శ్రీ మద్భాగవతము - దశమ (10వ) స్కందము
12 - శ్రీకృష్ణుడు అఘాసురుని ఉద్ధరించుట
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఒకనాడు శ్రీకృష్ణునకు అడవియందే జించవలెనని గట్టి ఇచ్చ కలిగెను. ఆయన ఉదయమే నిద్ర లేచి త్రులైన గోపబాలకులకు మనోహరమైన కొమ్ము బూర ధ్వనితో కేతము చేసెను, దూడలు ముందు నడచుచుండగా ఆయన కులమునుండి బయలు దేరెను.
ప్రేమతో నిండిన గోపబాలకులు వేలసంఖ్యలో ఆ శ్రీకృష్ణునితోడనే ఆనందముగా బయల్వెడలిరి. వారి ముందు నడచే దూడల సంఖ్య వేల కంటే అధికముగా నుండెను. వారు మంచి భోజనపు ఉట్టిలను, బెత్తములను, కొమ్ము బూరాలను, పిల్లన గ్రోవులను కలిగియుండిరి. .
వారు అసంఖ్యాకముగానున్న శ్రీకృష్ణుని దూడలతో తమ దూడలను కలిపి గుంపుగా చేసి, అక్కడక్కడ పిల్లల ఆటలతో విహరించిరి.
గాజు పూసలు, గురివింద పూసలు, మణులు, బంగారములతో చేసిన నగలను ఆ పిల్లలు కలిగియుండిరి. ఐనా వారు పళ్లు, చిగుళ్లు, పూల గుత్తులు, పూలు, నెమలి ఈకలు, రాళ్ల రంగులతో అలంకరించుకొనిరి.
ఒకరి (అన్నపు గిన్నెను భద్రము చేసే) ఉట్టి, పిల్లన గ్రోవి మొదలగువాటిని మరియొకడు అపహరించును. ఫలానా వాడు అపహరించినాడని తెలుసుకోగానే, ఆ తెలియబడినవాటిని దూరముగా విసి రెదరు. దాని కొరకు ఈతడు పరుగెత్తగా, అక్కడున్న పిల్లలు దానిని మరింత దూరము విసిరేదరు. అంతిమముగా నవ్వుతూ దానిని వానికి తిరిగి యిచ్చెదరు.
శ్రీకృష్ణుడు అడవి అందమును తిలకించుటకై దూరము వెళ్లగా, నేను ముందు నేను ముందు అంటూ పిల్లలు (పరుగెత్తి) ఆతనిని ముట్టి ఆనందించెడివారు.
కొందరు పిల్లన గ్రోవులను వాయిస్తూ ఉంటే, మరికొందరు కొమ్ము బూరాలను పూరించుచుండిరి. కొందరు తుమ్మెదలతో బాటు ఝామ్ అని ధ్వనిస్తూ ఉంటే, మరికొందరు కోకిలల కూతలతో కంఠమును కలిపిరి.
కొందరు పక్షుల నీడలతో బాటుగా వేగముగా పరుగెత్తెదరు. కొందరు హంసలతో సరిదూగునట్లుగా నడచెదరు. కొందరు కొంగల ప్రక్కన జేరి కూర్చుందురు. కొందరు పురి విప్పిన నెమళ్లతో కూడి నాట్యమాడెదరు.
వారు కోతి పిల్లలను లాగి, వాటితో చెట్లనెక్కెదరు. వాటితో బాటు పళ్లను ఇగిలించి వెక్కిరిస్తూ చెట్ల పై దుముకుచుందురు.
కొందరు నదిలో కలిసే నీటి పాయలలో దిగి తడిసి ముద్దవుతూ వాటిలోని కప్పలతో బాటు గెంతెడివారు. నీటిలోని తమ ప్రతిబింబములను కొందరు వెక్కిరించెడివారు. కొందరు కేక వేసి ప్రతిధ్వనిని తిట్టెడివారు.
