బలరామ శ్రీకృష్ణుల సోదరియగు సుభద్రను అర్జునుడే విధముగా వివాహమాడెనో తెలియగోరుచున్నాను. ఆమె నాకు నాయనమ్మ అగును.
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- అర్జునుడు గొప్ప సమర్థుడు. ఆయన తీర్థయాత్రలో భాగముగా భూమిని పర్యటిస్తూ ప్రభాసక్షేత్రమునకు వెళ్లాను. తన మేనమామయగు వసుదేవుని కుమార్తె సుభద్రను బలరాముడు దుర్యోధనునకిచ్చి వివాహము చేయబోవుచున్నాడని, ఆమెను ఆతనికిచ్చుట ఇతరులైన శ్రీకృష్ణాదులకు అంగీకారము కాదనియు వినెను.
ఆమెను పొందగోరి అర్జునుడు త్రిదండి సన్న్యాసీ వేషముతో ద్వారకకు వెళ్లాను. అర్జునునకు తన ప్రయోజనమును సాధించుకొనుట బాగా తెలియును. పురజనులు, ఈ సంగతి తెలియని బలరాముడు కూడ ఆయనను అధికముగా సమ్మానించిరి. ఆయన అచటనే వర్షకాలము నాల్గు నెలలు నివసించెను.
ఒకనాడు బలరాముడు అతిథి సత్కారము నిమిత్తమై ఆ అర్జునుని ఆహ్వానించి ఇంటికి తీసుకువచ్చి భిక్షాన్నమును సమర్పించెను. అర్జునుడు దానిని భుజించెను.
ఆతనికక్కడ వీరుల మనస్సును దోచే యుక్తవయస్సు వచ్చిన కన్య కనబడెను. ఆయన కన్నులు ప్రేమతో వికసించి మనస్సు ప్రేమచే విచలితమాయేను.
ఆమె నవ్వుతూ సిగ్గుతో ప్రక్క చూపులు చూస్తూ చూపులను, మనస్సును ఆయనకు సమర్పించివేసెను. స్త్రీలకు మనోహరుడైన ఆ. అర్జునుని చూచి ఆమె కూడ ఇష్టపడెను.
అర్జునుడు ఆమెను మాత్రమే ధ్యానించుచుండెను. ఆమెను హరించే అవకాశము కొరకు ఆతడు ఎదురుచూచుచుండెను. మీక్కిలి దృఢమైన ప్రేమచే ఆతని మనస్సు భ్రమించెను. ఆతనికి మనశ్శాంతి కరువాయెను.
సుభద్ర . తల్లిదండ్రులగు దేవకీవసుదేవులకు, శ్రీకృష్ణునకు కూడ అర్జునుడు సుభద్రను వివాహమాడుట అంగీకారము. సుభద్ర దేవయాత్ర సందర్భముగా దుర్గమునుండి బయటకు వచ్చెను. గొప్ప రథికుడగు అర్జునుడు రథమునందున్న ఆమెను తీసుకువెళ్లాను.
రథమునందున్న అర్జునుడు ధనుస్సు పట్టుకొని, అన్ని వైపులనుండియు అడ్డు పడుచున్న శూరులైన భటులను పారద్రోలేను. సుభద్ర బంధువులు ఆక్రోశించుచుండగా ఆతడు, సింహము తన భాగమును వలే, సుభద్రను తీసుకువెళ్లాను.
ఆ విషయమును విని బలరాముడు, పూర్ణిమనాడు మహాసముద్రము వలె, కల్లోలపడెను. శ్రీకృష్ణుడు, బంధువులు కూడ ఆయన కాళ్లు పట్టుకొని శాంతింపజేసిరి.
బలరాముడు ఆనందముతో వధూవరులగు సుభద్రార్జునులకు చాల ధనమును, సామగ్రిని, ఏనుగులను, రథములను, గుర్రములను, పరిచారకులను, పరిచారికలను పెళ్లికానుకగా పంపెను.
శ్రీకృష్ణునకు శ్రుతదేవుడని ప్రసిద్ధి గాంచిన బ్రాహ్మణశ్రేష్ఠుడు భక్తుడుగా నుండెను. శ్రీకృష్ణునియందలి ఏకాంతభక్తిచే పూర్ణ మైన మనోరథములు గల ఆయన శాంతుడు, వివేకి, విషయభోగములయందు ఆసక్తి లేనివాడు.
