శ్రీ మద్భాగవతము - దశమ (10వ) స్కందము

Table of Contents

59 - భౌమాసురుని ఉద్దరించుట

పరీక్షిన్మహారాజు ఇట్లు పలికెను --- ఆ స్త్రీలను బందీ చేసిన భౌమాసురుని శార్ జ్ఞమనే ధనుస్సు గల శ్రీహరి భగవానుడు సంహరించిన విధమెట్టిది ? ఆ శ్రీకృష్ణుని ఈ చరితమును వివరించి చెప్పుడు.

భౌమాసురుడు వరుణుని ఛత్రమును, ఇంద్రుని తల్లియగు అదితి కుండలములను, దేవతల స్థానమగు మణిపర్వతమును అపహరించెను. ఇంద్రుడు శ్రీకృష్ణునకు భౌమాసురుని చేష్టలను విన్నవించెను. ఆయన సత్యభామతో గూడి గరుడుని అధిష్ఠించి ప్రార్ణ్యోతిషపురమునకు వెళ్లాను.

ఆ నగరమునకు చుట్టూ దాటి వెళ్లలేని పర్వతములు, ఆయుధముల ఆటంకములు, నీటి అగర్త, అగ్ని వలయము, వాయువలయము ఉన్న కారణముగా ,దానిలో ప్రవేశించుట దుర్ఘటము. పైగా, మురాసురుడు దాని చుట్టూ దృఢములై భయమును గోలే పదివేల పాశములను అమర్చెను.

ఆయన పర్వతములను గదతో పగులగొట్టి, దారికి ఆటంకములైన ఆయుధములను బాణములతో ఛిన్నాభిన్నము చేసెను. చక్రముతో అగ్ని వాయువలయములను, నీటి అగడ్డను ఛేదించి, కత్తితో మురాసురుని త్రాళ్లను తెగగొట్టెను.

గదాధారియగు శ్రీకృష్ణుడు శంఖము యొక్క నాదముతో వీరులమనే అభిమానము గలవారి హృదయములను, పెద్ద గదతో నగరముయొక్క ప్రాకారమును, దాని మీదనుండే యంత్రములను పగులగొట్టెను.

పాంచజన్యమనే శంఖముయొక్క ధ్వని ప్రళయకాలమునందలి పిడుగును పోలి యుండెను. దానిని విని (అగడ్తలోని) నీటియందు నిద్రిస్తున్న ఐదు తలల మురాసురుడు లేచి నిలబడెను.

మురుడు ప్రళయకాలమునందలి సూర్యుడు వలె అగ్ని వలె ప్రకాశిస్తూ కన్నెత్తి చూడరాకుండ నుండెను. ఆతడు త్రిశూలమును పైకెత్తి భయమును గొల్పుతూ ఐదు నోళ్లతో ముల్లోకములను మ్రింగివేయుచున్నాడా యన్నట్లు, పాము గరుడుని పైకి వలె, శ్రీకృష్ణుని వైపు పరుగెత్తుకు వచ్చెను.

ఆతడు వేగముగా శూలమును త్రిప్పి గరుత్మంతుని కొట్టి ఐదు నోళ్లతో నాదము చేసెను. ఆ పెద్ద నాదము స్వర్గభూపాతాళములను సకలదిక్కులను నింపి గంగాళమువంటి బ్రహ్మాండమునావరించెను.

గరుత్మంతుని మీదకు వచ్చుచున్న ఆ త్రిశూలమును శ్రీకృష్ణ భగవానుడు వేగముగా రెండు బాణములతో కొట్టి మూడు ముక్కలు చేసెను. పైగా, ఆయన ఆ మురుని అయిదు ముఖములను బాణములతో కొట్టెను, వాడు కూడ కోపముతో శ్రీకృష్ణునిపై గదను ప్రయోగించెను.

గదుని అన్నగారగు శ్రీకృష్ణుడు యుద్ధములో పరాజయమునేరుగడు. ఆయన మీదకు వచ్చుచున్న ఆ గదను తన గదతో వేయి ముక్కలుగా పగుల గొట్టెను. చేతులను పైకెత్తి మీదకు పరుగుతో వచ్చుచున్న మురుని తలలను ఆయన చక్రముతో సుసోయాసముగా ఊడగొట్టెను.

తల నరుకబడిన మురుడు ప్రాణములను కోల్పోయి, ఇంద్రుని వజ్రముచే తెగగొట్టబడిన శిఖరము గల పర్వతము వలె, నీటియందు పడెను. వాని ఏడురు పుత్రులు తండ్రి వధ చే దుఃఖితులై ప్రతీకారము చేయాలనే కోపముతో ఆవేశించబడి యుద్ధమునకు సంసిద్దులైరి.