జ్ఞానులకు బ్రహ్మానందమై అనుభవమునకు వచ్చేది, శరణాగతులైన భక్తులకు పరదైవతముగా ఆరాధించబడేది, అజ్ఞానబంధములో ఉన్న వారలకు మానవబాలకుడుగా తెలియబడేది ఆ శ్రీకృష్ణుడే. గోపబాలకులు గుట్టలుగా పుణ్యమును చేయబట్టి ఆయనతో ఈ తీరున విహరించిరి.
అనేకజన్మలలో తపస్సు చేసి మనస్సును నిగ్రహించిన యోగులకైననూ ఆ శ్రీహరి యొక్క పాదముల ధూళి లభించదు. అట్టి శ్రీహరియే స్వయముగా గోకులవాసుల కళ్లకు కనబడుతూ నిలిచినాడు. వారి భాగ్యమును ఇంతకు మించి ఏమని వర్ణించదగును?
తరువాత అఘుడని ప్రసిద్ధి గాంచిన పెద్ద రాక్షసుడు అకస్మాత్తుగా వచ్చెను. వారు సుఖముగా ఆడుకొనుటను చూచి వాడు ఓర్వలేకపోయేను. దేవతలు అమృతము త్రాగినా లభించని జీవితసాఫల్యమును కోరువారై ఆ శ్రీకృష్ణుని లీలను నిత్యము మనస్సులో స్మరించుచుందురు.(అమృతమును త్రాగినా తమ జీవితములకు అఘాసురుని వలన హాని కలుగుననే భయముతో దేవతలు వాని మృత్యువు కొరకు ఎదురు చూచుచుందురు).
పూతనకు బకాసురునకు సోదరుడగు అఘాసురుని కంసుడు పంపెను. వాడు కృష్ణుడు ప్రముఖుడుగా గల గోపబాలకులను చూచి. ఇట్లు తలపోసేను -- నా సోదరుడగు బకాసురుని, సోదరియగు పూతనను, చంపినది వీడే. నాకు చెందిన వారిద్దరికి ప్రీతిని కలిగించుటకై నేను వీనిని గోపబాలకులతో సహా చంపెదను.
నా సోదరీసోదరులకు వీరిని తిలోదకములుగా చేసెదను. అప్పుడు గోకులములోని జనులు చచ్చినవారితో సమానము. ప్రాణమే పోతే దేహముల గురించి చింత యేముండును? ఎందుకంటే, ప్రాణులకు వారి సంతానమే ప్రాణము.
అప్పుడా దుష్టుడు ఈ విధముగా నిశ్చయించుకొని పెద్ద కొండచిలువ దేహమును దాల్చెను. అది రెండు క్రోసుల పొడవు కలిగి పెద్ద పర్వతము వలె బలిసి ఉండెను. ఆశ్చర్యకరమగు దాని నోరు తెరుచుకుని గుహవలె నుండెను. అది గోపబాలకులను మింగాలనే కోరికతో దారిలో పరుండెను.
ఆ అఘాసురుని క్రింది పెదవి నేలను, పై పెదవి మేఘములను తాకుచుండెను. వాని నోటి కొనలు గుహలను, కోరలు పర్వతశిఖరములను పోలియుండెను. నోటి లోపలి భాగము చీకటి. నాలుక పరుచుకున్న మార్గమువలె నుండెను. వాని నిట్టూర్పులు వేడి గాడ్పు వలె నుండెను. వాని కన్నులు కార్చిచ్చును పోలియుండెను.
అట్టి అఘాసురుని ఆ గోపబాలకులందరు చూచి, అది బృందావనములోని సుందరదృశ్యమనియే తలపోసిరి. పైగా, ఆ దృశ్యము నోరు తెరిచిన కొండచిలువను పోలి యున్నదని విలాసగా వర్ణించిరి.
ఆశ్చర్యము! మిత్రులారా! చెప్పడు. మనముందున్న ఈ బండరాయి పెద్ద ప్రాణివలె ఉన్నది గదా? ఇది మనలను మ్రింగుటకై నోరు తెరిచిన కొండ చిలువను పోలియున్నదా? లేదా?
