శ్రీ మద్భాగవతము - దశమ (10వ) స్కందము

Table of Contents

57 - శతధన్వుడు మణిని అపహరించుట - శతధన్వుని ఉద్ధారము

            శ్రీశుక మహర్షి ఇట్లు చెప్పెను --- లాక్షాగృహములో పాండవులు దహించబడలేదని శ్రీకృష్ణ భగవానునకు తెలియును. కానీ, వారు కుంతితో సహా దహించబడినారనే జనప్రవాదమును విని ఆయన బలరామునితో సహా వంశోచితమైన పరామర్శను చేయుటకై కురుదేశమునకు వెళ్లాను.

            బలరామకృష్ణులు భీష్ముని, కృపాచార్యుని, విదురుని, ద్రోణాచార్యుని, గాంధారిని కూడ కలిసి వారితో సమానమైన దుఃఖము గలవారై, అయ్యో! ఎంత కష్టము! అని (లాక్షాగృహదహనమును గురించి) పలికిరి.  

ఓ పరీక్షిన్మహారాజా! ఈ సందు చూసుకొని అక్రూరుడు కృతవర్మ శతధన్వునితో, సమంతకమణిని ఏల లాగుకొనవు? అని అడిగిరి.

సత్రాజిత్తు శ్రేష్ఠ కన్యయగు సత్యభామను మనలో ఒకనికిచ్చి వివాహము చేసెదనని మాట యిచ్చి, మనలను అనాదరము చేసి శ్రీకృష్ణునకిచ్చి పెళ్లి చేసినాడు. ఆతడు తమ్ముడగు ప్రసేనుని వెంట (యమపురికి) ఏల వెళ్లరాదు?(వెళ్లకుండుటకు కారణమేమీ లేదు).

శతధన్వుడు పరమదుష్టుడు, పాపి. వాని ఆయువు మూడినది. పైగా, వారిద్దరు వాని మనస్సును చెడగొట్టిరి. ఆతడు మణియందలి లోభము వలన నిద్రిస్తున్న సత్రాజిత్తును చం పెను.

            స్త్రీలు అనాథలవలె ఆక్రోశిస్తూ రోదిస్తూంటే ఆతడు వారిని లెక్క చేయకుండా, కసాయి పశువులను వలె, సత్రాజిత్తుని చంపి స్యమంతకమణిని తీసుకొని వెళ్లాను.

            చంపబడిన తండ్రిని చూచి సత్యభామ మోహమును పొందెను. ఆమె మనస్సు దుఃఖముతో నిండిపోగా, తండ్రీ! తండ్రీ! అయ్యో! నేను చంపబడితిని! అంటూ విలపించెను.

            సత్రాజిత్తు దేహమును నూనె దోనియందుంచిరి. దుఃఖితురాలైన సత్యభామ హస్తినాపురమునకు వెళ్లి తండ్రి వధ గురించి శ్రీకృష్ణునకు చెప్పెను. ఆయనకు అన్నీ తెలుసు.

            ఓ పరీక్షిన్మహారాజా! మానవలీలను అనుకరించే సర్వేశ్వరులైన బలరామకృష్ణులు ఆ వార్తను విని కళ్ల నిండా నీరు పెట్టుకొని, అయ్యో! మనకు పెద్ద ఆపద వచ్చినది, అంటూ విలపించిరి.

  శ్రీకృష్ణ భగవానుడు అన్నగారితో, భార్యయగు సత్యభామతో కలిసి ఆ హస్తిననుండి ద్వారకకు వచ్చెను. శతధన్వుని సంహరించి వానినుండి స్యమంతకమణిని లాగుకొనే ఉద్యమమును ఆయన ఆరంభించెను.

ఆ శతధన్వునికి శ్రీకృష్ణుని ప్రయత్నము గురించి తెలిసి భయము కలిగెను. ఆతడు ప్రాణములను కాపాడుకునే కోరికతో సహకారము కొరకు కృతవర్మను కోరెను. కృతవర్మ ఇట్లు పలికెను.

సర్వసమర్థులగు బలరామకృష్ణులకు నేను ప్రతికూలమును చేయను. వారిద్దరి యెడల అపరాధమును చేసి ఎవ్వాడు క్షేమముగా ఉండగల్గును?

వారిద్దరి యందలి ద్వేషము వలన కంసుడు సంపదను పోగొట్టుకొని తన అనుచరులతో సహా వినాశమును పొందినాడు. జరాసంధుడు పది హేడు యుద్దములలో రథమును కూడ కోల్పోయి మరలి వచ్చినాడు.