తాముడు, అంతరిక్షుడు, శ్రవణుడు, విభావసువు, వసువు, నభస్వంతుడు, అరుణుడు అనే ఏడురు మురుని పుత్రులను భౌమాసురుడు ఆదేశించెను. వారు ఆయుధములను ధరించి పీఠుడనే సేనాపతిని ముందడుకొని యుద్ధము కొరకై బయటకు వచ్చిరి.

ఆ ఏడ్గురు కోపముతో అపరాజితుడగు శ్రీకృష్ణ భగవానుని సమీపించి ఆయనపై బాణములను, కత్తులను, గదలను, చిల్లకోలలను, ఈటెలను, శూలములను ప్రయోగించిరి. మొక్కవోని పరాక్రమము గల ఆయన తన బాణములతో ఆ ఆయుధసముదాయమును నుగ్గు నుగ్గుగా తెగగొట్టెను.

శ్రీకృష్ణుడు ఆ పీఠుడు మొదలగువారి తలలను, తొడలను, చేతులను, కోళ్లను, కవచములను తెగగొట్టి యమపురికి పంపించెను.

భూదేవి పుత్రుడగు నరకుడు తన సేనాపతులు ఆ విధముగా శ్రీకృష్ణ భగవానుని చక్రముచే మరియు బాణములచే సంహరించబడుటను చూచి సహించలేకపోయేను. ఆతడు సముద్రతీరమున పుట్టి అంతటా మదమును స్రవించుచున్న ఏనుగులతో కూడి బయటకు వచ్చెను.

గరుత్మంతునిపై భార్యయగు సత్యభామతో గూడి కూర్చున్న శ్రీకృష్ణుడు సూర్యునిపై మెరుపుతో కూడిన మేఘమువలె నుండెను. ఆయనను చూచి ఆ నరకుడు ఆయనపై ఫిరంగిని ప్రయోగించెను. ఆతని సైనికులందరు కూడ ఒక్కసారిగా ఆయుధములతో కొట్టిరి.

అదే సమయములో గదుని అన్నయగు శ్రీకృష్ణ భగవానుడు రంగు రంగుల రెక్కలు గల వాడి బాణములతో ఆ నరకాసురుని సైన్యములోని సైనికుల చేతులను, తొడలను, మెడలను, దేహములను నరికి, గుర్రములను, ఏనుగులను సంహరించెను.

కురువంశశ్రేష్ఠుడవగు ఓ పరీక్షిన్మహారాజా! నరకుని యోధులు ఏ ఆయుధములను, అస్త్రములను ప్రయోగించిరో, వాటిని శ్రీకృష్ణ భగవానుడు ఒక్కొక్కదానిని మూడేసి వాడి బాణములతో ఛేదించేను.

శ్రీకృష్ణుని తనపై మోస్తూనే గరుత్మంతుడు రెక్కలతో ఏనుగులను కొట్టెను. ముక్కు, రెక్కలు, గోళ్లతో గరుత్మంతుడు ఏనుగులను చంపెను.

యుద్దములో గరుత్మంతునిచే పీడించబడిన నరకుని సైనికులు నగరములోనికే పారిపోయిరి. ఆ దృశ్యమును చూచి నరకుడు యుద్ధమును కొనసాగించెను.

నరకుడు ఆ గరుడుని శక్తితో కొట్టెను. ఆ శక్తి ఒకప్పుడు వజ్రమును కూడ విఫలము చేసెను. కాని, దానిచే కొట్టబడిన గరుత్మంతుడు, మాలచే కొట్టబడిన ఏనుగు వలె, చలించలేదు.

గరుత్మంతుని కొట్టాలనే నరకుని ప్రయత్నము వ్యర్థమాయెను. అపుడాతడు శ్రీకృష్ణ భగవానుని కొట్టుటకై శూలమును తీసుకొనెను. ఆతడు దానిని విడుచుటకు ముందే శ్రీకృష్ణ భగవానుడు ఏనుగు పైనున్న వాని తలను చురకత్తివలే వాడియైన ధార గల చక్రముతో ఊడగొట్టెను.

కుండలములు,. అందమైన కిరీటము, అలంకారములతో గొప్పగా ప్రకాశించే ఆ తల నేలపై పడి భాసించేను. నరకుని అనుయాయులు అయ్యో! అయ్యో! అని వాపోయిరి. మహర్షులు, దేవనాయకులు బాగు! అంటూ మోక్ష ప్రదాతయగు శ్రీకృష్ణ భగవానునిపై పూలను చల్లుతూ స్తుతించిరి.

తరువాత భూదేవి శ్రీకృష్ణుని వద్దకు వచ్చి పుటము పెట్టిన బంగారమునందు పొదిగిన రత్నములు గల కుండలముల జత (అదితివి) ను, ఎనిమిది రకముల రత్నముల మాలయగు వైజయంతిని, అడవి పూల మాలను, వరుణుని ఛత్రమును, పెద్ద మణిని సమర్పించెను.