నిజమే. సూర్యకిరణములచే అంతటా ఎర్రనైన మేఘము పై పెదవిని, ఆ మేఘమే నదియందు ప్రతిఫలించి ఎర్రగా కనబడే నది ఒడ్డు క్రింది పెదవిని పోలియున్నవి.
చూడండి. ఎడమ-కుడివైపులనున్న ఈ రెండు పర్వతగుహలు కొండ చిలువ పెదవి కొనలతో, ఈ ఎత్తైన శిఖరముల వరుసలు దాని కోరలతో పోటీ పడుచున్నవి.
ఈ విస్తరించిన పొడవైన దారి కొండచిలువ నాలుకను, ఈ పర్వతశిఖరముల లోపలి చీకటి కూడ కొండ చిలువ నోటి మధ్యభాగమును గట్టిగా పోలియున్నవి.
చూడండి. దావాగ్నిచే వేడెక్కిన పరుషమైన గాలి కొండ చిలువ శ్వాసను పోలినది. ఇంతేగాక, ఆ దావాగ్నిలో పడి కాలిపోయిన ప్రాణుల దుర్గంధము దాని కడుపు లోపలి మాంసపు వాసనను పోలియున్నది.
ఇది నిజముగా కొండ చిలువయే అయి, ఇక్కడ కూర్చున్న మనలను మ్రింగి వేయునా యేమీ? నిజముగా కొండ చిలువయే ఐనచో, బకాసురుని సంహరించిన శ్రీకృష్ణుడు దీనిని క్షణములో నశింప జేయగలడు, అని ఆ గోపబాలకులు మాట్లాడుకొనుచుండిరి. వారు బకాసురుని సంహరించిన శ్రీకృష్ణుని అందమగు ముఖమును చూస్తూ, బిగ్గరగా నవ్వుతూ చప్పట్లతో ముందుకు సాగిరి.
శ్రీకృష్ణ భగవానుడు సకలప్రాణుల హృదయమునందు (ఆత్మ రూపముగా) ఉన్నాడు. ఆ రాక్షసుని గురించి తెలియని గోపబాలకులు భ్రమతో ఈ తీరున ఒకరితోనొకరు పలికిరి. ఆ మాటలను విని ఆయన, వీరికి సత్యము మిథ్యగా తోచుచున్నది, అని తలచెను. వాడు రాక్షసుడని తెలిసి, ఆయన వారిని (ముందుకు వెళ్లకుండా) ఆపుటకు నిశ్చయించెను.
అంతలోనే గోపబాలకులు దూడలతో సహా రాక్షసుని ఉదరము మధ్య లోనికి ప్రవేశించినారు. కానైతే, తన ప్రియబంధువులగు పూతనను బకాసురుని గుర్తు చేసుకున్న రాక్షసునిచే వారు మ్రింగబడలేదు. ఎందుకంటే, వాడు బకాసురుని చంపిన శ్రీకృష్ణుడు ప్రవేశించుటకై ఎదురు చూచుచుండెను.
శ్రీకృష్ణుడు సకలప్రాణులకు అభయమునిచ్చువాడు. మరియొక రక్షకుడు లేని దీనులైన ఆ పిల్లలు ఆయన చేతినుండి జారిపోయి మృత్యురూపుడగు అఘాసురుని జఠరాగ్నికి గడ్డిపోచలవంటివారు కాబోతున్నారు. ప్రారబ్దముచే కల్పించబడిన ఆ పరిస్థితిని చూచి ఆయన మనస్సు దయచే పీడను పొందెను. ఆయన ఆశ్చర్యచకితుడయ్యెను.
ఈ విషయములో కర్తవ్యమేమి? ఈ దుష్టుడు బ్రదికి యుండరాదు. అమాయకులైన ఈ పిల్లలకు హాని కలుగరాదు. ఈ రెండు లక్ష్యములు నెరవేరే ఉపాయమేది? అని సర్వసాక్షియగు శ్రీకృష్ణ భగవానుడు లోతుగా ఆలోచించేను. ఆ ఉపాయము తట్టి, ఆయన వాని నోటిలో ప్రవేశించేను.