కృతవర్మచే తిరస్కరించబడి ఆ శతధన్వుడు అక్రూరుని తనను వెనుక నుండి రక్షించుమని కోరెను. ఆయన కూడ, సర్వసమర్థులగు వారిద్దరి బలము తెలిసినవాడెవ్వడు వారితో విరోధించును? అని చెప్పెను. .

ఆ శ్రీకృష్ణ భగవానుడు జగత్తును లీలచే సృష్టించి, పాలించి, ఉపసంహారమును కూడ చేయును. ఆయన మాయచే మోహమును పొందినవారలు ఆయన లీలను తెలియజాలరు.

            ఏడేళ్ల బాలుడుగ నుండగనే శ్రీకృష్ణుడు కొండను అవలీలగా పెకిలించి ఒకే చేతితో పైకెత్తి, పిల్లవాడు కుక్కగొడుగును వలె, పట్టుకొనెను.

 ఆద్యంతములు లేని శ్రీకృష్ణ భగవానుని లీలలు ఆశ్చర్యకరములు. అవికారియగు ఆత్మరూపుడై యున్న ఆయనకు పలు నమస్కారములు.

            ఆ అక్రూరుడు కూడ తిరస్కరించగా శతధన్వుడు ఆ గొప్ప మణిని ఆయన వద్ద ఉంచి వంద యోజనముల దూరము పోగలిగే గుర్రమునెక్కి పారిపోయెను.

 ఓ పరీక్షిన్మహారాజా! బలరామ కృష్ణులు గొప్ప వేగము గల గుర్రములు లాగే రథము పైనెక్కి తమ మామగారిని చంపిన శతధన్వుని వెంబడి తరిమిరి. ఆ రథము యొక్క జెండా పై గరుడుడు ఉండెను.

చాల భయపడిన శతధన్వుడు మిథిలానగరపు బాహోద్యానమునందు పడిపోయిన గుర్రమును విడిచి పెట్టి కాళ్లకు బుద్ధి చెప్పగా, శ్రీకృష్ణుడు కూడ కోపముతో వెనుక తరిమెను.

            పాదచారియగు శ్రీకృష్ణ భగవానుడు పరుగెత్తుతూ పారిపోతున్న ఆ శతధన్వుని తలను వాడి పదును గల చక్రముతో నరికి, క్రింది మరియు పై వస్త్రములలో మణి కొరకు వెది కెను.

శ్రీకృష్ణునకు మణి దొరకలేదు. ఆయన అన్నగారి వద్దకు వచ్చి ఇట్లు పలి కెను -- శతధన్వుని చంపుట వ్యర్థ మైనది. ఆతని వద్ద మణి లేదు.

 అప్పుడు బలరాముడిట్లు పలికెను -- శతధన్వుడు నిశ్చయముగా మణిని ఎవరో ఒక వ్యక్తి వద్ద దాచియుండును. నీవు నగరమునకు వెళ్లి ఆ వ్యక్తి గురించి అన్వేషించుము.

ఓ పరీక్షిన్మహారాజా! విదేహరాజు నాకు . మిక్కిలి ప్రియుడు; నేనాయనను చూడగోరుచున్నాను, అని పలికి యాదవవంశనందనుడగు బలరాముడు మిథిలను ప్రవేశించెను.

మిథిలాధిపతి ఆ బలరాముని చూచి మనస్సులో చాల సంతోషించెను. ఆయన వెంటనే లేచి నిలబడి పూజకు అర్హుడైన బలరాముని ఉత్తమమగు పూజాద్రవ్యములతో యథావిధిగా పూజించెను.

మహాత్ముడగు జనకుడు ప్రేమతో కూడినవాడై బలరామప్రభుని సమ్మానించెను. ఆయన ఆ మిథిలయందు కొన్ని సంవత్సరములు నివసించెను. అదే కాలములో ధృతరాష్ట్రపుత్రుడగు దుర్యోధనుడు ఆయన వద్ద గదాయుద్ధములో శిక్షణ పొందెను.

సర్వసమర్థుడగు శ్రీకృష్ణుడు ప్రియురాలగు సత్యభామకు ప్రియమును చేయును. ఆయన ద్వారకకు వచ్చి శతధన్వుడు మరణించినాడనియు, కాని, ఆతని వద్ద మణి దొరకలేదనియు ఆమెకు చెప్పెను.

            తరువాత ఆ శ్రీకృష్ణ భగవానుడు బంధువులతో గూడి, సంహరించబడిన సత్రాజిత్తున కైతే, మరణించిన వ్యక్తికి ఏయే కర్మలు పుణ్యలోకములను కలిగించునో, వాటిని చేయించెను.

శతధన్వుని పురిగొల్పిన అక్రూరకృతవర్మలు వాని వధను గురించి విని, భయముతో వణికిపోతూ ద్వారకను విడిచి పెట్టి వెళ్లిపోయిరి.