విదేహదేశములోని మిథిలానగరమునందు ఆ గృహస్థుడు నివసించెను. ఆయన అప్రయత్నముగా లభించిన ఆహారముతో జీవికను నడిపెడివాడు.
ప్రారబ్దము వలన ఆయనకు ప్రతిదినము దేహయాత్రకు మాత్రము తప్పనిసరిగా లభించెడిది. కాని, అధికము వచ్చెడిది కాదు. ఆయన లభించినదానితో సంతోషిస్తూ యోగ్యములైన కర్మలను (అతిథి సత్కారము ఇత్యాది) చేసెడివాడు.
ఓ పరీక్షిన్మహారాజా! అదే విధముగా, ఆ దేశమును పాలించే జనకవంశీయుడగు రాజు, బహులాశ్వుడని ప్రసిద్ది జెందినవాడు, అహం కారము లేనివాడు. వీరిద్దరు కూడ శ్రీకృష్ణ భగవానుని ప్రీతికి పాత్రులు.
సర్వసమర్థుడగు శ్రీకృష్ణ భగవానుడు వారిద్దరిపై ప్రసన్నుడాయెను. ఆయన మహర్షులతో గూడి, దారుకుడు తెచ్చిన రథమునెక్కి, విదేహదేశమునకు పయనమాయెను.
నారదుడు, వామదేవుడు, అత్రి, వ్యాసుడు, పరశురాముడు, అసితుడు, అరుణుడు, నేను (శుకమహర్షి), బృహస్పతి, కణ్వుడు, మైత్రేయుడు, చ్యవనుడు మొదలైన మహర్షులు ఆయనతో పాటు ఉండిరి.
ఓ పరీక్షిన్మహారాజా! అక్కడక్కడ పురజనులు, పల్లెవాసులు చేతులలో పూజాసామగ్రిని పట్టుకొని, వచ్చుచున్న ఆ శ్రీకృష్ణునకు, గ్రహములతో సహా ఉదయించిన సూర్యుని వలె, నమస్కరించిరి.
ఓ పరీక్షిన్మహారాజా! ఆనర్త ధన్వ కురుజాంగల కంక మత్స్య పాంచాల కుంతి మధు కేకయ కోసల అర్ణ దేశములకు చెందినవారు ఇతరులు పురుషులు స్త్రీలు కూడ ఆయనయొక్క పద్మమువంటి ముఖమును కళ్లతో పానము చేసిరి. ఆయన ముఖము పై ఔదార్యముతో కూడిన నవ్వు, ప్రేమతో నిండిన చూపులు గలవు.
ముల్లోకములకు తండ్రియగు శ్రీకృష్ణ భగవానుడు మెల్లగా విదేహదేశ మునకు వెళ్లాను. ఆయనను చూచుటచే జనుల బుద్దియందలి అజ్ఞానము నశించి అభయము కలుగుచుండెను. పది దిక్కులయందు వ్యాపించిన ఆయనయొక్క స్వచ్చమైన కీర్తిని దేవతలు, మానవులు గానము చేయుచుండగా ఆయన వినుచుండెను. ఆ కీర్తి అశుభములను పోగొట్టును.
ఓ పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణ భగవానుడు వచ్చినాడని విని ఆ పురజనులు, పల్లెవాసులు ఆనందముతో ఆయన కొరకు పూజాసామగ్రులను చేతులలో పట్టుకొని ఎదురేగిరి.
పవిత్రకీర్తియగు శ్రీకృష్ణ భగవానుని చూచి వారి ముఖములు, హృదయములు ఆనందముతో వికసించెను. వారు చేతులు జోడించి తలలు వంచి ఆయనకు, మహర్షులకు కూడ నమస్కరించిరి. ఆ మహర్షుల గురించి వారిదివరలో వినియుంటిరి.
జగత్తునకు తండ్రియగు ఆ శ్రీకృష్ణ భగవానుడు తమను అనుగ్రహించుటకై వచ్చినాడని తెలిసి మిథిలానరేశుడగు బహులాశ్వుడు, శ్రుతదేవుడు కూడ ఆ ప్రభుని పాదములపై పడిరి.
