శ్రీ మద్భాగవతము - దశమ (10వ) స్కందము

Table of Contents

25 - గోవర్ధనోద్ధారము  

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణుడు రక్షకుడుగా గల నందుడు మొదలైన గోపాలకులు తన పూజను ఆపివేసిరని తెలిసి, అప్పుడా ఇంద్రునకు కోపము వచ్చెను.

లోకపాలకుడననే అభిమానముతో కోపించిన ఇంద్రుడు సాంవర్తకమని ప్రసిద్ధి గాంచిన మేఘముల గణమును ఆజ్ఞాపించెను. ఆ మేఘములు ప్రళయమును కలిగించును. ఆయన వాటితో నిట్లనెను.

ఆహా! అడవిలో బ్రతికే గోపాలకుల ధనగర్వముయొక్క మహిమను చూడుడు. వారు మానవుడగు కృష్ణుని ఆశ్రయించి నాకు అవమానమును చేసిరి.

కర్మరూపములైన యజ్ఞములు పేరుకి నావవంటివి. కాని, అవి గట్టివి కావు. కొందరు ఆత్మస్వరూపమును బోధించే జ్ఞానమును ప్రక్కన బెట్టి, వాటితో సంసారసముద్రమును తరించ గోరెదరు. అదే విధముగా గోపాలకులు చేయుచున్నారు.

కృష్ణుడు వదరుబోతు, మూర్ఖుడు, గర్విష్ఠి, అజ్ఞాని, పండితుడననే అభిమానము గలవాడు, మరణించే స్వభావము గల మానవుడు. వానిని ఆశ్రయించి గోపాలకులు నాకు అప్రియమును చేసిరి.

ధనముతో గర్వించి యున్న వీరి మనోబలమును కృష్ణుడు వర్ధిల్ల జేసినాడు. వీరి పొగరును కడిగివేయుడు. పశువులను వినాశము చేయుడు.

నందుని గోకులమును నశింప జేయగోరుచున్నాను. నేను కూడ గొప్ప బలము గల మరుత్తుల గణములతో కూడి ఐరావతమనే ఏనుగునెక్కి మీ వెంట గోకులమునకు వచ్చెదను.

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఈ విధముగా ఆజ్ఞాపించి ఇంద్రుడు మేఘముల బంధనములను తొలగించివేసెను. అవి వేగముగా నందుని గోకులమునకు వచ్చి నీటి ధారలతో పీడను కలుగజేసెను.

మెరుపులతో అధికముగా ప్రకాశిస్తూ పిడుగుల ధ్వనులతో గర్జిస్తున్న మేఘములను ప్రచండచుగు గాలులతో మరుద్గణములు ప్రేరిపించినవి. అపుడా మేఘములు వడగళ్లను వర్షించినవి.

మేఘములు స్తంభములవలె దొడ్డు నీటి ధారలను నిరంతరముగా వర్షించినవి. నేల అంతా నీటి ప్రవాహములచే ముంచెత్తబడి, ఎత్తు పల్లములు కనబడకుండా పోయినవి.

కుండపోత వర్షముతో కూడిన ప్రచండమగు గాలి వలన పశువులకు, గోపాలకులకు, గోపికలకు కూడ చలితో వణుకు పుట్టి బాధపడిరి. వారు గోవులను రక్షించే శ్రీకృష్ణుని శరణు వేడిరి.

కుండపోత వర్షము చే పీడించబడి వణికిపోవుచున్న ఆవులు తమ తలను, దూడలను దేహము క్రింద కప్పి, శ్రీకృష్ణ భగవానుని పాదముల మూలమును చేరుకున్నవి.

ఓ శ్రీకృష్ణా! ఓ శ్రీకృష్ణా! నీవు మహాత్ముడవు, భక్తులయందు వాత్సల్యము గల ప్రభుడవు. గోకులమునకు రక్షకుడవు నీవే. కోపించిన ఇంద్రునినుండి గోకులమును, మమ్ములను రక్షించుటకు నీవే తగుదువు.

వడగళ్ల వర్షపు దెబ్బలకు సకల ప్రాణులు స్పృహను కోల్పోవుచుండెను. ఆ దృశ్యమును చూచి శ్రీకృష్ణ భగవానుడు, అదంతా కోపించిన ఇంద్రుడు చేసిన పనియేనని తెలుసుకొనెను.

మనము తన యాగమును ఆపివేసినందున ఇంద్రుడు మన వినాశము కొరకై వర్ష - ఋతువు కాకున్నా మిక్కిలి భయంకరమైన రాళ్ల నానను కురిపించుచున్నాడు. ఆ వర్షమునకు అధికమగు గాలి తోడై చాల భయమును గొల్పుచున్నది. (అని శ్రీకృష్ణుడు తలపోసెను).

ఆ విషయమునందు ప్రతిచర్యసు నేను నా సామర్థ్యము (మాయాశక్తి) చే బాగుగా సాధించెదను. మూర్ఖత్వముచే లోకపాలకులమనే అభిమానము గల ఇంద్రాదుల ధనగర్వమును, అజ్ఞానమును నేను పోగొట్టెదను.

దేవతం సత్త్వ ప్రధానమగు అంతఃకరణము గలవారు. వారుకి పాలకులమనే గర్వము , యుక్తము, కాదు. దుష్టులకు నేను చేసే గర్వభంగము వారికి అనర్ధములను గొట్టుటయందే పర్యంవసించును.

