శ్రీ మద్భాగవతము - దశమ (10వ) స్కందము
26 - నందునితో గోపాలకులు శ్రీకృష్ణుని గురించి చర్చించుట
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఈ విధములైన శ్రీకృష్ణుని లీలలను చూచి ఆ గోసాలకులు మిక్కిలి ఆశ్చర్యమును పొందిరి. వారికి ఆయన పరాక్రమము గురించి తెలియదు. వారు ఒకచో గుమిగూడి ఇట్లు పలికిరి.
ఈ బాలకృష్ణుని లీలలు నిశ్చయముగా అత్యద్భుతములు. ఈతడు పల్లెటూరివారమగు మనలో జన్మించుట ఈతనికి అయోగ్యమైన పుట్టుక. ఇది యెట్లు తగియున్నది?
ఈతడు ఏడేళ్ల బుడతడు. ఒకే చేతితో పెద్ద పర్వతమును, గొప్ప యేనుగు పద్మమును వలె, అవలీలగా ఎట్లు మోసినాడు?
ఈతడు చిన్నపిల్లవాడుగ నుండగనే గట్టిగా కళ్లను మూసుకొని గొప్ప బలము గల పూతనయొక్క చనుబాలను ఆమె ప్రాణములతో సహా, కాలము దేహము యొక్క వయస్సును వలె, త్రాగివేసెను.
ఈతడు మూడు నెలల పిల్లవాడుగా నున్నప్పుడు బండి క్రింద (చిక్కములో) పరుండి కాళ్లను రెండింటినీ పైకి ఊపుచుండెను. ఈతడు ఏడుస్తూ కాలి కొనతో తన్నగా బండి తల్లక్రిందులై పడిపోయెను.
ఒక ఏడు వయస్సు గల బాలకృష్ణుడు కూర్చుని యుండగా తృణావర్తుడనే రాక్షసుడు ఆకాశమార్గము గుండా ఎత్తుకుపోయెను. అపుడాతడు వాని కంఠమును పట్టి నొక్కి వానిని సంహరించెను.
అప్పుడే చిలికిన వెన్ననీతడు అపహరించగా తల్లి రోలునందు ఈతనిని కట్టివేసెను. అపుడీతడు జంట మద్ది చెట్ల మధ్య గుండా వెళ్తూ రెండు చేతులతో వాటిని పడగొట్టెను.
ఈతడు అడవిలో బలరామునితో గూడి గోప చుట్టువారియుండ దూడలను చక్కగా మేపుచుండెను. ఈతనిని చంపగోరి బకాసురుడనే శత్రువు రాగా, ఈతడు వాని ముక్కులను చీల్చి చంపెను.
ఈతనిని చంపాలనే కోరికతో ఒక రాక్షసుడు దూడ రూపముతో దూడలలో ప్రవేశించెను. ఈతడు వానిని చంపి ఆ దేహమును విసరగా అది తగిలి వెలగ చెట్ల పళ్లు రాలెను.
ఈతడు బలరామునితో కలిసి గాడిద రూపములోనున్న ధేనుకాసురుని, వాని బంధువులను కూడ సంహరించి, తాటి చెట్ల వనమునందు భద్రతను నెలకొల్పెను. దానియందు బాగా ముగ్గిన పళ్లు గలవు.
ఈతడు, బలశాలియగు బలరామునిచే భయంకరుడగు ప్రలంబాసురుని సంహరిపజేసెను. గోకులము యొక్క పశువులను, గోప బాలకులను అడవిలో దావాగ్నినుండి విడిపించెను.
ఈతకు మిక్కిలి భయంకరమగు విషము గల సర్పరాజగు కాలియుని పడగల పై బలముగా తొక్కి వాని గర్వమునడంచెను. వానికి యమునా నది లోని సరస్సునుండి ఉద్వాసన చెప్పి ఆ నీటికి విషము పోవునట్లు చేసెను.
ఓ నంద మహారాజా! గోకులమునందు నివసించే మాకందరికీ నీ పుత్రుడగు ఈతనిపై విడువ శక్యము కాని ప్రేమ. ఆతనికి కూడ మాపై సహజసిద్ధమైన ప్రేమ గలదు. దీనికి కారణమేమై యుండును?