మిథిలానరేశుడగు బహులాశ్వుడు, శ్రుతదేవుడు కూడ ఒకే సారి దోసిలియొగ్గ దశార్హవంశీయుడగు శ్రీకృష్ణుని, మహర్షులతో బాటుగా, ఆతిథ్యమునకు ఆహ్వానించిరి.
వారి ఆ ఆహ్వానమునంగీకరించి శ్రీకృష్ణ భగవానుడు ఇద్దరికి ప్రీతిని కలిగించ గోరెను. ఆయన వారికి తెలియకుండా ఇద్దరి యింటిని రెండు వేర్వేరు రూపములతో ప్రవేశించెను.
శ్రీకృష్ణుడు, ఆ మహర్షులు దుష్టులకు కూతవేటు దూరములో . నుండెదరు. తన గృహమునకు వచ్చిన వారికి పెద్ద మనస్సు గల జనకుడు శ్రేష్ఠ మగు ఆసనములను సమర్పించెను. వారు సుఖముగా కూర్చుండగా ఆయనకు భక్తి బాగా వర్ధిల్లి హృదయములో ఆనందోద్రేకము కలిగి, కళ్లు నీటితో నిండిపోయెను. ఆయన వారికి నమస్కరించి పాదములను కడిగి పరివారముతో సహా, జనులను పవిత్రము చేసే ఆ నీటిని తలపై చల్లుకొనెను. ఆ మహాత్ములను ఆయన గంధము, మాలలు, వస్త్రములు, భూషణములు, ధూపము, దీపము, ఇతరపూజాసామగ్రి, ఆవు, ఎద్దులనిచ్చి పూజించెను.
ఆహారముతో సంతృప్తి జెందిన వారికి ఆ రాజు మధురమగు వాక్కుతో కూడ ప్రీతిని కలిగించెను. ఆయన శ్రీకృష్ణ భగవానుని పాదములను ఒడిలో ఉంచుకొని ఆనందముతో మెల్లగా నొక్కెను.
బహులాశ్వమహారాజు ఇట్లు పలికెను --- ఓ ప్రభూ! నీవు నిశ్చయముగా సకలప్రాణులలో మనస్సాక్షివగు సాక్షి చైతన్యమవు, ఆత్మస్వరూపుడవు. కావుననే, నిన్ను స్మరించే మాకు దర్శనమిచ్చినావు.
నాకు అనన్యభక్తునికంటే సంకర్షణుడు గాని, లక్ష్మీదేవి గాని, బ్రహ్మదేవుడు గాని ఎక్కువ ప్రియులు కాదు అని నీవు చెప్పితివి. నీ ఆ మాటను సత్యము చేయుటకై నీవు మాకు దర్శనమిచ్చితివి.
సర్వస్వమును విడిచి పెట్టి శాంతముగా ఉండే మునులకు నీవు నిన్నే సమర్పించెదవు. ఈ సత్యమును తెలుసుకున్న ఏ వ్యక్తి నీ పద్మమువంటి పాదమును విడిచి పెట్టును?
నీవు యదువంశములో అవతరించి ముల్లోకముల పాపమును పోగొట్టే నీ కీర్తిని విస్తరింపజేసితివి. నీ కీర్తి ఈ లోకములో సంసారబద్దులైన జనులకు సంసారమునుపశమింప జేయును.
ఓ శ్రీకృష్ణ భగవానుడా! మొక్కవోని విజ్ఞానశక్తి గల నీకు నమస్కారము. నీవు నారాయణ మహర్షి వై మిక్కిలి శాంతమగు తపస్సును చేసితివి.
ఓ పరబ్రహ్మా! మహర్షులతో కూడినవాడవై కొన్ని రోజులు మా ఇంటిలో నివసించి, పాదధూళితో నిమియొక్క వంశమును పవిత్రము చేయుము.
ప్రాణులను కాపాడే శ్రీకృష్ణ భగవానుడు బహులాశ్వమహారాజుచే ఈ విధముగా ఆహ్వానించబడి అక్కడే నివసిస్తూ మిథిలా నగరమునందలి స్త్రీపురుషులకు మంగళమును చేసెను.
బహులాశ్వుడు లాగానే శ్రుతదేవుడు కూడ తన ఇంటికి వచ్చిన శ్రీకృష్ణ భగవానునకు, మహర్షులకు నమస్కరించి మహానందముతో వస్త్రమును చుట్టూ తిప్పుతూ నాట్యము చేసెను.