అప్పుడు కంసుని భయము వలన మేఘముల మాటున నక్కి చూస్తున్న దేవతలు అయ్యో! అయ్యో! అంటూ ఆక్రోశించిరి. అఘాసురుని బంధువులు కంసుడు మొదలైనవారెవరు గలరో, వారైతే హర్షించిరి.
వినాశము లేని శ్రీకృష్ణ భగవానుడు ఆ ఆక్రోశమును వినేను. అఘాసురుడు పిల్లలను, దూడలను, శ్రీకృష్ణుని కూడ చూర్ణము చేయ గోరెను. కాని, ఆయన మాత్రము వాని కంఠములో వేగముగా పెరిగెను.
ఆయన అట్లు పెరుగుట వలన పెద్ద దేహము గల ఆఘాసురుని ప్రాణవాయుమార్గము మూసుకుపోయెను. కళ్లు బయటకు పొడుచుకు రాగా, వాడు ఇటునటు పొర్లాడుచుండెను. దేహమధ్యభాగమునందు అడ్డు కొనబడి నిండిపోయిన వాయువు తలపై పగులగొట్టుకొని బయల్వెడలెను.
ఆ దారిగుండా వాని ప్రాణములన్నీ పైకి పోయెను. దూడలు, గోపబాలకులు మరణించి పడి యుండిరి. మోక్ష ప్రదాతయగు శ్రీకృష్ణ భగవానుడు వారిని తన చూపుతో పైకి లేచునట్లు చేసెను. ఆయన వారితో గూడి మరల నోటినుండి బయటకు వచ్చెను.
బలిసిన ఆ పాము పడగలనుండి అద్భుతమైన పెద్ద జ్యోతి బయటకు వచ్చేను. పది దిక్కులను తన కాంతితో ప్రజ్వరిల్ల జేయుచున్న ఆ జ్యోతి ఆకాశమునందు నిలిచి భగవానుడు బయటకు వచ్చువరకు ప్రతీక్షించేను. దేవతలు విస్తుబోయి చూచు చుండగా, అది ఆయనలో ప్రవేశించెను.
ఆ అఘాసురవధవలన మిక్కిలి హర్షమును పొందిన దేవతలు పూలతో తమ కార్యము (రాక్షససంహారము) ను చేసిన శ్రీకృష్ణుని సత్కరించిరి. అప్సరసలు నాట్యములతో, బాగా పాడే గంధర్వులు పాటలతో, వాద్యము లను కలిగియుండే విద్యాధరులు వాద్యములతో, మహర్షులు స్తోత్రములతో, పార్షదగణములు కూడ జయజయధ్వానములతో సత్కరించిరి.
దేవతలు మొదలగువారి అద్బుతములైన స్తోత్రములు, చక్కని వాద్యములు, పాటలు, జయధ్వానములు మొదలగు, అనేకములైన ఉత్సవముల మంగళధ్వనులు బ్రహ్మదేవునకు ఆయన ధామము దగ్గర వరకు వినిపించెను. ఆయన వెంటనే వచ్చి శ్రీకృష్ణ భగవానుని మహిమను గాంచి ఆశ్చర్యచకితుడాయెను.
ఓ పరీక్షిన్మహారాజా! అద్బుతమైన ఆ కొండ చిలువ చర్మము ఎండి పెద్ద బిలము ఆయెను. గోకులవాసులు చాల కాలము బృందావనములో దానియందు ఆటలాడెడివారు.
ఈ విధముగా శ్రీకృష్ణ భగవానుడు తన ఐదవ యేట గోపబాలకులను పాము నోటిలో చావునుండి, అఘాసురుని సంసారమునుండి విముక్తులను చేసెను. దీనిని చూచిన గోపబాలకులు ఆశ్చర్యపడి, ఆ వృత్తాంతమును శ్రీకృష్ణుని ఆరవ యేట గోకులమునందు చెప్పిరి.