ఓ పరీక్షిన్మహారాజా! తరువాత భూదేవి దేవనాయకులచే పూజించబడిన జగన్నాథుడగు శ్రీకృష్ణునకు దోసిలి యొగ్గి నమస్కరించి, భక్తిభావముతో నిండిన హృదయముతో స్తుతించెను.

భూదేవి ఇట్లు పలికెను --- ఓ పరమాత్మా! దేవతలకు ప్రభువులగు బ్రహ్మాదులకు కూడ నీవు శాసకుడవు. శంఖమును, చక్రమును, గదను ధరించే నీవు భక్తుల ఇచ్చచే అవతారములను స్వీకరించెదవు. నీకు నమస్కారమగు గాక!

పద్మముల మాల గల నీయొక్క నాభినుండి పద్మము పుట్టినది. నీ కన్నులు, పాదములు పద్మములను పోలియుండును. నీ పాదములలో పద్మపు గుర్తులు ఉండును. నీకు అనేక నమస్కారములు.

విష్ణుభగవానుడవగు నీవు వసుదేవపుత్రుడవై అవతరించితివి. పూర్ణ బ్రహ్మ వైన నీవే జగత్కారణము. దేశకాలపరిచ్ఛేదములు లేని చైతన్యమే నీ స్వరూపము. నీకు అనేక నమస్కారములు.

ఓ పరమాత్మా! కారణకార్యముల సొరము నీవే. పంచభూతముల రూపముగా ప్రకటమైనది నీవే. పుట్టుక లేని నీవీ జగత్తును సృష్టించినావు. అనంతశక్తి గల పరబ్రహ్మవు నీవే. నీకు నమస్కారము.

ఓ ప్రభూ! సృష్టి చేయగోరిన నీవు కార్యోన్ముఖమగు రజోగుణమును, ప్రళయమునకై తమోగుణమును, జగత్తు యొక్క స్థితి కొరకు సత్త్వగుణమును ఉపాధిగా స్వీకరించేదవు. కాని, గుణాతీతుడవగు నీవు స్వతంత్రుడవే. ఓ జగన్నాథా! కాలము, ప్రకృతి, జీవుడు నీవే.

ఓ భగవానుడా! పృథివ్య పేజోవాయ్వాకాశములనే పంచభూతములు, శబ్దస్పర్శరూపరసగంధములనే సూక్ష్మభూతములు, సూర్యుడు మొదలైన ఇంద్రియాధిష్ఠానదేవతలు, సమష్టి మనస్సు, అహంకారము, మహత్తత్త్వ ము అనే ఈ స్థావరజంగమాత్మకమగు జగత్తు సర్వము రెండవది లేని నీయందు వేరుగా యథార్థముగా ఉన్నట్లు ఇది భ్రమ మాత్రమే.

శరణు జొచ్చినవారి దుఃఖములను బాపే ఓ శ్రీకృష్ణా! భయపడిన ఈ పిల్లవాడు ఆ నరకాసురుని కొడుకు. నేను వీనిని పద్మమువంటి నీ పాదము పై పడవేసినాను. కాబట్టి నీవు వీనిని కాపాడుము. సకలపాపములను పోగొట్టే నీ చేతిని వీని తల పైనుంచుము.

శ్రీశుక మహర్షి ఇట్లు పలి కెను --- భక్తిచే వినమ్రురాలైన భూదేవి ఈ విధముగా వాక్కులతో ప్రార్థించగా, శ్రీకృష్ణ భగవానుడు ఆ పిల్లవానికి అభయమునిచ్చి, సకలసంపదలతో నిండిన నరకుని ఇంటిని ప్రవేశించేను.

నరకాసురుడు పరాక్రమించి రాజులనుండి ఎత్తుకు వచ్చిన పదహారు వేల రాజపుత్రికలు అచట శ్రీకృష్ణ భగవానునకు కనబడిరి.

రాజప్రాసాదములో ప్రవేశించిన శ్రీకృష్ణుడు మానవులలో వీరుడు. ఆ యువతులు ఆయనను చూచి మోహమును పొందిరి. ఆయనను దైవము సమకూర్చిన ప్రియతముడగు భర్తగా వారు మనస్సులో వరించిరి.

ఈయన నాకు భర్త యగుగాక! ఈశ్వరుడు నా అభిలాషను అనుమోదించుగాక! అని ఆ యువతులందరు ఎవరికి వారే శ్రీకృష్ణునియందు ప్రేమతో హృదయమును నిలిపిరి.