ఆ శ్రుతదేవుడు భార్యతో గూడి తుంగచాపలను, పీటలను, దర్భా సనములను తెచ్చి వాటిపై వారిని కూర్చుండబెట్టెను. ఆయన స్వాగత వచనములతో వారిని అభినందించి, ఆనందముతో పాదములను కడిగెను.
గొప్ప సౌభాగ్యము గల ఆ శ్రుతదేవుడు ఆ నీటిని తనపై, ఇంటిలో, కుటుంబములోనివారిపై చల్లి మహానందమును పొందెను. ఆయన మనోరథములన్నియు ఈడేరెను.
ఆయన పళ్లు, పూజాద్రవ్యములు, వట్టివ్రేళ్లతో చల్లనైన అమృతమువంటి జలములు, పరిమళము గల మట్టి, తులసి, దర్భలు, పద్మములతో, సత్త్వగుణమును వర్ధిల్లజేసే ఆహారముతో, తేలికగా లభించే పూజాసామగ్రితో వారిని ఆరాధించెను.
ఇల్లు అనే చీకటి నూతిలో పడియున్న నాకు శ్రీకృష్ణునితో, మరియు ఆయన స్వరూపమునకు నివాసమైన మహర్షులతో సమాగమము కలిగెను.
ఈ మహర్షుల పాదధూళియందు సకలతీర్థములు నివాసముండును. ఇట్టి సమాగమము నాకెట్లు కలిగినదో? అని ఆ శ్రుతదేవుడు తలపోసెను.
శ్రుతదేవుడు భార్య, పిల్లలు, బంధువులతో గూడి వారికి అతిథిసత్కారమును చేసెను. వారు విశ్రాంతిగా కూర్చున్నప్పుడు దగ్గరగా కూర్చుండి వారికి పాదములను నొక్కుతూ ఆయన ఇట్లు పలికెను.
శ్రుతదేవుడిట్లు పలి కెను --- పురుషోత్తముడవగు నీవు మాకు ఈనాడు మాత్రమే దర్శనమీయలేదు. ఎందుకంటే, ఎప్పుడైతే నీవీ జగత్తును నీ శక్తులతో సృష్టించి సత్తాస్ఫూర్తిరూపముగా ప్రవేశించినావో, అప్పుడే దర్శనమిచ్చినావు.
అదెల్లాగంటే, నిద్రిస్తున్న వ్యక్తి తన అజ్ఞానమునకు వశుడై మనస్సులో జాగ్రదావస్థకంటే విలక్షణమైన మరియొక స్వప్నప్రపంచమును సృష్టించి, దాని సత్తాస్ఫూర్తులుగా తానే ప్రవేశించి తాను అనేకముగా భాసించును.
సర్వదా నీ గురించి శ్రవణము చేస్తూ, కీర్తిస్తూ, పూజిస్తూ, నమస్కరిస్తూ, చర్చిస్తూ ఉండే స్వచ్చమైన అంతఃకరణము గల వ్యక్తులకు నీవు హృదయము లోపల ప్రకాశించుచున్నావు..
కర్మలచే చెల్లాచెదరైన మనస్సు గలవారలకు నీవు హృదయమునందే ఉన్నా చాల దూరములోనున్నావు. మనస్సుయొక్క వృత్తులతో నిన్ను తెలియుట శక్యము కాదు. అయినా, సంస్కృతమైన మనస్సు గలవారలకు నీవు దగ్గరలో (ఆత్మరూపముగా ) ఉన్నావు.
నీవు ఆత్మజ్ఞానులకు అంతరతమమగు ఆత్మవు. కాని, దేహాభిమానికి నీవు నీ నుండి మృత్యువును పంపెదవు. మహత్తత్త్వము మొదలైన కారణతత్త్వములు, అవ్యక్తమాయాశక్తి నీకు ఉపాధులు. మాయాశక్తి నీకు ఆవరకము కాకున్ననూ, సంసారుల వివేకదృష్టిని కప్పివేయును. అట్టి నీకు నమస్కారము.