బ్రహ్మాది దేవతలనుండి చెట్టు చేమలవరకు సర్వమును (కార్యములైన దేహములతో కారణములైన పంచభూతములతో కూడియున్న జగత్తును) సృష్టించిన పరబ్రహ్మయే మాయాశక్తిచే మానవబాలకుడై అవతరించేను. ఆయనకు ఇది విచిత్రమేమీ కాదు. ఏదనగా -- మోక్ష మైతే దుష్టులకు సుతరాము పొంద శక్యము కానిది. కాని, ఆయనను స్పృశించుటచే పాపములన్నీ కడిగివేయబడి అఘాసురుడు కూడ మోక్షమును పొందెను. మోక్షములో జీవుడు ఈశ్వరునిలో విలీనమగును.
ఆ భగవానుని మూర్తి యొక్క ప్రతికృతిని మనోవృత్తిరూపముగా ఎవడైతే ఒక్కసారి హృదయము లోపల ధ్యానముచే స్థాపించుకొనునో, అట్టివానికి భగవానుడు భగవద్బక్తులకు లభించే మోక్షమునిచ్చెను. హృదయములో నిత్యమైన ఆత్మానందానుభవరూపముగా ఆ భగవానుడు సాక్షాత్కరించి అజ్ఞానమును పారద్రోలును. అట్టి భగవానుడే స్వయముగా ఎవని దేహములో ప్రవేశించెనో, అట్టి అఘాసురునకు మోక్షము లభించెనని వేరుగా చెప్పవలయునా?
సూతమహర్షి ఇట్లు పలికెను --- ఓ శౌనకాది మహర్షులారా! యాదవప్రభువగు శ్రీకృష్ణుడే పరీక్షిత్తును కాపాడి పాండవులకు అనుగ్రహించెను. తనను కాపాడిన ఆ భగవానుని అద్బుతమగు చరితమును పరీక్షిత్తు వినుచుండెను. ఆయన మనస్సు ఆ చరితమునకు సుతరాము వశమయ్యెను. ఆయన మరల శుకమహర్షిని పవిత్రమగు ఆ చరితమును గురించియే ప్రశ్నించెను.
పరీక్షిన్మహారాజు ఇట్లు పలికెను --- ఓ మహర్షీ! శ్రీకృష్ణ భగవానుడు తన ఐదవ యేట ఏ లీలను చేసెనో, దానిని గోపబాలకులు ఆరవ యేట గానము చేసిరి. ఒక కాలములో చేసిన లీల మరియొక కాలమునకు చెందినది యెట్లు అగును? .
ఓ మహాయోగీ! నీవు నాకు గురుడవు. నాకీ విషయమును చెప్పుడు. నాకు కుతూహలము మెండు. ఇది నిశ్చయముగా శ్రీకృష్ణ భగవానుని - మాయాశక్తియే గాని, మరియొకటి కాదు.
ఓ గురుదేవా! మేము క్షత్రియాధులమే. అయినా అందరికంటే ఎక్కువ ధన్యులము. ఎందుకంటే, మేము నీనుండి పవిత్రమైన శ్రీకృష్ణగాథలనే అమృతమును మరల మరల పానము చేయుచున్నాము.
సూత మహర్షి ఇట్లు పలికెను --- ఓ శౌనకా! నీవు ఉత్తములగు భగవద్బక్తులలో ఉత్తముడవు. ఈ విధముగా రాజు ప్రశ్నించగా, వ్యాసపుత్రుడగు శుకునకు శ్రీకృష్ణ భగవానుడు స్మృతికి దగిలెను. అంతే. వెంటనే ఆయన ఇంద్రియములన్నియు అంతర్ముఖములాయెను. చాల కష్టము మీద ఆయన మరల సమాధినుండి బాహ్యజగత్తులోనికి వచ్చి, మెల్లగా ఆ రాజునకు ఇట్లు బదులు చెప్పెను.
శ్రీమద్బాగవత మహాపురాణమునందు పదవ స్కంధము పూర్వార్దములో శ్రీకృష్ణుడు అఘాసురుని ఉద్దరించుటను వర్ణించే పన్నెండవ అధ్యాయము ముగిసినది.