 అక్రూరుడు వలస పోగా ద్వారకావాసులకైతే అరిష్టములు ఆధ్యాత్మిక-ఆధిభౌతిక-ఆధిదైవికతాపములు మరల మరల కలిగినవి.

ఓ పరీక్షిన్మహారాజా! నేనిదివరలో చెప్పిన శ్రీకృష్ణ మాహాత్మ్యమును విస్మరించి కొందరీ విధముగా (అరిష్టములను గురించి) చెప్పుచున్నారు. మునులు ఏ భగవానునియందు నివసించెదరో, ఆ భగవానుడు నివసించే ద్వారకలో అరిష్టములు కనబడుట సంభవమా?(కాదు).

ఒకప్పుడు కాశీదేశములో వానదేవుడు వర్షించ లేదు. అప్పుడక్కడకు వచ్చిన (అక్రూరుని తండ్రియగు) శ్వఫల్కునకు కాశీరాజు తన కుమార్తెయగు గాందినిని ఇచ్చి వివాహము చేయగా, దేవుడు వర్షించెను.

 ఆ శ్వఫలుని పుత్రుడగు ఈ అక్రూరునకు కూడ అటువంటి మహిమ గలదు. ఈతడు ఎక్కడ ఉంటే అక్కడ దేవుడు వర్షించుటయే గాక, తాపములు గాని అంటువ్యాధులు గాని ఉండవు.

            పెద్దలు ఈ రకముగా పలుకటను దుష్టజనశిక్షకుడగు శ్రీకృష్ణ భగవానుడు వినెను. కేవలము అక్రూరుడు మాత్రమే లేకుండుట అరిష్ట హేతువు కాదని (మణి లేకుండుట కూడ హేతువని) ఆయన తలచెను. ఆయన అక్రూరుని రప్పించి ఇట్లు పలికెను.

            సకలప్రాణుల అంతఃకరణసాక్షియగు శ్రీకృష్ణునకు సర్వము దెలియును. ఆయన ఈ అక్రూరుని సమ్మానించి ప్రీతికరములగు మాటలను చెప్పి చిరునవ్వుతో సంబోధించి ఇట్లు పలికెను.

            ఓ దానప్రభూ! గొప్పగా ప్రకాశించే సమంతకమణిని శతధన్వుడు తమరి వద్ద భద్రపరచినాడు. అది మీ వద్దనే ఉన్నది గదా! ఈ విషయము మాకిదివరకే తెలియును.

            సత్రాజిత్తునకు పుత్రసంతానము లేనందువలన, ఆమె కుమార్తెయొక్క పుత్రులే ఆయనకు తర్పణములను పిండములను సమర్పించి, అప్పులను కూడ తీర్చి, మిగిలిన ఆస్తిని పొందెదరు.

 అయినప్పటికీ మంచి నియమనిష్ఠలు గల నీ వద్దనే మణిని ఉండనిండు. దానిని ఇతరులు భద్రము చేయలేరు. కానైతే, ఆ మణి విషయములో అన్న బలరామునకు నాపై పూర్తి నమ్మకము కలుగకున్నది.

ఓ అక్రూరా! మణిని చూపించి బంధువులకు శాంతిని కలిగించుము. ఈ కాలంలో నీవు బంగరు వేదులు గల యజ్ఞములను నిరంతరముగా చేయుచున్నావు.(మణి బంగారమును పెట్టుచుండును).

ఈ విధముగా శ్రీకృష్ణుడు సాంత్వవచనములతో నచ్చజెప్పగా, శ్వఫలుని పుత్రుడగు అక్రూరుడు సూర్యునితో సమానముగా వెలిగిపోయే స్యమంతకమణిని వస్త్రము చాటునుండి పైకి తీసి యిచ్చెను.

శ్రీకృష్ణ ప్రభుడు బంధువులకు స్యమంతకమణిని చూపించి, దాని కారణముగా తనకు కలిగిన అపవాదును తుడిచివేసి, మరల దానిని ఆ అక్రూరునకు సమర్పించెను.

సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు అగు శ్రీకృష్ణ భగవానుని ఈ పరాక్రమముతో సంపన్నమైన వృత్తాంతము పాపములను పోగొట్టి మంగళములను కలిగించును. ఎవడైతే దీనిని చదువునో, వినునో, లేదా స్మరించునో, అట్టివాడు అపవాదును, పాపమును తుడిచివేసి శాంతిని పొందును.

శ్రీమద్భాగవత మహాపురాణము పదవ స్కంధములో

శతధన్వుడు మణిని అపహరించుటను, శతధన్వుని ఉద్దారమును వర్ణించే

ఏబది ఏడవ అధ్యాయము ముగిసినది .