ఓ దేవా! అట్టి (మాయాశక్తిని శాసించే) నీవు నీ సేవకులమగు మమ్ము ఆదేశించుము. మేము ఏమి చేయవలెను? మానవులకు ఏ క్షణములో నీవు కంటబడేదవో, అదే క్షణములో దుఃఖములు అంతమగును.
శ్రీ శుక మహర్షి ఇట్లు పలికెను --- శ్రుతదేవుడు చెప్పిన ఈ మాటను విని, ప్రణమిల్లినవారి దుఃఖములను బాపే శ్రీకృష్ణ భగవానుడు చేతితో చేతిని పట్టుకొని నవ్వుతూ ఆయనతో నిట్లనెను.
శ్రీకృష్ణ భగవానుడిట్లు పలి కెను --- ఓ మహాత్మా! ఈ మహర్షులు నిన్ను అనుగ్రహించుటకే వచ్చినారని తెలియుము. వీరు నన్ను హృదయ ములో నిలిపి సంచరిస్తూ పాదధూళితో జనులను పవిత్రము చేయుదురు.
దేవతలు, క్షేత్రములు, తీర్థములు చూచి స్పృశించి అర్చించినచో మెల్లగా చాల కాలమునకు పవిత్రము చేయును. వాటి పావన శక్తి కూడ మహాత్ముల దృష్టి చేతనే వాటికి వచ్చినది. కాని, మహాత్ములను చూచినంత మాత్రాన మానవుడు పవిత్రుడగును.
ఈ లోకములోనీ సకలప్రాణులలో బ్రాహ్మణుడు పుట్టుకచే, తపస్సుచే, విద్యచే, సంతోషముచే శ్రేష్ఠుడు. నా ఉపాసన కూడ గల బ్రాహ్మణుడు శ్రేష్ఠుడని వేరుగా చెప్పవలయునా?
ఈ నాల్గు భుజముల రూపము నాకు బ్రాహ్మణునికంటే ఎక్కువ ప్రియమైనది కాదు. ఎందుకంటే, బ్రాహ్మణుడు సకలవేదరూపుడు కాగా, నేను సకలదేవతారూపుడను.
దుర్బుద్దులు ఈ విధముగా తెలుసుకోకుండా దోషములను వెదికెదరు. ప్రతిమ, తీర్థము మొదలైనవి మాత్రమే పూజనీయములనే భావనతో వారు ఆత్మరూపుడు, పూజనీయుడు, నా స్వరూపుడు అగు బ్రాహ్మణుని అవమానించేదరు.
బ్రాహ్మణుడు సర్వమునందు నన్నే చూచును. స్థావరజంగమా త్మకమగు ఈ జగత్తు, దానికి కారణములగు మహత్తత్త్వము మొదలైనవి నా రూపములేనని ఆతడు మనస్సులో అనుసంధానము చేయును.
ఓ మహాత్మా! కావున, ఈ మహర్షులను నాయందు చూపే శ్రద్ధతో పూజించుము. అట్లైనచో, సాక్షాత్తుగా నన్నే అర్చించినట్లగును. లేనిచో, పుష్కలమైన ఉపచారములను చేసినా నన్ను పూజించినట్లు కాదు.
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- శ్రీకృష్ణ ప్రభునిచే ఈ విధముగా ఆదేశించబడిన ఆ శ్రుతదేవుడు, మిథిలాధిపతియగు బహులాశ్వుడు కూడ శ్రీకృష్ణుని, ఆ గొప్ప మహర్షులను ఒకే ఆత్మ అనే భావముతో ఆరాధించి, సత్పురుషుల గతి (మోక్షము) ని పొందిరి.
ఓ పరీక్షిన్మహారాజా! భక్తులయందు ప్రేమ గల శ్రీకృష్ణ భగవానుడీ విధముగా భక్తులిద్దరి వద్ద నివసించి, వారికి సాధుపురుషుల మార్గమునుపదేశించి, మరల ద్వారకా నగరమునకు తిరిగి వచ్చెను.
శ్రీమద్భాగవతము పదవ స్కంధము ఉత్తరార్ధములో
సుభద్రాహరణ వృత్తాంతమును, శ్రీకృష్ణుడు బహులాశ్వ శ్రుతదేవుల
పూజలనందుకొనుటనువర్ణించే
ఎనుబది ఆరవ అధ్యాయము ముగిసినది (86).
* * * * *