శ్రీకృష్ణుడా యువతులకు అందమైన స్వచ్చమైన వస్త్రములనేర్పాటు చేసి పల్లకీల పై ద్వారకకు పం పేను. ఆయన గొప్ప ఖజానాలను, రథములను, గుర్రములను, గొప్ప సంపదను కూడ పం పెను.

నాలుగు దంతములు కలిగి తెల్లని వేగవంతములైన అరవై నాలుగు ఏనుగులను కూడ ఆ శ్రీకృష్ణ భగవానుడు ద్వారకకు పం పెను. ఆ ఏనుగులు ఐరావతము యొక్క వంశములో పుట్టినవి.

ప్రియురాలగు సత్యభామతో గూడి శ్రీకృష్ణ భగవానుడు దేవేంద్రుని భవనమునకు వెళ్లి అదితికి కుండలముల జతను ఇచ్చెను. మహేంద్రుడు శచీదేవితో గూడి ఆయనను పూజించెను.

సత్యభామ ప్రేరేపించగా శ్రీకృష్ణుడు ఇంద్రునితో సహా దేవతలను జయించి, పారిజాత వృక్షమునూడబెరకి, గరుత్మంతునిపై ఎక్కించి ద్వారకకు కొని తెచ్చెను.

ఆ చెట్టు సత్యభామ ఇంటిని ఆనుకొని ఉన్న ఉద్యానమునందు పాతబడి దానికి శోభను తెచ్చినది. దాని పరిమళముతో కూడిన తేనెయందలి లోభముచే స్వర్గమునుండి తుమ్మెదలు వెంట వచ్చినవి.

ఇంద్రుడు తలవంచి కిరీటముయొక్క కొనలతో శ్రీకృష్ణుని రెండు పాదములను తాకి నరకుని వధను గురించి ప్రార్థించెను. ఆయన ఆ పనిని చేసి పెట్టెను. ఇంద్రుడు గొప్పవాడే అయినా, తన పని అయిన పిదప ఈ శ్రీకృష్ణునితో (చెట్టు గురించి) విరోధము పెట్టుకొనెను. దేవతలయొక్క ఈ అజ్ఞానము, తాము సంపన్నులమనే గర్వము నిందార్దములు.

తరువాత ఒకానొక ముహూర్తమునందు అవినాశియగు శ్రీకృష్ణ భగవానుడు ఆ యువతులను అన్ని రూపములను దాల్చి వివిధభవనములయందు యథావిధిగా వివాహమాడెను.

ఆ యువతుల భవనములతో సమానమైనవి గాని, గొప్పవి గాని భవనములు లేవు. శ్రీకృష్ణుడు ఆ భవనములలో నిరంతరముగా ఉంటూ సామాన్యజనుల వలె గృహస్థధర్మములను పాటిస్తూ ఆ యువతులతో రమించెను. ఊహకు అందని లీలలను చేసే ఆ శ్రీకృష్ణుడు తన భక్తుల ఇచ్చకు వశుడై యుండును. ఆ యువతులు లక్ష్మీదేవియొక్క అంశలు.

శ్రీకృష్ణుని స్వరూపమును బ్రహ్మదేవుడు, ఇంద్రుడు మొదలగువారు కూడ తెలియలేకున్నారు. కానీ, ఈ విధముగా ఆ యువతులు లక్ష్మీపతి యగు ఆ శ్రీకృష్ణుని భర్తగా పొందిరి. వారి ఆనందము నిరంతరముగా వర్ధిల్లుచుండెను. వారు ప్రేమతో కూడిన చిరునవ్వులతో, చూపులతో, కొత్త " కలయికయందలి ప్రేమ ఊసుల సిగ్గులతో ఆయనను సేవించిరి.

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే దశమస్కంధే ఉత్తరార్దే ఏకోనషష్టితమోఽధ్యాయః॥

ఆ శ్రీకృష్ణ భార్యల వద్ద వందలాది దాసీలు ఉండిరి. అయినా, ఆ ప్రభునకు ఎదురేగుట, ఆసనమునిచ్చుట, త్రాగే నీరు మొదలగు శ్రేష్ఠమగు ఉపచారములను చేయుట, కాళ్లను కడుగుట, తాంబూలమునిచ్చుట, కాళ్లను నొక్కి శ్రమను తొలగించుట, వీచుట, గంధమునలదుట, పుష్పములనిచ్చుట, జుట్టు దువ్వుట, ప్రక్కనమర్చుట, స్నానమునకు - వ్యవస్థ చేయుట, భోజనమును ఫలహారమును ఇచ్చుట మొదలగు

పరిచర్యలతో వారే సేవ చేసిరి.

శ్రీమద్బాగవత మహాపురాణము పదవ స్కంధములో శ్రీకృష్ణుడు భౌమాసురుని ఉద్దరించుటను వర్ణించే ఏబది తొమ్మిదవ అధ్యాయము ముగిసినది (59).