గోకులప్రభువగు ఓ నందా! ఏడేళ్ల పిల్లవాడెక్కడ? పెద్ద పర్వతమును మోయుట యెక్కడ? అందువలన, మాకు నీ పుత్రునిపై అనుమానము కలుగుచున్నది.
నందుడు ఇట్లు పలికెను --- ఈ పిలవానిని గురించి ఒకనాడు గరాచార్యుడు నాకు చెప్పిన మాటను చెప్పెదను. మీరు నా మాటను విని వీనిపై గల అనుమానమును తొలగించుకొనుడు.
ఈయన ప్రతియుగమునందు అవతారములనెత్తును. తెలుపు, ఎరుపు, పచ్చన అనే మూడు రంగులుండెనట. ఇప్పుడీతడు నల్లనివాడైనాడు.
ఈ నీ పుత్రుడు పూర్వము ఒకప్పుడు ఎక్కడనో వసుదేవునకు పుట్టినాడు. ఆ రహస్యము తెలిసినవారు ఈతడు శ్రీమాన్ వాసుదేవుడని చెప్పెదరు.
నీ పుత్రునకు గుణములు లీలలను బట్టి అనేకములగు పేర్లు, రూపములు కూడా కలవు. అవి నాకు తెలియనే గాని, జనులకు తెలియవు.
ఈతడు గోపాలకులను, గోవులను ఆనందింప జేసి, మీకు గొప్ప హితమును చేయును. మీరు ఈతని ద్వారా ఆపదలనన్నింటినీ తేలికగా దాటి వేయగలరు.
గోకులమునకు ప్రభువగు ఓ నందా! పూర్వము అరాచకమేర్పడినప్పుడు చోరులు సత్పురుషులసు దోచుకొనుచుండిరి. అప్పుడు ఈతడు వారిని రక్షించి వారికి బలమును కలుగజేసెను.
విష్ణుపక్షీయులైన దేవతలను రాక్షసులు ఏమీ చేయలేరు. అదే విధముగా, ఏ మానవులైతే ఈతనియందు ప్రేమను కలిగియుండురో, వారు గొప్ప భాగ్యవంతులు. వీరిని శత్రువులు పరాభవించలేరు.
ఓ నందా! కాబట్టి, ఈ పిల్లవాడు గుణములు, శోభ, కీర్తి, మహిమలలో నారాయణునితో సమానమైనవాడు. ఆతని లీలలలో ఆశ్చర్యము లేదు.
సాక్షాత్తు గర్గాచార్యుడు ఈ విధముగా నాకు ఉపదేశించి తన యింటికి వెళ్లెను. తన లీలలచే మన కష్టములను పోగొట్టే ఈ శ్రీకృష్ణుడు నారాయణుని అవతారమని నేను తలంచుచున్నాను.
ఈ విధముగా గర్గుని ఉపదేశమును నందుని మాటల ద్వారా విన్న గోకులవాసులకు ఆశ్చర్యము తొలగిపోయినది. వారు అనంతశక్తియగు శ్రీకృష్ణుని మహిమలను చూచినవారు, విన్నవారే. వారు ఆనందముతో నందుని, శ్రీకృష్ణుని కూడ పూజించిరి.
ఇంద్రునకు తనను ఆరాధించే యజ్ఞమును ఆపివేయుట వలన కోపము వచ్చి సుడిగాలితో పాటుగా పిడుగులను, వడగళ్లను, వర్షధారలను వర్షించెను. అప్పుడు గోకులములోని గోపాలకులు, పశువులు, స్త్రీలు పీడను పొందిరి. వారికి శ్రీకృష్ణుడే రక్షకుడు. ఆయన వారిని చూచి దయ గలవాడై చిరునవ్వుతో, బలము లేని పిల్లవాడు కుక్క గొడుగును అవలీలగా పట్టుకున్న విధముగా, పర్వతమును ఒకే చేతితో ఊడబెరకి పట్టుకొని గోకులమును కాపాడెను. ఆ విధముగా ఆయన ఇంద్రునకు గర్వభంగమును చేసెను. అట్టి గోవిందుడు మన యెడల ప్రీతిని జెందు గాక!
శ్రీమద్భాగవత మహాపురాణము పదవ స్కంధము
పూర్వార్ధములో గోపాలకులు నందునితో శ్రీకృష్ణుని గురించి
చర్చించుటను వర్ణించే ఇరువది ఆరవ అధ్యాయము ముగిసినది (26).