ఈ గోకులమునకు రక్షకుడను, ప్రభువును నేనే. నేనీ గోకులమును నా కుటుంబముగా స్వీకరించినాను. కావున, దీనిని నేను నా మాయాశక్తి చే రక్షించెదను. నేను అట్టి ఈ సత్పురుషులను రక్షించుట అనే వ్రతమును స్వీకరించినాను.

ఇట్లు పలికి శ్రీకృష్ణుడు ఒకే చేతితో గోవర్ధన పర్వతమునూడబెరకి, పిల్లవాడు కుక్కగొడుగును వలె, అవలీలగా ధరించెను.

అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు గోపాలకులతో నిట్లనెను – ఓ తండ్రీ! గోకులవాసులారా! ఈ పర్వతము యొక్క పల్లమునందు గోసంపదలతో సహా ప్రవేశించి విశ్రాంతిగా నుండుడు.

ఇచట నా చేతినుండి సర్వతము పడిపోవునేమోననే భయము మీకు వద్దు, మీరు గాలికి, వర్షమునకు ఇకపై భయపడవద్దు. ఎందుకంటే, వాటినుండి మీకు నేనీ రక్షణనేర్పాటు చేసినాను.

శ్రీకృష్ణుడు వారి మనస్సులలో విశ్వాసమును కలిగించెను. అప్పుడు వారు ఆయన చెప్పినట్లుగా తమ సంపదలతో కూడి, సామానును బళ్లలో నింపుకొని, సేవకులు మొదలగువారితో సహా తొడతొక్కిడి లేకుండా విశాలమైన ఆ పర్వతము ఉండిన పల్లములోనికి ప్రవేశించిరి.

ఆ గోకులవాసులు చూస్తూండగా, ఆకలి దప్పికల పీడ గాని, సుఖాపేక్ష గాని లేకుండా, ఆయన నిలబడ్డ చోటునుండి కదలకుండా నిరంతరముగా ఏడు రోజులు పర్వతమును మోస్తూ ఉండెను.

శ్రీకృష్ణుని యోగమాయ యొక్క ఆ మహిమను చూచి ఇంద్రుడు చాల విస్మయమును పొందెను. ఆతని గర్వము తొలగిపోయి గోకులమును నశింప జేయాలనే సంకల్పము జారిపోయెను. ఆతడు తన మేఘములను పూర్తిగా వెనుకకు మళ్లించెను.

ఆకాశములో సూర్యుడు ఉదయించి మేఘములు తొలగిపోయెను. దారుణమైన గాలివాన కూడ అగిపోయెను. అది చూచి గొవర్ధన శ్రీకృష్ణుడు గోపాలకు తో నిల్లనెను.

ఓ గోసాలకులారా! స్త్రీలు, సంపదలు, పిల్లలతో కలిసి భయమును వీడి బయటకు నడువుడు. గాలి వాన ఆగినది. నదులలో నీరు కూడ తగ్గినది.

పిదప ఆ గోపాలుగు, స్త్రీలు, పిల్లలు, పెద్దలు తమ తమ గోసంపదను తీసుకొని, సామగ్రిని బళ్లపై ఎక్కించుకొని, మెల్లగా బయటకు వచ్చిరి.

సర్వశక్తిమంతుడగు శ్రీకృష్ణ భగవానుడు సకల ప్రాణులు చూచుచుండగా, ఆ పర్వతమును దాని స్థానమునందు ఇదివరలో వలెనే అవలీలగా స్థాపించెను.

ప్రేమ యొక్క ఆవేశముతో నిండియున్న గోకుల వాసులు ఆ శ్రీకృష్ణుని కౌగిలించుట, చేతులు కలుపుట మొదలగువాటితో యథోచితముగా కలుసుకొనిరి. గోపికలు కూడ ప్రేమతో ఆనందముతో ఆయనను పెరుగు, అక్షతలు, జలములతో పూజించి, పవిత్రమగు ఆశీస్సులనందజేసిరి.

యశోద, రోహిణి, నందుడు, బలవంతులలో శ్రేష్ఠుడగు బలరాముడు కూడ ప్రేమ వలన కంగారు పడుతూ శ్రీకృష్ణుని కౌగిలించుకొని ఆశీస్సులను పలికిరి.

ఓ పరీక్షిన్మహారాజా! ఆకాశమునందున్న దేవతల గణములు, సాధ్యులు, సిద్ధులు, గంధర్వులు, చారణులు సంతోషముతో పూల వానలను కురిపించి స్తుతించిరి.

ఓ పరీక్షిన్మహారాజా! ఆకాశమునందు దేవతలు శంఖములను, దుందు భులను మోయించిరి. తుంబురుడు మొదలైన గంధర్వశ్రేష్ఠులు పాడిరి.

ఓ పరీక్షిన్మహారాజా! తరువాత అనురాగము గల గోపాలకులు చుట్టువారి రాగా బలరామునితో గూడి శ్రీకృష్ణ భగవానుడు గోకులమునకు వెళ్లెను. ప్రేమతో హృదయమును స్పృశించే గోపికలు ప్రేమతో హృదయమును స్పృశించే ఈ శ్రీకృష్ణుని గోవర్ధనోద్ధారమువంటి లీలలను ఆనందముతో పాడుకుంటూ వెళ్లిరి.

శ్రీమద్భాగవత మహాపురాణము పదవ స్కంధము

పూర్వార్ధములో గోవర్ధనోద్ధారమును వర్ణించే

ఇరువది ఐదవ అధ్యాయము ముగిసినది (25).